Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఏడవ అధ్యాయం

          ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఏడవ అధ్యాయం

శ్రీపరీక్షిదువాచ
బ్రహ్మన్బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః
కథం చరన్తి శ్రుతయః సాక్షాత్సదసతః పరే


పరమాత్మ దేనికీ అందని వాడు కదా. అనిర్దేశ్యుడు కద. ఆయన కారణమూ కార్యమూ కాడు. రెంటికీ అవతల ఉన్నాడు. కార్య కారణాత్మకమైన ప్రపంచాన్ని సంకల్పము చేత సృష్టిస్తున్నాడు. త్రిగుణాత్మకమైన ప్రకృతిని మనకు తెలిసేట్లు చేసే వేడములు కూడా త్రిగుణాత్మకములే. ఏ గుణములూ లేని పరమాత్మను అవి ఎలా చెప్పగలవు. మనము వేటిని సాధనములు అనుకుంటున్నామో అవేవీ పరామాత్మను వర్ణించలేవు. ఎందువలనంటే అవి అన్నీ గుణాత్మకములు. పరమాత్మ గుణ అతీతుడు. వేదాలు త్రై గుణ్యాన్ని గురించి గురించి చెబుతాయి, కార్య కారణ భావాన్ని చెబుతాయి అవి. మరి వేదములు పరమాత్మను గురించి ఎలా చెబుతాయి
కారణం కంటే కార్యం కంటే పరుడైన పరమాత్మ విషయములో శృతులు ఎలా చెబుతాయి

శ్రీశుక ఉవాచ
బుద్ధీన్ద్రియమనఃప్రాణాన్జనానామసృజత్ప్రభుః
మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనేऽకల్పనాయ చ

ఈ విషయం తెలుసుకోవాలి అంటే ముందు మన సంగతి ఆలోచించుకోవాలి. శరీరములో బుద్ధి మనసు ప్రాణములూ ఇంద్రియములూ ఉన్నాయి. ఇవన్నీ ఉండడానికి శరీరం నిర్మించబడినది.ఇంద్రియములన్నీ శరీరం కోసం. శరీరములో ఉండి శరీరం చేత పని చేయించడానికి సృష్టించబడ్డాయి. ఆ బుద్ధీ మనసూ ఇంద్రియము ప్రాణములతోనే మళ్ళీ ఈ శరీరము రాకుండా ఉండడానికి కూడా కారణాలే
శరీరేం కలగడానికీ శరీరం కలగకపోవడానికీ,మోక్షంకలగడానికీ నరకం రావాడానికి, సంసారం రావడానికి సాంసారం లేకపోవడానికీ బుద్ధి ఇంద్రియ మనో ప్రాణములు కారణం అవుతాయి. ఈ విషయాన్ని వేదాలు చెబుతాయి. సంసారములో అవి ప్రవర్తించడానికి దారి చూపేది, సంసారములో ప్రవర్తించకపోవడానికి కూడా దారి చూపేవి వేదములే.

సైషా హ్యుపనిషద్బ్రాహ్మీ పూర్వేశాం పూర్వజైర్ధృతా
శ్ర్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్ఛేదకిఞ్చనః

వీటిని ఉపనిషత్ అంటారు. వీటిని పూర్వూలందరికన్నా పూర్వులు ధరించారు. ముందు పుట్టినవారందరికంటే ముందు పుట్టినవారు (సనకాదులు)
ఎవరైతే ఈ ఉపనిషద్ విద్యను ధరిస్తాడో వాడు దేని యందూ ఆశ లేక మోక్షాన్ని పొందుతాడు

అత్ర తే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితామ్
నారదస్య చ సంవాదమృషేర్నారాయణస్య చ

నారద మహర్షీ నారాయణ ఋషికీ కలిగిన సంవాదం చెబుతాను విను

ఏకదా నారదో లోకాన్పర్యటన్భగవత్ప్రియః
సనాతనమృషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమమ్

భగవంతుని యందు ప్రీతి ఉన్న నారదుడు అన్ని లోకాలనూ సంచరిస్తూ నారయణ మహర్షిని చూద్దామని ఆశ్రమానికి వెళ్ళాడు

యో వై భారతవర్షేऽస్మిన్క్షేమాయ స్వస్తయే నృణామ్
ధర్మజ్ఞానశమోపేతమాకల్పాదాస్థితస్తపః

ఈ నారాయణ మహర్షి భరత వర్షములో ప్రజల క్షేమం కోసం, కళ్యాణం కోసం, ధర్మ జ్ఞ్యాన శాంతులతో కూడి సృష్టి నుండీ కల్పం వరకూ ఈ ఆశ్రమములో ఉండి తపసు చేస్తూ ఉంటాడు

తత్రోపవిష్టమృషిభిః కలాపగ్రామవాసిభిః
పరీతం ప్రణతోऽపృచ్ఛదిదమేవ కురూద్వహ

కలాప గ్రామములో ఉండే ఋషులందరితో స్వామి వేంచేసి ఉన్నాడు. నీవడిగిన ఈ విషయాన్నే నారదుడు కూడా అడిగాడు.గుణములు లేని పరమాత్మ గుణములు బోధించే వేదముల చేత ఎలా తెలుపబడతాడు. అలా అడుగుతున్నప్పుడు ఋషులందరూ వింటుండగా, పూర్వ కాలములో జనలోకములో బ్రాహ్మణులు మాట్లాడుకున్న సంవాదమును నారాయణుడు నారదుడికి ఇలా చెప్పాడు


తస్మై హ్యవోచద్భగవానృషీణాం శృణ్వతామిదమ్
యో బ్రహ్మవాదః పూర్వేషాం జనలోకనివాసినామ్

శ్రీభగవానువాచ
స్వాయమ్భువ బ్రహ్మసత్రం జనలోకేऽభవత్పురా
తత్రస్థానాం మానసానాం మునీనామూర్ధ్వరేతసామ్

నారదా జన లోకములో బ్రాహ్మణూలందరూ ఇంద్రియ నిగ్రహపరులై సత్రాన్ని ఆచరించారు.

