Followers

Tuesday 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఏడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తే నాగరాజమామన్త్ర్య ఫలభాగేన వాసుకిమ్
పరివీయ గిరౌ తస్మిన్నేత్రమబ్ధిం ముదాన్వితాః

మందర పర్వతం వచ్చాక వాసుకుని కూడా అమృతం ఇస్తామని చెప్పి పిలిచారు. వాసుకుని పర్వతానికి కట్టి అమృతం రావడం కోసం చిలకడ మొదలు పెట్టారు

ఆరేభిరే సురా యత్తా అమృతార్థే కురూద్వహ
హరిః పురస్తాజ్జగృహే పూర్వం దేవాస్తతోऽభవన్

స్వామి వెళ్ళి వాసుకి తల వైపు పట్టుకున్నారు, దేవతలు కూడా అక్కడే పట్టుకున్నారు. 

తన్నైచ్ఛన్దైత్యపతయో మహాపురుషచేష్టితమ్
న గృహ్ణీమో వయం పుచ్ఛమహేరఙ్గమమఙ్గలమ్

అది చూసిన రాక్షసులు, "మేము కశ్యపుని పుత్రులము బ్రాహ్మణులము, మేము అమంగళమైన తోకను పట్టుకోము" 

స్వాధ్యాయశ్రుతసమ్పన్నాః ప్రఖ్యాతా జన్మకర్మభిః
ఇతి తూష్ణీం స్థితాన్దైత్యాన్విలోక్య పురుషోత్తమః
స్మయమానో విసృజ్యాగ్రం పుచ్ఛం జగ్రాహ సామరః

మేము స్వాధ్యాయం శాస్త్రం ఉత్తమ జన్మ ఉన్న వారం.  చిరునవ్వుతో అది చూసి స్వామి తోకను పట్టుకున్నాడు. ఈ ప్రకారముగా ఎవరు తోక పట్టుకోవాలో ఎవరు తల పట్టుకోవాలో నిర్ణయించబడినది. అప్పుడు సముద్రాన్ని చిలికారు

కృతస్థానవిభాగాస్త ఏవం కశ్యపనన్దనాః
మమన్థుః పరమం యత్తా అమృతార్థం పయోనిధిమ్

మథ్యమానేऽర్ణవే సోऽద్రిరనాధారో హ్యపోऽవిశత్
ధ్రియమాణోऽపి బలిభిర్గౌరవాత్పాణ్డునన్దన

కానీ పర్వతానికి ఆధారం లేదు. పర్వతం నీటిలో ప్రవేశిస్తోంది ఇంతటి బలవంతులు పట్టుకున్నా. 

తే సునిర్విణ్ణమనసః పరిమ్లానముఖశ్రియః
ఆసన్స్వపౌరుషే నష్టే దైవేనాతిబలీయసా

అందరి ముఖాలూ వాడిపోయాయి. బలీయమైన దైవం తమ పనిని అడ్డుకొంది అని తలచారు. 

విలోక్య విఘ్నేశవిధిం తదేశ్వరో దురన్తవీర్యోऽవితథాభిసన్ధిః
కృత్వా వపుః కచ్ఛపమద్భుతం మహత్ప్రవిశ్య తోయం గిరిముజ్జహార

విఘ్నేశుని పూజించకుండా పని మొదలుపెట్టారని పర్వతం మునిగిపోతోంది. అది చూసిన పరమాత్మ అనత బలం కలవాడు సత్య సంకలపం కలవాడు అత్యాశ్చర్యకరమైన కూర్మ అవతారాన్ని ధరించి నీటిలో ప్రవేశించాడు. అందుకే మనం ఏ కార్యం సఫలం కావాలన్నా కూర్మాన్ని ధ్యానించాలి. ఆయనే విశ్వక్సేనుడు.

తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యతా నిర్మథితుం సురాసురాః
దధార పృష్ఠేన స లక్షయోజన ప్రస్తారిణా ద్వీప ఇవాపరో మహాన్

ఇలా మందర పర్వతం పైకి లేచింది. దాన్ని చూచి అందరూ చిలకడానికి లేచారు. అంత పెద్ద పర్వతాన్ని స్వామి వీపుతో మోసాడు. ఆయన వీపు ఇంకో ద్వీపములా ఉంది. 

