Followers

Wednesday 5 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం మూడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
నాభిరపత్యకామోऽప్రజయా మేరుదేవ్యా భగవన్తం యజ్ఞపురుషమవహితాత్మాయజత

వారందరిలో నాభి పెద్దవాడు. సంతానాన్ని కోరి సావధానమ మనసుతో భార్యతో కలిసి పరమాత్మను ఆరాధించాడు.

తస్య హ వావ శ్రద్ధయా విశుద్ధభావేన యజతః ప్రవర్గ్యేషు ప్రచరత్సు ద్రవ్యదేశకాల
మన్త్రర్త్విగ్దక్షిణావిధానయోగోపపత్త్యా దురధిగమోऽపి భగవాన్భాగవతవాత్సల్యతయా సుప్రతీక
ఆత్మానమపరాజితం నిజజనాభిప్రేతార్థవిధిత్సయా గృహీతహృదయో హృదయఙ్గమం మనో
నయనానన్దనావయవాభిరామమావిశ్చకార

పరిశుద్దమైన మనసు శ్రద్ధా ఏకాగ్రతతో భగవానున్ని ఆరాధించాడు. యజ్ఞ్యానికి ఎనిమిది అంగాలుంటాయి. ఒక క్రమపద్దతిలో సమూహాత్మకముగా ఏర్పరచేవి. యజ్ఞ్యానికి ద్రవ్యమూ (పాలూ, పురోడాశం హవిస్సు పెరుగు) ద్రవ్యమూ ప్రదేశమూ కాలమూ (మంచి ముహూత్రమూ) మంత్రాల్లూ ఋత్విక్కులూ దక్షిణా విధానమూ యోగమూ కావాలి. ఇవన్నీ సక్రమముగా చేకూరాలి ఇవన్నీ సావధానమనసుతో చేకూర్చాడు. అందు వలన భాగవతుల యందు వాత్సల్యం కలిగినందున ఎవ్వరికీ చిక్కని వాడైన శ్రీమన్నారాయణుడు కోరికను తీర్చడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన హృదయమునకు నిరంతరం స్మరించదగినవాడు. మనసుకీ నేత్రాలకు ఆనందం కలిగించేవాడు తన దివ్య మంగళ రూపాన్ని ప్రత్యక్షం చేసాడు. నాలుగు భుజములున్న తన రూపాన్ని చూపించాడు. భుజయుగళద్వయం (ఇది గద్యం కాబట్టి ఆరు లఘువులు )

అథ హ తమావిష్కృతభుజయుగలద్వయం హిరణ్మయం పురుషవిశేషం కపిశకౌశేయామ్బర
ధరమురసి విలసచ్ఛ్రీవత్సలలామం దరవరవనరుహవనమాలాచ్ఛూర్యమృతమణి
గదాదిభిరుపలక్షితం స్ఫుటకిరణప్రవరముకుటకుణ్డలకటకకటిసూత్రహారకేయూరనూపురాద్యఙ్గ
భూషణవిభూషితమృత్విక్సదస్యగృహపతయోऽధనా ఇవోత్తమధనముపలభ్య సబహు
మానమర్హణేనావనతశీర్షాణ ఉపతస్థుః

పీతాంబరధారి అయిన స్వామి, వక్షములో శ్రీవత్సం కలిగి ఉన్న స్వామీ, శంఖమూ పద్మమూ వనమాలా గదా ఖడ్గముతో ప్రకాశించే స్వామి, అన్ని రకాల ఆభరణాలతో, ముకుటముతో కుండలములూ కటకములూ కటి సూత్రములూ హారములూ నూపురములూ కేయూరములు గలిగిన స్వామిని ఋత్విక్కులూ సదస్యులూ యజమానులు ధనములేని వాడికి ధనమున్నవాడు కనపడితే ఎలా లేస్తారో అలా లేచారు. ఆర్తితో లేచి గౌరవముతో పూజతో తల వంచి నమస్కరించి సేవించారు

ఋత్విజ ఊచుః
అర్హసి ముహురర్హత్తమార్హణమస్మాకమనుపథానాం నమో నమ ఇత్యేతావత్సదుపశిక్షితం కో
ऽర్హతి పుమాన్ప్రకృతిగుణవ్యతికరమతిరనీశ ఈశ్వరస్య పరస్య ప్రకృతిపురుషయోరర్వాక్తనాభిర్నామ
రూపాకృతిభీ రూపనిరూపణమ్సకలజననికాయవృజిననిరసనశివతమప్రవరగుణగణైకదేశ కథనాదృతే