శ్వేతద్వీపం గతవతి త్వయి ద్రష్టుం తదీశ్వరమ్
బ్రహ్మవాదః సుసంవృత్తః శ్రుతయో యత్ర శేరతే
తత్ర హాయమభూత్ప్రశ్నస్త్వం మాం యమనుపృచ్ఛసి

వారంతా ఇంద్రియ నిగ్రహ పరులు, పరమాత్మను మాత్రమే కోరేవారు

తుల్యశ్రుతతపఃశీలాస్తుల్యస్వీయారిమధ్యమాః
అపి చక్రుః ప్రవచనమేకం శుశ్రూషవోऽపరే
నీవు శ్వేత ద్వీపములో పరమాత్మను చూడడానికి వెళ్ళినపుడు అన్ని వేదములూ ఎవరిలో లీనమి ఉంటారో అలాంటి పరమాత్మ గురించి చర్చ ఆ సత్రములో ప్రారంభమయ్యింది. జనలోకములో బ్రహ్మఋషులు అదే ప్రశ్న అడిగారు

అక్కడ ఉన్న ఋషులందరూ శీలమూ తపస్సు విద్యా ప్రభావమూ జ్ఞ్యానము భక్తీ సమానముగా ఉన్నవారే.
అందరూ కలసి సనందుడిని వక్తగా ఎన్నుకున్నారు

శ్రీసనన్దన ఉవాచ
స్వసృష్టమిదమాపీయ శయానం సహ శక్తిభిః
తదన్తే బోధయాం చక్రుస్తల్లిఙ్గైః శ్రుతయః పరమ్

యథా శయానం సంరాజం వన్దినస్తత్పరాక్రమైః
ప్రత్యూషేऽభేత్య సుశ్లోకైర్బోధయన్త్యనుజీవినః

అపుడు సనందుడు ఇలా అన్నాడు "శృతులు పరమాత్మను ఎలా స్తోత్రం చేసాయో చెబుతాను వినండి"
సకల చరాచర జగత్తునూ కన కడుపులో బెట్టుకుని ప్రళయకాలములో శేష శయ్యపై పడుకున్నాడు. ప్రళయ కాలం పూర్తి అయ్యేసరికి వేదములే ఆయనను స్తోత్రం చేస్తాయి
పడుకున్న మహారాజును వదిమాగధులు లేపినట్లు లేపుతూ స్తోత్రం చేస్తాయి

శ్రీశ్రుతయ ఊచుః
జయ జయ జహ్యజామజిత దోషగృభీతగుణాం
త్వమసి యదాత్మనా సమవరుద్ధసమస్తభగః
అగజగదోకసామఖిలశక్త్యవబోధక తే
క్వచిదజయాత్మనా చ చరతోऽనుచరేన్నిగమః

ఇది అర్థం కావాలంటే వైద్కి వ్యాకరణం రావాలి. గృభీతగుణాం అని ఉంది. కానీ ఇది గృహీత. హా స్థానములో భ వస్తుంది.
ఎపుడూ గెలిచే పరమాత్మా, నీవు ప్రకృతిని గెలువు. (మా నుండి ప్రకృతిని దూరం చేయి)
సత్వ రజో తమో గుణాలతో దోషములుగా మాచేత ప్రవర్తింపచేసేది. ఈ మూడు గుణాలతోనే సంసారములో ప్రకృతి బంధిస్తూ ఉంది. పేరుకు గుణాలే ఐనా అవి దోషాలే. దోషములుగా గ్రహించబడే గుణములు గల ప్రకృతిని నీవు తొలగించు
నీవు ఏ ప్రకృతి రూపములో (జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ అనే ఆరింటికీ భగము అని పేరు) భగమును స్వీకరించి ప్రకృతి దోషాలను అరికట్టేవాడవు. నీవు ప్రకృతిని జయించగలవు
అగ - స్థావరం, జగ  - జంగమములు. స్థావర జంగమ రూపం గలవాటిలో అన్ని శక్తులనూ ఏర్పరచే వాడవు
నీవు మాయతో గానీ, నీ సంకల్పముతో కానీ ఈ సకల చరాచర జగత్తులో సంచరిస్తూ ఉంటే ఆ వేదం కూడా నీవెంటే సంచరిస్తూ, నీ చేష్టనూ సంకల్పాన్నీ శక్తినీ అనుసరిస్తుంది.
 ఆ బ్రహ్మకు కూడా అన్ని వేదాలూ నీవే బోధించావు. ఇది ఒక శ్రుతి మంత్రం.
అన్ని వేదములూ చదివినా, పురాణములు తెలియని వాడు వేదములకు అర్థం చెప్పలేడు. అలాగే అన్ని పురాణములూ చదివినా వేదం చదవని వారు పురాణాన్నీ చెప్పలేరు. పురాణం తెలియాలంటే వైదిక జ్ఞ్యానం ఉండాలి. వేదం చెప్పాలంటే పురాణ జ్ఞ్యానం ఉండాలి. సత్యం వదా అని చెప్పాలంటే సత్యముతో ఎవరెవరు ఉత్తమలోకాలను పొందారో చెప్పాలి. అలాగే ధర్మం ఆచరించిన వారు చేరిన ఉత్తమగతులను చెప్పాలంటే పురాణమే చెప్పాలి . వేదములో చెప్పబడిన ప్రతీ దానికి దృష్టాంతం పురాణములో కనపడుతుంది.

బృహదుపలబ్ధమేతదవయన్త్యవశేషతయా
యత ఉదయాస్తమయౌ వికృతేర్మృది వావికృతాత్
అత ఋషయో దధుస్త్వయి మనోవచనాచరితం
కథమయథా భవన్తి భువి దత్తపదాని నృణామ్

ఒక చిన్న కుండా ఇల్లూ, చిప్పా, ఇవన్నీ మట్టి యొక్క వికారాలు. ఎన్ని మారినా అది మట్టే. అన్నీ శిధిలం ఐతే అవి కూడా మట్టే. మట్టిగా పుట్టి మట్టిగా ఉండి అన్నీ మట్టిలోనే కలుస్తున్నాయి. ఇల్లూ కుండా మొదలైనవన్నీ పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నాము. మానవులూ జంతువులూ పక్షులూ క్రిములూ ఇవన్నీ ఉత్త వాగాడంబరమే. పరమాత్మ ఒక్కడే సత్యం
ఇంత పెద్ద ప్రపంచమూ చిన్న సూక్ష్మ రూపముగా పరమాత్మ ఉదరములో చేరతాయి. అప్పుడు, ఉన్నది ఆయనే. ఇపుడు ఉన్నవన్ని ఉన్నట్లు కనపడుతున్న పరమాత్మ రూపమే.
మట్టే కుండగా చిప్పగా ఇల్లుగా మారింది. ఆకారం కనపడినా కనపడకపోయినా మట్టే. ప్రపంచం ఉన్నా లేకున్నా పరమాత్మే.ఆయన నుండి వచ్చి ఆయన్లోనే కలుస్తాయి. సూక్ష్మ రూపములో అవి అన్నీ కలసి మెలిల్సి అందులోనే ఉంటాయి.చూడడానికి పెద్దవిగా కనపడతాయి. మట్టిలో మార్పు వచ్చినా రాకున్నా అది మట్టే అవుతుంది.
వికారం పొందినా వికారం పొందకున్నా ఒకటే. కాబట్టి ఋషులందరూ మనసుతో వాక్కుతో శరీరముతో ఆరాధించారు. త్రికరణములతో వారు ఆరాధించారు. నిన్ను ఆరాధిస్తేనే వారు ఉంటారు. భూమి మీద కాలుపెడితే నిలుస్తారు. ఆకాశములో కాలుపెడితే ఎలా నిలుస్తారు, పడిపోతారు. నాస్తిక వాదులంతా అలా ఆధారం లేక పడిపోతారు. ఈ సంగతి తెలిసి ఋషులు తమ త్రికరణములు నీ యందు ఉంచారు