సురాసురేన్ద్రైర్భుజవీర్యవేపితం పరిభ్రమన్తం గిరిమఙ్గ పృష్ఠతః
బిభ్రత్తదావర్తనమాదికచ్ఛపో మేనేऽఙ్గకణ్డూయనమప్రమేయః

దేవతలూ రాక్షసులూ బలీయములైన భుజములతో బాగా తిప్పుతూ ఉంటే తన వీపు దురద పెడితే గీకినట్లు భావించాడు. ఆయన అప్రమేయుడు

తథాసురానావిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్
ఉద్దీపయన్దేవగణాంశ్చ విష్ణుర్దైవేన నాగేన్ద్రమబోధరూపః

అంత పెద్ద పర్వతాన్ని రాక్షసులు తమ శక్తితో తిప్పలేరు. అందుచే వారిలో వారి రూపముతోనే ప్రవేశించాడు. వారి బలాన్ని వారి పరాక్రమాన్ని వృద్ధి పొందింపచేసాడు. దేవతల బలాన్ని కూడా పెంచాడు దేవతారూపముతో. అజ్ఞ్యాన రూపముతో వాసుకి బలాన్ని పెంచాడు. పర్వతం కిందకి ఒరగకుండా ఆయన పైన బరువుగా కూర్చున్నాడు. వాసుకిలో, దేవతలలో, రాక్షసులలో, పరవతం మీద, పర్వతం కింద, పరవతములోను, సముద్రములో, విడిగా తాను - అష్ట మూర్తిగా అయ్యాడు స్వామి. అందుకే స్వామిని అష్ట మూర్తి అష్ట బాహువు, అందుకే అమ్మవారు కూడా అష్ట లక్ష్ములుగా వచ్చారు. 

ఉపర్యగేన్ద్రం గిరిరాడివాన్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహుః
తస్థౌ దివి బ్రహ్మభవేన్ద్రముఖ్యైరభిష్టువద్భిః సుమనోऽభివృష్టః

వేయి బాహువులతో స్వామి పరవతాన్ని పట్టుకుని మధిస్తూ, అందరిలో అన్నిటిలో స్వామి ఉండి పర్వతాన్ని చిలికాడు, ఆయన వేగాన్ని చూసి బ్రహ్మ రుద్రాదులు స్తోత్రం చేస్తున్నారు. అందరూ పూల వర్షం  కురిపించారు. 

ఉపర్యధశ్చాత్మని గోత్రనేత్రయోః పరేణ తే ప్రావిశతా సమేధితాః
మమన్థురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షోభితనక్రచక్రమ్

పైనా కిందా తనలో పర్వతములో పాములో దాని అవతలా లోపలా అంతా ప్రవేశించి, స్వామి ఇంత చేస్తే దేవతలూ రాక్షసులూ మదముతో పర్వతాన్ని చిలికారు.

అహీన్ద్రసాహస్రకఠోరదృఙ్ముఖ శ్వాసాగ్నిధూమాహతవర్చసోऽసురాః
పౌలోమకాలేయబలీల్వలాదయో దవాగ్నిదగ్ధాః సరలా ఇవాభవన్

పాము  యొక్క వేయి కఠోరమైన చూపులూ, ముఖములూ, నిశ్వాస, అగ్ని అన్ని వైపుల నుండీ విషం వస్తూ అసురుల బలం పోయింది. రాక్షసులందరూ చల్లబడి పోయారు.

దేవాంశ్చ తచ్ఛ్వాసశిఖాహతప్రభాన్ధూమ్రామ్బరస్రగ్వరకఞ్చుకాననాన్
సమభ్యవర్షన్భగవద్వశా ఘనా వవుః సముద్రోర్మ్యుపగూఢవాయవః

దేవతలకు వారు కట్టుకున్న బట్టలూ ఆభరణాలూ మాడిపోయాయి. వారు నల్లగా ఐపోయారు. స్వామి దేవతల వైపు ఒక మేఘాన్ని పంపించారు. అది చల్లని వాన కురిపించాడు. పై నుంచి సముద్ర తరంగాలతో చల్లని వాయువు దేవతల మీదకు వీచింది

మథ్యమానాత్తథా సిన్ధోర్దేవాసురవరూథపైః
యదా సుధా న జాయేత నిర్మమన్థాజితః స్వయమ్

ఇంత కష్టపడి ఇంత చిలికినా అమృతం రాలేదు. ఇంక స్వామి స్వయముగా చిలికాడు. 

మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోతవిద్యున్
మూర్ధ్ని భ్రాజద్విలులితకచః స్రగ్ధరో రక్తనేత్రః
జైత్రైర్దోర్భిర్జగదభయదైర్దన్దశూకం గృహీత్వా
మథ్నన్మథ్నా ప్రతిగిరిరివాశోభతాథో ధృతాద్రిః

మేఘశ్యాముడు పీతాంబరం ధరించి చెవులకు మకర కుండలాలు ప్రకాశిస్తూ ఉండగా, చిలుకుతున్నందు వలన శిఖ వీడి వెంట్రుకలు ముఖం మీద పడి, కళ్ళు కాస్త ఎర్రబడి, జగత్తుకి అభయమిచ్చే బాహువులతో పామును పట్టుకుని కవ్వముతో చిలుకుతూ ఇంకో మందరములా కనపడుతున్నాడు. కిందినుండి పర్వతాన్ని ధరించి, పర్వతం మీద తాను ఉండి, తాను చిలుకుతూ ఉన్నాడు

నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః
సమ్భ్రాన్తమీనోన్మకరాహికచ్ఛపాత్తిమిద్విపగ్రాహతిమిఙ్గిలాకులాత్

అలా చిలికేసరికి హాలాహలం పుట్టింది. సముద్రములో ఉండే తిమింగలాలూ మొదలైన్వన్నీ కొట్టుకుంటున్నాయి. 

తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధో విసర్పదుత్సర్పదసహ్యమప్రతి
భీతాః ప్రజా దుద్రువురఙ్గ సేశ్వరా అరక్ష్యమాణాః శరణం సదాశివమ్

ఉగ్ర వేగముతో వచ్చే విషాన్ని చూచి ప్రజలందరూ భయపడ్డారు. కాపాడమని అక్కడ ఉన్న శంకరున్ని శరణు వేడారు. 

విలోక్య తం దేవవరం త్రిలోక్యా భవాయ దేవ్యాభిమతం మునీనామ్
ఆసీనమద్రావపవర్గహేతోస్తపో జుషాణం స్తుతిభిః ప్రణేముః

మూడు లోకాలకొచ్చిన ఆ కంటకాన్ని చూచి స్తోత్రముతో స్వామికి నమస్కరించి 

శ్రీప్రజాపతయ ఊచుః
దేవదేవ మహాదేవ భూతాత్మన్భూతభావన
త్రాహి నః శరణాపన్నాంస్త్రైలోక్యదహనాద్విషాత్

మూడు లోకాలను కాల్చి వేసే విషం నుండి మమ్ము కాపాడు

త్వమేకః సర్వజగత ఈశ్వరో బన్ధమోక్షయోః
తం త్వామర్చన్తి కుశలాః ప్రపన్నార్తిహరం గురుమ్

మొత్తం జగత్తుకు నీవే బంధాన్నీ మోక్షాన్నీ ఇస్తావు. తెలిసినవారు నిన్ను ఆశ్రయించేవారి బాధలు పోగొట్టేవాడిగా నిన్ను ఆశ్రయిస్తారు

గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్విభో
ధత్సే యదా స్వదృగ్భూమన్బ్రహ్మవిష్ణుశివాభిధామ్

నీ గుణములతో యోగమాయతో సృష్టి స్థితి సంహారాలు చేస్తుంటావు, బ్రహ్మగా విష్ణువుగా శివునిగా ఉంటావు

త్వం బ్రహ్మ పరమం గుహ్యం సదసద్భావభావనమ్
నానాశక్తిభిరాభాతస్త్వమాత్మా జగదీశ్వరః

నీవే సకల శక్తులుగా భాసిస్తావు.

త్వం శబ్దయోనిర్జగదాదిరాత్మా ప్రాణేన్ద్రియద్రవ్యగుణః స్వభావః
కాలః క్రతుః సత్యమృతం చ ధర్మస్త్వయ్యక్షరం యత్త్రివృదామనన్తి

నీవే జగత్తునకు ఆదివి, శబ్ద స్వరూపుడవు, ఆత్మవు, ప్రాణములూ ఇంద్రియములూ ద్రవ్యములూ గుణములూ రూపములు, సత్యమూ ఋతమూ రూపము అక్షరమూ ఓంకారము

అగ్నిర్ముఖం తేऽఖిలదేవతాత్మా క్షితిం విదుర్లోకభవాఙ్ఘ్రిపఙ్కజమ్
కాలం గతిం తేऽఖిలదేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశమ్

