Followers

Thursday 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం



శ్రీశుక ఉవాచ
స ఇత్థమాచరన్కామాన్స్త్రైణోऽపహ్నవమాత్మనః
బుద్ధ్వా ప్రియాయై నిర్విణ్ణో గాథామేతామగాయత

యయాతి స్త్రీలోలుడై ఇలా అనుభవించి ఒక వెయ్యి సంవత్సరాలు దాటిన తరువాత అతనికి విషయం అంటే ఏమిటో తెలిసింది. అది  ఎటువంటి వారినైనా వ్యామోహములో పడేస్తుందని తెలుసుకుని నిర్వేదం పొందాడు. ఇన్ని సంవత్సరాలు వ్యామోహములో ఉన్న నేను అనుభవించిన కొత్త అనుభూతి ఏమైనా ఉందా అని ప్రియురాలితో తమ గాధనే మార్చి చమత్కారముగా చెబుతున్నాడు

శృణు భార్గవ్యమూం గాథాం మద్విధాచరితాం భువి
ధీరా యస్యానుశోచన్తి వనే గ్రామనివాసినః

నాలాంటి వాడు ఆచరించిన ఈ కథను విను. గ్రామాలలో ఉండే వారి ప్రవృత్తిని జితేంద్రియులు విని జాలిపడతారు.

బస్త ఏకో వనే కశ్చిద్విచిన్వన్ప్రియమాత్మనః
దదర్శ కూపే పతితాం స్వకర్మవశగామజామ్

ఒక మేక అరణ్యములో తిరుగ్తూ, దప్పి ఐ నీరు తాగుదామని ఒక బావి వద్దకు వెళితే అందులో ఒక ఆడ మేక పడి ఉన్నది. తనను బయటకు తీయమని ప్రార్థిస్తే మేక తన కొమ్ముతో ఒడ్డంతా తవ్వి పైకి తీసింది. బయటక్ తీసినందు ఆ మగ మేకనే వరించింది

తస్యా ఉద్ధరణోపాయం బస్తః కామీ విచిన్తయన్
వ్యధత్త తీర్థముద్ధృత్య విషాణాగ్రేణ రోధసీ

సోత్తీర్య కూపాత్సుశ్రోణీ తమేవ చకమే కిల
తయా వృతం సముద్వీక్ష్య బహ్వ్యోऽజాః కాన్తకామినీః

పీవానం శ్మశ్రులం ప్రేష్ఠం మీఢ్వాంసం యాభకోవిదమ్
స ఏకోऽజవృషస్తాసాం బహ్వీనాం రతివర్ధనః
రేమే కామగ్రహగ్రస్త ఆత్మానం నావబుధ్యత

ఆ మగ మేక కూడా ఆడ మేకను కాదనలేదు.అప్పుడు మిగతా మేకలు కూడా ఆ విషయం తెలుసుకుని అతనినే అనుసరించాయి

తమేవ ప్రేష్ఠతమయా రమమాణమజాన్యయా
విలోక్య కూపసంవిగ్నా నామృష్యద్బస్తకర్మ తత్

కామినీ పిశాచం పట్టినట్లుగా ఆ మగమేక ఆడమేకతో విహరించాయి. ఇంతకంటే మంచి మేక దొరకదా అన్నట్లూ పరస్పరం విహరించాయి. పేరుకు మిత్రులులా ఉన్నా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. తనకెక్కడ దూరం అవుతాడో అని ఆడ మేక తన మీద కోపించి వెళ్ళింది. తన మీద కోపించి వెళ్ళిన ఆడ మేకను దారిలోకి తేవడానికి మగ మేక వెళ్ళింది.

తం దుర్హృదం సుహృద్రూపం కామినం క్షణసౌహృదమ్
ఇన్ద్రియారామముత్సృజ్య స్వామినం దుఃఖితా యయౌ

సోऽపి చానుగతః స్త్రైణః కృపణస్తాం ప్రసాదితుమ్
కుర్వన్నిడవిడాకారం నాశక్నోత్పథి సన్ధితుమ్

తస్య తత్ర ద్విజః కశ్చిదజాస్వామ్యచ్ఛినద్రుషా
లమ్బన్తం వృషణం భూయః సన్దధేऽర్థాయ యోగవిత్

అప్పుడు ఆడ మేకను పెంచుకునే వాడు ఆ మగ మేకను పట్టుకుని ఆ మగమేక వృషణములను చేధించింది

సమ్బద్ధవృషణః సోऽపి హ్యజయా కూపలబ్ధయా
కాలం బహుతిథం భద్రే కామైర్నాద్యాపి తుష్యతి

అప్పుడు మేకపోతులు ప్రార్థిస్తే చేధించిన వాటిని మళ్ళీ అతికించాడు. ఎంత కాలం గడిచినా ఆ మేకపోతు నేటికీ తృప్తి పొందలేదు

తథాహం కృపణః సుభ్రు భవత్యాః ప్రేమయన్త్రితః
ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా

అలాగే నేను కూడా నీ ప్రేమతో నియంత్రించబడి దీనుడనై నీ మాయతో మోహించబడి నేనేమిటో నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇన్ని వేల సంవత్సరాలు గడవడం బట్టి ఈ జీవితం గురించి నాకు ఒక విషయం అర్థం అయ్యింది.

యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః
న దుహ్యన్తి మనఃప్రీతిం పుంసః కామహతస్య తే

కోరికలు నిండి ఉన్న జీవునికి ఈ భూమండలములో ఉన్న ధాన్యం గోధుమలూ పశువులూ స్త్రీలూ ఈ మొత్తాన్ని అనుభవించినా మనసుకు తృప్తి కలుగదు. భూమండలములో అనుహ్బవించదగినవిగా పేర్కొనబడినవన్నీ అనుభవించినా అతనికి తృప్తి ఉండదు

న జాతు కామః కామానాముపభోగేన శాంయతి
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే

కోరికలను అనుభవించడముతో ఏ కోరికా చల్లారదు, తీరదు. ధనమూ ఆహారమూ మొదలైనవి ఎంత అనుభవించినా తీరవు. నెయ్యితో అగ్నిహోత్రములాగ అవి ఎన్నటికీ చల్లారదు. మండుతున్న మంటలో నెయ్యి పోస్తే చల్లారకపోగా ఇంకా పెరుగుతుంది. కోరికలకు అనుభవం ఎప్పుడూ తృప్తినిచ్చేది కాదు

యదా న కురుతే భావం సర్వభూతేష్వమఙ్గలమ్
సమదృష్టేస్తదా పుంసః సర్వాః సుఖమయా దిశః

ప్రపంచములో ఉన్నవాటిని అనుభవించాలి అన్న కోరిక ఉన్నవాడికి ఎంత అనుభవించినా తృప్తి కలుగదు. విరక్తి మాత్రమే మందు. ఏ కోరికా తీర్చుకోకుంటే పురుషునికి తృప్తి ఎలాగ. సంతోషం కలగడానికి అనుభవించుట కాదు కావలసినది. సర్వలోక హితమునూ ప్రియమునూ ఎవరు కోరతారో అతనికి అన్ని వైపులా సంతోషమే ఉంటుంది. వాడికి అసంతృప్తి ఉండదు. కోరికలను అనుభవించడం వలన సకల లోకములూ చెడిపోవాలీ నేనొక్కడినే బాగుండాలి అనుకుంటారు. సకల లోక విరోధం పెంచుకుని మనశ్శాంతి కరువు చేసుకుంటారు. చాలా కోరికలు ఉన్నవారు పక్కవారికి పంచిపెట్టాలి అని అనుకోడు.
అందరిలో ఉన్న పరమాత్మను చూడగలిగిన వాడికి అన్ని వైపులూ అన్ని దిక్కులూ ఆనందాన్నే కలిగిస్తాయి.

యా దుస్త్యజా దుర్మతిభిర్జీర్యతో యా న జీర్యతే
తాం తృష్ణాం దుఃఖనివహాం శర్మకామో ద్రుతం త్యజేత్

దుష్టబుద్ధి కలవారు దేన్ని విడిచిపెట్టలేరో, తాను మొత్తం జీర్ణం అవుతాడు (తాను ముసలి వాడవుతాడు) గానీ ఆశ మాత్రం జీర్ణం కాదు. 
అన్ని దుఃఖములకూ మూలమైన ఆశను నిజముగా శుభమునూ మంగళమునూ కోరేవారైతే వెంటనే విడిచిపెట్టాలి. నీకు నిజముగా హితము కలగాలి అనుకుంటే నీవు చేయవలసిన మొదటి పని, ఆశను మొదట విడిచిపెట్టడం. ఎంతటి జ్ఞ్యాని ఐనా ఎన్ని వేదాంత శాస్త్రాలు చెప్పగలిగినా విన్నా చదివినా విడిచిపెట్టలేనిది ఆశ. 