ఇతి తవ సూరయస్త్ర్యధిపతేऽఖిలలోకమల
క్షపణకథామృతాబ్ధిమవగాహ్య తపాంసి జహుః
కిముత పునః స్వధామవిధుతాశయకాలగుణాః
పరమ భజన్తి యే పదమజస్రసుఖానుభవమ్

కాబట్టి, జ్ఞ్యానులు, త్రిగుణాధిపతి, త్రికాలాధిపతి, త్రిలోకాధి పతి, త్రి వేదాధిపతి, ఐన, సకల లోకముల పాపములూ తొలగించగల అమృతమైన నీ కథా సాగరములో మునిగి వారి తపస్సును విడిచిపెట్టారు
నిరంతరం సుఖానుభవాన్ని మాత్రమే కలిగించే నీ దివ్య పాదములను ఎవరు భజిస్తారో, ఎవరు నీ పాదాలను నిరంతరం పట్టుకుని ఉంటారో, వారు వదిలిపెడతారా. నీ దివ్యమైన తేజస్సుతో కాలమునూ త్రిగుణములనూ తొలగించిన వారు నిన్ను వదలిపెడతారా. నిరంతరం ఆనందం కలిగించే నీ పాద పద్మములను భజించేవారి గురించి వేరే చెప్పేదేముంది
పరమాత్మ స్వరూప స్వభావాలను నిరంతరం స్మరించేవారికి సంసారం అంటదు, పాపాలు అంటవు. తామరాకు నీటిలోనే మొలిచినా, దాని మీద నీరు నిలుస్తుందా. అందుచే అలాంటి వారు పుట్టినదీ,ఉన్నదీ సంసారములోనే ఐనా వారికి సంసారం అంటదు.
అలాంటి వాడు సుకృత దుష్కృతాలను తొలగిస్తాడు. అటువంటి వాడెపుడూ విచారించడు, పరితపించడు. మంచి పనులు చేయలేకపోయాను అనీ, పాపం చేసానూ అనీ పరితపించడు. అటువంటి వాడిని పాప కర్మ అంటదు. అతను పాప పుణ్యములను తీసి పారేస్తాడు. అతను విచారించడు.

దృతయ ఇవ శ్వసన్త్యసుభృతో యది తేऽనువిధా
మహదహమాదయోऽణ్డమసృజన్యదనుగ్రహతః
పురుషవిధోऽన్వయోऽత్ర చరమోऽన్నమయాదిషు యః
సదసతః పరం త్వమథ యదేష్వవశేషమృతమ్

పరమాత్మా, నీ స్వరూపాన్నీ, అనుగ్రహానీ, నీ శక్తినీ నీ లీలనూ ఎవరైతే తెలుసుకోరో, అటువంటి వరౌ కేవలం ప్రాణం మాత్రం కలిగి ఉంటారు. దానికి గుర్తుగా ఉచ్చాస నిశ్వాసలు తీస్తూ ఉంటారు. ఉచ్చాస నిశ్వాసలు తీయడమే ప్రయోజనమైతే వాటిని ప్రాణులు అనడం కన్నా తోలు తిత్తులూ అనవచ్చు
ఆయననే ఎందుకు స్తోత్రం చేయాలి? ప్రకృతిలో క్షోభ కలిగితే మహత్త్ తతవమూ, మహత్తుకు క్షోభ కలిగితే అహంకారం కలుగుతుంది. ఈ అహంకారం రాజసిక తామస సాత్వికాలుగా మారుతుంది. సాత్వికం నుండి మనసు, రాజసికం నుండి ఇంద్రియాలు, తామస అహంకారం నుండి పంచ భూతములు, తమాత్రలు. ఇవన్నీ కలిస్తే ఒక అండం సృష్టించబడుతుంది. ఇవి అండాన్ని ఎలా సృష్టించాయి. అది నీ అనుగ్రహముతోనే. అన్న మయ మనో మయ ప్రాణ మయ మనో మయ విజ్ఞ్యాన మయ ఆనంద మయ అని ఐదు కోశాలు. అన్నముతోనే ప్రాణం, ప్రాణముతోనే మనసు, మనసుతోనే విజ్ఞ్యానం, విజ్ఞ్యానముతోనే ఆనందం.
అందుకే సుందరకాండలో హనుమంతుడూ మొదట రావణుని భోజన శాలనూ, తరువాత పుష్పక విమానాన్ని (ప్రాణ మయం), తరువాత రావణున్ని (మనో మయం)  తరువాత గానాలూ నాట్యాలూ చూచాడు (విజ్ఞ్యాన మయం), తరువాత అశోక వనములో సీతమ్మను చూచాడు (అశోక - ఆనంద మయం)

ఈ కోశాలలో జీవుడు ఐదింటిలో తిరిగి అంత్యములో ప్రవర్తిస్తాడు (అంత్యం అంటే ఆనందం). ఈ జీవుడు అక్కడ ప్రవర్తిస్తాడు. నీవు సత్తు కంటే అసత్తు కంటే పరము. ఆత్మ హత్య చేసుకున్న వారు ఆసురి అన్న నరకానికి వెళతారు. ఆత్మ ఏదో తెలుసుకోలేకపోవుటే ఆత్మ హత్య. పుట్టి చచ్చే శరీరాన్ని ఆత్మ అనుకోవడమే ఆత్మ హత్య.
ఈ ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుంటే అంత కన్నా పెద్ద నష్టం ఇంకోటి ఉండదు

ఉదరముపాసతే య ఋషివర్త్మసు కూర్పదృశః
పరిసరపద్ధతిం హృదయమారుణయో దహరమ్
తత ఉదగాదనన్త తవ ధామ శిరః పరమం
పునరిహ యత్సమేత్య న పతన్తి కృతాన్తముఖే

ఎవరికి ఆత్మ జ్ఞ్యానం ఉందో వారు మోక్షాన్ని పొందుతారు.
అది తెలుసుకోని వారు దుఃఖాన్నే పొందుతారు. అలా దుఃఖాన్ని పొందే వారు అన్న రసముతో బతికేవారు. అన్న రసమయులు. కేవలం అన్నం తినడం, బతకడం చేసేవారు ఆత్మ హత్య చేసుకున్నవారు. వారు చాలా నష్టపోతున్నారు.
నాభి దగ్గర మణిపూర చక్రం ఉంటుంది. అక్కడే పరమాత్మ ఉన్నాడని ఆరాధించేవారు కొందరు. దహరాకాశములో అంతర్యామిగా ఉండే పరమాత్మను ఆరాధించాలి అనేవారు కొందరు.
సూక్ష్మ దృష్టి ఉన్న ఋషులు మణిపూరక చక్రములో ఉండే పరమాత్మను ఆరాధిస్తారు. ఆరుణులు (సూర్యోపాసకులు) హృదయములో ఉన్న దహరాకాశములో (హృదయాంతరములో ఉన్న ఆకాశం) ఉన్న పరమాత్మను ఆరాధిస్తారు. అటువంటి వారు యముని నోటిలో పడరు

స్వకృతవిచిత్రయోనిషు విశన్నివ హేతుతయా
తరతమతశ్చకాస్స్యనలవత్స్వకృతానుకృతిః
అథ వితథాస్వమూష్వవితథాం తవ ధామ సమం
విరజధియోऽనుయన్త్యభివిపణ్యవ ఏకరసమ్

తాము ఆచరించే పుణ్య పాప కర్మలను కారణముగా చేసి అనేకమైన మంచీ-చేడు జాతులలో పుడుతున్నారు
ఆయా కర్మలు ఆచరించిన వారు తీసుకున్న ఆయా దేహములలో కూడా నీవే ఉంటావు. పాపపు కర్మలు చేసుకున్నవారు పాపపు శరీరముతో పాపపు ఆకారముతో పుడితే అలా పుట్టినవారిలో ఉన్న నీకు ఆ పాపం ఎందుకు అంటదు
అగ్ని హోత్రం అన్నీ తింటుంది, కానీ దానికి ఏదీ అంటదు. కట్టెకి ఉన్న ఆకారం మంటకి ఉండదు కదా.తాను దేన్ని ఆశ్రయించిందో ఆ కారం అదీ పొందుతుంది.
మాలో ఉన్న నీకు అవి అంటవు

స్వకృతపురేష్వమీష్వబహిరన్తరసంవరణం
తవ పురుషం వదన్త్యఖిలశక్తిధృతోऽంశకృతమ్
ఇతి నృగతిం వివిచ్య కవయో నిగమావపనం
భవత ఉపాసతేऽఙ్ఘ్రిమభవమ్భువి విశ్వసితాః

ప్రపంచములో ఉన్న సకల లోకములూ సకల కర్మలూ వ్యర్థములే. సత్యమూ నిత్యమూ నీవు మాత్రమే .
నీ ధామమొక్కటే నిత్యం. ఇలాంటి నీ స్వరూపాన్ని పాపము లేని వారు మాత్రమే తెలుసుకుంటారు. వారు మాత్రమే నీలో చేరతారు. నిరంతరం నిన్ను స్తోత్రం చేసే పరిశుద్ధులు మాత్రమే నిన్ను తెలుసుకుని నిన్ను చేరుతారు..
ఈ దేహాలన్నీ ఆత్మకు పురాలు (నగరాలు). ఎవరి పురాన్ని వారే కట్టుకుంటారు (స్వకృత పురేషు).
మన వెలుపలా లోపలా ఉన్నాడు. ఈ జీవుడు అన్ని శక్తులూ కల నీ అంశతోనే ఈ జీవుడు వచ్చడు అని పెద్దలు చెబుతారు. వేదములకు మూల స్థానమైన నీ పాదపద్మము జ్ఞ్యానులు ఉపాసిస్తారు. భగవంతునికి ఏ ముసుగూ దాపరికమూ కప్పూ ఉండదు. ఆకారం అనే కప్పు జీవులకే.ఆ ఆకరం వెలుపలా లోపలా కూడా పరమాత్మే ఉంటాడు. అలా తెలుసుకున్నవాడు జీవుడు కూడా పరమాత్మ యొక్క అంశగా తెలుసుకుంటాడు. అటువంటి వాడు నీ పాదపద్మములను సేవిస్తాడు
నమ్మిన వారు దాన్ని ఆచరిస్తారు

దురవగమాత్మతత్త్వనిగమాయ తవాత్తతనోశ్
చరితమహామృతాబ్ధిపరివర్తపరిశ్రమణాః
న పరిలషన్తి కేచిదపవర్గమపీశ్వర తే
చరణసరోజహంసకులసఙ్గవిసృష్టగృహాః

సూర్యుడిలో ఉన్న వాదు పురుషుడిలో ఉన్నవాడూ పరమాత్మే అని తెలుసుకున్నవాడు పరమాత్మను ఆరాధించి మోక్షానికి వెళతాడు. ఎంత చెప్పినా అర్థం కాని ఆత్మ తత్వాన్ని చెప్పడానికి శరీరం ధరించి నీవు వస్తావు
నీ అవతార చరితామృతములో మునిగిన వారు అన్ని శ్రమలనూ పోగొట్టుకుంటారు. అలాంటి సముద్రములో ఓలలాడినవారు మోక్షాన్ని కూడా కోరరు.నీ పాద పద్మము అనే హంసలో ప్రవేశించిన వారు మోక్షాన్ని కూడా కోరరు

త్వదనుపథం కులాయమిదమాత్మసుహృత్ప్రియవచ్
చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ
న బత రమన్త్యహో అసదుపాసనయాత్మహనో
యదనుశయా భ్రమన్త్యురుభయే కుశరీరభృతః

నీవు అనుకూలముగా ఉంటే ఈ శరీరం నిన్ను పొందడానికి సాధనమవుతుంది. నీవు విముఖుడిగా ఉంటే ఇదే శరీరం నరకాన్ని పొందే సాధనమవుతుంది.
నేనే ప్రభువును నేనే బలవంతుడిని అనుకుంటున్న కొద్దీ పడిపోతూ ఉంటాడు జీవుడు. ఈ శరీరం  పక్షులు ఉండే గూడు వంటిది. ఇది మనకు మిత్రుడు కావాలంటే పరమాత్మ మనకు అభిముఖుడు కావాలి
దుష్టమును ఉపాసించే ఇటువంటి వారు ఆత్మ హత్య చేసుకున్నవారితో సమానం. వారు ఆనందించలేదు. మహా భయమును కలిగించే సంసారములో చెడు శరీరం కలిగి సంచరిస్తూ ఉంటారు. వారు ఈ బుద్ధితో శరీరముతో మనసుతో ఆనందాన్ని పొందలేరు. ఆనందాన్ని పొందుతున్నామనుకుని ప్రతీ క్షణం కుంగిపోతూ ఉంటారు. వారు ప్రకృతిని మాత్రమే ఆరాధించేవారు

నిభృతమరున్మనోऽక్షదృఢయోగయుజో హృది యన్
మునయ ఉపాసతే తదరయోऽపి యయుః స్మరణాత్
స్త్రియ ఉరగేన్ద్రభోగభుజదణ్డవిషక్తధియో
వయమపి తే సమాః సమదృశోऽఙ్ఘ్రిసరోజసుధాః

