Followers

Tuesday 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
ఇత్థం విరిఞ్చస్తుతకర్మవీర్యః ప్రాదుర్బభూవామృతభూరదిత్యామ్
చతుర్భుజః శఙ్ఖగదాబ్జచక్రః పిశఙ్గవాసా నలినాయతేక్షణః

ఇలా బ్రహ్మచేత స్తోత్రం చేయబడిన పరాక్రమం కరంలౌ కల్గిన స్వామి, మోక్షమునకు నివాసమైన స్వామి అథితి యందు ఆవిర్భవించాడు. పరమాత్మ లక్షణాలన్నీ ఆవిర్భవింపచేస్తూ (నాలుగు భుజాలూ నాలుగు ఆయుధాలు పీతాంబర ధారుడు పుండరీకాక్షుడు) తాను ఆవిర్భవించాడు. 

శ్యామావదాతో ఝషరాజకుణ్డల త్విషోల్లసచ్ఛ్రీవదనామ్బుజః పుమాన్
శ్రీవత్సవక్షా బలయాఙ్గదోల్లసత్కిరీటకాఞ్చీగుణచారునూపురః

నీల మేఘ శ్యాముడు మకర కుండలాలు కలవాడు, కాంతిచే ప్రకాశించే ముఖం కలవాడు. శ్రీవత్స వక్షమూ వలయంలూ కంకణములూ అంగదములూ వాటితో ప్రకాశించే కిరీటమూ కంచీనూపురాలు కలవాడై

మధువ్రాతవ్రతవిఘుష్టయా స్వయా విరాజితః శ్రీవనమాలయా హరిః
ప్రజాపతేర్వేశ్మతమః స్వరోచిషా వినాశయన్కణ్ఠనివిష్టకౌస్తుభః

ఐదు రంగులు కల పుష్పాలు కూర్చిన మాలను వనమాల అంటారు. ఆ వనమాలలో తుమ్మెదల యొక్క సమూహముచేత ధ్వనింపచేసే శబ్దములు కల వనమాలలో, తన కాంతిచేత ప్రజాపతి యొక్క ఇంటిలో చీకట్లు పారద్రోలుతూ కంఠములో కౌస్తుభం కలిగి ఉన్నాడు

దిశః ప్రసేదుః సలిలాశయాస్తదా ప్రజాః ప్రహృష్టా ఋతవో గుణాన్వితాః
ద్యౌరన్తరీక్షం క్షితిరగ్నిజిహ్వా గావో ద్విజాః సఞ్జహృషుర్నగాశ్చ

ఇలా పరమాత్మ అవతరిస్తే అన్ని దిక్కులూ సముద్రాలూ నదులూ ప్రసన్నములయ్యాయి.  ప్రజలందరూ ఆనందించారు.అన్ని ఋతువులూ తమ తమ గుణములను కూర్చుకుని ఉన్నాయి. పంచభూతములూ పర్వతములూ గోవులూ బ్రాహ్మణులూ సంతోషించారు.

శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తేऽభిజితి ప్రభుః
సర్వే నక్షత్రతారాద్యాశ్చక్రుస్తజ్జన్మ దక్షిణమ్

భాద్రపద శుద్ధ ద్వాదశీ శ్రవణా నక్షత్రం అభిజిత్ ముహూర్తములో అవతరించాడు. నక్షత్రాలన్నీ ఉత్తర భాగములోకి వెళ్ళాయి. (ఆ జన్మను దక్షిణం చేసాయి. నక్షత్రాలు తారలు ఉచ్చ స్థానములో ఉన్నాయి). సూర్యభగవానుడు మధ్య భాగములో ఉండి

ద్వాదశ్యాం సవితాతిష్ఠన్మధ్యన్దినగతో నృప
విజయానామ సా ప్రోక్తా యస్యాం జన్మ విదుర్హరేః

ఏ భాద్రపద శుద్ద ద్వాదశి శ్రవణా నక్షత్రములో ఉన్న అభిజిత్ ముహూర్తానికి విజయ అని పేరు. శ్రవణ యుక్త దశమిని విజయ అంటారు. (అందుకే మనకు విజయ దశమి వచ్చింది. కామ దోషములు నాలుగు,క్రోధ దోషములు మూడు, లోభ దోషములు మూడు, కలిపి వచ్చే పది దోషాలను పోగొట్టేది దశ హర. ఆ పాపాలు పోగానే మనం విజయం సాధించిన వారం కాబట్టి దానిని విజయ దశమి అంటారు)

