Followers

Wednesday 19 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తథా చ భద్రశ్రవా నామ ధర్మసుతస్తత్కులపతయః పురుషా భద్రాశ్వవర్షే సాక్షాద్భగవతో
వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా
సన్నిధాప్యేదమభిగృణన్త ఉపధావన్తి

ధర్ముని పుత్రుడు భద్రశ్వుడు. కులపతులతో కలిసి భద్రశ్రవుడు హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటాడు.పరమ సమాధితో ఈ మంత్రాలను చదువుతూ ఆయన్ని ఉపాసిస్తారు

భద్రశ్రవస ఊచుః
ఓం నమో భగవతే ధర్మాయాత్మవిశోధనాయ నమ ఇతి

ఇది హయగ్రీవమంత్రం. ఈయన ధర్మ స్వరూపుడూ మనశ్శుద్ధిని కలిగిస్తాడు అంటే చక్కని వాగ్ వైభవాన్ని ఇస్తాడు.

అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నన్తం జనోऽయం హి మిషన్న పశ్యతి
ధ్యాయన్నసద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి

ఎంత విచిత్రం పరమాత్మ లీల. చనిపోతున్న వారిని చూస్తూ కూడా మళ్ళీ ఇంకోళ్ళను చంపుతారు. చూస్తూ కూడా గుడ్డివాడవుతున్నాడు. అదే విషయాన్ని ధ్యానం చేసి కూడా చెడు పని చేయడానికి వెనుకాడడు. ఎందరో పోయిన వాళ్ళను చూసినా తాను బతకడానికి చెడు పని చేస్తాడు.

వదన్తి విశ్వం కవయః స్మ నశ్వరం పశ్యన్తి చాధ్యాత్మవిదో విపశ్చితః
తథాపి ముహ్యన్తి తవాజ మాయయా సువిస్మితం కృత్యమజం నతోऽస్మి తమ్

తండ్రిని అంత్యక్రియలు చేసిన కొడుకు తాను చాలా కాలం బతుకుతాడనుకుంటాడు. ఇదేమి చిత్రం

పండితులందరూ ప్రపంచం నశ్వరం అని చెబుతూ ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు. స్పష్టముగా చూస్తున్నా ఇందరు చెబుతున్నా నీ మాయ ఎంత గొప్పది. అందరూ ఇందులోకే పోతున్నారు.ఇంత ఆశ్చర్యకరములైన కర్మలు చేసే పరమాత్మకు నమస్కారం

విశ్వోద్భవస్థాననిరోధకర్మ తే హ్యకర్తురఙ్గీకృతమప్యపావృతః
యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః

సృష్టి లయలకు నీవే కర్తవూ నీవే అకర్తవు.  అన్ని కార్యాలకు కారణమైన నీ  యందు ఇది చిత్రం. అన్నీ నీలో ఉండి అన్నీ నీవే చేస్తున్న నీ మాయను దాటలేకపోవడం వింతేమీ కాదు

వేదాన్యుగాన్తే తమసా తిరస్కృతాన్రసాతలాద్యో నృతురఙ్గవిగ్రహః
ప్రత్యాదదే వై కవయేऽభియాచతే తస్మై నమస్తేऽవితథేహితాయ ఇతి

ప్రళయకాలములో తమస్సులో దాగి ఉన్న వేదాలను రసాతలములో ఉన్న వేదాలని తీసుకుని వచ్చి ప్రార్థిస్తున్న బ్రహ్మకు ఇచ్చావు. అలాంటి సత్య సంకల్పుడవైన నీకు నమస్కారం.

హరివర్షే చాపి భగవాన్నరహరిరూపేణాస్తే తద్రూపగ్రహణనిమిత్తముత్తరత్రాభిధాస్యే
తద్దయితం రూపం మహాపురుషగుణభాజనో మహాభాగవతో దైత్యదానవకులతీర్థీకరణశీలాచరితః
ప్రహ్లాదోऽవ్యవధానానన్యభక్తియోగేన సహ తద్వర్షపురుషైరుపాస్తే ఇదం చోదాహరతి

హరి వర్షములో నృసింహ రూపములో ఉంటాడు. ఆయన ఎందుకు అది ధరించాడో తరువాత చెబుతాను. అది పరమ సుందరమైన రూపం. సకల దైత్యులకూ దానవులకూ సద్గుణములకు గని అయిన ప్రహ్లాదుడు అనన్యమైన భక్తియోగముతో అందరి చేతా ఆరాధించబడుతూ, ఆయన నరసింహుని ఆరాధిస్తాడు.

ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర
కర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్ష్రౌమ్

క్షౌం అనేది నరసింహ బీజం. నీవు తేజస్సులకు తేజస్సువి. అజ్య్నానాన్ని పోగొట్టమని ప్రార్థిస్తూ ఉంటాడు.

స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయన్తు భూతాని శివం మిథో ధియా
మనశ్చ భద్రం భజతాదధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ

ప్రపంచానికి మంగళమవుగాక, దుర్మార్గులు కూడా ప్రసన్నముగా ఉండుగాక. అన్ని ప్రాణులూ పరస్పరం ఒకరి క్షేమాన్ని ఇంకొకరు కోరుకుందురు గాక. అందరి మనస్సూ భద్రముగ పరమాత్మ యందే లగ్నము కానీ.

మాగారదారాత్మజవిత్తబన్ధుషు సఙ్గో యది స్యాద్భగవత్ప్రియేషు నః
యః ప్రాణవృత్త్యా పరితుష్ట ఆత్మవాన్సిద్ధ్యత్యదూరాన్న తథేన్ద్రియప్రియః

మా మనస్సు భార్యా బంధువులూ ఇల్లూ పిల్లల యందు గాక పరమాత్మ భక్తుల యందు లగ్నమవు గాక. ప్రాణాయామ పరాయణుడై ప్రాణాయామముతో మనసుని జయించినవాడు ఇంద్రియములకు లొంగిన వాడు పొందలేడు కదా.

యత్సఙ్గలబ్ధం నిజవీర్యవైభవం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసమ్
హరత్యజోऽన్తః శ్రుతిభిర్గతోऽఙ్గజం కో వై న సేవేత ముకున్దవిక్రమమ్

ఎవరి క్షణ కాల సంగముతో మానస సరోవరం తీర్థముగా అయ్యిందో, అలాగే నీ క్షణ కాలం నివాసముతో మా హృదయం కూడా మానససరోవరమంత పవిత్రం అవుతుంది. ఇలాంటి పరమాత్మ యొక్క పరాక్రమాన్ని ఎవరు సేవించరు. ఏ స్తోత్రం మనసులో ఉన్న మన్మధున్ని జయిస్తుందో అలాంటి ఏ బుద్ధిమంతుడు సేవించడు.

యస్యాస్తి భక్తిర్భగవత్యకిఞ్చనా సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః
హరావభక్తస్య కుతో మహద్గుణా మనోరథేనాసతి ధావతో బహిః

ఎవరికి పరమాత్మ యందు కోరికలేని భక్తి ఉంటుందో అలాంటి వారిదగ్గరకి గుణములతో కలిసి దేవతలందరూ వచ్చి చేరతారు. పరమాత్మ యందు భక్తుడుకాని వాడికి గొప్ప గుణాలెలా ఉంటాయి. మనస్సనే రథమెక్కి మాటి మాటికీ బయటకు వెళ్ళేవాడికి గుణాలెలా వస్తాయి.

హరిర్హి సాక్షాద్భగవాన్శరీరిణామాత్మా ఝషాణామివ తోయమీప్సితమ్
హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్త్వం వయసా దమ్పతీనామ్

శరీరం కలిగినవారందరికీ పరమాత్మే ఆత్మ, చేపలకు నీరు లాగ.  అలాంటి పరమాత్మను వదిలిపెట్టి సంసారములో లగ్నమైతే వయసుతో పెద్దవాడవుతాడు గానీ జ్ఞ్యానముతో కాడు

తస్మాద్రజోరాగవిషాదమన్యు మానస్పృహాభయదైన్యాధిమూలమ్
హిత్వా గృహం సంసృతిచక్రవాలం నృసింహపాదం భజతాకుతోభయమితి

ఈ సంసారములో 1. రజస్సూ 2. ప్రేమ కోపం విషాదం అభిమానం కోరిక దైన్యమూ మానసిక వ్యాధి మొదలైన వాటికిమూలమైన గృహాన్ని వదిలిపెట్టి శ్రీమన్నారసింహుని పాదాలనే స్మరించండి.