మాత్రా స్వస్రా దుహిత్రా వా నావివిక్తాసనో భవేత్
బలవానిన్ద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి

కోరిక అనేది ఎంత భయంకరమైనదంటే కన్న తల్లితో గానీ తొబొట్టువైన చెల్లితో గానీ కన్న కూతురుతో కానీ ఒకే ఆసనం మీద ఒంటిగా కూర్చోకూడదు. 
నీవు ఎంత గొప్పవాడవో నీకంటే వేయిరెట్లు బలీయం నీ మనసూ ఇంద్రియములు. పండితున్నైనా సరే ఇంద్రియములు ఆకర్షించి వశం చేసుకుంటాయి. అవసరానికి మించి ఏకాంతములో వారితో కూడా ఉండరాదు.  ఎలాంటి స్త్రీతో ఐనా సరే అలా ఒంటిగా కూర్చోకూడదు. 

పూర్ణం వర్షసహస్రం మే విషయాన్సేవతోऽసకృత్
తథాపి చానుసవనం తృష్ణా తేషూపజాయతే

వేయి సంవత్సరాలు ఏ ఒక్క రోజు విరామం లేకుండా అనుభవించినా, భోగించినా, నాకు విషయముల మీద తృప్తీ విరక్తీ కలగలేదు. నేనే దృష్టాంతం దీనికి. (యయాతి ఎంత ధర్మాత్ముడంటే దేవతలూ ఋషులకూ అష్టావక్రునికీ ధర్మాన్ని బోధిస్తాడు యయాతి, ఇది మహాభారతములో అరవై ఆరు అధ్యాయాలు ఉంటుంది. యయాతి యజ్ఞ్యములో పశు హింస తప్పు అని చెప్పాడు. అలా చెప్పడముతో దేవతలు స్వర్గము నుండి "పత" అన్నారు. దానితో స్వర్గము నుండి ఆయన కింద పడ్డాడు. ఐనా తాను అన్న మాటకే కట్టుబడి ఉన్నాడు. అలా ఉండటముతో "నీకు తోడుగా ఉంటామని" ఋషులు కూడా వచ్చారు. అప్పుడే అష్టావక్రుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. అటువంటి ధార్మికునికి చేత కానప్పుడు సామాన్యమైన మానవులకు ఎలా తృప్తి కలుగుతుంది.)
ఇలా ప్రతి దినం సేవిస్తూ ఉన్నా నాకు దాని మీద ఇంకా ఆశ కలుగుతూ ఉన్నది. 

తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యధ్యాయ మానసమ్
నిర్ద్వన్ద్వో నిరహఙ్కారశ్చరిష్యామి మృగైః సహ

అనుసరిస్తున్న కొద్దీ అనుభవిస్తున్న కొద్దీ ఇంకా  నిరంతరం పెరుగుతూనే ఉన్నది. దీనికి ఒకటే మందు. విడిచిపెట్టుట. ఆశను విడిచిపెట్టి పరమాత్మ యందు మనసు ఉంచి ఎలాండి ద్వంద్వములూ (సుఖ దుఃఖ లాభ నష్టాలు) వదిలి అహంకారం వదిలివేసి అరణ్యములో మృగములతో కలిసి తిరుగుతాను. 

దృష్టం శ్రుతమసద్బుద్ధ్వా నానుధ్యాయేన్న సన్దిశేత్
సంసృతిం చాత్మనాశం చ తత్ర విద్వాన్స ఆత్మదృక్

ఇహ లోక సుఖాన్నీ (దృష్టం) పర లోక సుఖాన్ని (శ్రుతం, స్వర్గాన్ని అభిలషించి చేసే పనులు ) ధ్యానించరాదు. బుద్ధిమంతుడు విన్నదానిని గానీ చూసిన దానిని గానీ ధ్యానించకూడదు. దాన్నే మాటి మాటికీ తలచకూడదు. అలాంటి కర్మలో ప్రవర్తించకూడదు. విన్నదానిలోనూ చూసిన దానిలోనూ ప్రవర్తించవద్దు. చిన్న శ్లోకమైనా దీన్ని అనుసరిస్తే మనం బాగుపడతాము. మనం అనుభవించే వాటికన్నా తోటివాడు అనుభవించేవాటిని చూచే మనం బాధపడతాము. పక్కవారికున్నవాటి గురించే మనం ధ్యానం చేసి పొందుతున్న సుఖాన్ని దుఃఖముగా మార్చుకుంటాము. 
చూసిన దాన్ని ధ్యానం చేస్తే సంసారం. విన్న దాన్ని ధ్యానం చేస్తే ఆత్మనాశం. చూసిన దాన్ని తలచుకోవడం వలన సంసారం గట్టిపడుతుంది. విన్నదాన్ని గురించి ఆలోచిస్తే ఆత్మపతనం, అంటే ఇంకో జన్మ వస్తుంది. దృష్టం వలన సంసారం శ్రుతం వలన ఆత్మ నాశం. వివేకి ఐన వాడు ఈ రెంటిలో ప్రవేశించకూడదు. ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో, అలాంటివాడు ఆత్మ జ్ఞ్యానం కలవాడు అవుతాడు. 

