Followers

Thursday 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదమూడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
నిమిరిక్ష్వాకుతనయో వసిష్ఠమవృతర్త్విజమ్
ఆరభ్య సత్రం సోऽప్యాహ శక్రేణ ప్రాగ్వృతోऽస్మి భో

ఇక నిమి వంశం. ఈ నిమి కూడా ఇక్ష్వాకు తనయుడే. ఇతను యజ్ఞ్యం చేయదలచి వశిష్ఠ మహర్షిని ఋత్విక్కుగా ఉండమని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు "ఇపుడే ఇంద్రుడు వచ్చి పిలిచాడు. అతని  యజ్ఞ్యం పూర్తి కాగానే నీ దగ్గరకు వస్తాను" అని అన్నాడు. నిమి ఏమీ మాట్లాడలేదు.

తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ
తూష్ణీమాసీద్గృహపతిః సోऽపీన్ద్రస్యాకరోన్మఖమ్

నిమిత్తశ్చలమిదం విద్వాన్సత్రమారభతామాత్మవాన్
ఋత్విగ్భిరపరైస్తావన్నాగమద్యావతా గురుః

నశ్వరమైన ఈ శరీరం అప్పటిదాకా ఉంటుందా. మంచి బుద్ధి కలిగినపుడు వాయిదా వేస్తే అప్పటిదాకా మనం ఉండకపోవచ్చు అని వేరే ఋత్విక్కును ఏర్పాటు చేసుకున్నాడు. 

శిష్యవ్యతిక్రమం వీక్ష్య తం నిర్వర్త్యాగతో గురుః
అశపత్పతతాద్దేహో నిమేః పణ్డితమానినః

యజ్ఞ్యం మొదలుపెట్టాక మహర్షి వచ్చాడు. తొందరపడి వేరేవారిని చూసుకున్నావు నేను వస్తున్నానని చెప్పినా, అని, నీ శరీరం పడిపోవుగాకా అని శపించాడు

నిమిః ప్రతిదదౌ శాపం గురవేऽధర్మవర్తినే
తవాపి పతతాద్దేహో లోభాద్ధర్మమజానతః

నిమి కూడా గురువుని ద్రవ్య కాంక్షతో అధర్మముగా ప్రవర్తించాడని నీ శరీరం పడిపోవుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. 

ఇత్యుత్ససర్జ స్వం దేహం నిమిరధ్యాత్మకోవిదః
మిత్రావరుణయోర్జజ్ఞే ఉర్వశ్యాం ప్రపితామహః

ఇలా ఇద్దరూ పడిపోయారు. అప్పుడు వశిష్ఠ మహర్షి తరువాత ఒక యజ్ఞ్యములో మిత్రావరుణులు  ఊర్వశిని చూచి రేతస్సును ఒక ఘటములో స్ఖలనం చేస్తే అందులో పుట్టాడు

గన్ధవస్తుషు తద్దేహం నిధాయ మునిసత్తమాః
సమాప్తే సత్రయాగే చ దేవానూచుః సమాగతాన్

నిమి శరీరాన్ని తైల్ద్రోణిలో ఋషులందరూ పెట్టి యజ్ఞ్యం పూర్తి ఐనాక వచ్చిన దేవతలతో "ఇతను యజమాని. యజమాని లేని యజ్ఞ్యం ఉండదు  కాన ఇతన్ని బతికించండి" అని అడుగుతారు. 

రాజ్ఞో జీవతు దేహోऽయం ప్రసన్నాః ప్రభవో యది
తథేత్యుక్తే నిమిః ప్రాహ మా భూన్మే దేహబన్ధనమ్

యస్య యోగం న వాఞ్ఛన్తి వియోగభయకాతరాః
భజన్తి చరణామ్భోజం మునయో హరిమేధసః

నిమి మాత్రం దేహం తీసుకోవడానికి ఒప్పుకోలేదు. శరీరం వచ్చింది అంటే పోతుంది అని అర్థం. ఎపుడు పోతుందో అని భయపెట్టే ఆ శరీరం నాకెందుకు. అందుకే జ్ఞ్యానులు పరమాత్మ పాదపద్మాలను సేవిస్తారు గానీ శరీరాన్ని సేవించరు

దేహం నావరురుత్సేऽహం దుఃఖశోకభయావహమ్
సర్వత్రాస్య యతో మృత్యుర్మత్స్యానాముదకే యథా

కాబట్టి నాకీ శరీరం వద్దు. ఈ శరీరం దుఃఖాన్నీ శోకాన్నీ భయాన్నీ కలిగిస్తుంది. ఈ శరీరానికి ప్రతీ చోటి నుండీ ఆపదే. చేపలకు నీటిలో ఎలా ప్రాణ భయం ఉందో అలాగే ప్రతీ క్షణం మృత్యువుతో భయపెట్టే ఈ శరీరముతో నాకు ప్రయోజనం లేదు. 

దేవా ఊచుః
విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణామ్
ఉన్మేషణనిమేషాభ్యాం లక్షితోऽధ్యాత్మసంస్థితః

ఒక సారి దేవతలు మాట ఇచ్చాక వెనక్కు తీసుకోరు కాబట్టి దేవతలు శరీరం లేకుండానే బతుకు అని అన్నారు. అందరి కనులలో రెప్పపాటుగా ఉండూ అని అన్నారు. నిమి నుండి వికసింపచేయబడేది - నిమేషం. 

అరాజకభయం న్ణాం మన్యమానా మహర్షయః
దేహం మమన్థుః స్మ నిమేః కుమారః సమజాయత

నిమికి సంతానములేకపోవడముతో నిమి శరీరాన్ని మధించారు. అలా మధిస్తే ఒక కుమారుడు కలిగాడు. మధించడం వలన కలిగాడు కాబట్టి మిధిల అయ్యాడు. దేహ సంబంధం వద్దు అన్నవాడితో పుట్టాడు కాబట్టి విదేహుడు. పుట్టడానికి ఆస్కారం లేకున్నా అసాధారణముగా జనకత్వం లేని శరీరముతో పుట్టాడు కాబట్టి జనక వంశస్థుడయ్యాడు 

జన్మనా జనకః సోऽభూద్వైదేహస్తు విదేహజః
మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా

తస్మాదుదావసుస్తస్య పుత్రోऽభూన్నన్దివర్ధనః
తతః సుకేతుస్తస్యాపి దేవరాతో మహీపతే

ఇతని కుమారుడు ఉదావసు, అతని కుమారుడు నందివర్ధనుడు. అతని కుమారుడు సుకేతుడు. అతనికి దేవరాతుడు, 

తస్మాద్బృహద్రథస్తస్య మహావీర్యః సుధృత్పితా
సుధృతేర్ధృష్టకేతుర్వై హర్యశ్వోऽథ మరుస్తతః

మరోః ప్రతీపకస్తస్మాజ్జాతః కృతరథో యతః
దేవమీఢస్తస్య పుత్రో విశ్రుతోऽథ మహాధృతిః

కృతిరాతస్తతస్తస్మాన్మహారోమా చ తత్సుతః
స్వర్ణరోమా సుతస్తస్య హ్రస్వరోమా వ్యజాయత

తతః శీరధ్వజో జజ్ఞే యజ్ఞార్థం కర్షతో మహీమ్
సీతా శీరాగ్రతో జాతా తస్మాత్శీరధ్వజః స్మృతః

అలా శీరధ్వజుని వరకూ ఉంది ఆ వంశం. ఈ శీరధ్వజునికే యజ్ఞ్యం చేస్తుండగా లక్ష్మీ అమ్మవారు దొరికింది. అందుకే ఇతనికి ఈ పేరు వచ్చింది. ఎవరి గుర్తు శీరమో, సంతానాన్ని నాగలితో పొందినవాడు కాబట్టి శీరధ్వజః అనే పేరు వచ్చింది

కుశధ్వజస్తస్య పుత్రస్తతో ధర్మధ్వజో నృపః
ధర్మధ్వజస్య ద్వౌ పుత్రౌ కృతధ్వజమితధ్వజౌ

ఇతనికి కుశధ్వజుడు, అతనికి ధర్మధ్వజుడు, అతనికి ఇద్దరు, కృతధ్వజ, మిత్రధ్వజులని కుమారులు

కృతధ్వజాత్కేశిధ్వజః ఖాణ్డిక్యస్తు మితధ్వజాత్
కృతధ్వజసుతో రాజన్నాత్మవిద్యావిశారదః

కృతధవ్జుని కుమారుడు కేశిధ్వజుడు ఆత్మవిద్య (తత్వజ్ఞ్యానం) కలవాడు మిత్రధ్వజుని కుమారుడు ఖాణ్డికుడు లౌకిక విద్యలో బాగా ఆరితేరినవాడు. కేశిత్ధ్వజుడు రాజ్యం వద్దు అని వెళ్ళిపోవడముతో మిత్రధ్వజుడు రాజ్యం పరిపాలించాడు. ఎంత బాగా ధర్మముగా పరిపాలించినా వర్షం కురవలేదు. అప్పుడు అతనికి చెప్పారు నీ అన్నకు రావలసిన రాజ్యం నీవు పాలిస్తున్నావు అందువలననే వర్షం పడుటలేదని. వారి రాజ్యం ఇమ్మని చెప్పగా కేశిధ్వజునికి రాజ్యం అప్పగించాడు. దానికి మిత్ర ధ్వజుడు అంగీకరించాడు. కానీ అది మంత్రులకు నచ్చలేదు. అపుడు వారు ఒక సౌందర్య రాశి ఐన అమ్మాయిని ఆ రజుకు కనపడేలా చేయగా అతను మోహించాడు. సన్యాసి ఆడువారిని చూచి మోహం చెందరాదు. అందుచే అతను ధర్మభ్రష్టుడయ్యాడు. ధర్మ భ్రష్టునికి రాజ్యాధికారం లేదు. దానితో మిత్రధ్వజుడు రాచరికం నుండి తప్పుకోకమునుపే వర్షం పడింది. కానీ అమ్మాయి మోహములో పడిన కేశిధ్వజుడు రాజ్యం తనకు కావాలన్నాడు. ఈ సందర్భములో ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో కేశిధ్వజుడు గెలిచాడు. కానీ సన్యాసికి రాజ్యాధికారం లేదు. మంత్రులకే రాజ్యభారం ఇచ్చి ఇద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడు తమ్ముడు అనుకున్నాడు "మా అన్నగారికి ఇంత ఆధ్యాత్మిక జ్ఞ్యానం ఉండి కూడా అంత బలం పరాక్రమం ఉన్నాయి, ఎక్కడిదీ పరాక్రమమని అన్నను గురువుగా స్వీకరించి అడిగాడు." అప్పుడు అన్న ఐన కేశిధ్వజుడు "అలాగే చెబుతాను గానీ, ఇపుడు నాకు ఆధ్యాత్మిక జ్ఞ్యానం బోధించే అధికారం పోయింది. ఇంచుమించు సన్యాసిగా ఉన్న నేను స్త్రీ వ్యామోహములో పడ్డాను. స్త్రీ వ్యామోహములో పడ్డవానికి ఆ ఆధ్యాత్మిక జ్ఞ్యానం బోధించే అర్హత లేదు. నీకు ఉత్తమ గురువును చూస్తాను. నీవు అక్కడికి వెళ్ళి నేర్చుకో" అన్నాడు. ఇంతగా వ్యక్తివాన్ని కాపాడుకుంటూ ఉన్న వాస్తవాన్ని తమ్ముడితో చెప్పి స్వయముగా తప్పును ఒప్పుకున్నావు కాబట్టి అసలు జరిగిన విషయం వినమని చెబుతాడు. ఆ స్త్రీ వ్యామోహం తన అన్నగారి స్వబుద్ధి కాదు, ఆయన పడాలని పక్కవారు పడేస్తే ఆ తప్పు అతనిది కాదు. అప్పుడు అన్నగారికి ఆధ్యాత్మ విద్య బోధించే యోగ్యత వచ్చి, మొత్తం ఆధ్యాత్మ జ్ఞ్యానం బోధించాడు. దీని వలన ఇద్దరూ రాజ్యం తీసుకోకుండా తమ కుమారులకు రాజ్యమిచ్చారు. ఇది పాద్మములో రామాయణములో విష్ణు పురాణములో ఉంది. రాజ ధర్మం వీర ధర్మం ఆత్మ ధర్మం ఈ మూడూ ఉన్న కథ ఇది. 

ఖాణ్డిక్యః కర్మతత్త్వజ్ఞో భీతః కేశిధ్వజాద్ద్రుతః
భానుమాంస్తస్య పుత్రోऽభూచ్ఛతద్యుమ్నస్తు తత్సుతః

యుద్ధములో కేశిధ్వజుని వలన భయపడ్డాడు ఖాణ్డిక్యుని కుమారుడు. 

శుచిస్తు తనయస్తస్మాత్సనద్వాజః సుతోऽభవత్
ఊర్జకేతుః సనద్వాజాదజోऽథ పురుజిత్సుతః

అరిష్టనేమిస్తస్యాపి శ్రుతాయుస్తత్సుపార్శ్వకః
తతశ్చిత్రరథో యస్య క్షేమాధిర్మిథిలాధిపః

తస్మాత్సమరథస్తస్య సుతః సత్యరథస్తతః
ఆసీదుపగురుస్తస్మాదుపగుప్తోऽగ్నిసమ్భవః

ఆ పరంపరలో వచ్చిన కుమారులు వీరు. 

వస్వనన్తోऽథ తత్పుత్రో యుయుధో యత్సుభాషణః
శ్రుతస్తతో జయస్తస్మాద్విజయోऽస్మాదృతః సుతః

శునకస్తత్సుతో జజ్ఞే వీతహవ్యో ధృతిస్తతః
బహులాశ్వో ధృతేస్తస్య కృతిరస్య మహావశీ

ఏతే వై మైథిలా రాజన్నాత్మవిద్యావిశారదాః
యోగేశ్వరప్రసాదేన ద్వన్ద్వైర్ముక్తా గృహేష్వపి

వీరంతా మిథిలా నగరపు రాజులు. వీరంతా రాజులే గానీ అందరూ ఆత్మ విద్యా విశారధులే. పరిపాలించినా లోలుపతా, ధన కాంక్ష లేదు. పరమేశ్వరానుగ్రహముతో వీరు సుఖ దుఃఖాది ద్వంద్వాలను గృహస్థాశ్రమములో ఉండి కూడా విముక్తులయ్యారు. 

Popular Posts