Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు ---యాదవ ముసలం

కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు ముగ్గురూ కృష్ణభగవానుణ్ణి చూడటానికని ద్వారకానగరానికి బయలుదేరారు. వాళ్ళు రాజవీధిని వస్తూండడం చూసిన యాదవులకు దుర్బుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి తీసుకువచ్చి "అయ్యా! ఇది భద్రుడి భార్య. దీనికి సంతానం కలుగుతుందా?" అని అడిగారు మునుల్ని యదుకుమారులు.

అంతమాత్రం తెలుసుకోలేరు గనుకనా ఆ మహర్షులు!

"వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు మాకు. వీడికి యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది! కృష్ణుడూ, బలరముడూ తప్ప తక్కిన యాదవులంతా అ రోకలి వల్ల చస్తారు. బలరాముడు అదికనిష్ఠతో శరీరం విడిచి సముద్రంలో ప్రవేశిస్తడు. నేలమీద పడుకుని వుండగా కృష్ణుణ్ణి 'జర ' అనే రాక్షసి పుట్టి అక్రమిస్తుంది. పొండి" అన్నారు వాళ్ళు కోపంగా.

ఇంత చేసి ఇంక మనం వాసుదేవుణ్ణి చూడడం మంచిది కాదనుకుని మహర్షులు ముగ్గురూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.

తరువాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఉదాసీనంగా వూరుకున్నాడు.

ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులందరూ భయంతో పరుగెత్తుకు వెళ్ళి ఆ సంగతంతా వసుదేవుడికి చెప్పారు.

"ఆ రోకలిని పిండి పిండి చేసి సముద్రంలో కలిపిరండి" అని ఆజ్ఞాపించాడు. యాదవులంతా వెళ్ళి అయన చెప్పినట్లే చేశారు. కాని గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి?

ద్వారకాపట్టణంలో అనేక ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవసాగాయి. పగలు మేకలు నక్కల్లా కూశాయి. ఆవులకు గాడిదలూ, ముంగీసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయి. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. కూడూ కూరలూ అప్పుడే పొయ్యిమీద నుంచి దింపినాసరే - పురుగులు పట్టడం మొదలెట్టాయి. ఈ అశుభ సూచనలన్నీ చూసి గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు కృష్ణుడు. యాదవులు తీర్థసమీపంలో చావడం మంచిదని భావించాడు కృష్ణుడు. ఇంక తెల్లవారితే వాళ్ళంతా కాలం చేస్తారనగా అంతకు ముందురోజే కొలువుతీర్చి "సముద్రానికి జాతర చెయ్యాలి. అందరూ బయల్దేరండి" అని ఆజ్ఞ ఇచ్చాడు.

రాబోతున్న ప్రమాదం గ్రహించుకోలేక పానీయాలూ, భక్ష్యభోజ్యాలు, మాంసాహారాలూ సమకూర్చుకుని, అందంగా అలంకారాలు చేసుకుని చతురంగ బలాలతో బయలుదేరారు యాదవులు.

నిర్వికారుడై బయలుదేరాడు కృష్ణుడు.

అందరూ సముద్రతీరాన వున్న పందిళ్ళ దగ్గరకు చేరుకున్నారు. బలరాముడు మాత్రం అరణ్యాలకు వెళ్ళాడు. యాదవులు తెచ్చుకున్న భక్ష్యాలన్నీ తిన్నారు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించారు. అసంబద్ధపు ప్రేలాపనలు సాగిస్తూ నవ్వడం మొదలుపెట్టారు.


"ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మ! చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు.


"అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలు!" కృతవర్మ ఆక్షేపించాడు.


సాత్యకికి కోపం వచ్చి కత్తి దూసి గబగబ వెళ్ళి కృతవర్మ కంఠం నరికేసాడు. సముద్రతీరాన తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిమిషంలో ఆ కత్తిని ఆక్రమించి వుంది. అంతటితో వూరుకోక సాత్యకి భోజులందరిమీదా విజృంభించాడు. వారించడానికి కృష్ణుడు వెళ్ళేలోగానే భోజులంతా సాత్యకిని చుట్టుముట్టారు. అయితే జరగబోయేదంతా తెలిసిన వాడవడం వల్ల కాలస్వరూపుడైన కృష్ణుడు సాత్యకిని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు.


సాత్యకిని కాపాడడం కోసం ప్రద్యుమ్నుడు విజృంభించాడు. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళకు కయ్యం ప్రారంభమైంది. ఆ సముద్రతీరంలో మొలిచిన తుంగ పీకి దాంతో ఒకరినొకరు కొట్టుకుని హతులయ్యారు వాళ్ళందరూ.


ఆనాడు వాళ్ళు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే అక్కడ తుంగగా మొలిచింది! అదే వాళ్ళ యుద్ధానికి సాధనమై చావుకు కారణమైంది!!


దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే సాగాడు కృష్ణుడు.

Popular Posts