Followers

Tuesday 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పన్నెండవ అధ్యాయం


శ్రీనారద ఉవాచ
బ్రహ్మచారీ గురుకులే వసన్దాన్తో గురోర్హితమ్
ఆచరన్దాసవన్నీచో గురౌ సుదృఢసౌహృదః

బ్రహ్మచారి ఐన వాడు గురుకులములో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. గురువుకు హితమును ఆచరిస్తూ గురువుగారికి దాసునిలా నైత్యానుసంధానము చేస్తూ గురువు యందు గట్టి ప్రీతి గలవాడు కావాలి

సాయం ప్రాతరుపాసీత గుర్వగ్న్యర్కసురోత్తమాన్
సన్ధ్యే ఉభే చ యతవాగ్జపన్బ్రహ్మ సమాహితః

ప్రాతః సాయంకాలం రెండుపూటలా గురువులనూ అగ్నిహోత్రున్ని సూర్యున్ని దేవతలనూ ఆరాధించాలి. వాక్కును నియమించుకుని రెండు సంధ్యలలో గాయత్రిని జపిస్తూ ఉండాలి. గురువుగారు పిలిస్తే వెళ్ళి కూర్చుని వినయముతో చదువుకోవాలి.

ఛన్దాంస్యధీయీత గురోరాహూతశ్చేత్సుయన్త్రితః
ఉపక్రమేऽవసానే చ చరణౌ శిరసా నమేత్

పాఠం ప్రారంభించినప్పుడూ పాఠం ముగిసిన తరువాత గురువుగారి పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించాలి. 

మేఖలాజినవాసాంసి జటాదణ్డకమణ్డలూన్
బిభృయాదుపవీతం చ దర్భపాణిర్యథోదితమ్

బ్రహ్మచారి మేఖలమూ జింక చర్మమూ వస్త్రమూ దండం కమడలం ధరించాలి. వీటితో బాటు యజ్ఞ్యోపవీతం కూడా ధరించాలి. చేతిలో నిరంతరం దర్భలు చెప్పిన రీతిలో ధరించాలి.

సాయం ప్రాతశ్చరేద్భైక్ష్యం గురవే తన్నివేదయేత్
భుఞ్జీత యద్యనుజ్ఞాతో నో చేదుపవసేత్క్వచిత్

ప్రాతః సాయంకాలం బిక్షాటన చేసి వచ్చిన దాన్ని గురువుగారికి అర్పించాలి. గురువుగారు పిలిచి తినమంటే భుజించాలి. లేకుంటే ఉపవసించాలి.

సుశీలో మితభుగ్దక్షః శ్రద్దధానో జితేన్ద్రియః
యావదర్థం వ్యవహరేత్స్త్రీషు స్త్రీనిర్జితేషు చ

చక్కని శీల స్వభావం ఉండాలి.మితముగా భుజించాలి. గురువుగారి కార్యము చేయడములో సమర్ధుడై ఉండాలి. చెప్పే పాఠములో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఆడవారితో ఎక్కువ సన్నిహితముగా వ్యవహరించరాదు. ఎంత వరకూ వారితో పనే అంతవరకే ఉండాలి. స్త్రీలతో కన్నా స్త్రీలాచే ఓడించబడినవారితో (స్త్రీ దాసులతో) జాగ్రత్తగా ఉండాలి. 

వర్జయేత్ప్రమదాగాథామగృహస్థో బృహద్వ్రతః
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్త్యపి యతేర్మనః

గృహస్థుడు కాని వాడు బ్రహ్మచర్య వ్రతములో ఉన్నప్పుడు ఆడవారి గాధలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంద్రియములు ప్రమాదకారి, సన్యాసై మనసును కూడా చలింపచేస్తాయి. వాటికి అవకాశం ఇవ్వకు. ఆ గాధలను మాట్లాడకు. 

కేశప్రసాధనోన్మర్ద స్నపనాభ్యఞ్జనాదికమ్
గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా

యువకుడైన వాడు ఆడవారితో గానీ గురువుగారి పత్నితో గానీ పిల్లలతో గానీ జుట్టుకు నూనె రాయించుకొనుట, ఒంటికి నలుగు పెట్టుటా స్నానం అభ్యంగనం చేయించుకోరాదు.