శఙ్ఖదున్దుభయో నేదుర్మృదఙ్గపణవానకాః
చిత్రవాదిత్రతూర్యాణాం నిర్ఘోషస్తుములోऽభవత్

అన్ని రకాల మంగళ వాద్యాలూ మ్రోగాయి. రకరకాల మగళ వాద్యాల ధ్వని అన్ని వైపులా వ్యాపించింది

ప్రీతాశ్చాప్సరసోऽనృత్యన్గన్ధర్వప్రవరా జగుః
తుష్టువుర్మునయో దేవా మనవః పితరోऽగ్నయః

అప్సరసలు నాట్యమూ గంధర్వులు గానమూ చేసారు.దేవతలూ మునులూ మనువులూ స్తోత్రం చేసారు. 

సిద్ధవిద్యాధరగణాః సకిమ్పురుషకిన్నరాః
చారణా యక్షరక్షాంసి సుపర్ణా భుజగోత్తమాః

యక్ష రాక్షస కిన్నెర కింపురుష సకల దేవతా గణం స్వామిని స్తోత్రం చేస్తూఉ నాట్యం చేస్తూ అనుసరిస్తూ అథితి ఆశ్రమాన్ని పుష్పములతో వర్షింపచేసారు

గాయన్తోऽతిప్రశంసన్తో నృత్యన్తో విబుధానుగాః
అదిత్యా ఆశ్రమపదం కుసుమైః సమవాకిరన్

దృష్ట్వాదితిస్తం నిజగర్భసమ్భవం పరం పుమాంసం ముదమాప విస్మితా
గృహీతదేహం నిజయోగమాయయా ప్రజాపతిశ్చాహ జయేతి విస్మితః

తన గర్భము నుండి పుట్టిన స్వామిని చూసి అత్యాశ్చర్యాన్ని అమితానందాన్నీ పొందింది. తన యోగ మాయతో దేహమును తీసుకుని ఉన్న స్వామిని చూచి ప్రజాపతి "మీరు జయించాలి" అని ఆశ్చర్యముతో చెప్పాడు

యత్తద్వపుర్భాతి విభూషణాయుధైరవ్యక్తచిద్వ్యక్తమధారయద్ధరిః
బభూవ తేనైవ స వామనో వటుః సమ్పశ్యతోర్దివ్యగతిర్యథా నటః

పరమాత్మ ఎలాంటి దేహమును ధరించాడో, అనేక ఆభరణములతో ఎవరికీ భాసించని జ్ఞ్యానం అందరికీ భాసించింది (వ్యక్తమైంది). అలా అందరూ చూస్తుండగానే ఆ శిశుదేహం బ్రహ్మచారిగా కావడానికి తగిన వయసుతో కూడుకుని ఉన్న దేహముగా అయ్యింది. అది కూడా పొట్టి వాడిగా అయ్యింది. నటుడు తన దేహాన్ని ఎలా మర్చుకుంటాడో పాత్రకి తగ్గట్టుగా, స్వామి కూడా మార్చుకున్నాడు

తం వటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయః
కర్మాణి కారయామాసుః పురస్కృత్య ప్రజాపతిమ్

అటువంటి వామన వటువుని చూచి ఋషులందరూ కశ్యప  ప్రజాపతిని ముందు ఉంచుకుని ఉపనయన విధి కావించారు

తస్యోపనీయమానస్య సావిత్రీం సవితాబ్రవీత్
బృహస్పతిర్బ్రహ్మసూత్రం మేఖలాం కశ్యపోऽదదాత్

సూర్యభగవానుడు మంత్రాన్ని చెప్పగా, బృహస్పతి యజ్ఞ్యోపవీతాన్ని, కశ్యపుడు మేఖలం (దర్భలతో మౌంజి) కశ్యపుడూ, భూమి కృష్ణాజినాన్ని, చంద్రుడు దండాన్ని, తల్లి కౌపీనాన్ని, ఆకాశం (స్వర్గం) గొడుగుని ఇచ్చింది,

దదౌ కృష్ణాజినం భూమిర్దణ్డం సోమో వనస్పతిః
కౌపీనాచ్ఛాదనం మాతా ద్యౌశ్ఛత్రం జగతః పతేః

కమణ్డలుం వేదగర్భః కుశాన్సప్తర్షయో దదుః
అక్షమాలాం మహారాజ సరస్వత్యవ్యయాత్మనః

బ్రహ్మ కమండలాన్ని సప్తఋషులు దర్భలను అక్ష మాలను సరస్వతి ఇచ్చింది

తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్పాత్రికామదాత్
భిక్షాం భగవతీ సాక్షాదుమాదాదమ్బికా సతీ

యక్ష రాట్ (కుబేరుడు) ఉపనయన పత్రిక ఇచ్చాడు. అన్నర్పూర్ణ ఐన పార్వతి మొదటి భిక్ష వేసింది. 

