Followers

Friday 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –41 శ్రీ హనుమత్కుండం

                                           
     
        దక్షిణ మహా సముద్రం  తీరం లో రామేశ్వర మహా క్షేత్రం లో ని ‘’హనుమత్కుండం ‘’గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివ రించి చెప్పాడు .
    స్కంద పురాణం లో బ్రహ్మ ఖండం లో రామేశ్వర క్షేత్రం లో24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించ బడింది .అవి చక్ర తీర్ధం ,భేతాళ వరద తీర్ధం ,పాప వినాశనం ,సీతా సరస్సు ,మంగళ తీర్ధం ,అమృత వాపిక ,బ్రహ్మ కుండము ,హనుమత్కుండం ,అగస్త్య తీర్ధం ,రామ తీర్ధం ,లక్ష్మణ తీర్ధం ,జటా తీర్ధం ,లక్ష్మీ తీర్ధం ,అగ్ని తీర్ధం ,శివ తీర్ధం ,శంఖ తీర్ధం ,యమునా తీర్ధం ,గంగా తీర్ధం ,గయా తీర్ధం ,కోటి తీర్ధం ,స్వాధ్యామ్రుత తీర్ధం ,సర్వ తీర్ధం ,ధనుష్కోటి తీర్ధం ,మానస తీర్ధం .
      రావణాసురుని చంపిన బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివ లింగ ప్రతిష్టాపన ను రామేశ్వరం లో చేయ సంకల్పించాడు .సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన ‘’పుల్ల ‘’గ్రామానికి దగ్గరలో ,సేతువు కు సమీపం లో ,గంధ మాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం .హను మంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహం తో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు .ముహూర్త విషయాన్ని కూడా తెలిపి ,ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞా పించాడు .
      హను మంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా ,మహర్షుల అను మతి తో సీతా దేవి ఇసుక తో లింగాన్ని చేస్తే ,సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామ చంద్రుడు .ఆ లింగానికి అభిషేకం జరిపి ,పూజ కూడా చేసే శాడు .మారుతి శివ లింగాన్ని తెసుకొని వచ్చాడు .విషయమ తెలిసి బాధ పడి  తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు .దానికి ఆయన  వేరొక చోట ప్రతిష్టించ మని  చెప్పాడు .హనుమ కు కోపం వచ్చి ‘’రామా ! నన్ను అవమానిస్తావా ?కైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు ?ఇంకో చోట ప్రతిష్ట చేయటానికోసమా నేను అంత దూరం వెళ్లి తెచ్చింది ? నాకీ జీవితం వద్దు .నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను ‘’అని దూక బోతుండగా రాముడు వారించాడు ‘’అన్నా హనుమన్నా !మనిషి తను  చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు .ఆత్మ ను చూడు .దుఖం పొందటం వివేకికి తగని పని దోషాన్ని వదిలి మంచిని గ్రహించు .నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్తాపిద్దాం .ఈ రెండు లింగాలను దర్శించినా ,స్మరించినా ,పూజించినా పునర్జన్మ ఉండదు .భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివ లింగాన్ని పూజించి ,ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు .అలా కాక పోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రం లో విసిరెయ్యి ‘’అన్నాడు .
            అప్పుడు హనుమ తన తోకను ఇసుక లింగం చుట్టూ బిగించి పెకలించ టానికి తీవ్ర ప్రయత్నం చేశాడు ..అది ఇసుమంత కూడా కదలలేదు .మళ్ళీ ప్రయత్నం చేసి వీలు గాక నెత్తురు కక్కు కొంటు దూరం గా పడి  పోయాడు .పడిన చోట హనుమ ముక్కులు ,చెవుల ,నోటి నుండి విప రీతం గా రక్తం కారి ఒక సరస్సు గా మారింది .హనుమ స్పృహ కోల్పోయాడు .అప్పుడు రాముడు మారుతి పడి  ఉన్న ప్రదేశానికి వెళ్లి ,అతని శిరస్సు ను తన ఒడిలో పెట్టు కొని సేద తెర్చాడు .అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు  కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు .
        కొంత సేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది .అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతా రాములు ప్రతిష్టించారు .హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది .అదే ‘’హనుమత్కుండం ‘’.ఇది రామేశ్వరానికి కొద్ది దూరం లో ఉంది .దీని లో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు .పితృదేవత లకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు .
                                                            హనుమత్కుండ మహాత్మ్యం
     పూర్వం ధర్మ సఖుడు అనే రాజు ఉండే వాడు .ధర్మం గా రాజ్య పాలన చేసే వాడు .అతడికి వంద మంది భార్యలు .చాలాకాలానికి పట్టపు దేవి మనో రమ కు కొడుకు పుట్టాడు .మిగిలిన రాణులు కూడా అతన్ని తమ కుమారుడి గానే భావించి పెంచుతున్నారు .ఒక రోజు ఆ పిల్లాడు ఉయ్యాల లో ఊగుతుండగా తేలు కుట్టింది .ఈ విషయం రాణులకు తెలీక బాలుదేడుస్తుంటే వీళ్ళు కూడా ఏడవటం మొదలెట్టారు .రాజుకు విషయం తెలిసి వైద్యుల్ని రప్పించి మంత్ర తంత్రాలు జరిపిస్తే బాలుడు స్వస్తుడు అయ్యాడు .
             ఒక రోజు రాజు తనకు ఒక్కడే కొడుకు ఉండటం బాధ గా ఉందని మిగిలిన భార్యలకు కూడా పుత్రసంతానం కలిగితే బాగుంటుందని సభలో అన్నాడు .దీనికి తగిన ఉపాయం చెప్పమని కోరాడు .మంత్రులు బాగా ఆలోచించి దక్షిణ సముద్ర తీరం లో గంధ మాదన పర్వతం మహా పుణ్య క్షేత్రం అని ,దాని దగ్గరే శ్రీ రాముడు ప్రతిష్టించిన సైకత రామ లింగేశ్వరుడు ఉన్నాడని ,దానికి సమీపం లో ‘’హనుమత్కుండం ‘’ఉందని ,అక్కడ పుత్ర కామేష్టి జరిపితే అభీష్ట సిద్ధి కలుగు తుందని తెలియ జేశారు .వారు చెప్పిన ప్రకారమే రాజు అక్కడికి వెళ్లి యజ్ఞాన్ని పూర్తి చేసి హనుమత్కుండం లో భార్యల తో సహా  స్నానం చేస్తూ నేల రోజులున్నాడు .యాగం పూర్తీ అయిన పది నెలల్లో రాజు గారి మిగిలిన రాణు లంతా పుత్రుల్ని కన్నారు .వారంతా పెరిగి పెద్ద వారైనారు .అనురాగం తో తల్లులు ,పిల్లలు ఉన్నారు .తండ్రి తర్వాతరాజ్యాన్ని పాలించారు .రాజు భార్యలు మరణానంతరం స్వర్గం చేరారు .హను మంతుడు ఈ కుండం లో స్నానం చేసిన వారి కోరికలన్నీ తీరుస్తూ భక్త కల్పద్రుమం గా విలసిల్లుతున్నాడు .

Popular Posts