నీవు మాలాంటి వాడికి కనపడటానికి యోగ్యుడవు (మాకు యోగ్యత ఉన్నట్లే) యోగ్యుడైన వాడికి పూజించ యోగ్యత మాకు ఉన్నట్లు తెలిసింది, నీకు నమస్సులు.
ఇంత కంటే ఎక్కువ (నమస్కారం కంటే ఎక్కువ) నీతో మాట్లాడటానికి మాకు ఏమి శక్తి ఉంది. ప్రకృతి పురుషులకంటే నీవు విలక్షణుడవు. ప్రకృతి పురుషులకు కనపడే ఆకారాన్ని తీసుకుని వచ్చావు. (మనకొక విషయం తెలిసిందంటే పురుషుని వలన తెలియాలి ప్రకృతి వలన తెలియాలి, ఈయన్ రెంటికీ అతీతుడు. అయినా మనకు కనపడడానికి మనం చూడగలిగే ఆకారముతో వచ్చాడు)
ప్రకృతి పురుషులేర్పడిన తరువాత మనకెలాంటి స్వరూప స్వభావాలర్థమవుతాయో అలాంటి స్వరూపాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన ఎవరికీ సాధారణముగా కనపడడు. సకల జనుల పాపములను పోగొట్టగలిగినవాడు (సకలజననికాయవృజిననిరసన). సుఖాలని ప్రసాదిస్తాడు. ఈయనకన్నీ మంగళ గుణాలే. అలాంటి పరమాత్మతో మనం మాట్లాడాలంటే ఏమి మాట్లాడగలము? నమో నమః అనగలమంతే, లేదా నీకున్న అనంత కోటి గుణాలలో ఒకటో అరో గుణాన్ని చెప్పగల ప్రయత్నం చేయగలం

పరిజనానురాగవిరచితశబలసంశబ్దసలిలసితకిసలయతులసికాదూర్వాఙ్కురైరపి సమ్భృతయా
సపర్యయా కిల పరమ పరితుష్యసి

పరమాత్మా, నీవింత గొప్పవాడవు. నిన్ను స్తోత్రం చేయలేము. కనీసం నిన్ను ఆరాధించాలన్నా ఆరాధించగలమా? ఒకటో రెండో తులసీ దళాలు వేయగలం. నీవింత పెద్దవాడవైన భక్తుల అనురాగముతో పలకబడిన జయ జయ ధ్వానాల చేత తులసితో ఆరాధన అందుకుంటావు. (గంగా గాయత్రీ గీతా గోవు తులసీ నామ సహస్రకం, సూర్యుడూ కాలము, పరమాత్మను పూజించ వీలు లేని వారు వీటితో అర్చించవచ్చు). తులసి దొరకకుంటే ఏదో ఒక చిగురుటాకులతో నిన్ను ఆరాధించవచ్చు. అదీ దొరకకపోతే గడ్డితో కూడా (దూర్వాఙ్కురైరపి) ఆరాధన స్వీకరిస్తావు. ఆర్తితో దేనితో పూజ చేసినా నీవు స్వీకరిస్తావు. నీకు తగినంత ద్రవ్యాలతో నిన్ను పూజించలేమన్న భయము మాకు లేదు. నీవు దేనితో పూజించినా సంతోషిస్తావు.

అథానయాపి న భవత ఇజ్యయోరుభారభరయా సముచితమర్థమిహోపలభామహే

మేము ఎంత గొప్ప లేదా చిన్న పూజ చేసినా మేము చేసే పూజతో నీకు సంతోషం కలుగుతుందా. కొద్ది పూజ చేసి కూడా గొప్ప ఫలితం పొందుతున్నాము

ఆత్మన ఏవానుసవనమఞ్జసావ్యతిరేకేణ బోభూయమానాశేషపురుషార్థస్వరూపస్య కిన్తు నాథాశిష
ఆశాసానానామేతదభిసంరాధనమాత్రం భవితుమర్హతి

నీ స్వరూపానికి తగినట్లుగానే యజ్ఞ్యమవుతున్న వెంటనే ఎలాంటి వ్యతిరేకమూ లేకుండా మేము చేసిన కర్మవలన కాకుండా నీ దయ వలన ఫలితాన్ని పొందుతున్నాము. నీవు పురుషార్థస్వరూపుడివి. ఏ కోరికా లేని వాడు ఎంత చిన్న పూజ చేసినా స్వామీ నీవు కరుణిస్తావు. ఆశీర్వాదాన్ని కోరికనూ కోరే మేము కేవలం ఏదో పేరుకు ఆరాధన చేస్తున్నామంతే!