నీకూ మాకూ ఏదైతే భేదం కనపడుతోందో అది తెలుసుకోని వారు దుఃఖాన్ని పొందుతారు
నాచు కప్పిన నీటి మీద నాచులో పుట్టే క్షుద్ర క్రిమి కీటకాలతో ప్రాణాలు నిలుపుకునేవారు.పరమాత్మను ఆరాధించేవారు కొన్ని రకాలుగా ఉంటారు. బుద్ధి ఇంద్రియ మనసు ఇంద్రియములను నిగ్రహించి పరమాత్మను ఆరాధించేవారైన మునులు. అంత కంటే దృఢముగా శత్రువులు కూడా శత్రువులు కూడా మోక్షానికే వెళతారు. ఇవేవీ తెలియని గోపికల వంటి వారు కామముతో పరమాత్మను కామించి మోక్షానికి వెళతారు. చివరకు మేము(వేదాలు) కూడా రోజూ నీ పాదపద్మాలు ధ్యానించి మోక్షాన్నే పొందుతారు.యోగులూ శత్రువ్లూ, నిన్ను కామించినవారు, నిన్ను సేవించిన వారూ అందరూ నిన్నే చేరతారు


క ఇహ ను వేద బతావరజన్మలయోऽగ్రసరం
యత ఉదగాదృషిర్యమను దేవగణా ఉభయే
తర్హి న సన్న చాసదుభయం న చ కాలజవః
కిమపి న తత్ర శాస్త్రమవకృష్య శయీత యదా

నిన్ను ఎవరు తెలుసుకోగలిగే వారు. తెలుసుకున్నా ఎవరు నీ స్వరూపాన్ని స్పష్టముగా చెప్పగలరు. ఈ జగత్తంతా ఎక్కడినుంచి వచ్చింది. ఈ సృష్టి ఎలా ఏర్పడింది? దేవతలు కూడా తెలుసుకోలేరు. ఎవరు ఈ స్వరూపాన్ని గానం చేసారు, ఇది ఎక్కడినుండి వస్తున్నది. దేవతలూ రాక్షసులు ఎవరిని నిరంతరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతను ఉన్నవాడా, లేనివాడా.
ఆయన ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడూ లేనివాడూ ఆయనే. రెండూ కాకపోవచ్చు. రెండూ కావొచ్చు. ఈయనద దగ్గర కాలవేగం పనికిరాదు
అది ఏ మాత్రమూ కదలదు.కానీ మనసు కంటే వేగమైనది.అది పరిగెత్తదు గానీ పరిగెత్తేవారిని దాటిపోతుంది. పరమాత్మ స్వరూపం ఇదీ అని ఎవరూ చెప్పలేరు



జనిమసతః సతో మృతిముతాత్మని యే చ భిదాం
విపణమృతం స్మరన్త్యుపదిశన్తి త ఆరుపితైః
త్రిగుణమయః పుమానితి భిదా యదబోధకృతా
త్వయి న తతః పరత్ర స భవేదవబోధరసే


నిత్యమైన పరమాత్మనుండి అనిత్యమైన జగత్తు ఎలా పుడుతుంది.కారణ గుణాలు కార్యములో రావాలి కదా. పరమాత్మ నుండి పుడితే జగత్తు నిత్యమూ సత్యమూ కావాలి. అసత్ నుండి పుడితే జగత్తు కూడా అసత్ కావాలి. దేని నుండి పుడితే దాని లక్షణాలు రావాలంటే మన చేతికి ప్రాణం ఉంది, కానీ వాటి నుండి పుట్టే గోళ్ళకు ప్రాణం లేదు. ప్రాణం లేని స్వేదం నుండి పురులు పుడుతున్నాయి. ఈ వాదం తర్కానికి నిలిచేది కాదు

 కొందరు ఆరోపించిన ధర్మాలతో "ఇవి ఉన్నాయి, ఇవి లేవు అని చెబుతున్నారు. ప్రకృతి త్రిగుణాత్మకం కాబట్టి పురుషుడు కూడా త్రిగుణాత్మకం అంటున్నారు. ఇది వాస్తవం కాదు. నీ స్వరూపాన్ని జ్ఞ్యాన స్వరూపాన్నీ వాస్తవాన్నీ తెలుసుకోలేక జీవుడు గుణమయుడు అని చెప్పడం సరికాదు

ఇలాంటి వారు గుడ్డివారిని పట్టుకున్న గుడ్డివారివలే నరకములో పడతారు

సదివ మనస్త్రివృత్త్వయి విభాత్యసదామనుజాత్
సదభిమృశన్త్యశేషమిదమాత్మతయాత్మవిదః
న హి వికృతిం త్యజన్తి కనకస్య తదాత్మతయా
స్వకృతమనుప్రవిష్టమిదమాత్మతయావసితమ్

ఆత్మ జ్ఞ్యానం కలవారు ఈ జగత్తును పరమాత్మ స్వరూపముగా తెలుసుకుంటారు.బంగారం ఎన్ని వికారాలు పొందినా అది బంగారం కాకుండా పోతుందా?
ప్రపంచం ఎన్ని రంగులు మారిన పరమాత్మ తత్వం ఎక్కడికీ పోదు. పరమాత్మ తాను సృష్టించిన జగత్తులో తానే ప్రవేశిస్తాడు. జగత్తురూపం మారినంత మాత్రాన పరమాత్మ మారడు. సకలప్రాణూలు మూలాధారముగా నిన్ను ఎవరు ఉపాసిస్తారో వారు తమో గుణము శిరస్సులో పాదం పెట్టి (నరకం నెత్తిన పాదం పెట్టి)

తవ పరి యే చరన్త్యఖిలసత్త్వనికేతతయా
త ఉత పదాక్రమన్త్యవిగణయ్య శిరో నిరృతేః
పరివయసే పశూనివ గిరా విబుధానపి తాంస్
త్వయి కృతసౌహృదాః ఖలు పునన్తి న యే విముఖాః

నీ స్థానాన్ని పొందుతారు. నీ యందు విముఖులైన వారు పశువులవలే నరకములో బంధించబడుతారు
నీకు విముఖులు కాని వారు నిన్ను అనుసరించి ఉంటారు. నీకు ఏ ఇంద్రియాలూ లేవు. కానీ నీవు సర్వత్రా ప్రకాశించేవాడవు. ప్రపంచములో ఏవేవి పనులు చేస్తున్నాయో, కాళ్ళూ చేతులూ  ఉన్నవారు తమకున్న కాళ్ళూ చేతులతో చేసే పనులకు కావలసిన శక్తిని నీవే ఇస్తావు.
త్వమకరణః స్వరాడఖిలకారకశక్తిధరస్
తవ బలిముద్వహన్తి సమదన్త్యజయానిమిషాః
వర్షభుజోऽఖిలక్షితిపతేరివ విశ్వసృజో
విదధతి యత్ర యే త్వధికృతా భవతశ్చకితాః

దేవతలు నీ మాయతో మోహించబడి నిన్ను పూజించి నీకు కానుకలు అర్పిస్తూ ఉంటారు.రైతులు వ్యవసాయం చేసి పంట పండిస్తారు. దానికి వర్షం కురవాలి. వర్షం పడితే పంట పండితే పండిన పంటలో కొంత భాగం రాజుకి ఇస్తారు. వర్షానికి ఇవ్వరు. వర్షముతో పడ్డ వాన నీరే అన్ని పొలాలకూ నీరు ఇస్తే, దాన్ని నిలువచేసి ఏ పొలానికి ఎంత నీరు కావాలో రాజు ఏర్పాటు చేస్తాడు. వాన నీరు అనుగుణముగా చేసినవాడు రాజు కాబట్టి పంటను రాజుకి ఇస్తారు. చేతులూ కాళ్ళూ మనవే ఐనా ఏ సమయములో వీటితో ఏ పని చేయాలో అలా చేయించేది పరమాత్మ.

మన పని మనమే చేసుకుంటున్నా, ఇందుకే పరమాత్మను మనం పూజించాలి. మన చేత మంచి పనులు చేయించేట్లుగా
సకల చరాచర జగత్తునూ నీ అధికారముతో నడుపుతున్నావు.

స్థిరచరజాతయః స్యురజయోత్థనిమిత్తయుజో
విహర ఉదీక్షయా యది పరస్య విముక్త తతః
న హి పరమస్య కశ్చిదపరో న పరశ్చ భవేద్
వియత ఇవాపదస్య తవ శూన్యతులాం దధతః

ఆకాశములో మనం ఉండలేము కానీ, మనకు వచ్చేవన్నీ ఆకాశం నుండే వస్తాయి. అసత్ నుండి సత్ వచ్చిందంటే ఇదే అర్థం.
పరమాత్మ కంటే మించిన్వాడు, ఆయన కంటే ముందరవాడూ తరువాతి వాడూ ఎవడూ లేడు
సకల భూతములనూ ప్రాణములనూ దిక్కులనూ ఎవరైతే ఆవరించి ఉన్నారు వాడు అందరి చేత లేనివాడిగా గుర్తించబడుతున్నాడు. ఆయన చేత సృష్టించబడినవన్నీ ఉన్నట్లుగా గుర్తించబడుతున్నాయి.

అపరిమితా ధ్రువాస్తనుభృతో యది సర్వగతాస్
తర్హి న శాస్యతేతి నియమో ధ్రవ నేతరథా
అజని చ యన్మయం తదవిముచ్య నియన్తృ భవేత్
సమమనుజానతాం యదమతం మతదుష్టతయా

 ఏమీ తెలియని వాడు నేను జ్ఞ్యానినీ అన్నట్లూ, అంత తెలిసినవాడు తనకేమీ తెలియదనీ అన్నట్లు
అనంతమైన దృఢమైన శరీర ధారులూ అంతటా ఉండి వారంతా శాసించబడుతూ ఉన్నారు. ఎవరూ వారి ఇష్టానుగుణముగా నడవట్లేదు, వారు శాసించబడుతూ ఉన్నారు

న ఘటత ఉద్భవః ప్రకృతిపూరుషయోరజయోర్
ఉభయయుజా భవన్త్యసుభృతో జలబుద్బుదవత్
త్వయి త ఇమే తతో వివిధనామగుణైః పరమే
సరిత ఇవార్ణవే మధుని లిల్యురశేషరసాః

నియామకుడు లేని నాడు ఈ ఏక స్థితి నియమిత పద్దతిలో ఎలా ఉంటుంది. సముద్రం చెలియలికట్ట దాట పోవడం, భూమి ఒకే రీతిని తిరగడమూ మొదలైనవి ఎలా జరుగుతున్నాయి
దాని వెంట పుట్టిన వారు దాన్ని ఒప్పుకోకపోతే అది వారి భావ దోషమే.ప్రకృతికీ జీవునికీ పుట్టుక లేదు. నీటి బుడగలు నీటినుండే వచ్చాయి గానీ నీరుగా పరిగణించబడవు. వడగళ్ళు నీళ్ళా రాళ్ళా?
బుడగలో గాలీ నిప్పే ఉంది, మేఘములోనూ గాలీ నిప్పే ఉంది. అక్కడా పరమాత్మ ఉన్నాడు ఇక్కడా పరమాత్మ ఉన్నాడు. కనపడని ఆకరం కనపడితే ప్రకృతి అని కనపడకపోతే జీవుడని అంటున్నాము. సూయ ఉదయాస్తమాలలాగ కనపడే ఆకారములో ఆత్మ చేరుటే పుట్టుట
కనపడనిది కనపడే రూపములోకి వెళ్ళడం పుట్టుక. నీయందు రక రకాల పేర్లతో ఆకారాలతో కలుస్తాయి.
సముద్రములోని నదూలలాగ. నది ఒక్కొక్కటీ వేరుగా ఉన్నపుడు వాటి నీటి రుచి వేరుగా ఉంటుంది. సముద్రములో కలసినపుడు అన్ని నీళ్ళ రుచీ ఒకలాగే ఉంటుంది. రసాలన్నీ వేరు వేరు రుచి ఐనా, తేనెటీగలు వాటినుంచి సేకరించి తేనెగా చేసినపుడు వచ్చిన తేనె రుచి మాత్రం ఒకలాగే ఉంటుంది.

నృషు తవ మయయా భ్రమమమీష్వవగత్య భృశం
త్వయి సుధియోऽభవే దధతి భావమనుప్రభవమ్
కథమనువర్తతాం భవభయం తవ యద్భ్రుకుటిః
సృజతి ముహుస్త్రినేమిరభవచ్ఛరణేషు భయమ్

నీవు నీ మాయతో పుట్టుక లేకుండా ఉండి కూడా పుడతావు. బుద్ధి లేని వారు నీవు కూడా మానవుడవే అనుకుంటారు. సంసార భయం నీకు ఎలా వస్తుంది?
నీ కనుబొమ్మల ముడే కాల సర్పములాగ అందరినీ తీసుకు పోతుంది. అందరికీ భయాన్ని కలిగిస్తుంది. అలా సకల లోకాలకే కనుబొమ్మల ముడితే భయాన్ని కలిగించే నీకు సంసారం ఎలా వస్తుంది

విజితహృషీకవాయుభిరదాన్తమనస్తురగం
య ఇహ యతన్తి యన్తుమతిలోలముపాయఖిదః
వ్యసనశతాన్వితాః సమవహాయ గురోశ్చరణం
వణిజ ఇవాజ సన్త్యకృతకర్ణధరా జలధౌ