స బ్రహ్మవర్చసేనైవం సభాం సమ్భావితో వటుః
బ్రహ్మర్షిగణసఞ్జుష్టామత్యరోచత మారిషః

ఇలా అప్పటికప్పుడు బ్రహ్మచారి తయారయ్యాడు. ఈయన బ్రహ్మ ఋషి గణాల తేజస్సు కంటే మించిన తేజస్సు కలవాడయ్యాడు

సమిద్ధమాహితం వహ్నిం కృత్వా పరిసమూహనమ్
పరిస్తీర్య సమభ్యర్చ్య సమిద్భిరజుహోద్ద్విజః

అగ్నిలో పరిసమూహన కార్యక్రమాన్ని జరిపి, పరిషేచనం చేసి దర్భలన్నీ చుట్టు పెట్టి, 1008 దర్భలతో హోమం చేసాడు,  సమిధలతో హోమం చేసాడు 

శ్రుత్వాశ్వమేధైర్యజమానమూర్జితం బలిం భృగూణాముపకల్పితైస్తతః
జగామ తత్రాఖిలసారసమ్భృతో భారేణ గాం సన్నమయన్పదే పదే

అదే సమయానికి బృగువులు తన యజమాని ఐన బలి చక్రవర్తి చేత యాగం చేయిస్తున్నాడు. అది తెలుసుకున్నాడు వామనుడు. యజ్ఞ్య దీక్షితుడైన రాజు భిక్ష అడిగితే కాదనడు. సకల జగత్తులనూ తనలో దాచుకుని నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక్కో అడుగుకూ భూమి వంగుతూ ఉంది. 

తం నర్మదాయాస్తట ఉత్తరే బలేర్య ఋత్విజస్తే భృగుకచ్ఛసంజ్ఞకే
ప్రవర్తయన్తో భృగవః క్రతూత్తమం వ్యచక్షతారాదుదితం యథా రవిమ్

నర్మదా నది యొక్క ఉత్తర తీరములో బలి చక్రవర్తి యజ్ఞ్యం చేస్తున్నాడు. భృగు కచ్ఛ అనే ప్రాంతములో అందరూ యజ్ఞ్యం చేయిస్తుండగా వస్తున్న వామనుడిని చూచి ఉదయించిన సూర్యుడు వస్తున్నాడేమో అని భావించారు

తే ఋత్విజో యజమానః సదస్యా హతత్విషో వామనతేజసా నృప
సూర్యః కిలాయాత్యుత వా విభావసుః సనత్కుమారోऽథ దిదృక్షయా క్రతోః

ఆయన తేజస్సు ముందర ఋత్విక్కులు తేజో విహీనులయ్యారు. సూర్యుడా అగ్నా సనత్కుమారుడా, ఎవరు ఆ వస్తోంది

ఇత్థం సశిష్యేషు భృగుష్వనేకధా వితర్క్యమాణో భగవాన్స వామనః
ఛత్రం సదణ్డం సజలం కమణ్డలుం వివేశ బిభ్రద్ధయమేధవాటమ్

అని శిష్యులతో కలిసి అందరూ ఆలోచిస్తూ ఉండగా చత్రం కమండలం దండం పట్టుకుని యజ్ఞ్య వాటికలోకి ప్రవేశించాడు 

మౌఞ్జ్యా మేఖలయా వీతముపవీతాజినోత్తరమ్
జటిలం వామనం విప్రం మాయామాణవకం హరిమ్

మౌంజి ఉపవీతం జింక చర్మం ధరించి, మాయా బ్రహ్మచారిగా (అమ్మవారిని అజినముతో దాచిపెట్టి) లోపలకు వచ్చాడు

ప్రవిష్టం వీక్ష్య భృగవః సశిష్యాస్తే సహాగ్నిభిః
ప్రత్యగృహ్ణన్సముత్థాయ సఙ్క్షిప్తాస్తస్య తేజసా