నన్వగ్నిః ప్రమదా నామ ఘృతకుమ్భసమః పుమాన్
సుతామపి రహో జహ్యాదన్యదా యావదర్థకృత్

స్త్రీ అంటే అగ్ని, నిప్పులాంటిది. పురుషుడు నీటి కుండ వంటి వాడు. గురుపత్నే కాదు, కన్న కూతురైనా యువతి ఐతే వారితో రహస్యముగా ఏకాంతముగా ఒంటిగా ఉండరాదు. ఉండవలసి వస్తే (యావధర్ధం) ఎంత వరకూ అవసరమైతే అంత వరకూ. 

కల్పయిత్వాత్మనా యావదాభాసమిదమీశ్వరః
ద్వైతం తావన్న విరమేత్తతో హ్యస్య విపర్యయః

పరమాత్మ, జగత్తూ, ప్రకృతి. సకల జగత్తూ పరమాత్మ స్వరూపమే. జగత్తునూ పరమాత్మనూ రెంటినీ చూడాలి; రెండవది లేకుండా పరమాత్మ ఒక్కటే ఉన్నాడు అన్న జ్ఞ్యానం పెంచుకోవాలంటే భావించబడే వాడు ఉండాలి. జ్ఞ్యానం కలిగే వరకూ ద్వైత బుద్ధి వదిలి పెట్టరాదు. అభేధ బుద్ధీ, తత్వ జ్ఞ్యానం కలిగే వరకూ ద్వైతాన్ని విడవకూడదు

ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి
గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః

పైన చెప్పిన ఈ నాలుగూ, (స్త్రీలను, వారెవరైనా, ఏకాంతములో కలవరాదు, పని ఎంతవరకో అంత వరకే ఉండాలి) అన్ని వర్ణాల వారికీ, ఆశ్రమాల వారికి. గృహస్థ, వానప్రస్థ సన్యాసులకు కూడా వర్తిస్తాయి. ఒక్క గురు శుశ్రూష విషయములో తప్ప తక్కిన నియమాలన్నీ గృహస్థుకు కూడా ఉంటాయి. భార్య ఋతుమతి అయినప్పుడు సంతానం కోసం సంగమించుట తప్ప బ్రహ్మచర్య గార్హస్థాశ్రమాలకు తేడా ఉండవు.

అఞ్జనాభ్యఞ్జనోన్మర్ద స్త్ర్యవలేఖామిషం మధు
స్రగ్గన్ధలేపాలఙ్కారాంస్త్యజేయుర్యే బృహద్వ్రతాః

గృహస్థుడు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని వ్రతాలు స్వీకరిస్తారు. అప్పుడు కంటికి కాటుక పెట్టరాదు, తలకు స్నానం చేయరాదు, ఒంటికి నలుగు పెట్టకూడదు, ఆడువారిని చూడరాదు, ఆడవరాఇని రాయకూడదు (చిత్రించరాదు). మద్య మాంఅసములను విడవాలి, పూలదండలనూ గంధములు రాసుకొనుట విడవాలి. వ్రతం స్వీకరించిన వారు విడిచిపెట్టాలి

ఉషిత్వైవం గురుకులే ద్విజోऽధీత్యావబుధ్య చ
త్రయీం సాఙ్గోపనిషదం యావదర్థం యథాబలమ్

బ్రహ్మచారి ఐన వారు, ఇలా గురువుగారి ఇంటిలో కొంతకాలం నివసించి బ్రాహ్మణుడు చదువుకొని, తెలుసుకున్ని, వేదమును అంగములతో (శిక్షా వ్యాకరణం జ్యోతిషాది అంగాలను) అవసరమున్నంత అవకాశం ఉన్నంత చదువుకోవాలి. 

దత్త్వా వరమనుజ్ఞాతో గురోః కామం యదీశ్వరః
గృహం వనం వా ప్రవిశేత్ప్రవ్రజేత్తత్ర వా వసేత్

శక్తికి తగ్గట్టుగా గురువుగారికి దక్షిణ ఇచ్చి, వారి అనుగ్రహం పొంది గురువు గారి అనుజ్ఞ్య పొంది ఇష్టముంటే గృహస్థాశ్రమానికీ, లేకుంటే వానప్రస్థానికీ, సన్యాసాశ్రమానికి వెళ్ళవచ్చు. లేకుంటే గురువుగారి దగ్గరే ఉండవచ్చు

అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేష్వధోక్షజమ్
భూతైః స్వధామభిః పశ్యేదప్రవిష్టం ప్రవిష్టవత్

అగ్ని యందూ గురువు యందూ తనలోనూ సర్వభూతముల యందూ శ్రీమన్నారాయణున్ని చూడాలి. ఆయా భూతములలో పరమాత్మ ప్రవేశించి ఉన్నాడని తెలుసుకోవాలి. తాన్ ఎందులోనూ ప్రవేశించకుండా ప్రవేశించనట్లే ఉండాలి. అన్ని కోరికలూ కోరుతున్నట్లే ఉండాలి గానీ కోరకూడదు. పని చేస్తున్నప్పుడు అజ్ఞ్యానుల కన్నా ఎక్కువ వ్యామోహం ఉందేమో అన్నట్లు చేయాలి, కానీ ఫలితం మీద ఆసక్తి ఉండకుండా అంతటా పరమాత్మను చూడాలి

ఏవం విధో బ్రహ్మచారీ వానప్రస్థో యతిర్గృహీ
చరన్విదితవిజ్ఞానః పరం బ్రహ్మాధిగచ్ఛతి

బ్రహ్మచారి, వానప్రస్థుడు సన్యాసీ గృహస్థుడు, తెలియ వలసిన వాటిని గురించి బాగా తెలుసుకుని పరమాత్మని పొందుతారు

వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్మునిసమ్మతాన్
యానాస్థాయ మునిర్గచ్ఛేదృషిలోకముహాఞ్జసా

ఇక వాన ప్రస్థాన్ని గురించి పొందుతాడు. ఈ ధర్మం ఆచరించిన వారు ఋషిలోకం పొందుతారు. 

న కృష్టపచ్యమశ్నీయాదకృష్టం చాప్యకాలతః
అగ్నిపక్వమథామం వా అర్కపక్వముతాహరేత్

దున్ని చేసి వండిన దాన్ని తినకూడదు. సహజముగా ఉన్న ఆహారాన్నే తినాలి, అది కూడా ఏ సమయములో భోజనం చేయాలో ఆ సమయములోనే చేయాలి. సహజముగా అగ్నితో పండిన పండుగానీ, పండని కాయలు కాఈ, సూర్యభగవానుని చేత వండబడినదాన్ని తినాలి

వన్యైశ్చరుపురోడాశాన్నిర్వపేత్కాలచోదితాన్
లబ్ధే నవే నవేऽన్నాద్యే పురాణం చ పరిత్యజేత్

అడవిలో సహజముగా పండిన వాటినే హోమములో పురోడాశముగా అర్పించాలి. ఒక వేళ కొత్త ఆహారం దొరికితే కొత్త ఆహారం తిని పాత ఆహారం దాచుకోరాదు. కొత్త ఆహారం దొరికితే పాత ఆహారాన్ని వదలాలి. 

అగ్న్యర్థమేవ శరణముటజం వాద్రికన్దరమ్
శ్రయేత హిమవాయ్వగ్ని వర్షార్కాతపషాట్స్వయమ్

అగ్ని చల్లారబడకుండా ఉండటానికి పర్ణశాల కట్టుకుని ఉండాలి. తాను మంచుకు గానీ గాలికి గానీ వర్షాలకు గానీ అగ్నికి కానీ సహించగలవాడిగా ఉండాలి. పర్వత గుహలో ఉన్నా ఆశ్రమం కట్టుకుని ఉన్నా దానిలో అగ్ని ఉండాలి. 

కేశరోమనఖశ్మశ్రు మలాని జటిలో దధత్
కమణ్డల్వజినే దణ్డ వల్కలాగ్నిపరిచ్ఛదాన్

శరీరానికి ఏ వ్యాధి వస్తుందో అని భయపడరాదు. కేశములూ రోమములూ నఖములూ మీసములూ గడ్డములూ (ఇవన్నీ శరీరం యొక్క మలాలు) వీటిని ధరించాలి. ఇలా పెంచడము వలన శరీరం మీద మోజు తగ్గుతుంది. మండలం జింక చర్మం నారవస్త్రములూ అగ్నీ ఇవన్నీ ధరించి

చరేద్వనే ద్వాదశాబ్దానష్టౌ వా చతురో మునిః
ద్వావేకం వా యథా బుద్ధిర్న విపద్యేత కృచ్ఛ్రతః

పన్నెండు గానీ ఎనిమిది కానీ నాలుగేళ్ళుగానీ తిరిగి తరువాత సన్యాసాశ్రమం తీసుకోవలి. తనకు ఇబ్బంది కాకుండానే వానప్రస్థాన్ని తీసుకోవాలి. సన్యాసాశ్రం మీద కోరిక పుట్టేంతవరకూ వానప్రస్థం.

యదాకల్పః స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాథవా
ఆన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికమ్

శరీరం సహకరించకపోతే వానప్రస్థం స్వీకరించకూడదు. ఇంటిలోనే గృహస్థాశ్రమములో ఉండి ఉపవాసాలతో శరీరం కృశింపచేస్తూ కోరికలను జయించాలి

ఆత్మన్యగ్నీన్సమారోప్య సన్న్యస్యాహం మమాత్మతామ్
కారణేషు న్యసేత్సమ్యక్సఙ్ఘాతం తు యథార్హతః

అగ్నిని తనలో ఉంచుకొని, తనలో అగ్నిని ఆవాహన చేసుకుని అహంకార మమకారాలను వదిలి, కారణములను కార్యాలలో ఉంచాలి. అర్థాలను ఇంద్రియాలలో, ఇంద్రియాలను మనస్సులో, మనస్సును ప్రాణములో, ప్రాణమును వాక్కులో ఉంచాలి. 

ఖే ఖాని వాయౌ నిశ్వాసాంస్తేజఃసూష్మాణమాత్మవాన్
అప్స్వసృక్శ్లేష్మపూయాని క్షితౌ శేషం యథోద్భవమ్

ఇంద్రియములను ఆకాశములో, ఆకాశాన్ని వాయువులో వాయువును తేజస్సులో తేజస్సును జలములో జలముని పృధ్విలో. శరీరాన్నీ, శరీరములో ఇంద్రియాలను విడిచిపెట్టాలి. నిట్టూర్పులను వాయువులో, శరీరములో ఉన్న తేజస్సును అగ్నిలో నెత్తురూ మలమూ శ్లేషమునూ జలములో ఉంచాలి, మిగిలిన దాన్ని భూమిలో ఉంచి, వాకును అగ్ని యందు ఉంచి, మాటను ఇంద్రుని యందు, పని చేయుటని ఇంద్రుని యందు ఉంచి, గత్యాదులని వ్యాకరణములో ఉంచి, ఉపస్థని ప్రజాపతులలో ఉంచి, పాయువును మృత్యువు యందు, ఏ ఏ ఇంద్రియములకు ఏ ఏవి అవయములో వాటియందు ఉంచి.

వాచమగ్నౌ సవక్తవ్యామిన్ద్రే శిల్పం కరావపి
పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ

మృత్యౌ పాయుం విసర్గం చ యథాస్థానం వినిర్దిశేత్
దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శేనాధ్యాత్మని త్వచమ్

దిక్కుని శ్రోత్రములో, త్వక్కును ఆధ్యాత్మలో ఉంచి, రూపాన్ని చక్షువులో ఉంచి, చక్షువుతో బాటు రూపాన్ని అగ్నిలో ఉంచి, జిహ్వను జలములో, ఘ్రాణాన్ని భూమిలో, మనసును చంద్రునిలో, 

రూపాణి చక్షుషా రాజన్జ్యోతిష్యభినివేశయేత్
అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్యసేత్

మనో మనోరథైశ్చన్ద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే
కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతాక్రియా
సత్త్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే

బుద్ధిని శుక్రునిలో ఆధ్యాత్మ కర్మలను రుద్రునిలో, (నేను నాది అన్న భావము వచ్చే అహంకారానికి శివుడు అధిష్ఠాన దేవత, అంతఃకరణాన్ని ఆయనలో ఉంచి) మనసుని సత్వగుణముతో జీవుని యందు ఉంచి, ఆ క్షేత్రజ్య్నున్ని (జీవున్ని) పరమాత్మలో న్యాసం చేయాలి

అప్సు క్షితిమపో జ్యోతిష్యదో వాయౌ నభస్యముమ్
కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తేऽక్షరే చ తత్

ఇలా భూమిని నీటిలో, నీటిని అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువుని ఆకాశములో, ఆకాశముని మహత్ తత్వములో, మహత్తును ప్రకృతిలో, ప్రకృతి జీవునిలో, జీవున్ని పరమాత్మలో న్యాసం చేయాలి.

ఇత్యక్షరతయాత్మానం చిన్మాత్రమవశేషితమ్
జ్ఞాత్వాద్వయోऽథ విరమేద్దగ్ధయోనిరివానలః

ఇలా అక్షరరూపముగా చిన్మాత్రముగా జ్ఞ్యనరూపముగా భేధములేకుండా తెలుసుకుని తనను తాను విరమించుకోవాలి. కట్టెలన్నీ ఐపోయినప్పుడు అగ్ని తనకు తాను చల్లారినట్లుగా అవ్వాలి. ఇలా పరమాత్మను ఆరాధించాలి.

Popular Posts