ఇంద్రియ ప్రాణములతో కలసి నియమించబడని మనసనే గుర్రమును నియమించాలని అనుకున్నవారు మహా చంచలులై ఉపాయం దొరకక బాధపడతారు. ప్రాణ వాయువునూ ఇంద్రియాలను జయించి, మనసును మాత్రం జయించక అన్నీ తన వశం చేసుకోవాలని బాధపడతారు.గురువుగారి పాద పద్మములను వదిలిపెట్టి మనసును గెలవలేక ప్రాణాయమముతో ప్రాణాన్ని గెలిచి ప్రపంచాన్ని గెలవాలనుకుంటారు, కానీ ఉపాయాన్ని పొందలేరు
వ్యాపారం చేసేవారు సరుకులు తీసుకుని పడవలో బయలుదేరుతారు. ఐనా చుక్కాని లేనిదే పడవ ఉన్నా సముద్రాన్ని దాటలేనట్లుగా గురువుగారి పాదాలని ధ్యానం చేస్తే సంసారాన్ని దాటుతారు

స్వజనసుతాత్మదారధనధామధరాసురథైస్
త్వయి సతి కిం నృణామ్శ్రయత ఆత్మని సర్వరసే
ఇతి సదజానతాం మిథునతో రతయే చరతాం
సుఖయతి కో న్విహ స్వవిహతే స్వనిరస్తభగే

అన్నిటికన్నా ప్రథానమైన రసమైన నిన్ను చేరితే భార్యా ఇల్లూ పిల్లలూ వాకిలీ సంపదలు ఎందుకు? పరమాత్మను ఆశ్రయించని వారికి కూడా వాటితో ప్రయోజనం లేదు. పరమాత్మను ఆశ్రయించినవారికి సంసారం ఉన్నా నష్టం లేదు.పరమాత్మను ఆశ్రయించని వారికి సంసారములో ఉన్నా ప్రయోజనం లేదు. ఇది తెలియక దాంపత్య సుఖములోనే తిరిగే వారు తన ఇంటిని తానే కూలగొట్టుకున్నవారితో సమానం.

భువి పురుపుణ్యతీర్థసదనాన్యృషయో విమదాస్
త ఉత భవత్పదామ్బుజహృదోऽఘభిదఙ్ఘ్రిజలాః
దధతి సకృన్మనస్త్వయి య ఆత్మని నిత్యసుఖే
న పునరుపాసతే పురుషసారహరావసథాన్

సజ్జనులు మాటి మాటికీ సంచరించినందువలన పవిత్రమైన మార్గంలౌలో అహ్మకారం వదులుకున్నవారు నీ పాదాల యందు మనసు ఉంచి, అందులో సంచరిస్తే, నీ యందు భక్తి కలిగి, పురుషుల యొక్క సుఖాన్ని అపహరించే ఇళ్ళను పొరబాటున కూడా మళ్ళీ ఆశ్రయించరు.

సత ఇదం ఉత్థితం సదితి చేన్నను తర్కహతం
వ్యభిచరతి క్వ చ క్వ చ మృషా న తథోభయయుక్
వ్యవహృతయే వికల్ప ఇషితోऽన్ధపరమ్పరయా
భ్రమయతి భారతీ త ఉరువృత్తిభిరుక్థజడాన్

సత్తు నుండి సత్తే పుట్టాలి కదా అన్న వాదం ఇక్కడ పనిచేయదు. అంధ పరంపరతో గుడ్డివారిని గుడ్డివారు పట్టుకున్నట్లుగా, ఇద్దరు అజ్ఞ్యానులు వాదించినట్లుగా, అది జడులను బుద్ధి హీనులనూ భ్రమింపచేస్తుంది కానీ వాస్తవం కాజాలదు. అది ఉన్నట్లూ కనిపించదూ,లేనట్లూ కనిపించదు.


న యదిదమగ్ర ఆస న భవిష్యదతో నిధనాద్
అను మితమన్తరా త్వయి విభాతి మృషైకరసే
అత ఉపమీయతే ద్రవిణజాతివికల్పపథైర్
వితథమనోవిలాసమృతమిత్యవయన్త్యబుధాః

ద్రవ్యముతో జాతితో మనం దేనితో పోలుస్తామో అదే లేనిది. (ఉదాహరణకు పరమాత్మ కళ్ళను పద్మాలతో పోలుస్తారు)

స యదజయా త్వజామనుశయీత గుణాంశ్చ జుషన్
భజతి సరూపతాం తదను మృత్యుమపేతభగః
త్వముత జహాసి తామహిరివ త్వచమాత్తభగో
మహసి మహీయసేऽష్టగుణితేऽపరిమేయభగః

నిన్ను ఆశ్రయించిన వారు సంసారాన్ని విడిచిపెడతారు, పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా
నీవు అష్ట గుణములు కలిగి జ్ఞ్యాన శక్త్యాదులు అనంతముగా కలిగిన నీవు

యది న సముద్ధరన్తి యతయో హృది కామజటా
దురధిగమోऽసతాం హృది గతోऽస్మృతకణ్ఠమణిః
అసుతృపయోగినాముభయతోऽప్యసుఖం భగవన్న్
అనపగతాన్తకాదనధిరూఢపదాద్భవతః

హృదయములో కామ క్రీడలను యతులు ఉద్ధరించని నాడు దుర్జనుల యొక్క హృదయములో ఉన్న ఈ సంసార బీజాన్ని దాటలేము.
శరీరాన్ని ప్రాణాన్ని నిలుపుకోవాలి అనుకునే వారికి ఇహ పరాలు రెండూ ఉండవు. యముడు తొలగిపోడు, నీవేమో రావు.

త్వదవగమీ న వేత్తి భవదుత్థశుభాశుభయోర్
గుణవిగుణాన్వయాంస్తర్హి దేహభృతాం చ గిరః
అనుయుగమన్వహం సగుణ గీతపరమ్పరయా
శ్రవణభృతో యతస్త్వమపవర్గగతిర్మనుజైః

శరీర ధారుల వాక్యములు నీవలన కలిగిన శుభాశుభములను ప్రతీ యుగములో ప్రతీ రోజు,  మోక్షమునిచ్చే నీ స్వరూప స్వభావ ప్రభావాలను చెవిలో నిరంతరం పడవేసుకోకుంటే జ్ఞ్యానాన్ని పొంది సంసారాన్ని విడిచిపెట్టలేరు

ద్యుపతయ ఏవ తే న యయురన్తమనన్తతయా
త్వమపి యదన్తరాణ్డనిచయా నను సావరణాః
ఖ ఇవ రజాంసి వాన్తి వయసా సహ యచ్ఛ్రుతయస్
త్వయి హి ఫలన్త్యతన్నిరసనేన భవన్నిధనాః