నీ ముఖం అగ్ని పాదం భూమి గమనం కాలం చెవులు దిక్కులు నాలుక వరుణుడు నాభి ఆకాశం నిట్టూర్పు వాయువు చక్షువు సూర్యుడు చంద్రుడు మనసు శిరస్సు ఆకాశం ఎముకలే పర్వతాలు సముద్రమే కుక్షి రోమాలే ఔషదులు ఏడు చందస్సులు ఏడు ధాతువులు హృదయం ధర్మం 

నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్సూర్యశ్చ చక్షూంషి జలం స్మ రేతః
పరావరాత్మాశ్రయణం తవాత్మా సోమో మనో ద్యౌర్భగవన్శిరస్తే

కుక్షిః సముద్రా గిరయోऽస్థిసఙ్ఘా రోమాణి సర్వౌషధివీరుధస్తే
ఛన్దాంసి సాక్షాత్తవ సప్త ధాతవస్త్రయీమయాత్మన్హృదయం సర్వధర్మః

ముఖాని పఞ్చోపనిషదస్తవేశ యైస్త్రింశదష్టోత్తరమన్త్రవర్గః
యత్తచ్ఛివాఖ్యం పరమాత్మతత్త్వం దేవ స్వయంజ్యోతిరవస్థితిస్తే

అష్టోత్తరములూ, అన్ని ఉపనిషత్తులూ నీ ముఖములూ, దాన్నే శివాఖ్యమని పరమ మంగళమనీ చెబుతున్నారు. నీ నీడ అధర్మము తరంగములు నీ సంకల్పములూ మూడు గుణాలు నీ మూడు నేత్రాలు నీవు జ్ఞ్యాన స్వరూపానివి నీ సంకల్పం శాస్త్రం చందో మయుడవు పురాణ ఋషివి నీవు

ఛాయా త్వధర్మోర్మిషు యైర్విసర్గో నేత్రత్రయం సత్త్వరజస్తమాంసి
సాఙ్ఖ్యాత్మనః శాస్త్రకృతస్తవేక్షా ఛన్దోమయో దేవ ఋషిః పురాణః

న తే గిరిత్రాఖిలలోకపాల విరిఞ్చవైకుణ్ఠసురేన్ద్రగమ్యమ్
జ్యోతిః పరం యత్ర రజస్తమశ్చ సత్త్వం న యద్బ్రహ్మ నిరస్తభేదమ్

నీ పరాక్రమం బ్రహ్మకు గానీ, విష్ణువుకు గానీ ఇంద్రునకు కానీ తెలియదు. నీవి పరం జ్యోతివి. రజస్తమో గుణాలూ సత్వమూ నిన్ను ఆవరించవు. కామం నిన్ను ఆవరించవు, దక్ష యజ్ఞ్యం విధ్వంసం చేసావు నీవు.

కామాధ్వరత్రిపురకాలగరాద్యనేక
భూతద్రుహః క్షపయతః స్తుతయే న తత్తే
యస్త్వన్తకాల ఇదమాత్మకృతం స్వనేత్ర
వహ్నిస్ఫులిఙ్గశిఖయా భసితం న వేద

ప్రళయ కాలములో నీ నేత్రం నుండి వచ్చే అగ్ని కణముతో అంతా భస్మం చేసావు

యే త్వాత్మరామగురుభిర్హృది చిన్తితాఙ్ఘ్రి
ద్వన్ద్వం చరన్తముమయా తపసాభితప్తమ్
కత్థన్త ఉగ్రపరుషం నిరతం శ్మశానే
తే నూనమూతిమవిదంస్తవ హాతలజ్జాః

ఆత్మా రాములచే స్తోత్రం చేయబడుతూ ఉంటావు. పార్వతీ దేవితో కలిసి ఉండి ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటావు. ఉగ్ర పురుషుడివి. నిరంతరం శ్మశానములో ఉంటావు. నీ అసలు ప్రభావాన్ని మేము తెలుసుకోలేము. సిగ్గు విడిచి నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ ప్రభావాన్ని  మేము తెల్సుకోలేము. బ్రహ్మాదులే నిన్ను తెలుసుకోలేరు. ఆయన సృష్టిలో భాగం ఐన మేము ఎలా తెలుసుకోగలము. ఇంత కన్నా మేము చెప్పలేము. ఇలాంటి పని చేస్తావు అని చెప్ప వీలు లేని నీవు లోకం యొక్క రక్ష కోసం ఆవిర్భవిస్తూ ఉంటావు