కేతుమాలేऽపి భగవాన్కామదేవస్వరూపేణ లక్ష్మ్యాః ప్రియచికీర్షయా ప్రజాపతేర్దుహిత్ణాం పుత్రాణాం
తద్వర్షపతీనాం పురుషాయుషాహోరాత్రపరిసఙ్ఖ్యానానాం యాసాం గర్భా మహాపురుషమహాస్త్రతేజసోద్వేజిత
మనసాం విధ్వస్తా వ్యసవః సంవత్సరాన్తే వినిపతన్తి

మన్మధుని ఆకారములో అమ్మ వారికి ప్రీతి కలిగించాలన్న ఉద్దేశ్యముతో, ప్రజాపతి యొక్క పుత్రులు అధిపతిగా ఉన్న కేతుమాల వర్షములో ఉన్నాడు. ఈ ప్రజాపతులకు ఒక పురుష ఆయుష్యం ఒక పగలు. ఒక సంవత్సరం అయిన తరువాత వారికుండే గర్భములు కాలపురుషుని ప్రభ్హావముతో పడిపోతాయి.

అతీవ సులలితగతివిలాసవిలసితరుచిరహాసలేశావలోకలీలయా
కిఞ్చిదుత్తమ్భితసున్దరభ్రూమణ్డల
సుభగవదనారవిన్దశ్రియా రమాం రమయన్నిన్ద్రియాణి రమయతే

పరమాత్మ తన సౌందర్యముతో సౌకుమార్యముతో, గతి విలాస హాస సౌందర్యములతో అమ్మవారితో సహా అందరినీ రంజింపచేస్తూ ఉంటాడు

తద్భగవతో మాయామయం రూపం పరమసమాధియోగేన రమా దేవీ సంవత్సరస్య రాత్రిషు
ప్రజాపతేర్దుహితృభిరుపేతాహఃసు చ తద్భర్తృభిరుపాస్తే ఇదం చోదాహరతి

ఈ కామదేవున్ని లక్ష్మీ దేవి ప్రజాపతులల్తో కలిసి వారి పుత్రికలతో కలసి ఆరాధిస్తుంది. పగలు అంటే ప్రజాపతుల పుత్రులూ రాత్రి అంటే వారి పుత్రికలు. వీరితో కలిసి కామదేవున్ని ఆరాధిస్తుంది

ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే
ఆకూతీనాం
చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ
సర్వమయాయ
సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్

ఈ కామదేవుడే హృషీకేశుడు. కోరిక ఇంద్రియములు మన చేతిలో లేకుండుటచే కలుగుతుంది. ఆ ఇంద్రియ ప్రవృత్తిని నియంత్రించగలిగే వాడు పరమాత్మ. అందుకే స్వామి హృషీకేశుడు. ప్రకృతి గుణాల కంటే ఆత్మ గుణాల కంటే పరమాత్మ విలక్షణుడు. ఆకూతి (కర్మేంద్రియాలకూ) జ్ఞ్యానేంద్రియాలకూ మనసు యొక్క ప్రవృత్తికీ ఆయనే అధిపతి. షోడశకలాయ - ఐదు జ్ఞ్యాన ఐదు కర్మ పంచభూతములకూ మనసుకూ అధిపతి, ఆయనే చందోమయుడు అమృతమయుడు అన్నమయుడు, సర్వమయుడు. బలమూ (ధారణ సామర్ధ్యం) ఓజః (ప్రవృత్తి సామర్ధ్యం) సహః (శత్రువులను ఓడించే సామర్ధ్యం) కలవాడు. అతనే కాంతుడూ కాముడు. ఇహలోకములో సుందరుడూ, పరలోకములో కోరికలను తీర్చేవాడు. ఈ లోకములో మనం చూసే సౌందర్యమంతా పరలోక సుఖాదాయకం కావాలి. పరలోకములో సుఖం కలిగించేదిగా ఉండాలి. ఈయన కామస్పతి - సకల కోరికలకూ అధినాధుడు. ఆయనకు ఆనందం కలిగించే ప్రవృత్తి మనం అలవరచుకుంటే ఇహలోకములో ప్రతీ ప్రవృత్తీ మనకు సంతోషాన్నిస్తుంది.