ఇత్యుక్త్వా నాహుషో జాయాం తదీయం పూరవే వయః
దత్త్వా స్వజరసం తస్మాదాదదే విగతస్పృహః 

ఈ విధముగా యయాతి మహారాజు దేవయానితో చెప్పి తాను తీసుకున్న యవ్వానన్ని పూరువుకు ఇచ్చివేసి తన వార్ధక్యాన్ని తాను ఆశను విడిచిపెట్టినవాడై స్వీకరించాడు. 

దిశి దక్షిణపూర్వస్యాం ద్రుహ్యుం దక్షిణతో యదుమ్
ప్రతీచ్యాం తుర్వసుం చక్ర ఉదీచ్యామనుమీశ్వరమ్

ఆగ్నేయ దిక్కుకు ద్రుహ్యున్ని, దక్షిణ దిక్కుకు యదువును పశ్చిమ దిక్కుకు తుర్వసునూ ఉత్తర దిక్కుకు అను అనేవారిని రాజుగా చేసి, సకల భూమండలానికీ పురువునూ రాజుగా చేసి

భూమణ్డలస్య సర్వస్య పూరుమర్హత్తమం విశామ్
అభిషిచ్యాగ్రజాంస్తస్య వశే స్థాప్య వనం యయౌ

అన్నదమ్ములందరిలో సఖ్యతను కూర్చి ఈయన అరణ్యాన్ని చేరాడు

ఆసేవితం వర్షపూగాన్షడ్వర్గం విషయేషు సః
క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః

కొన్ని వేల సంవత్సరముల నుంచీ అనుభవించిన అన్ని కామోపభోగములనూ ఈయన క్షణ కాలములో విడిచిపెట్టాడు, ఎలాగంటే రెక్కలు వచ్చిన పక్షి గూటిని విడిచిపెట్టినట్లుగా

స తత్ర నిర్ముక్తసమస్తసఙ్గ ఆత్మానుభూత్యా విధుతత్రిలిఙ్గః
పరేऽమలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః

ఈయన సమస్తములన్నిటిలో కోరికను విడిచిపెట్టి ఆత్మానుభూతితో సత్వరజస్తమోగుణాలని విడిచిపెట్టి పరిశుద్ధుడూ పరబ్రహ్మ వాసుదేవుడైన పరమాత్మ యందు మనసు పెట్టి పరమ భక్తుడు పొందే గతిని పొందాడు

శ్రుత్వా గాథాం దేవయానీ మేనే ప్రస్తోభమాత్మనః
స్త్రీపుంసోః స్నేహవైక్లవ్యాత్పరిహాసమివేరితమ్

దేవయాని కూడా భర్త చెప్పిన కథను విని, తనను అవహేళన చేయడానికి ఆ కథ చెప్పినట్లూ, స్త్రీ పురుషుల యొక్క పరస్పర స్నేహమూ అనురాగమునూ పరిహాసపూర్వకముగా వివరించాడని తెలుసుకుంది

సా సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్ఛతామ్
విజ్ఞాయేశ్వరతన్త్రాణాం మాయావిరచితం ప్రభోః

ఆమెకూడా అతను చెప్పినదాన్ని అర్థం చేసుకుంది. పరమాత్మకు పరతంత్రులైన జీవులు చలివేంద్రము వద్ద మంచినీరు తాగడానికి తాత్కాలికముగా కలిసిన వారి వంటి వారం అనీ, మనం క్రితం జన్మలో చేసుకున్న కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మనం పుట్టామనీ, చలివేంద్రములో కలిసి విడిచిపోయినట్లే సంసారములో జీవులు తమ తమ కర్మ ఫలితములు అనుభవించడానికి పుడతారు. ఇదంతా పరమాత్మ యొక్క మాయా విరచితం. ఈ విషయం తెలుసుకుని

సర్వత్ర సఙ్గముత్సృజ్య స్వప్నౌపమ్యేన భార్గవీ
కృష్ణే మనః సమావేశ్య వ్యధునోల్లిఙ్గమాత్మనః

ఈ జగత్తూ సంసారమూ మోహమూ స్వప్నము లాంటిదని సంగము విడిచిపెట్టి పరమాత్మయందు మనసు ఉంచి తన శరీరాన్ని విడిచిపెట్టింది

నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే
సర్వభూతాధివాసాయ శాన్తాయ బృహతే నమః

బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడైనా, సకల భూతములకూ ఆధారమైన సత్వ రజసతమోగుణాలు లేనీ, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకు నమస్కారం

Popular Posts