Followers

Saturday 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదవ అధ్యాయం

                     
                                                                     ఓం నమో భగవతే వాసుదేవాయ
 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
కథ్యతాం భగవన్నేతత్తయోః శాపస్య కారణమ్
యత్తద్విగర్హితం కర్మ యేన వా దేవర్షేస్తమః

కుబేరుని కొడుకులైన వారిని నారదుడెందుకు శపించాడు. నారద మహర్షి అంతటి మహానుభావునికి కోపం తెప్పించేంత పని వారేమి చేసారు. ఆ కారణం మాకు చెప్పవలసింది.

శ్రీశుక ఉవాచ
రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ
కైలాసోపవనే రమ్యే మన్దాకిన్యాం మదోత్కటౌ

వీరిద్దరూ కైలాస పర్వత ప్రాంతములో మొత్తం పరమాత్మ యొక్క భక్తులు లోకపాలకులూ వారి అనుచరులూ వారి కుటుంబాలతో వచ్చి హరి నామ సంకీర్తనం చేద్దామని సంకల్పించారు. దానికి అందరూ వచ్చారు. పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేస్తున్నారు. వీరు కూడా వచ్చారు దానికి. తమ భార్యలతో కలిసి వచ్చారు. అక్కడ ఎన్నో ఉపవనాలూ సరస్సులూ ఉద్యాన వనాలూ ఉన్నాయి. అది చూసి, "మనం చేయకపోతే ఎవరు గుర్తుపడతారులే" అనుకుని భార్యలను తీసుకుని తోటలలో సరసులో విహరిస్తూ పక్కన ఉన్న గంగా తీరములో విహరిస్తూ ఉన్నారు.

వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ
స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతుః పుష్పితే వనే

పరమాత్మ సంకల్పముతో అక్కడికి నారదుడు వచ్చాడు.

అన్తః ప్రవిశ్య గఙ్గాయామమ్భోజవనరాజిని
చిక్రీడతుర్యువతిభిర్గజావివ కరేణుభిః

యదృచ్ఛయా చ దేవర్షిర్భగవాంస్తత్ర కౌరవ
అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత

బాగా మద్యపానం చేసి ఉన్నారు, పక్కన స్త్రీలు ఉన్నారు, మంచి యవ్వనములో ఉన్నారు, మంచి ధనవంతులు, (సంపదా అధికారం అవివేకం యవ్వనం - మనని పాడుచేసే నాలుగూ ఉన్నాయి) దీని వలన వచ్చిన నారదుల వారిని చూడలేదు. మద్యపానం చేసారు శరీరాన్ని మనసును మత్తెక్కించే వాతావరణం ఉంది అక్కడే. పరమార్థాన్ని మరిపించగల వాతావరణములో మదించి ఉన్న వీరిని నారదుడు చూచారు

తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాః శాపశఙ్కితాః
వాసాంసి పర్యధుః శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ

అలా వచ్చిన నారదున్ని వారికంటే వారి భార్యలు ముందు చూచారు. చూచి నారదుడు శపిస్తాడేమో అని భయపడి బయటకు వచ్చి వస్త్రాలు కట్టుకున్నారు.

తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాన్ధౌ సురాత్మజౌ
తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ

కానీ వారిద్దరికీ ఆ ధ్యాస కూడా లేదు. వారు మదిరా మత్తులు. ఇంకో మత్తు స్త్రీ. ధన, ఆభిజాత్య (ఉత్తమ వంశం) స్త్రీ మదం ఉన్నాయి వారికి. వారిని అనుగ్రహించదలచి శపించాడు. వారికి వినవచ్చేలా ఇలా అన్నాడు

శ్రీనారద ఉవాచ
న హ్యన్యో జుషతో జోష్యాన్బుద్ధిభ్రంశో రజోగుణః
శ్రీమదాదాభిజాత్యాదిర్యత్ర స్త్రీ ద్యూతమాసవః