స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో హ్యారాధ్య లోకే పతిమాశాసతేऽన్యమ్
తాసాం న తే వై పరిపాన్త్యపత్యం ప్రియం ధనాయూంషి యతోऽస్వతన్త్రాః

యువతులు సౌందర్యవతులు తాము కోరుకున్న భర్త రావడానికి నిన్ను ఆరాధిస్తారు. కానీ వారు అనుకూలవంతులైన పుత్రులని కోరరు. భర్త మంచివాడే అయినా కొడుకు మంచివాడు కాకపోవడముతో ఆ సంతానం వారిని కాపాడరు. ఆ సంతానం తల్లి తండ్రులను కాపాడరు గానీ తల్లి తండుర్లు సంపాదించిన ఆస్తులను మాత్రం బాగా కాపాడతారు. భర్తను కోరే ఆడవారు ఇలాంటి సంతానం కలుగుతుందనో కలవచ్చనో ఆలోచించరు.

స వై పతిః స్యాదకుతోభయః స్వయం సమన్తతః పాతి భయాతురం జనమ్
స ఏక ఏవేతరథా మిథో భయం నైవాత్మలాభాదధి మన్యతే పరమ్

మాకర్థమయ్యింది ఒకటే. ఎవడు పతి? తాను వేటి వలనా భయము పొందని వాడు భర్త. వాడికి భయం లేకుంటేనే మనము భయపడకుండా కాపాడతాడు. తనకు భయములేని వాడై, భయం ఉన్నవారిని ఎవడు కాపాడతాడో అతనే భర్త. తనను చూచి తానే భయపడే వాడు భర్త ఎలా అవుతాడు. ఆత్మలాభము కంటే ఇంకో ఫలం ఉన్నదని భావించేవాడేవడూ భర్తకాడు. ఆత్మలాభం కంటే భిన్నమైనదాన్ని ఫలముగా తలచేవాడెవడూ భర్త కాదు. పరమాత్మ ప్రాప్తే మనకు ఫలము. దాని కన్నా భిన్నమైనదాన్ని కోరేవారు భర్తా కాదు, భార్యా కాదు, పిల్లలూ కాదు.

యా తస్య తే పాదసరోరుహార్హణం నికామయేత్సాఖిలకామలమ్పటా
తదేవ రాసీప్సితమీప్సితోऽర్చితో యద్భగ్నయాచ్ఞా భగవన్ప్రతప్యతే

పరమాత్మనే ఎందుకారాధించాలంటే, అందరికంటే భగవంతుడు ఉత్తముడు, అడిగిన దాన్నిస్తాడు. అనేక కోరికలతో నిండి ఉన్న మనసు గానీ బుద్ధి కానీ, తాను కోరే కోరికల వలన అనర్థమును పొందకుండా ఉండాలంటే నీ పాదపద్మములనే ఆరాధించాలి. కోరికలు భగవంతుని మీద భక్తిని పెంచే కోరికలు కావాలి. నీవు పూజించబడి కోరబడి భక్తులు ఏమడుగుతారో అది ఇస్తావు. కోరి ఆరాధించినపుడు ఆరాధించిన వాడు ఏ కోరిక కోరతాడో అది ఇస్తావు. కోరిక తీరకుంటే భక్తులు బాధపడతారని కోరికలను తీరుస్తూ ఉంటావు.

మత్ప్రాప్తయేऽజేశసురాసురాదయస్తప్యన్త ఉగ్రం తప ఐన్ద్రియే ధియః
ఋతే భవత్పాదపరాయణాన్న మాం విన్దన్త్యహం త్వద్ధృదయా యతోऽజిత

మానవులే కాదూ ఇంద్రాదులు కూడా ఇంద్రియముల యందే మనసు పెట్టుకుని నశ్వరమైన వాటిని పొందడానికి ఘోరమైన తపస్సు చేస్తారు. బ్రహ్మ రుద్ర దేవతలూ రాక్షసులూ అందరూ ఇలాగే చేసారు. అలా కోరని వారు ఒక్కరు మాత్రమే, నీ పాద భక్తులు మాత్రమే. కొందరు నేను నా హృదయాన్ని నీ మీద ఉంచిన సంగతి తెలియక నన్ను మాత్రమే కోరతారు. నా హృదయం నీలో ఉంటుంది. అది తెలియని వారు నిన్ను కోరక నన్ను కోరతారు.

స త్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వన్దితం కరామ్బుజం యత్త్వదధాయి సాత్వతామ్
బిభర్షి మాం లక్ష్మ వరేణ్య మాయయా క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి

నన్ను కోరేవారందరూ, నీతో బాటుగా నన్ను కోరేవారిగా వారిని తయారు చేయి. లేదా నన్ను నీతో విడిపోకుండా ఉండే వరమునియ్యి. భక్తులు కోరిక కాదనకుండా నేనైనా నిన్ను విడిచిపెట్టి వెళతానేమో గానీ, నీవు మాత్రం నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళవు. నన్ను పుట్టుమచ్చగా చేసుకుని నీ హృదయములో ఉంచుకున్నావు.
నీవు నీ భక్తుల యొక్క శిరస్సు మీద ఏ కరాంభుజమును ఉంచుతావో ఆ కరాంభుజమునే నా శిరస్సు మీద ఉంచి నీ నుండి నాకు ఎడబాటు రాకుండా వరమివ్వు. ఆనాడు నీవు పుట్టుమచ్చగా చేసుకున్నప్పుడు "నేనే ఉండగా వేరే గుర్తు ఎందుకు" అనుకున్నాను. కానీ భక్తులు ఇలా నన్ను వేరు చేస్తారని తెలియదు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీ సంకల్పాన్ని ఎవరు ఊహించగలరు.

వీటిని లక్ష్మీ పంచకం అంటారు. దీన్ని ప్రతీ పూర్ణిమ నాడూ చదువుకుంటే పరమాత్మ యందు భక్తి పెరిగి సంసారములో కోరిక కోరకుండా ఉంటారు.

రమ్యకే చ భగవతః ప్రియతమం మాత్స్యమవతారరూపం తద్వర్షపురుషస్య మనోః ప్రాక్
ప్రదర్శితం స ఇదానీమపి మహతా భక్తియోగేనారాధయతీదం చోదాహరతి

రమ్యక వర్షములో మత్స్యమూర్తి వేంచేసి ఉంటారు, ఈయనను ఆరాధించేది మనువు. రమ్యక వర్షాధిపతి మనువు. ఇది మత్స్య మంత్రం

ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్త్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ
మహామత్స్యాయ
నమ ఇతి

బలానికీ ఓజస్సుకూ సహస్సుకూ అధిపతి. బలానికి మారుపేరు మత్స్యం. ఆయనే ప్రాణమూ ఓజస్సూ సహస్సూ బలం. ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ మనువు మత్స్య రూపాన్ని సేవిస్తున్నాడు.

అన్తర్బహిశ్చాఖిలలోకపాలకైరదృష్టరూపో విచరస్యురుస్వనః
స ఈశ్వరస్త్వం య ఇదం వశేऽనయన్నామ్నా యథా దారుమయీం నరః స్త్రియమ్

నీటి పైనా లోపల తిరిగే అవతారం మత్స్యం. అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణ అంటే జలములకు ఆధారం, జలములు ఆధారముగా కలవాడు. నీటిలోపల స్వామి ఉంటే నీటికి స్వామి ఆధారం. బయట ఉన్నప్పుడు స్వామికి నీరు ఆధారం. నారాయణ ఉపనిషత్తుని చూపిన వాడు, లోపల ఉన్నా బయట ఉన్నా కనపడకుండా ఉంటాడు. అందుకే నిన్ను ఈశ్వరుడూ అంటారు. ఈశతి అంటే సకల జగత్తునూ తన వశములో ఉంచుకున్నవాడు అని అర్థం. మానవులు తన ఎదురుగా ఉన్న తనలాంటి బొమ్మనే (ఆడవారినే) తమ వశములో ఉంచుకోలేరు. నీవు మాత్రం సకల జగత్తునూ నీ వశములో ఉంచుకుంటావు. ఆపద వస్తే ఆదుకోగలిగిన వారే సకల జగత్తునీ వశములో ఉంచుకోగలరూ. రెండు కాళ్ళ జంతువులనూ నాలుగు కాళ్ళ జంతువులనూ ఆపద వస్తే శరణిచ్చేవాడివి నీవే. మిగతా దేవతలు ఆదుకొనలేరు. అందుకే ఏ ప్రాణి జాతమైనా ఇంకెవరి వశములోనూ ఉండదు.

యం లోకపాలాః కిల మత్సరజ్వరా హిత్వా యతన్తోऽపి పృథక్సమేత్య చ
పాతుం న శేకుర్ద్విపదశ్చతుష్పదః సరీసృపం స్థాణు యదత్ర దృశ్యతే

భవాన్యుగాన్తార్ణవ ఊర్మిమాలిని క్షోణీమిమామోషధివీరుధాం నిధిమ్
మయా సహోరు క్రమతేऽజ ఓజసా తస్మై జగత్ప్రాణగణాత్మనే నమ ఇతి

ప్రళయములో ఆ సముద్రములో బ్రహ్మాండమైన ప్రళయములో భూమికి రవ్వంత కూడా హాని కలగకుండా భూమిలో ఉన్న అన్ని ఔషధులనూ నిక్షిప్తం చేసి కాపాడావు. ఆ భూమికి నన్ను ఏర్పాటు చేసి నన్నూ భూమినీ ఋషులనూ కాపాడినవాడవు నీవే కదా. నాతో కలిసి నీవే అంతా విజృంభించావు. ఇలాంటి జగత్తు యొక్క ప్రాణ రూపమైన నీకు నమస్కారం. 

హిరణ్మయేऽపి భగవాన్నివసతి కూర్మతనుం బిభ్రాణస్తస్య తత్ప్రియతమాం తనుమర్యమా సహ
వర్షపురుషైః పితృగణాధిపతిరుపధావతి మన్త్రమిమం చానుజపతి

హిరణ్మయ వర్షములో స్వామి కూర్మ రూపములో ఉండగా అర్యముడు (పితృగణాధిపతి) తన వారందరితో కలిసి ఈ మంత్రాన్ని జపిస్తాడు 

ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్త్వగుణవిశేషణాయానుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే
నమో భూమ్నే నమో నమోऽవస్థానాయ నమస్తే

ఈయన అవస్థానుడు. ఎప్పుడూ ఉండేవాడు. కూర్మం చాలా గట్టిది.  నీవు అకూపార - నీవు దాట లేని ఒడ్డూ లేదు, నీవు సమీపించలేని స్థలం లేదు. సకల ప్రాణుల గుణాలనూ నీలో ఉంచుకున్నావు. నీ కూర్మావతారములో నీవెక్కడ ఉన్నావో కూడా ఎవరికీ తెలీదు. పర్వతం ఎంత ఉందో అంత వ్యాపించి ఉన్నావు. నీ స్థానాన్ని మేము గుర్తుపట్టలేము. 

యద్రూపమేతన్నిజమాయయార్పితమర్థస్వరూపం బహురూపరూపితమ్
సఙ్ఖ్యా న యస్యాస్త్యయథోపలమ్భనాత్తస్మై నమస్తేऽవ్యపదేశరూపిణే

నీ ఈ రూపం నీ సంకల్పముతో ఏర్పాటు చేసుకున్నావు. అనేకమైన ప్రపంచం యొక్క రూపములతో ఏది నీ రూపం ఏర్పడినదో అది నీ రూపం. కూర్మ రూపములోనే అన్ని రూపములూ ఉన్నాయి.  దేవతలను అమృతాన్నిచ్చింది సముద్రం కాదు, నీవే. కానీ తెలియక అందరూ సముద్రం ఇచ్చిందని చెప్పుకుంటారు. (దాత కూడా కూరమములా ఉండాలి. ఇచ్చినట్లు ఎవరికీ తెలియకూడదు) దానం నశ్యతి కీర్తనాత్. దానము చేస్తే చెప్పకూడదు. "ఇది ఇలా ఉంటుందని " ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి నీ రూపం ఎవరికీ అర్థం కాదు. ఎవరు చెప్పలేని రూపములో ఉన్న నీకు నమస్కారం 

జరాయుజం స్వేదజమణ్డజోద్భిదం చరాచరం దేవర్షిపితృభూతమైన్ద్రియమ్
ద్యౌః ఖం క్షితిః శైలసరిత్సముద్ర ద్వీపగ్రహర్క్షేత్యభిధేయ ఏకః

జరాయుజం (మావి నుంచి ) గుడ్డు నుంచీ చెమట నుంచీ భూమిని భేదించుకుని పుట్టే జాతులు. దేవతలూ ఋషులూ పితృ దేవతలూ ప్రాణులూ, ఆకాశమూ భూమీ స్వరగమూ నదులూ గ్రహములూ తారకులూ సముద్రాలూ అన్నీ నీవే. 

యస్మిన్నసఙ్ఖ్యేయవిశేషనామ రూపాకృతౌ కవిభిః కల్పితేయమ్
సఙ్ఖ్యా యయా తత్త్వదృశాపనీయతే తస్మై నమః సాఙ్ఖ్యనిదర్శనాయ తే ఇతి

అన్ని రూపాలుగా ఉన్న నిన్ను పక్కన బెట్టి నీలో ఉన్నవాటికి పేర్లు పెడుతున్నారు.  అనేకమైన భూత జాలముల సంఖ్యను చూపిస్తావు కాబట్టి నీవు సాంఖ్య రూపుడివి, అలాంటి నీకు నమస్కారం 

ఉత్తరేషు చ కురుషు భగవాన్యజ్ఞపురుషః కృతవరాహరూప ఆస్తే తం తు దేవీ హైషా భూః సహ
కురుభిరస్ఖలితభక్తియోగేనోపధావతి ఇమాం చ పరమాముపనిషదమావర్తయతి

ఉత్తర కురేషులో వరాహస్వామిని భూదేవి ప్రార్థిస్తుంది. ఈ ఉపనిషత్తును పఠనం చేస్తూ ఉంటుంది. 

ఓం నమో భగవతే మన్త్రతత్త్వలిఙ్గాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః
కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే

వరాహానికి శుక్లః అని పేరు. అన్ని కర్మలూ చేస్తూ కూడా పరిశుద్ధుడు. అంత పెద్ద భూమిని కోరల మీద నిలుపుకున్నా కొంచెం మట్టి కూడా అంటలేదు. మనం కూడా కోరిక లేకుండా చేస్తే పరిశుద్ధులమే అవుతాము. 

యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్వివ జాతవేదసమ్
మథ్నన్తి మథ్నా మనసా దిదృక్షవో గూఢం క్రియార్థైర్నమ ఈరితాత్మనే

వరాహ స్వామిని ప్రార్థించే మంత్రం ఇది. కట్టెలో ఉన్న అగ్నిని తీయడానికి ఎలా మధనం చేయాలో. అంతర్యామిగ ఉన్న పరమాత్మను బయటకు తీయడానికి ఋషులు తమ మనసుతో బుద్ధి అనే వాసుకితో శరీరమనే మదర పర్వతాన్ని సంసారమనే సముద్రాన్ని.  మధనం చేస్తారు. వారంతగా మధనం చేసినా నీవు కనపడవు. నీవు శబ్దమే స్వరూపముగా ఉన్నవాడు. వేద వేద్యుడవు.

ద్రవ్యక్రియాహేత్వయనేశకర్తృభిర్మాయాగుణైర్వస్తునిరీక్షితాత్మనే
అన్వీక్షయాఙ్గాతిశయాత్మబుద్ధిభిర్నిరస్తమాయాకృతయే నమో నమః

సృష్టి చేయాలంటే ద్రవ్యమూ క్రియా హేతువూ ఆధారం కావాలి.దాన్ని కూర్చే వాడు చేర్చేవాడూ నియమించేవాడూ .  కేవలం వేదాంత విద్యతోటే బుద్ధినీ మనస్సునూ అతిక్రమించిన విలక్షణమైన పరమాత్మ మాయాను అతిక్రమించగలం. 

కరోతి విశ్వస్థితిసంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః
మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణో నమస్తే గుణకర్మసాక్షిణే

నీకు ప్రీతి కలిగించే వేదమంత్రాలనూ యజ్ఞ్య యాగాదులనూ చేయాలి. నీవు . ప్రపంచాన్ని సృష్టించి రక్షించి సంహరిస్తున్నావు. నీ ఈప్సితాన్నీ అనీప్సితాన్ని తెలుసుకోలేని వారు, నీవెక్కడున్నావో తెలీయకుండానే అయస్కాంతం చుట్టూ ఇనుము తిరిగినట్లు నీ చుట్టూ తిరుగుతారు 

ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే యో మాం రసాయా జగదాదిసూకరః
కృత్వాగ్రదంష్ట్రే నిరగాదుదన్వతః క్రీడన్నివేభః ప్రణతాస్మి తం విభుమితి


అడ్డు వచ్చిన రాక్షసులని చంపి రసాతలం నుంచి నన్ను బయటకు తీసావు. ఒక ఆట ఆడినట్లుగా భూమిని పైకి తీసావు. అలాంటి నీకు నమస్కారం

Popular Posts