తత్తస్య తే సదసతోః పరతః పరస్య
నాఞ్జః స్వరూపగమనే ప్రభవన్తి భూమ్నః
బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయం తు
తత్సర్గసర్గవిషయా అపి శక్తిమాత్రమ్

ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర
మృడనాయ హి లోకస్య వ్యక్తిస్తేऽవ్యక్తకర్మణః

శ్రీశుక ఉవాచ
తద్వీక్ష్య వ్యసనం తాసాం కృపయా భృశపీడితః
సర్వభూతసుహృద్దేవ ఇదమాహ సతీం ప్రియామ్

ఇలా స్తోత్రం చేస్తే శివుడు దయతో ఇలా అన్నాడు పార్వతితో

శ్రీశివ ఉవాచ
అహో బత భవాన్యేతత్ప్రజానాం పశ్య వైశసమ్
క్షీరోదమథనోద్భూతాత్కాలకూటాదుపస్థితమ్

చూసావా వీరికి ఎంత బాధ కలిగిందో వీరి ఆప్ద చూడు

ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయమభయం హి మే
ఏతావాన్హి ప్రభోరర్థో యద్దీనపరిపాలనమ్

వీరికి నేను అభయం ఇచ్చి తీరాలి. ప్రభువు యొక్క కర్తవ్యం దీనులను పరిపాలించుటే.

ప్రాణైః స్వైః ప్రాణినః పాన్తి సాధవః క్షణభఙ్గురైః
బద్ధవైరేషు భూతేషు మోహితేష్వాత్మమాయయా

క్షణబంగురమైన తన ప్రాణములతో ఇతరులను కాపాడాలి. అదే వేరే వారు మోహం పొంది వైరం పెంచుకుని ఇతరులను చంపి తాము బతకాలని కోరతారు. 

పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరిః
ప్రీతే హరౌ భగవతి ప్రీయేऽహం సచరాచరః
తస్మాదిదం గరం భుఞ్జే ప్రజానాం స్వస్తిరస్తు మే

బాధపొందుతున్న వారి మీద దయ చూపితే సర్వ భూఅత అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. పరమాత్మ సంతోషమే నాకూ సంతోషం. కాబట్టి నేను ఈ విషాన్ని తింటున్నాను. ప్రజలకూ నీకు శుభం కలుగుగాక. 

శ్రీశుక ఉవాచ
ఏవమామన్త్ర్య భగవాన్భవానీం విశ్వభావనః
తద్విషం జగ్ధుమారేభే ప్రభావజ్ఞాన్వమోదత

ఇలా మాట్లాడిన శివునికి, శివుని ప్రభావం బాగా తెలిసిన పార్వతీ అమ్మవారు ఆమోదం తెలిపింది.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!  


తతః కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషమ్
అభక్షయన్మహాదేవః కృపయా భూతభావనః

అంతటా వ్యాపిస్తున్న విషాన్ని శంకరుడు అరచేతిలో ఉంచుకుని దయతో దాన్ని తినేసాడు. 

తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః
యచ్చకార గలే నీలం తచ్చ సాధోర్విభూషణమ్

జలకల్మషమైన ఆ విషం మిగుట వలన స్వామి కంఠం నల్లగా మారిపోయింది. వేరేవారికి అది మచ్చగానీ, స్వామికి అది అలంకారమైంది,. 

తప్యన్తే లోకతాపేన సాధవః ప్రాయశో జనాః
పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః

లోకముల తాపముతో సజ్జనులు తాము తపిస్తారు. తపిస్తున్న లోకముల తాపములను తప్పించుట భగవంతుడైన శ్రీమన్నారాయణుని పరమారాధనం. 

నిశమ్య కర్మ తచ్ఛమ్భోర్దేవదేవస్య మీఢుషః
ప్రజా దాక్షాయణీ బ్రహ్మా వైకుణ్ఠశ్చ శశంసిరే

ఈ విషయం చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వారు పరమ శివున్ని ప్రశంసించారు. 

ప్రస్కన్నం పిబతః పాణేర్యత్కిఞ్చిజ్జగృహుః స్మ తత్
వృశ్చికాహివిషౌషధ్యో దన్దశూకాశ్చ యేऽపరే

అరచేతిలో విషాన్ని పెట్టుకుని నోటిలో వేసుకుంటూ ఉన్నప్పుడు అది కొద్దిగా జారింది. అలా పడ్డదాన్ని కొన్ని క్రిమి కీటకాలు తిన్నాయి. అవే తేళ్ళూ పాములూ మొదలైన జీవాలు.

Popular Posts