తద్యథా బాలిశానాం స్వయమాత్మనః శ్రేయః పరమవిదుషాం పరమపరమపురుష ప్రకర్ష
కరుణయా స్వమహిమానం చాపవర్గాఖ్యముపకల్పయిష్యన్స్వయం నాపచిత ఏవేతరవదిహోపలక్షితః

ఏది మాకు శ్రేయస్సో కాదో తెలియను మూర్ఖులము. మాకేది కావాలో తెలియదు. మోక్షమంటే తెలియదు. అలాంటి వారికి నీ అతి తీవ్రమైన దయను ప్రసరిస్తావు. పెద్ద కోరిక కోరుకుని దానికి తగ్గట్టు పూజ చేయకపోయినా నీవు దయతో కరుణిస్తావు, మోక్షాన్ని ప్రసాదిస్తావు. నీవు ఏమాత్రం మార్పు లేకుండా ఉండి, మాకు మాత్రం మోక్షాన్నిస్తావు. మా చర్మ చక్షువులకు దర్శనమిచ్చావు.  నీవు ఆరాధించబడకుండానే సామాన్య మానవునిలా ఇక్కడ ఉన్నవారిలో నీవు కూడా ఒకడిగా ఉన్నట్లు కనపడుతున్నావు గానీ నీ దివ్యత్వాన్ని చూపెడుతున్నావా? మాకిదే వరము.

అథాయమేవ వరో హ్యర్హత్తమ యర్హి బర్హిషి రాజర్షేర్వరదర్షభో భవాన్నిజపురుషేక్షణవిషయ ఆసీత్

తన వారికీ తనకూ దృష్టి పధములో ఉండేట్లు చేసావు.

అసఙ్గనిశితజ్ఞానానలవిధూతాశేషమలానాం భవత్స్వభావానామాత్మారామాణాం
మునీనామనవరతపరిగుణితగుణగణ పరమమఙ్గలాయనగుణగణకథనోऽసి

సజ్జనులంటే ఎవరు? సంసారము యందు ఆసక్తి లేని వారు. వారిని నరకం రాదు స్వర్గమూ రాదు. ఇలాంటి వారికి చాలా తీక్షణమైన తపస్సు ఉంటుంది. అసంగమనే అతి తీక్షణమైన జ్ఞ్యానాగ్ని చేత అన్ని మురికులనూ పాపాలనూ ధ్వంసం చేస్తారు. అలాంటి భక్తులు చాలు. అనేకమైన కళ్యాణ గుణముల సమూహము చేత స్తోత్రం చేయబడతావు.

అథ కథఞ్చిత్స్ఖలనక్షుత్పతనజృమ్భణదురవస్థానాదిషు వివశానాం నః స్మరణాయ జ్వర
మరణదశాయామపి సకలకశ్మలనిరసనాని తవ గుణకృతనామధేయాని వచనగోచరాణి భవన్తు

మరి ఇలాంటి వాడవైన నిన్ను మేము స్తోత్రం ఎందుకు చేయలేకపోతాము? ఎందుకంటే మాకు తీరికేది? స్క్లనక్షుత్పతనజృమ్భణదురవస్థానాదిషు - జారిపడడం ఆకలీ దప్పి పడటమూ ఆవలించడమూ  ఇతర బాధలను తొలగించుకునే ప్రయత్నములో ఉన్న మేము పరవశులమయ్యాము. వీటితో పరవశులమైన మేము నిన్ను స్మరించడానికి నీ పేర్లు ఏవీ జ్ఞ్యాపకం రావు. ఇంతకాలం స్మరించకున్నా అంతకాలములో స్మరించినా మోక్షం ఇవ్వగల నీ నామధేయాలు ఉన్నా మాకు అవి జ్ఞ్యాపకం రావు.
గుణకృతనామధేయాని  - యాని నామాని గఊనాని. నీ పేర్లన్నీ నీ గుణాలని చెప్పేవే. నిన్ను మేము మరచిపోయినా అంతకాలములో స్మరించినా మా అన్ని పాపాలను పోగొట్టగల నీ నామాన్ని మాకు స్పురణ చేయి. పరమాత్మ నామం పలకాలని  స్ఫురణ నీవే చేయాలి. నీవే గుర్తుంచుకోవాలీ స్తోత్రం చేయించుకోవాలి.

కిఞ్చాయం రాజర్షిరపత్యకామః ప్రజాం భవాదృశీమాశాసాన ఈశ్వరమాశిషాం
స్వర్గాపవర్గయోరపి
భవన్తముపధావతి ప్రజాయామర్థప్రత్యయో ధనదమివాధనః ఫలీకరణమ్

ఈ రాజు నీలాంటి సంతానాన్ని కోరాడు. ఇహములో గానీ పరములో గానీ స్వర్గము గానీ మోక్షము గానీ కావాలంటే నిన్నే వెతుకుతారు. నీవు అపరాజితుడవు. నీవు ఓడిపోనివాడవు. నీ మాయనూ ఎవరూ గెలవలేరు.

కో వా ఇహ తేऽపరాజితోऽపరాజితయా
మాయయానవసితపదవ్యానావృతమతిర్విషయవిషరయానావృత
ప్రకృతిరనుపాసితమహచ్చరణః

మనకు కలిగే భోగములూ విషయములూ విషయాసక్తులూ ఇవన్నీ అనవసితములు. నీ మాయచేత ఆవరించబడని వారికి నీ జ్ఞ్యానం కలుగుతుంది. నీ మాయను గెలవాలంటే ఏమి చేయాలి? వారెందుకు గెలవ లేకపోయారు. నీ భక్తులైన గొప్పవారిని వారు సేవించి ఉండరు. నీ భక్తుల ఆరాధనముతోనే నీ మాయను గెలవవచ్చు.

యదు హ వావ తవ పునరదభ్రకర్తరిహ సమాహూతస్తత్రార్థధియాం మన్దానాం
నస్తద్యద్దేవహేలనం దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ప్రతివోఢుమవిదుషామ్

మేము యజ్ఞ్య యాగాలు దానాలు చేస్తున్నాము గానీ ఎవరు పరదేవతో మాకు తెలియదు. ఒక్క నిన్ను తప్ప అందరినీ పూజిస్తున్నాము. ఏ దేవతను మేము ఆరాధించినా ఆ కోరికను ఇచ్చేది నీవే. జ్ఞ్యానము లేకుండా ఏమి అడగాలో తెలియకుండా అజ్ఞ్యానములో పడి నిన్ను ఎలా ఆరాధించాలో తెలీయకుండా కొట్టుమిట్టాడుతున్న మాకు నీవే జ్ఞ్యానం అందించాలి.

శ్రీశుక ఉవాచ
ఇతి నిగదేనాభిష్టూయమానో భగవాననిమిషర్షభో వర్షధరాభివాదితాభివన్దితచరణః
సదయమిదమాహ

ఇలా స్తోత్రం చేయబడిన పరమాత్మ అందరిచేతా నమస్కరించబడి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
అహో బతాహమృషయో భవద్భిరవితథగీర్భిర్వరమసులభమభియాచితో యదముష్యాత్మజో మయా
సదృశో భూయాదితి మమాహమేవాభిరూపః కైవల్యాదథాపి బ్రహ్మవాదో న మృషా భవితుమర్హతి మమైవ హి
ముఖం యద్ద్విజదేవకులమ్

మీరంతా మహర్షులూ నాయందే భక్తి ఉండి నా స్వరూపం తెలిసి ఉన్నవారు. మీరేమన్నా అది జరిగి తీరుతుంది. కానీ మీరు చాలా కష్ట సాధ్యమైన వరాన్ని కోరారు. న్యాయముగా ఈ వరం ఇతరులకు దుర్లభం. ఇతనికి నాలాంటి కుమారుడు కావాలని కోరారు. నాలాంటి వాడను నేనే. నాకు ఇంకో సమానుడు లేడు. నాలాంటి వాడు లేడు కాబట్టి నీలాంటు వాడు కావాలి అన్న వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుల మాట అబద్దం కాకూడదు. బ్రాహ్మణోత్తములంటే నా ముఖమే. వారు మాట్లాడారంటే నేను మాట్లాడినట్లే. నా మాట నేను అబద్దమెలా చేస్తాను.

తత ఆగ్నీధ్రీయేంశకలయావతరిష్యామ్యాత్మతుల్యమనుపలభమానః

నాలాంటి వాడు ఇంకోడు లేడు కాబట్టీ మీరు కోరారు కాబట్టి ఈ ఆగ్నీద్రుడికి నేనే కొడుకుగుగా అవతరిస్తాను

శ్రీశుక ఉవాచ
ఇతి నిశామయన్త్యా మేరుదేవ్యాః పతిమభిధాయాన్తర్దధే భగవాన్

ఇలా పలికి మేరు దేవికీ నాభికీ కోరిన వరాలిచ్చి స్వామి అంతర్ధానమయ్యాడు
పరమాత్మ తన దివ్యమైన దేహముతో నాభికీ మేరుదేవికీ కుమారుడిగా పుట్టాడు. ఎక్కడ యజ్యం చేసారో ఆ దర్భలలోనే నాభికి ప్రీతి కలిగించడానికి అతని యొక్క అంతఃపుర స్త్రీ అయిన మేరు దేవి యందు ఊర్ధ్వ రేతస్కులైన దిగంబరులైన యతి (సన్యాసి) ధర్మాలను చెప్పడానికి వచ్చాడు. పరిశుద్ధమైన సత్వ దేహముతో అవతరించాడు.

Popular Posts