సంపద మత్తు ఇంకొక మూడు మత్తులను అందిస్తుంది. మొదటి మత్తు స్త్రీ. రెండవది జూదం, రెండవది మద్యం (ఆసవః). స్త్రీ ఆభిజాత్య మదముతో ఈ మూడు మదాలు వస్తాయి. ఇవి వస్తే మనం ఎక్కడున్నామో తెలియని స్థితిలో ఉంటాము. ఇలాంటి వాటిని సేవించడం వలన బుద్ధి భ్రంశం అవుతుంది. బుద్ధిని భ్రష్టు పట్టించే ఈ మూడు మదాలను ధన ఆభిజాత్య మదాలు కలిగిస్తాయి

హన్యన్తే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః
మన్యమానైరిమం దేహమజరామృత్యు నశ్వరమ్

ఐశ్వర్యం ఉత్తమ వంశం, స్త్రీ జూదం మద్యం అలవాట్లని చేస్తాయి. దీనికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమి కావాలి. తన శరీరానికి ఉత్తమ లోకాలు కావాలని అలాంటి శరీరం ఉన్న ఇంకో ప్రాణిని హింసిస్తున్నారు. ఇంత కన్నా వేరే నిదర్శనం ఏమి కావాలి.

దేవసంజ్ఞితమప్యన్తే కృమివిడ్భస్మసంజ్ఞితమ్
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

మేము దేవతలం మేము సిద్ధులం మేము యక్షులం అని వారి శరీరానికి ఉన్న పేర్లను చూచి చెప్పుకుంటారు. క్రిముగా మలముగా బూడిదగా మారే శరీరాన్ని చూచి ఈ పేర్లు చెప్పుకుంటారు. అలాంటి శరీరం కోసం తోటిప్రాణులకు ద్రోహం చేస్తున్నారు. వారు తెలిసే చేస్తున్నారా. తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఇతరుల శరీరాన్ని హింసించేవారికి నరకమే వస్తుంది. ఇది తెలిసిన విషయమే ఐనా ఈ మదములో వారు ఈ విషయం మరచిపోతారు

దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ
మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోऽపి వా

అసలు ఇన్ని పనులు చేస్తున్న ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం నీదే ఐతే నీ శరీరానికి ఇంకెవరో అన్నం పెట్టి ఎందుకు పోషించాలి. శరీరం నీదా నీకు అన్నం పెట్టినవారిదా? అన్నం నీకు పెట్టాలంటే అంతకు ముందే నీకు శరీరం ఉండాలి. అది నీకెవరిచ్చారు? తండ్రి. ఆ తండ్రి కేవలం నిశేషిత. కానీ నిన్ను కన్నది తల్లి. ఆ తల్లిని కన్నది ఒక తండ్రి. మరి నీ కన్నా ముందు ఒకడు పుడతాడు. అంటే నీ శరీరం వాడిద? నిన్ను ఎవరో డబ్బులిచ్చి కొనుక్కుంటారు. అపుడు ఎవరిది ఆ శరీరం. ఆ కొన్న వాడిని తన్ని ఇంకొకడు నిన్ను లాక్కుపోతాడు. ఇపుడు ఆ శరీరం ఎవరిది. ఒక వేళ పోతే ఆ శరీఎరాన్ని కాల్చి వేస్తాయి. అంటే ఆ శరీరం ఎవరిది? అగ్నిదా? మరి దహనం చేయలేకపోతే దాన్ని కుక్కలకు పడేస్తారు. అంటే నీ శరీరం కుక్కలదా?

ఏవం సాధారణం దేహమవ్యక్తప్రభవాప్యయమ్
కో విద్వానాత్మసాత్కృత్వా హన్తి జన్తూనృతేऽసతః

ఈ శరీరం సాధారణం (అందరిది). నీ శరీరం ఏ  ఒక్కడిదీ కాదు. శరీరం నీదే ఐతే ఇంకొకరిని ఎందుకు పోషిస్తావు? నీవు ఇంకొకరి కోసం ఉద్యోగం చేస్తావు. నీ కోసం కానిది నీ శరీరం. అది ఎపుడు పుడుతుందో ఎపుడు నశిస్తుందో తెలియదు. తెలిసినవాడైనా తన కోసం అంటూ తోటివారిని హింసిస్తారా

అసతః శ్రీమదాన్ధస్య దారిద్ర్యం పరమఞ్జనమ్
ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే

ఈ గుడ్డితనం శ్రీమదముతో వచ్చింది. శ్రీ మదముతో గుడ్డివారైన మీకు కంటికి దారిద్ర్యం అనే కాటుక పెట్టాలి. దరిద్రుడు మాత్రమే తన లాగే కదా తక్కిన వారు కూడా బాధపడతారూ అని ఆలోచిస్తారు. నాలాగే అందరూ బాగుండాలి అని శ్రీమంతుడు కోరుకోడు. దరిద్రుడు మాత్రమే తనను తాను చూసుకుని తనలాగే ఇతరులు కూడా కష్టాలతో బాధపడతారు అని గ్రహిస్తాడు.

యథా కణ్టకవిద్ధాఙ్గో జన్తోర్నేచ్ఛతి తాం వ్యథామ్
జీవసామ్యం గతో లిఙ్గైర్న తథావిద్ధకణ్టకః

కాలికి ముల్లు గుచ్చుకున్నవాడు మాత్రమే ఆ ముల్లును తీసి ఈ బాధ ఇంకొకరికి కలగకూడదు అని ఆ ముల్లును తీసి పడేస్తాడు. చెప్పులు వేసుకున్నవాడికి అది తెలియదు. ముల్లు గుచ్చుకోని వాడు ముల్లు గుచ్చుకున్నవాడి బాధ తెలియదు. కడుపు నిండా తిన్నవాడికి ఆకలి బాధ తెలుస్తుందా? దరిద్రుడే పది మంది గురించి ఆలోచించగలడు

దరిద్రో నిరహంస్తమ్భో ముక్తః సర్వమదైరిహ
కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరం తపః

శరీరం మీద కూడా స్పృహ లేని శరీరం వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. వస్త్రం లేదన్న జ్ఞ్యానం కూడా లేదన్న భావముతో ఉన్నారు మీరు. అందుకే ఆ జ్ఞ్యానం లేని చెట్లుగా పుట్టండి. దరిద్రుడు మాత్రమే అన్ని మదాల నుండి తొలగి భగవత్ సంకల్పం వలన చాలా బాధలూ కష్టాలు పడతాడు. అలా చాలా బాధలు పడడమే అతను చేసే తపస్సు

నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాఙ్క్షిణః
ఇన్ద్రియాణ్యనుశుష్యన్తి హింసాపి వినివర్తతే

తినడానికి అన్నం కూడా లేక కృశించిన శరీరం కలిగి ఎక్కడైనా అన్నం దొరికితే బాగుండు అనుకుంటాడు. ఇంద్రియాలకు ఆహారం ఇస్తుంటే ఇంకా కావాలి అని కోరతాయి. అదే ఇంద్రియాలకు ఆహారంలేకపోతే ఆహారం ఇమ్మని కూడా అడగలేక ఎండిపోతాయి. అప్పుడు దరిద్రుడు హింస నుండి బయటకు వస్తాడు.

దరిద్రస్యైవ యుజ్యన్తే సాధవః సమదర్శినః
సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాద్విశుద్ధ్యతి

ఉత్తములు సజ్జనులు దరిద్రులతోనే కల్వాలని కోరుకుటారు. అలాంటి సజ్జనుల సాంగత్యముతో దరిద్రులు అన్ని పాపాలూ పోగొట్టుకుంటారు. ఐశ్వర్యం వలన వచ్చే పాపం దారిద్ర్యం కలిగించే మేలూ చెబుతున్నాడు.

సాధూనాం సమచిత్తానాం ముకున్దచరణైషిణామ్
ఉపేక్ష్యైః కిం ధనస్తమ్భైరసద్భిరసదాశ్రయైః

సమచిత్తులూ అందరి యందూ పరమాత్మనే చూడగలిగే వారు. పరమాత్మయొక్క పాద సేవను కోరే వారు. అలాంటి వారికి డబ్బుతో గర్వించి ఎవరినీ లెక్కచేయని దుర్మార్గులని ఆశ్రయించ పని ఏముంది. ధనమదముతో ఉన్నవారికి వారి గురించీ ఎదుటివారి గురించీ తెలియదు.

తదహం మత్తయోర్మాధ్వ్యా వారుణ్యా శ్రీమదాన్ధయోః
తమోమదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మనోః

మదిరా పానం చేసి మదించి, స్త్రీ దాసులై శ్రీ మదముతో ఇంద్రియాలను గెలవలేని, ఉన్న వీరి అజ్ఞ్యాన మదాన్ని తొలగిస్తాను.

యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ
న వివాససమాత్మానం విజానీతః సుదుర్మదౌ

వీర్య్ కుబేరుని కొడుకులు. అంత పెద్దవారి పుత్రులై కూడా అజ్ఞ్యానముతో మత్తుతో ఉండిపోయారు. మదముతో తమ ఒంటి మీద వస్త్రం కూడా లేదన్న విషయాన్ని వీరు తెలియలేకపోతున్నారు. కాబట్టి వీరు వృక్షాలుగానే పుడతారు మళ్ళీ వీరు ఇలాంటి తప్పు చేయకుండా

అతోऽర్హతః స్థావరతాం స్యాతాం నైవం యథా పునః
స్మృతిః స్యాన్మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్

చెట్లుగా ఉన్నా నా అనుగ్రహముతో వీరికి పూర్వ జన్మ స్మృతి కూడా ఉంటుంది. పెద్దలు ఏది మాట్లాడినా ఏమి చేసినా ఫలితం ఉత్తమం. దీని వలన వీరిద్దరికీ ఎలాంటి తప్పు చేసారో నిరంతరం జ్ఞ్యాపకం ఉంటుంది. అది పరిపాకం చెందినపుడు స్వామి వస్తాడు  మనను రక్షించడానికి

వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్ఛతే
వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధభక్తీ భవిష్యతః

నూరు దివ్య వర్షములైన తరువాత పరమాత్మ సాన్నిధ్యాన్ని పొంది,పరమాత్మ యందు భక్తి కలవారి తమ తమ లోకాలకు వెళతారు.

శ్రీశుక ఉవాచ
ఏవముక్త్వా స దేవర్షిర్గతో నారాయణాశ్రమమ్
నలకూవరమణిగ్రీవావాసతుర్యమలార్జునౌ

ఇలా నారదుడు చెప్పి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు నారదుడు. ఇలా వీరిద్దరూ మద్ది చెట్లుగా (యమాల - మూలం ఒకటే ఉంటుంది రెండు జంట చెట్లుగా ఉంటాయి)

ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః
జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ

పరమ భాగవతోత్తముడైన నారదుని మాట నిజం చేయడానికి ఎక్కడ ఈ జంట చెట్లు ఉన్నాయో అక్కడకు వెళ్ళాడు

దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ
తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా

నారదుడు నాకు ఇష్టుడు. ఆ మహానుభావునితో గానం చేయబడిన దాన్ని నిజం చేస్తాను.

ఇత్యన్తరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయౌ
ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలమ్

కృష్ణుడు ఈ రెంటి చెట్ల మధ్యలోంచి రోలుతో వెళ్ళగా ఆ నిలువుగా ఉన్న రోలు కాస్తా అడ్డముగా అయ్యింది.

బాలేన నిష్కర్షయతాన్వగులూఖలం తద్
దామోదరేణ తరసోత్కలితాఙ్ఘ్రిబన్ధౌ
నిష్పేతతుః పరమవిక్రమితాతివేప
స్కన్ధప్రవాలవిటపౌ కృతచణ్డశబ్దౌ

కట్టుబడి ఉన్న ఆ బాలుడు తాకడముతో వ్రేళ్ళతో సహా ఆ చెట్లు లేచి వచ్చాయి (తాను బంధములో ఉండి బంధములో ఉన్న వారి బంధాన్ని విడిపించాడు)
అవి కాస్తా కింద పడ్డాయి. మహాబలవంతునితో బాగా ఊపబడ్డాయి, కొమ్మలూ మూలమూ ఆకులూ ఊపబడి భయంకరమైన ధ్వని చేస్తూ అవి పడిపోయాయి.