శిష్యులతో కలిసి భృగువులు లేచి వెళ్ళి స్వాగతం చెప్పారు. పరమాత్మ తేజస్సు ముందర అందరూ ముడుచుకుని పోయారు

యజమానః ప్రముదితో దర్శనీయం మనోరమమ్
రూపానురూపావయవం తస్మా ఆసనమాహరత్

సాక్షాత్తు యజమాని ఐన బలి చక్రవర్తి సంతోషించాడు. చూడదగిన వాడు. పొట్టిగా ఉన్న మనస్సును హరింపచేస్తున్నాడు. అతని దివ్యమైన రూపమునకు తగిన అవయవాలు కలిగినవాడు. ఆ బ్రహ్మచారికి బలి చక్రవర్తి ఆసనం తెచ్చి అర్పించాడు.

స్వాగతేనాభినన్ద్యాథ పాదౌ భగవతో బలిః
అవనిజ్యార్చయామాస ముక్తసఙ్గమనోరమమ్

అతనికి స్వాగతం చెప్పి, సంసారము యందు కోరిక విడిచిన వారి మనసులను రంజింపచేసే పరమాత్మ యొక్క పాదములను ప్రక్షాళన చేసి పూజించాడు. చేసి పూజించాడు

తత్పాదశౌచం జనకల్మషాపహం స ధర్మవిన్మూర్ధ్న్యదధాత్సుమఙ్గలమ్
యద్దేవదేవో గిరిశశ్చన్ద్రమౌలిర్దధార మూర్ధ్నా పరయా చ భక్త్యా

పరమ పవిత్రమైన పరమాత్మ పాద తీర్థములను, సకల జనాల పాపాన్ని పోగొట్టే ఆ జలాన్ని తన శిరస్సు యందు ధరించాడు. ఇది వరకూ ఈ పాదతీర్థాన్ని దేవ దేవుడని చంద్రమౌళి ఐన శంకరుడు పరమ భక్తితో తన శిరస్సును ధరించాడు. అలాంటి తీర్థన్ని బలి చక్రవర్తి ధరించాడు 

శ్రీబలిరువాచ
స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్కిం కరవామ తే
బ్రహ్మర్షీణాం తపః సాక్షాన్మన్యే త్వార్య వపుర్ధరమ్

బ్రాహ్మణోత్తమా నీకు నమస్కారం. మీకు ఏమి సేవ చేయాలి. బ్రహ్మఋషులందరూ రూపు దాల్చి వచ్చినట్లు ఉన్నారు

అద్య నః పితరస్తృప్తా అద్య నః పావితం కులమ్
అద్య స్విష్టః క్రతురయం యద్భవానాగతో గృహాన్

నీరాకతో మా పితృ దేవతలు తృప్తి పొందారు మాకులం పవిత్రమైంది ఈ యజ్ఞ్యం బాగా ఆచరించబడినట్లు ఐంది మీ రాకతో. 

అద్యాగ్నయో మే సుహుతా యథావిధి ద్విజాత్మజ త్వచ్చరణావనేజనైః
హతాంహసో వార్భిరియం చ భూరహో తథా పునీతా తనుభిః పదైస్తవ

నా అగ్నులు యథా విధముగా హోమము చేయబడ్డాయి నీ పాదజలముతో, దానితో పాపం పోయి ఆ పాదోదకముతో ఈ భూమి కూడా పావనమయ్యింది

యద్యద్వటో వాఞ్ఛసి తత్ప్రతీచ్ఛ మే త్వామర్థినం విప్రసుతానుతర్కయే
గాం కాఞ్చనం గుణవద్ధామ మృష్టం తథాన్నపేయముత వా విప్రకన్యామ్
గ్రామాన్సమృద్ధాంస్తురగాన్గజాన్వా రథాంస్తథార్హత్తమ సమ్ప్రతీచ్ఛ

నీకు ఏమేమి కావాలో అవి అన్నీ తీసుకో. నీవో ఏదో అర్థించి వచ్చి ఉంటావు. గోవులు బంగారం భవనాలు మంచి అన్నం పానీయం బ్రాహ్మణ కన్యలా ఎవరు కావాలి. గ్రామములూ అశ్వములూ గజములూ రథమూఉ ఏమి కావాలో అవి స్వీకరించడి. 

Popular Posts