దేవతాదులే అనంతమైన నీ స్వరూపాన్ని చేరలేరు. అనంతమైన ఈ లోకాలనూ, ఆకాశములో ధూళి కణాలు వెళుతున్నట్లుగా శ్రుతులన్నీ నీలో ప్రవేశిస్తాయి. ఐనా నీ స్వరూపాన్ని అవి పూర్తిగా చెప్పలేవూ. అలా అని నీవు లేవనీ నిరూపించలేవు. అవి అన్నీ నీలోనే ఉంటాయి
ఆకాశములో దుమ్ము పక్షులూ ఇతరములైన ప్రాణులు సంచరిస్తూ ఉన్నా వాటిలో ఉన్న దోషాలు ఆకాశానికి అంటవు

శ్రీభగవానువాచ
ఇత్యేతద్బ్రహ్మణః పుత్రా ఆశ్రుత్యాత్మానుశాసనమ్
సనన్దనమథానర్చుః సిద్ధా జ్ఞాత్వాత్మనో గతిమ్

ఈ విధముగా శ్రుతి గీతలను విని పరమాత్మ స్వరూపమును తెలుసుకుని, సనందుడిని అందరూ గురువుగా కీర్తించారు.

ఇత్యశేషసమామ్నాయ పురాణోపనిషద్రసః
సముద్ధృతః పూర్వజాతైర్వ్యోమయానైర్మహాత్మభిః

అనంతమైన వేద పురాణ ఇతిహాస ఉపనిషద్సారం ఇవి. పూర్వ జాతులైన సనకాదులు ఇవన్నీ జాగ్రత్తగా మధించి తీఉస్కుని మనకు అందించారు

త్వం చైతద్బ్రహ్మదాయాద శ్రద్ధయాత్మానుశాసనమ్
ధారయంశ్చర గాం కామం కామానాం భర్జనం నృణామ్

ఇంత వరకూ చెప్పిన ఈ ఆత్మాను శాసనాన్ని నీవు కూడా శ్రద్ధగా వింటే అన్ని కామములూ మాడ్చివేస్తుంది. ఇలాంటి వేదాను శాసనాన్ని ధరిస్తూ మీరు సంచరించండి

శ్రీశుక ఉవాచ
ఏవం స ఋషిణాదిష్టం గృహీత్వా శ్రద్ధయాత్మవాన్
పూర్ణః శ్రుతధరో రాజన్నాహ వీరవ్రతో మునిః

ఈ ప్రకారముగా సనందన ఋషి తక్కిన వారందరికీ బోధిస్తే జ్ఞ్యానమూ మనో నిగ్రహం కల సనందుడు బోధించిన ఈ విషయాన్ని గ్రహించి, ఉన్న విషయాన్ని విన్నవాడైన ముని, విన్నదాన్ని నిష్ఠ బాగా ఉన్న నారదుడు ధరించాడు.

శ్రీనారద ఉవాచ
నమస్తస్మై భగవతే కృష్ణాయామలకీర్తయే
యో ధత్తే సర్వభూతానామభవాయోశతీః కలాః

పరిపూర్ణమైన కీర్తి గల స్వామికి నమస్కారం
సకల భూతముల అభివృద్ధికి రకరాకాల రూపాలు ధరిస్తూ ఉంటావు. అని స్వామికీ సనకాదులకూ నమస్కరించి

ఇత్యాద్యమృషిమానమ్య తచ్ఛిష్యాంశ్చ మహాత్మనః
తతోऽగాదాశ్రమం సాక్షాత్పితుర్ద్వైపాయనస్య మే

వ్యాసభగవానుని ఆశ్రమానికి వేంచేసారు. పరమాత్మ చేత మన్నించబడి, ఆసనాన్ని స్వీకరించి నారాయణ ఋషి వలన విన్నదాన్ని వ్యాసునకు తెలియజేసాడు

సభాజితో భగవతా కృతాసనపరిగ్రహః
తస్మై తద్వర్ణయామాస నారాయణముఖాచ్ఛ్రుతమ్

నీవడిగావు కదా, గుణాతీతుడైన పరమాత్మను గుణములు కల వేదములు ఎలా స్తోత్రం చేస్తాయి అన్నదానికి సమాధానం విన్నావు కదా

ఇత్యేతద్వర్ణితం రాజన్యన్నః ప్రశ్నః కృతస్త్వయా
యథా బ్రహ్మణ్యనిర్దేశ్యే నీఋగుణేऽపి మనశ్చరేత్

చెప్పడానికి వీలు లేని వాడైనా పరమాత్మ యందు మనం మనసు నిలుపవచ్చు అన్న విషయం అర్థం చేసుకున్నావా

యోऽస్యోత్ప్రేక్షక ఆదిమధ్యనిధనే యోऽవ్యక్తజీవేశ్వరో
యః సృష్ట్వేదమనుప్రవిశ్య ఋషిణా చక్రే పురః శాస్తి తాః
యం సమ్పద్య జహాత్యజామనుశయీ సుప్తః కులాయం యథా
తం కైవల్యనిరస్తయోనిమభయం ధ్యాయేదజస్రం హరిమ్

ఇది శ్రుతి గీతల సారం. పరమాత్మ ఈ సకల చరాచర ప్రపంచమునకూ సృష్టి చేసే వాడు. సృష్టిలోనూ రక్షణలోనూ ప్రకృతీ పురుషుడులోనూ పరమాత్మ ప్రవేశించి సకలమూ దర్శించే పరమాత్మ చేత ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు
తానే అందులో చేరుతాడు, తానే దాన్ని సృష్టిస్తాడు, తానే దాన్ని లయం చేస్తాడు, తానే దాన్ని విడిచిపెడతాడు. మాయను తన వశములో ఉంచుకుని జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను ఆచరిస్తూ ఉంటాడు.
గూడులో పక్షి నిదురించి ఉన్నట్లుగా పరమాత్మ మాయలో నిదురించి ఉన్నట్లు కనపడతాడు. ఆత్మా, ప్రకృతి స్వరూపం విడి విడిగా తీసుకుని, అది ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అసత్యం అన్న భావాన్ని ఆయన దయ వలన విడిచిపెట్టాలి. ప్రాణం ఉన్న దానితో ప్రాణం లేనిదీ, ప్రాణం లేనిదానితో ప్రాణం ఉన్నదీ సృష్టించవచ్చు. గుణ రహితమైన పరమాత్మ నుండి గుణాత్మకమైన ప్రపంచం సృష్టించవచ్చు.
ఏ దోషాలూ లేని పరమాత్మ ఈ జగత్తును సృష్టించవచ్చు. పరమాత్మకు గుణ దోషాలు లేవు కాబట్టి జగత్తునకు గుణ దోషాలు ఉంటాయి అని చెప్పడం తప్పు. అనుకున్న రీతిలో అనుకున్నదానిని ఆచరించగలిగిన వాడు పరమాత్మ.
                                                   అటువంటి స్వామిని ధ్యానించు
                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts