Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు ---ఉత్తరకుమార ప్రజ్ఞలు



విరాటరాజు గోవులను కౌరవులు దొంగతనంగా వచ్చి తరలించుకుపోయారు. రాజు నగరంలో లేని తరుణం చూసి దుర్యోధనుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. విరటరాజు కుమారుడైన ఉత్తరుడికీ విషయం తెలిసింది. "నా రథాన్ని నడపగలిగే సారథి కనక దొరికితే నేనొక్కణ్ణే దండెత్తి ఆ గోవులను మళ్ళించుకుని రాగలను. నా యుద్ధం చూసి వాళ్ళు తోక ముడవాల్సిందే" అన్నాడు ఉత్తరకుమారుడు.

ఉత్తరుడీ మాటలు చెపుతూనప్పుడు ద్రౌపది అక్కడే వుంది. గబగబ విరాటరాజు కూతురు ఉత్తర దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి, "బృహన్నలను ఉత్తరకుమారుడికి సారథిగా పంపించండి. మన బృహన్నల పూర్వం అర్జునుడికి సారథ్యం చేసింది. అతనివద్ద విలువిద్య రహస్యాలు తెలుసుకుంది. అందువల్ల కార్యసాధన అవుతుంది" అని ఆలోచన చెప్పింది.

ఉత్తర ఈ విషయం అన్నగారితో చెప్పింది.

ఉత్తరకుమారుడు సరే అన్నాడు.

రథం బయలుదేరింది. ఉత్తరుడు ఉత్సాహంగానే నగరం నుండి బయలుదేరడు.

"రథం వేగంగా పోనీ! కౌరవులు గోవులను తరలించుకుపోతున్న దిక్కుగా పోనిస్తే వారిని పారిపోకుండా పట్టుకుందాం" అన్నాడు బృహన్నలతో.

గుర్రాలు అఘమేఘాలమీద పోతున్నాయి. కౌరవసేన కనుచూపు మేరలో వుంది. మహసముద్రంలా కనిపిస్తోంది. అది చూడగానే ఉత్తరకుమారుడికి గుండెలు ఝల్లుమన్నాయి. బెదురు పుట్టింది. కళ్ళు బయర్లు కమ్మాయి. చేతులతో కళ్ళు మూసుకున్నాడు. రథం మీద నిలవలేకపోయాడు. "అయ్యయ్యో! ఇంతపెద్ద సేనను నేనెలా ఎదిరించగలను? నావెంట సైన్యమూ లేదు, సేనాపతీ లేడు. బృహన్నలా! నావల్లకాదు. రథం మరల్చు. తిరిగిపోదాం" అన్నాడు.

అది విని బృహన్నల నవ్వింది. "ఉత్తరకుమారా! నీవు రాకుమారుడివి. అడవాళ్ళ ముందు ఏవేవో ప్రతిజ్ఞలు పలికి నన్ను కూడా యుద్ధభూమికి తెచ్చావు. ఆవుల్ని తీసుకుని పోకుండా వట్టిచేతులతో వెడితే మనల్ని చూసి అందరూ పరిహాసం చేస్తారు. కనుక ధైర్యంతో నిలిచి పోరాడు" అని రథం ఆపకుండా ముందుకు పోనిచ్చింది బృహన్నల.

"నావల్ల కానేకాదు. ఆవుల్ని వాళ్ళు తోలుకుపోతే పోనీ. ఆడవాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తే చేయనీ! నేను మాత్రం క్షణం కూడా ఇక్కడ వుండను. రథం వెనక్కి తిప్పు. లేకపోతే నేనే నడచిపోతాను" అని ఉత్తరుడు విల్లూ, అంబులూ అక్కడే పారేశాడు. రథం మీద నుంచి కిందకు దూకి పిచ్చివాడిలా ఊరివైపు ఉరకడం మొదలుపెట్టాడు.

"రాకుమారా! నిలునిలు! పారిపోకు! క్షత్రియుడవు. ఇలా యుద్ధభూమి నుంచి పారిపోకూడదు" అని బృహన్నల వెంటపడింది.

"నన్ను పట్టుకోవద్దు. వదులు. నీకు పుణ్యం వుంటుంది. నీకు కావలసినంత ధనం ఇస్తాను. కానుకలు ఇస్తాను. చీరలు పెడతాను. ఏం కావాలంటే అది ఇస్తాను. నన్ను విడిచిపెట్టు. మా అమ్మకు నేనొక్కణ్ణే కొడుకును. నేను కుర్రవాణ్ణి. తల్లిచాటు బిడ్డను. నాకు భయం వేస్తోంది. నన్ను పోనీ" అని కేకలు పెడుతూ పరిగెత్తుతూనే ఉన్నాడు ఉత్తరకుమారుడు.

కాని బృహన్నల విడిచిపెట్టలేదు.

పట్టుకుని రథం మీద కూర్చోబెట్టింది.

కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఉత్తరుడు.

"రాకుమారా! భయపడకు. ఈ కౌరవులతో నేను యుద్ధం చేస్తాను. గుర్రాలను మాత్రం నీవు పట్టుకో. నీవు రథం తోలగలిగితే మిగతా కార్యమంతా నేను నడిపిస్తాను" అని ఉత్తరుడికి పగ్గాలు అందించింది బృహన్నల.

తరువాత రథాన్ని దూరంగా కనిపించే జమ్మిచెట్టు వద్దకు పోనిమ్మంది.

అక్కడికి చేరాక "విరాటపుత్రా! ఈ చెట్టెక్కి పైన వున్న ఆయుధాలు పట్టుకురా" అంది బృహన్నల.

ఉత్తరుడికి ఇదేమీ అర్థం కాలేదు. బిత్తరచూపులు చూస్తుంటే "ఉత్తరకుమారా! చెట్టెక్కి చూడు! అది పాండవుల ఆయుధాల మూట!! అనవసరంగా భయపడకు, ఆలస్యం చేయకు" అంది బృహన్నల.

ఉత్తరుడు బృహన్నల చెప్పినట్టే చేశాడు. ఆయుధాల మూటను చూసి సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు మూసుకున్నాడు. "బృహన్నలా! ఆశ్చర్యంగా వుంది నాకు. పాండవులు సర్వం పోగొట్టుకుని అడవులపాలయ్యారు కదా! వాళ్ళ ఆయుధాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా?" అని అడిగాడు.

అప్పుడు బృహన్నల తానెవరైందీ చెప్పి తన అన్నదమ్ములను గురించీ, ద్రౌపదిని గురించీ చెప్పింది.

ఉత్తరుడు నమస్కారం చేశాడు. బృహన్నల రూపంలో వున్న అర్జునుడు కౌరవ సేన వైపు రథాన్ని మళ్ళించి గాండీవం ఎత్తిపట్టాడు. మూడుసార్లు నారి సారించాడు. తన శంఖం దేవదత్తాన్ని గట్టిగా పూరించాడు.

అంతే! కౌరవసేనంతా ఆ గంభీరఘోషకు చెల్లాచెదురైంది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెత్తారు.

గోవుల్ని తీసుకుని ఉత్తరుడూ, అర్జునుడూ నగరానికి తిరిగి వచ్చారు.

అదీ కథ!!

అంతఃపురకాంతల ముందు గొప్ప వీరుడులాగా బీరాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చిన తరువాత బెదిరిపోయి తిరిగుముఖం పట్టి పారిపోయిన ఉత్తరకుమారిడి కథ మహాభారతంలో చెప్పడం కేవలం హాస్యం కోసమే కాదు, గుణాలు కలవాళ్ళు గుణహీనులను చూసి గేలిచేయడం స్వభావసిద్ధం. అలాగే శక్తి సామర్థ్యాలు కలిగినవాళ్ళు అవి లేనివాళ్ళను చూసి కించపరచటం పరిపాటి. కాని ధనుంజుయుడు మాత్రం అలా చేయలేదు. వీరాధివీరుడు అయిన అతడు యుద్ధభూమిలో ఉత్తరుడు నిర్వీర్యుడు కావడం చూసి, అతణ్ణి నిలబెట్టి ధైర్యం చెప్పి చేరదీసి వీరుణ్ణిచేసాడు. ధైర్యం కోల్పోయిన ఉత్తరుడికి చేయవలసిన సహాయం చేసి, ధైర్యం నూరిపోసి వీరుడిగా నిలిపి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు.

అర్జునుడి మూలంగా వీరుడైన ఉత్తరుడు కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడితో తలపడి వీరస్వర్గం అలంకరించాడు.

Popular Posts