Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు ---యదువంశ క్షయం


కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుణ్ణి వెంటబెట్టుకొచ్చేందుకు దారుకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తున్న దారుకుణ్ణి చూసేసరికి పాండవుల గుండెలు ఝల్లుమన్నాయి. యాదవులందరూ మరణించారని దారుకుడు చెప్పగానే కన్నీళ్ళు కార్చారు అన్నదమ్ములు అయిదుగురూ.

"కృష్ణుడు నిన్ను తీసుకురమ్మని పంపాడు నన్ను" అన్నాడు దారుకుడు అర్జునుడితో. అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని ద్వారకకు బయలుదేరాడు.

చంద్రుడు లేని రాత్రీ, దినమణి లేని ఆకాశం ఎలా వుంటాయో అలాగ వుంది కృష్ణుడు లేని ద్వారక. తమ విభుని ప్రియసఖుణ్ణి చూడటంతోనే కృష్ణుడి భార్యలు పదహరువేలమందీ గట్టిగా ఏడుస్తూ చుట్టూ నిలబడ్డారు. దైన్యం స్త్రీల రూపాలు ధరించి వచ్చినట్టున్న వాళ్ళని చూసి అర్జునుడు మరింతగ దుఃఖపడ్డాడు.

ఏడ్చి ఏడ్చి కృశించి శయ్య మీద పడివున్న వసుదేవుడు అర్జునుణ్ణి చుట్టేసుకుని దుఃఖించాడు. "మనుష్యమాత్రులు కారు యదుకుమారులు! దేవ పరాక్రములు! దానవులనైనా చంపి ప్రకాశించే దర్పంగలవారు! అకారణంగా వైరం పెంచుకుని తమలో తాము కొట్టుకుని మరణించారు. అయినా వాళ్ళననడమెందుకులే! ముని శాపం అలా పరిణమించింది. చచ్చిన పరీక్షిత్తుని బతికించిన శౌరి, జరిగిన ఘోరమంతా చూస్తూనే ఉపేక్షించాడు!" అన్నాడు వసుదేవుడు కన్నీళ్ళు కారుస్తూ.

"బావ ఎక్కడ వున్నాడు!" అని అడిగాడు అర్జునుడు.

"పార్థా! 'అర్జునుడు వస్తాడు. నీ ఆజ్ఞలన్నీ అతడు నెరవేరుస్తాడు. కార్యజ్ఞుడూ శౌర్యశాలీ కూడా అతడు! కిరీటీ నేనూ ఒకటే! నువ్వు శోకం విడిచి అతన్ని చేతపట్టి అందర్నీ రక్షించుకో. ఇంక కొద్దిరోజుల్లో ఈ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది ' అని చెప్పి నన్ను ఊరడించి, అన్నతో పాటూ తపస్సు చేసుకోవడానికి కృష్ణుడూ వెళ్ళి పోయాడు" అన్నాడు వసుదేవుడు.

అర్జునుడు దారుకుణ్ణి పిలిచి, "కృష్ణుడు వెళ్ళిన దిక్కుగా వెళ్దాం మనం. ఇక్కడ చెయ్యవలసిన పనులన్నీ మంత్రులకు అప్పగిద్దాం. మంత్రుల్నీ, పౌరుల్నీ పిలిపించు" అన్నాడు.

దారుకుడు వెంటనే అజ్ఞ పాటించాడు.

వాళ్ళందర్నీ ఒక్కసారి కలయచూసి "ఈనాటికి ఏడవరోజున ఈ పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని దేవతల వాక్కు! కనుక మనమందరం త్వరగా ద్వారకను విడిచివెళ్ళాలి. ఇంద్రప్రస్థానికి వసుదేవుడి మనుమడైన వజ్రుణ్ణి రాజుగా చేస్తాను. మీరందరూ వెళ్ళి అక్కడ అతని పరిపాలనలో సుఖంగా వుండండి. మొయ్యగలిగినన్ని సరుకులు మోయించండి. బళ్ళు సిద్ధం చెయ్యండి. ఇదివరకు గోవిందుని నీడన యాదవవీరులంతా ఎలా సుఖంగా ఉన్నారో, అలగే ఇప్పుడు ఈ దేశపు ప్రజలంతా ధర్మరాజు ఆదర గౌరవాలందుకుంటూ వుంటారు" అని ఆజ్ఞాపించాడు అర్జునుడు.

ప్రజలు వెళ్ళిపోయారు.