తత్ర శ్రియా పరమయా కకుభః స్ఫురన్తౌ
సిద్ధావుపేత్య కుజయోరివ జాతవేదాః
కృష్ణం ప్రణమ్య శిరసాఖిలలోకనాథం
బద్ధాఞ్జలీ విరజసావిదమూచతుః స్మ

వారు అందులోంచే పుట్టారా అన్నట్లు గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ పరమాత్మను శిరసా నమస్కారం చేస్తూ, పాపం అంతా పోగొట్టుకుని రజస్సంతా తొలగిపోయి,

కృష్ణ కృష్ణ మహాయోగింస్త్వమాద్యః పురుషః పరః
వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః

నీవే ఆదిపురుషుడవు నీవే పరమ పురుషుడవు. వ్యక్త అవ్య్క్త రూపమైన ఈ జగత్తు నీ శరీరమే అని బ్రాహ్మణులు తెలుసుకుంటారు

త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేన్ద్రియేశ్వరః
త్వమేవ కాలో భగవాన్విష్ణురవ్యయ ఈశ్వరః

అఖిల ప్రాణులకు దేహమూ ప్రాణమూ ఆత్మ ఇంద్రియములూ నీవే. వాటికి అధిపతీ నీవే
నీవే కాలము భగవంతుడవు సర్వ వ్యాపకుడవు మాయ లేనివాడవు , నీవే ప్రకృతివీ మహదాదులూ నీవే జీవుడవూ నీవే పర్రమాత్మవూ నీవే అన్ని శరీరాలలో ఉండి మార్పులు తెలుసుకునేదీ నీవే

త్వం మహాన్ప్రకృతిః సూక్ష్మా రజఃసత్త్వతమోమయీ
త్వమేవ పురుషోऽధ్యక్షః సర్వక్షేత్రవికారవిత్

గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః
కో న్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః

గ్రహించడానికి ఏదేది సృష్టించావో వాటి చేత నీవు గ్రహించబడవు. నీ స్వరూప స్వభావాన్నీ ప్రభావాన్ని నీవు సృష్టించిన ఇంద్రియాలతో గ్రహించ వీలు లేదు.
నీవు మా బుద్ధికి అందవు
ప్రకృతి గుణాలచే ఆవరించబడిన ఏ జీవుడు నిన్ను తెలుసుకుంటాడు.

తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే
ఆత్మద్యోతగుణైశ్ఛన్న మహిమ్నే బ్రహ్మణే నమః

అలాంటి భగవంతుడు వాసుదేవుడూ జ్ఞ్యానీ ఆత్మ యొక్క ప్రకాశమును అందరికీ తెలియజేసే కాంతితో నీ శరీరాన్ని కప్పి పుచ్చుకున్నావు. నీ కాంతి అందరికీ జగత్తును తెలియజేస్తుంది. సూర్యుని కాంతితోనే ప్రపంచం అంతా చూస్తాము కానీ ఆయన ఇచ్చిన కాంతితో ఆయనను చూడలేము. నీవు మాకు అందుబాటులో దొరకవు.

యస్యావతారా జ్ఞాయన్తే శరీరేష్వశరీరిణః
తైస్తైరతుల్యాతిశయైర్వీర్యైర్దేహిష్వసఙ్గతైః

ఏ శరీరము లేనీ నీవు అవతారాల పేరుతో ఆయా శరీరాలలో ప్రవేశించి అందరిచేతా తెలియబడతావు
ఏ పోలికకూ నీవు సరిపోవు. సాటిలేదు అన్నవాటిని కూడా నీవు మించినవాడు. ఏ శరీరములోనూ ఇమడడానికి వీలు లేని పరాక్రమముతో సకల లోకముల పుట్టకకూ పెరగడానికీ నీవు కారణం.

స భవాన్సర్వలోకస్య భవాయ విభవాయ చ
అవతీర్ణోऽంశభాగేన సామ్ప్రతం పతిరాశిషామ్

నీ కలలతో నీవు అవతరిస్తున్నావు. ఇపుడు అవతరించావు.అన్ని కోరికలకూ నీవు మూల స్థంభమూ. నీవే కళ్యానము మంగళమూ శుభం. ఆత్మకు కలిగేదాన్ని కళ్యాణమూ అంటారు. మనసుకు కలిగే దాన్ని మంగళం అంటారు. శరీరానికి కలిగేదాన్ని శుభం అంటారు.

