Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు --- భీష్మ ప్రతిజ్ఞ


గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటినుండి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కాని ఒక రోజు యమునాతీరానికి వాహ్యాళికని వెళ్ళి అక్కడ జగన్మోహినినా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు.తనను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. " నా తండ్రి దాశరాజు. బెస్త్ల్లందరికీ నాయకడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి. అది మీకూ నాకూ మంచిది " అని బదులు చెప్పిందాపిల్ల.

శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ " మా అమ్మాయిని మీ చేతుల్ల్లో పెడతాను కాని నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి " అన్నాడు.

శంతనుడు ఒప్పుకోలేదు.

దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు.

అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు.

దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రధసారధి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్ళి " నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను " అని శపధం చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకయినా అతని సంతతివారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడాపల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్ళిచేసాడు.

ఆ అమ్మాయి పేరు సత్యవతి.

శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు.


Popular Posts