ఆ రాత్రంతా భారమైన మనస్సుతో కృష్ణమందిరంలోనే గడిపాడు అర్జునుడు.

తెలతెలవారే సమయంలో వసుదేవుడు యోగనిష్ఠతో శరీరం విడిచిపెట్టాడు.

అంతఃపురమంతా రోదన ధ్వనులతో మారుమోగిపోయింది.

వసుదేవుడి భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర సహగమనం చేశారు.

'నన్ను పిలిపించి తన తండ్రికి కావలి పెట్టాడు మాధవుడు. అలాంటివాడికి తండ్రి మరణవార్త ఎలా చెప్పను? ఈ చావుకబురు చెప్పి తపోనిష్ఠలో వున్న నారాయణుడికి బాధ కలిగించడమెందుకు?' అనుకున్నడు అర్జునుడు. అంతలోనే 'అయ్యో! పెదతల్లి గాంధారీదేవి శాపం ఎందుకో అస్తమానం జ్ఞాపకం వస్తోంది. ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చావు చావమని కృష్ణుణ్ణి శపించిందామె. ఎలా వున్నాడో ఏమో!' అనుకుంటూ త్వరత్వరగా బయలుదేరాడు అర్జునుడు. కలతపడిన వృదయంతో కృష్ణుడి కోసం అరణ్యమంతా గాలించసాగాడు. ఒకనాడు అతనికొక బోయవాడు ఎదురయ్యాడు.

"ఎక్కడకు వెళ్ళాలి దొరా?" అని ప్రశ్నించాడు.

"కృష్ణభగవానుడు తపస్సు చేసుకుంటున్న చోటికి!" అర్జునుడు జవాబు చెప్పాడు.

"అ మహానుభావుణ్ణి ఒకనాడు ఒకచోట చూశాను. మరి ఇప్పుడు అక్కడున్నాడో లేడో తెలీదు. అయినా అ చోటు చూపిస్తాను రండి" అని బోయవాడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తిన్నగా అచ్యుతుడు వున్న చోటుకు వెళ్ళారు. అక్కడ నేలమీద పడివున్న జగదేకవంద్యుడి మృతదేహాన్ని చూసి మూర్చపోయాడు అర్జునుడు.

'ఈ మహానుభావుడికి ఈ గతి ఎలా సంభవించింది?' అనుకుంటూ శరీరమంతా కలయచూశాడు అర్జునుడు. పాదంలో గుచ్చుకున్న బాణపు గాయం కనిపించింది. అది చూస్తూనే దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. 'కృష్ణుడి కళేబరాన్ని నగరానికి తీసుకుపోవడమా? లేకపోతే బంధువులందర్నీ ఇక్కడికే పిలిపించడమా?' అని ఆలోచిస్తూ వుండగా సముద్రం పట్టణాన్ని ముంచేయబోతున్న విషయం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి.

వెంటనే చితి పేర్చి మృతదేహానికి అగ్ని సంస్కారం చేశాడు. గబగబ ద్వారకకు బయలుదేరాడు. తెల్లవారేలోపల బలరామకృష్ణుల భార్యలనూ, మిగిలిన ప్రజలనూ పురం దాటించాడు పార్థుడు. అందరికీ తానే దిక్కై ముందుకు నడిచాడు. ఇంతలో కిరాతకుల గుంపొకటి యాదవ స్త్రీలపై దాడి చేసింది. సవ్యసాచి అగ్రాహావేశాలతో అస్త్రప్రయోగం చెయ్యబోయాడు. చిత్రం - ఒక్క మంత్రం కూడా గుర్తు రాలేదు! ఆశ్చర్యం, విషాదం కూడా కలిగాయి విజయుడికి. గాండీవంతోనే అ దొంగలను మోదసాగాడు. చివరకు ఎలాగైతేనేం - కృష్ణుడి ఎనమండుగురి భార్యలనూ, బలరాముడి భార్యలనూ, ఇంకా కొంతమంది స్త్రీలనూ మాత్రం రక్షించగలిగాడు. వాళ్ళను వెంటబెట్టుకుని కురుక్షేత్రానికి చేరుకున్నాడు.

అక్కడ తాను కృష్ణుణ్ణి వెదకడానికి వెళ్ళింది మొదలు, మళ్లీ ద్వారకకు వచ్చేవరకూ జరిగినదంతా అందరికీ దీనంగా వివరించాడు అర్జునుడు. రామకృష్ణుల భార్యలు మొదలు నరికిన మానుల్లా నేలకొరిగారు.

Popular Posts