నమః పరమకల్యాణ నమః పరమమఙ్గల
వాసుదేవాయ శాన్తాయ యదూనాం పతయే నమః

వసుదేవాత్మజుడవు యాదవ పతివి ఐన నీకు నమస్కారం. మాకు మీరు ఆజ్ఞ్య ప్రసాదించండి. నారద మహర్షి అనుగ్రహముతో మీ దర్శనం లభించినది

అనుజానీహి నౌ భూమంస్తవానుచరకిఙ్కరౌ
దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్

వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం
హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః
స్మృత్యాం శిరస్తవ నివాసజగత్ప్రణామే
దృష్టిః సతాం దర్శనేऽస్తు భవత్తనూనామ్

మాకు మీరు ఈ ఒక్క వరం ఇవ్వండి చాలు.
మా వాక్కు మీ గుణాలను చెప్పడములో  మా చెఉవ్లు నీ గుణములను వినడములో చేతులు నిన్ను ఆరాధించడములో మా మనసు నీ పాదముల స్మరణ యందు,
శిరసు నీవు ఉండే చోట్లను తాకి నమస్కరించడానికి చూపు (కనులు) సజ్జనులను చూడడములో
మా ఇంద్రియాలకు ఈ వరం ఇవ్వు. భగవంతుడు ఈ అవయవాలను ఏ పని కోసం ఇచ్చాడు ఆ పని కోసం వినియోగించమని అడిగారు

శ్రీశుక ఉవాచ
ఇత్థం సఙ్కీర్తితస్తాభ్యాం భగవాన్గోకులేశ్వరః
దామ్నా చోలూఖలే బద్ధః ప్రహసన్నాహ గుహ్యకౌ

ఇలా కీర్తించబడిన రోలుకు తాడుతో కట్టబడి ఉన్న పరమాత్మ నవ్వుతూ ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
జ్ఞాతం మమ పురైవైతదృషిణా కరుణాత్మనా
యచ్ఛ్రీమదాన్ధయోర్వాగ్భిర్విభ్రంశోऽనుగ్రహః కృతః

నాకు మొదలే తెలుసు. ఋషి మీ వద్దకు వచ్చాడంటే మీ శ్రీ మదం తొలగించడానికి. ఋషి మీ మీద చూపింది నిగ్రహం కాదు అనుగ్రహమే.

సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనామ్
దర్శనాన్నో భవేద్బన్ధః పుంసోऽక్ష్ణోః సవితుర్యథా

సూర్యున్ని చూచిన కనులకు చీకటి కనపడంట్లుగా మహానుభావుల దర్శనం లభిస్తే ఇక వారికి బంధం ఉండదు. సకల చరా చర జగత్తులో పరమాత్మ ఒకే రీతిగా ఉన్నాడని తెలుసుకుని నిరంతరం నాయందే మనసు ఉంచి ఉన్న వారి దర్శనం వలన బంధనం కలగదు.

తద్గచ్ఛతం మత్పరమౌ నలకూవర సాదనమ్
సఞ్జాతో మయి భావో వామీప్సితః పరమోऽభవః

నలకూబరులారా, మీరు మీ ఇళ్ళకు వెళ్ళండి. నా యందు మనసు ఉంచి వెళ్ళండి. నిజముగా మీ మనసులో నా మీద భక్తి కలిగితే అది మోక్షమే (అభవః). వైకుంఠములోకి వెళితేనే మోక్షం కాదు. సంసారములో ఉండే మోక్షం సంపాదించవచ్చు. నా మీద భక్తి కలగడమే మోక్షం. అలాంటి వారు సంసారములో ఉండి అన్ని పనులూ చేస్తూ కూడా మోక్షాన్ని పొందుతారు.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తౌ తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః
బద్ధోలూఖలమామన్త్ర్య జగ్మతుర్దిశముత్తరామ్

ఈ రీతిలో వారు కట్టుబడి ఉన్న స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూ స్వామి ఆజ్ఞ్య పొంది వారి లోకానికి వెళ్ళారు. బంధం పొందిన నలకూబర మణిగ్రీవులు బద్ధుడిగా ఉన్న స్వామిని చూచి బంధం తొలగించుకున్నారు.



                                                                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts