Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం
నారాయణ కవచం
దధీచి మహర్షికి (అంగిరసుని సంతానం) వచ్చిన విద్య ఈ నారాయణ కవచం. మంత్రమెప్పుడూ రహస్యముగా ఉంటుంది. దీనినే హయగ్రీవ బ్రహ్మవిద్య అంటారు. పరమాత్మ స్వరూపాన్ని బోధించేది. ఆయన దగ్గరకు అశ్వనీ దేవతలు వెళ్ళి వారికీ విద్య ఉపదేశించమని కోరగా తాను యజ్ఞ్యములో ఉన్నానని, తరువాత రమ్మని చెప్తాడు దధీచి మహర్షి. ఈ విషయం ఇంద్రుడు తెలుసుకున్నాడు. ముందు తనకు తెలుపవలసినదని ఇంద్రుడు దధీచిని కోరాడు. మళ్ళీ అదే సమాధానమిచ్చాడు ధధీచి. ఇంద్రుడు ఆ విద్యను తనకు చెప్పకుండా ఎవరికీ చెప్పరాదని, చెప్తే ఆయన శిరస్సును ఖండిస్తానని శాసించి వెళ్ళాడు. యజ్ఞ్యము పూర్తికాగానె శిష్యులైన అశ్వనీ దేవతలు ధధీచి వద్దకు వెళ్ళి ఆ విద్య కోరగా ధధీచి జరిగిన విషయం చెప్పారు. శిరస్సు ఇంద్రుడు ఖండిస్తాడని భయపడవలదని, ఆయన శిరస్సు కాపాడటానికి ప్రస్తుతం ఉన్న శిరస్సును మేమే ఖండించి, వేరే శిరస్సు ఉంచి, హయగ్రీవ విద్యను నేర్చుకుని, ఇంద్రుడు శిరస్సును ఖండించగానే అసలు తలను అతికిస్తామని చెప్పారు. అశ్వనీ దేవతలు ఆయన తల తీసి ఒక గుఱ్ఱం తలని ఆయన తల స్థానములో పెట్టారు. గుఱ్ఱం తలతో ఉపదేశించబడినది కాబట్టి అది హయగ్రీవ బ్రహ్మవిద్య అయ్యింది. ఇంద్రుడు తరువాత ఆ శిరస్సును ఖండించాడు. అలా చేసాడు కాబట్టి ఆయననుండి ఇంద్రునికి ఆ విద్య ధధీచి నుండి రాలేదు. ఇంద్రుడు అదే నారాయణ కవచాన్ని విశ్వరూపుడి నుంచి నేర్చుకున్నాడు. విశ్వరూపుడు ఈ నారాయణ కవచాన్ని ఇంద్రునికి ఉపదేశించాడు.

శ్రీరాజోవాచ
యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్రిపుసైనికాన్
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్

ఏ బ్రహ్మ విద్యను నేర్చుకుని సహస్రాక్షుడైన ఇంద్రుడు వాహనములతో కూడిన సైన్యాన్ని ఓడించాడు. (యోద్ధ కంటే వాహనం ముఖ్యం, శత్రువును శారీరకముగా కాకుందా మనాసికముగా పరాజితున్ని చేయాలంటే వారి రథాన్ని పడగొట్టాలి) సునాయాసముగా గెలిచాడు. మన శక్తి సామర్ధ్యాల కంటే మంత్ర శక్తి గుర్వనుగ్రహం ఎన్నో రెట్లు ఎక్కువ. ఆడుకొంటున్నట్లుగా తెలిచాడు, త్రైలోక్య లక్ష్మిని దేనితో అందుకున్నాడో

భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్
యథాతతాయినః శత్రూన్యేన గుప్తోऽజయన్మృధే

గురువర్యా ఆ కవచాన్ని మాకు ఉపదేశించండి. ఇంద్రుడు శత్రువులను ఏ విద్యతో గెలిచాడో అది చెప్పండి. అలాంటి శత్రువులు (ఇంద్రియాలు) నాకు కూడా ఉన్నారు.

శ్రీబాదరాయణిరువాచ
వృతః పురోహితస్త్వాష్ట్రో మహేన్ద్రాయానుపృచ్ఛతే
నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు

పురోహితుడిగా వరించబడ్డ త్వాష్ట్రుడు (త్వష్ట యొక్క పుత్రుడు) అడుగుతున్న ఇంద్రునికోసం నారాయణమనే కవచాన్ని ఉపదేశించాడు. అది నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. ఇది మహామంత్రము కాబట్టి దీని యందే మనస్సు ఉంచి ఈ కవచాన్ని శ్రద్ధగా విను.

శ్రీవిశ్వరూప ఉవాచ
ధౌతాఙ్ఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః
కృతస్వాఙ్గకరన్యాసో మన్త్రాభ్యాం వాగ్యతః శుచిః

ఒక మహామంత్రాన్ని వినడానికి ముందు కాళ్ళూ చేతులూ కడుక్కోవాలి. కడుగుకొని, ఆచమనం చేసి, చేతికి దర్భలు వేసుకు కూర్చోవాలి. ఉత్తరముఖముగా కూర్చోవాలి. ఇది మంత్రం కాబట్టి, మంత్రాన్ని జపించాలంటే అంగన్యాస కర్న్యాసములు మంత్రములతో చేయాలి. నారయణ మంత్రం మూడు రకాలు. అష్టాక్షరీ షడక్షరీ ద్వాదశాక్షరి.  ఏదైన రెండు మంత్రాలతో అంగన్యాస కరన్యాసములు చేయాలి. ఏ మంత్రం జపిస్తున్నా పారాయణ చేస్తున్నా మధ్యలో వేరే విషయాలు మాట్లాడకూడదు. మనసులో వేరే ఆలోచనలు ఉండకూడదు, అంటే శుచిగా ఉండాలి.

నారాయణపరం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే
పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి

భయమొచ్చినప్పుడు ఈ నారయణమయమైన కవచాన్ని కట్టుకోవాలి. సంసారములో ఉన్నవాడు తప్పకుండా నారాయణ కవచాన్ని బాగా కట్టుకోవాలి. లౌకిక కవచం కంఠం నుండి నాభి వరకే ఉంటుంది. కానీ ఈ కవచం శరీరం మొత్తం ఉంటుంది. పాదములూ, మోకాళ్ళు, తొడలు, ఉదరం, హృదయం, వక్షస్థలం, ముఖమునంది, శిరస్సు నందూ

ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా

ఓం నమో నారాయణాయ. ఎనిమిది అక్షరాలను ఈ ఎనిమిది అవయవాలలో (పాదములూ, మోకాళ్ళు, తొడలు, ఉదరం, హృదయం, వక్షస్థలం, ముఖమునంది, శిరస్సు నందూ) ఉంచాలి. వీటితో న్యాసం చేయాలి. లేదా పాదములనుంచి శిరస్సు దాకా లేదా శిరస్సు నుండి పాదముల దాకా కూడా న్యాసము చేయాలి.

కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా
ప్రణవాదియకారాన్తమఙ్గుల్యఙ్గుష్ఠపర్వసు

కరన్యాసం ద్వాదశాక్షరితో చేయాలి. అంగన్యాసం అష్టాక్షరితో కరన్యాసం ద్వాదశాక్షరితో చేయాలి.
అంగుళి  అంగుష్ఠం. ఓం నుంచీ మొదలుపెట్టి

న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా న్యసేత్

హృదయములో ఓంకారాన్నీ, మూర్ధకు వికారం, రెండు కనుబొమ్మల మధ్య షకారం, శిఖలో నకారం, వేకారం నేత్రములయందు, ణకారం అన్ని సంధులలో ఉంచాలి.

వేకారం నేత్రయోర్యుఞ్జ్యాన్నకారం సర్వసన్ధిషు
మకారమస్త్రముద్దిశ్య మన్త్రమూర్తిర్భవేద్బుధః

మకారం అస్త్రాయ ఫట్. అని తనలో తాను న్యాసం చేసి. జపం చేసేప్పుడు జపం వేరు తాను వేరు అన్న భావం విడిచిపెట్టాలి. ఆ దేవతా మూర్తే మనం కావాలి. అప్పుడే ఆ మత్రాన్ని జపించే యోగ్యత వస్తుంది. తాను మంత్రం కావడానికి ఏర్పరచబడినవే అంగన్యాస కరన్యాసములు.

సవిసర్గం ఫడన్తం తత్సర్వదిక్షు వినిర్దిశేత్
ఓం విష్ణవే నమ ఇతి

నమః కారముతో ఎనిమిది దిక్కులలో దిగ్బంధం చేయాలి.

ఆత్మానం పరమం ధ్యాయేద్ధ్యేయం షట్శక్తిభిర్యుతమ్
విద్యాతేజస్తపోమూర్తిమిమం మన్త్రముదాహరేత్

పరమాత్మను ధ్యానం చేయాలి. జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగిన స్వామిని ధ్యానం చేయాలి. విద్య తేజస్సు తపస్సు మూర్తీభవించిన మంత్రాన్ని ఉచ్చరించాలి. మన శరీరములో ప్రతీ అవయవం దేనికి ప్రతీకో దన్ని పరమాత్మ ఏ రూపముతో సృష్టించాడో ఆ రూపములో ఉన్న పరమాత్మ ఆ అవయవాన్ని కాపాడాలి. పరమాత్మ విశ్వరూపములో కేశవుడు అందమైన కేశములు కలవాడు, కేశి అన్న రాక్షసుడిని సంహరించిన వాడు, అలాగే అజ్ఞ్యః అన్న నామముతో పరమాత్మ భక్తులు చేసే తప్పులు తెలియని వాడు. అలా పరమాత్మ ఏ ఏ రూపాలలో ఏ ఏ అవయవాలని సృష్టించాడో ఆయా రూపాలలో ఆయనే మనను కాపాడు గాక.

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాఙ్ఘ్రిపద్మః పతగేన్ద్రపృష్ఠే
దరారిచర్మాసిగదేషుచాప పాశాన్దధానోऽష్టగుణోऽష్టబాహుః

పరమాత్మ నాకు అన్ని వైపుల నుండీ రక్షణ కల్పించు గాక. మనకొచ్చే విఘ్నాలన్నిటికీ కారణం, భయాలకీ కారణం, ఆపదలకీ కరణం మన పాపాలే. పరమాత్మ నామాన్ని స్మరించి భయ విఘ్న ఆపద రూపములో ఉన్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాము. గరుత్మంతుని వీపు మీద పాదములు పెట్టి కూర్చున్న హరి. అంటే రావడానికి సిద్ధముగా ఉన్న హరి. మనకు ఆపదలు రాక ముందే వచ్చి కాపాడే అవతారం హరి. హరి అనేది ఒక అవతారం. ఆ అవతారములోనే స్వామి గజేంద్రున్ని కాపాడాడు. గరుడుని మీద పాదములుంచి ప్రయాణానికి సిద్ధముగా ఉన్న హరి. నారాయణ కవచములో నామ భూష ఆయుధ వాహనాలున్నాయి. వీటిలో ఏ ఒక్కటి స్మరించినా మంత్ర స్మరణే అవుతుంది.
అష్ట గుణములూ అష్ట బాహువులు. ఇక్కడ గుణమంటే ఆయుధాలు. (మనకు కూడా గుణాలు ఆయుధాలే. ఆయుధమంటే మననున్ కాపాడేది, పక్కవారి బలాన్ని తగ్గించేది. మంచి గుణములతో చెడ్డవారిని కూడా గెలవవచ్చు.)
పరమాత్మకు ఎనిమిది గుణములు ఎనిమిది ఆయుధాలు ఉన్నాయి. పరమాత్మకు (ఆత్మకు) కూడా ఎనిమిది లక్షణాలుంటాయి.
వెన్న దొంగతనం చేస్తున్న కృష్ణున్ని వారించాలని గోపికలు వెన్నకుండను ఉట్టిమీద  పెట్టారు. అప్పుడు కృష్ణుడు పైకెక్కి, రెండు చేతులతో గంటలను, రెండు చేతులతో కుండను, ఇంకో రెండు చేతులతో పక్కనున్నవారికి పెడుతూ, ఇంకో రెండు చేతులతో తాను తిన్నాడు.
పరమాత్మ అష్ట గుణః అష్ట బాహుః

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిర్యాదోగణేభ్యో వరుణస్య పాశాత్
స్థలేషు మాయావటువామనోऽవ్యాత్త్రివిక్రమః ఖేऽవతు విశ్వరూపః

ఇక్కడ మాయావటువు అంటే అమ్మ వారు కూడా ఉన్నారు అని అర్థం. బలిని కాపాడేందుకే అమ్మవారు కూడా వామనావతారములో వచ్చారు. ప్రహ్లాదుని వంశములో ఎవరినీ చమప్నూ అన్న స్వామి వరం నిలబెట్టడానికే స్వామితో అమ్మవారు వచ్చారు. వామనుడిగా వచ్చి యాచించాడు. పిల్లల మీద తల్లితండ్రులకుండే ప్రేమను చూపించిన అవతారం వామనావతారం. ఈ వామనుడి రెండవ రూపమే త్రివిక్రముడు. బలి చక్రవర్తి చేతిలోంచి దానజలము భూమిని తాకేలోపే స్వామి ఆకాశాన్ని తాకాడు. వి అంటే పాదం, క్రమ అంటే అడుగు వేయుటు. అడుగు యొక్క కదలిక విక్రమః. ఆయన ఒక్క అడుగుకు భూమి, రెండవ అడుగుకు ఆకాశం. ఆయన్ త్రివిక్రముడు కావాలంటే మూడవ అడుగుకు స్థలమే లేదు. తన విశ్వవ్యాపకత్వం, సకల జగత్తుకూ అధినాయకత్వం చాటాడు.  దురాశను ళండించిన అవతారం త్రివిక్రమావతారం. భూమి మీద వామనుడు కాపాడాలి, త్రివిక్రముడు ఆకాశములో కాపాడాలి. ప్రపంచం తన రూపముగా ఉన్న త్రివిక్రముడు ఆకాశము నుండి వచ్చే ప్రమాదాల నుండి కాపాడాలి.

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోऽసురయూథపారిః
విముఞ్చతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః

దుర్గేషు అటవి ఆజిముఖేషు - దుర్గములలో అరణ్యములలో యుద్ధములలో నరసింహుడు కాపాడాలి. నరుడు దుర్గాలలో సింహం అరణ్యములో కాపాడాలి. యుద్ధములో నారసింహుడు కాపాడాలి. ద్వంద్వ యుద్ధములో నారసింహుని మించిన వీరుడు లేడు. హిరణ్యకశ్యపుడు తన చుట్టూ దుర్గాన్ని నిర్మించుకున్నాడు దేని ద్వారా మరణము రాకుండా. మన బుద్ధికి అందని మహాపద వస్తుంది. అలాంటప్పుడు నరసింహున్ని తలచుకుంటే ఆయన మనకు సమయస్పూర్థిని ప్రసాదిస్తాడు. మనం నిరంతరం యుద్ధరంగములో ఉన్నాము.
అసురయూథపారిః - రాక్షసైన్యాధిపతికి శత్రువు. మన ఇంద్రియములు ఎప్పుడూ ఆసురీ ప్రవృత్తితో ఉంటాయి. వాటిని స్వామి తొలగిస్తాడు. ఇంద్రియ జయం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాన్ని సూచించడానికి స్వామిని అసుర యూధపారి.
విముఞ్చతో యస్య మహాట్టహాసం - నాస్తిక వాదాన్ని ఖండించిన స్వామి నారసింహుడు. అన్ని దిక్కులూ చిల్లుపడ్డాయి ఆయన అట్టహాసము వలన. ఆయన మహాట్టహాసానికి గర్భములన్నీ ప్రసవించాయి. స్వామి కనపడీ కాపాడతాడు, వినపడీ కాపాడతాడు. హిరణ్యకశ్యపుని సైన్యములో చాలామంది స్వామి అట్టహాసానికే హతులయ్యారు. నారసింహుడు షోడశ భుజుడు. పదహారు భుజాలూ పదహారు ఆయుధాలు. మన ఇంద్రియాలు, పంచ జ్ఞ్యానేంద్రియములూ, పంచ కర్మేంద్రియములూ, పంచ తన్మాత్రలు, మనసూ కలిపి పదహారు. పరమాత్మ జీవున్ని ఎలా వశం చేసుకుంటాడు? మన సైన్యాన్ని వశం చేసుకుంటాడు. పదహారు ఇంద్రియాలనూ వశం చేసుకోవడానికి పదహారు భుజాలతో వస్తాడు. మన ఇంద్రియ వ్యాపారాన్ని నియంత్రించేవాడు, దారిలోపెట్టేవాడు నరసింహుడు. ఈ మంత్రం చదివేప్పుడు ఆయన గుణాలని స్మరిస్తూ చదవాలి. ఆయన ప్రళయభయంకరత్వం, దుష్టజన శిక్షకత్వ, ఆశ్రిత రక్షణ, ఆశ్రిత వ్యామోహం, ఇవన్నీ నారసింహావతారములో ఉన్నాయి.

రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః
రామోऽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోऽవ్యాద్భరతాగ్రజోऽస్మాన్

జలమూ ఆకాశమూ దుర్గములలో అడవులలో రక్షణ కల్పించుకున్న తరువాత, ఇక ఆకడికి వెళ్ళే దారినీ దారిలో వెళ్ళే మననూ కాపాడే వాడు యజ్ఞ్య వరాహ స్వామి. వరాహ స్వామి, దారినీ, దారిలో వారినీ కాపాడాలి. సముద్రములో మునిగి ఉన్న భూమిని పైకి తేవడానికి అవతరించాడు స్వామి. భూమిని తీసుకు వస్తుంటే ఒక రాక్షసుడు అడ్డుపడ్డాడు. అంటే భూమిని జలము నుండీ, హిర్ణ్యాక్షుని నుండీ కాపాడాలి. పరమాత్మ భూమిలో కాపాడాలి, భూమినీ కాపాడాలి. తన ఒక కోరతో భూమిని లేపాడు. ఆ కోరమీదనే భూమండలాన్ని నిలిపాడు. వరాహవతారములో స్వామి భూదేవిని ముద్దుపెట్టుకున్నాడు. వారికి నరకాసురుడు పుట్టాడు. ఈ ఉదంతముతో స్వామి మనకు బోధిస్తున్నాడు. భార్యా భర్తలు మంచి వారే కావొచ్చు, వారి ప్రేమకూడా మంచిదే కావొచ్చు, గానీ వారి మీద దుష్ట దృష్టి పడకుండా చూసుకోవాలి. హిరణ్యాక్షుని దృష్టి సోకింది వారి మీద.
నగరాన్నీ గ్రామాన్ని వదిలి అడవికి వెళ్ళినప్పుడు కొండలలో కోనలలో విప్రవాసాలలో మనను కాపాడేవాడు లక్ష్మణుడితో కూడి ఉన్న భరతాగ్రజుడైన రాముడు. రాముడితో బాటు అడవిలో ఉన్నంతకాలం వెంట ఉన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడంటే ఆదిశేషుడు, పరంభాగవతోత్తముడు. భరతుడంటే శంఖం, ప్రణవం. అడవికి ఒంటిగా వెళ్ళరాదు. ఆదిశేషుని వెంటతీసుకుని అడవికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. ఆదిశేషుడంటే పరమభాగవతోత్తముడు. వారి ఆశీర్వాదముతోనే మనం ప్రయాణం చేయాలి.

మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదాన్నారాయణః పాతు నరశ్చ హాసాత్
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబన్ధాత్

శ్రీమన్నారాయణుడు కాపాడాలి. ఉగ్రధర్మాలనుండి, అభిచారహోమములనుండి. మనలో ఉగ్రధర్మం కలకూడదు. ఎదుటివారు అభిచారాలు చేస్తే నారాయణుడు కాపాడాలి. అందరూ పరమాత్మ రూపాలే అన్న ఎరుక ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడు.
ఎదుటివారిని పరిహాసం హేళన చేసి తృప్తి పొందడం భయంకరమైన పాపం. అలాంటి వారిని బాగు చేసే వాడు నరుడు. సహస్రకవచుడనే రాక్షసున్ని చంపడానికి నర నారాయణులు అవతారం ఎత్తారు.
దత్తః అయోగాత్: యోగనాధుడు దత్తాత్రేయుడు, యోగ్యులు కాని వారికి యోగం అందచేయకుండా వచ్చిన అవతారం దత్తత్రేయావతారం. రహస్యం తెలియని వారికి అందకుండా ఉండటానికి తెలిసిన వారికి దగ్గరవడానికి వచ్చిన అవతారం దత్తాత్రేయావతారం. నాలుగు కుక్కలు నాలుగు వేదాలు, ఎనిమిది మంది వేశ్యలు ఎనిమిది అణిమాది అష్టసిద్ధులు, ఆరు సురాపాత్రలు జ్ఞ్యానాది షడ్గుణములు. మన మనస్సు చలించకుండా ఉండడానికి సేవించాల్సింది దత్తాత్రేయున్ని. కార్త్వీర్యార్జునికీ, ప్రహ్లాదునికీ అలర్కుడికీ పరశురామునికీ గురువు దత్తాత్రేయులే. యోగమును బోధించడం కంటే ఎవరెవరు యోగం జోలికి రాకూడదో వారినుంచి యోగాన్ని కాపాడాడు. అందుకే దత్తుడు యోగము లేని స్థితి నుండి కాపాడాలి. జీవాత్మ పరమాత్మతో ఉండడమే యోగం. పరమాత్మ నుండి కలిగే వియోగం నుండి కాపాడాల్సిన వాడు దత్తాత్రేయుడు.
పాయాత్ గణేశః (గుణేశః) కపిలః కర్మబంధాత్ - కపిలుడు మనకు సాంఖ్యమును బోధించి, గణములకూ గుణములకూ రెంటికీ అధిపతి కపిలుడు. ఇరవై నాలుగు గణాలు సాంఖ్య గణములు, గనేశ. గుణేశః అంటే త్రిగుణాలకూ అధిపతి.

సనత్కుమారోऽవతు కామదేవాద్ధయశీర్షా మాం పథి దేవహేలనాత్
దేవర్షివర్యః పురుషార్చనాన్తరాత్కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్

మొదట ప్రదేశముల నుండి రక్ష, తరువాత అయోగముల గురించి కాపాడమని, గుణాల నుండి కాపాడమని రక్ష. బయట నుంచి వచ్చే ఆపదలూ, లోపల నుండి వచ్చే ఆపదలు (హాసం, అపహాసం, హేలన, అయోగం, హేలన) అని రెండు రకములు. కర్తృత్వాభిమానం నుండి కపిలుడు కాపాడాలి.
సనత్కుమారుడు కామదేవుడి నుండి కాపాడాలి. ఐదేండ్ల పిల్లవాడిగా ఉన్నవాడు ఎన్ని యుగాలైనా. కోరికలు కలగడానికి కూడా యోగ్యమైన వయసు లేని వాడు సనత్కుమారుడు. కాల ప్రభావం లేని వాడు. అటువంటి కాల ప్రభావం మన మీద రాకుండా ఉండాలంటే సనత్కుమారున్ని ప్రార్థించాలి.
హయశీర్షము గల రాక్షసుడు బ్రహ్మగారు నిదురపోయినపుడు ఆయన నిశ్వాస నుండి వేదాలను లాక్కొన్నాడు. అలా లాక్కొని బ్రహ్మగారిని అవహేళన చేసాడు.
ఇలా బ్రహ్మను అపహసించినందుకు ఈ అవతారం వచ్చింది. వేదాలను అపహరించినందుకు కాదు. దేవహేళనానిన్ని ఖండించడానికి వచ్చిన అవతారం. సోమకుడనే అసురుడు బ్రహ్మ నుండి తనకు తనలాంటి వాడిచేతే మరణం పొందాలని వరము పొంది ఆ వరమిచ్చినందుకు వికటాట్టహాసం చేసి బ్రహ్మను హేళనం చేసాడు. ఎప్పుడూ మనకొచ్చే సంకల్పానికి అనుగుణమైన రూపం ఒక చోట వచ్చే ఉంటుంది. మనలో ఎప్పుడూ ఉన్నదే పుడుతుంది. నాలాంటి ఆకారముతో ఉన్నవాడితోనే మృత్యువు రావాలని కోరాడంటే అలాంటి రూపం ఒక చోట వచ్చే ఉంటుంది. ఇలా బ్రహ్మనూ హేళనం చేసాడు. హయగ్రీవ అవతారం రావడానికి నారదుడు శివ కేశవ యుద్ధం కల్పించాడు. దాని వలన వచ్చింది హయగ్రీవ అవతారం. పెద్దలనూ, దేవతలనూ, మహానుభావులనూ అవమానించడము కన్నా పాపం లేదు. దీన్ని పోగొట్టాలంటే దానికోసం వచ్చిన స్వామే పోగొట్టాలి. అందుకు మనను హయగ్రీవుడు దేవహేళనము నుండి కాపాడాలి.

నారదుడు, పురుష అర్చన అంతరాత్, నుండి కాపాడాలి. భగవంతుని ఆరాధించడములో కలిగే విఘ్నములనుండి కాపాడాలి. నారదుడూ నిరంతరం భగవంతుని నామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. భగవదారాధనా విఘ్నాన్ని పోగొట్టేవాడు నారదుడు. నారదుడు ముందు జన్మలో దాసీ పుత్రునిగా పుట్టి  చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చాత్రుమాస్యము చేసుకుంటున్న మహాత్ముల దగ్గర ఉండి భగవంతున్ని ఆరాధించడం నేర్చుకున్నాడు. అందుకు పరమాత్మను ఆరాధించే ముందు నారదున్ని స్మరిస్తే అంతరాలు రావు.

కూర్మావతారం అన్ని రకముల నరకముల నుండీ తొలగించాలి. అశేషాత్ నిరయాత్ మాం అవతు. నరకం నుంచి కాపాడేవాడు కూర్మము. నరకానికీ కూర్మానికి ఏమిటి సంబంధం? కూర్మావతారం మందర పర్వతాన్ని మునగకుండా చేసింది. ఈ సంసారమనే సముద్రములో మునగడానికి సిద్ధముగా ఉన్న మనమందరమూ మందర పరవతములమే. కూర్మము మందర పర్వతం మునగకుండా చేస్తుంది. కవ్వాన్ని చిలికేప్పుడు కవ్వం పూర్తిగా మునగకుండా, పూర్తిగా తేలకుండా ఉంటేనే వెన్న వస్తుంది. కొంత భాగం తేలుతూ ఉండాలి, కొంతభాగం మునిగి ఉండాలి. మనం కూడా సంసారములో ఉండాలి, పూర్తిగా పైకి రాకూడదు, పూర్తిగా మునగకూడదు. అందులో ఉన్నట్లే ఉంటూ మునగకుండా ఉండాలి. ప్రతీ పనీ మనం ఆచరించాలి.  జ్ఞ్యానం లేని వారు సాంసరిక ప్రక్రియల యందు, సాంసారిక ప్రక్రియల వలన కలిగే ఫలమునందు ఆసక్తితో వ్యవహరిస్తారు. జ్ఞ్యానులు పని చేస్తారు గానీ ఆశతో కోరికతో చేయరు. ధర్మం కాబట్టి చేస్తారు. జీవితములో అది ఒక భాగముగా  చేస్తారు గానీ అదే జీవితముగా చేయరు. జీవితములో సంసారం ఒక భాగం మాత్రమే. జ్ఞ్యానులు సాంసారిక ప్రక్రియలో ఆసక్తి లేకుండా ఉంటారు. కవ్వమంటే జ్ఞ్యాని. మునుగుతుంటుంది తేలుతుంటుంది, వెన్న మాత్రం వస్తుంది. కానీ ఆ కవ్వం ఆ వెన్నను ఏ మాత్రం తినదు. జ్ఞ్యాని కూడా తాను సంపాదించిన జ్ఞ్యానాన్ని ఏ కొంచెమూ మిగుల్చుకోకుండా అందరికీ పంచిపెడతాడు. ఈ మందర పర్వతం ములగకుండా కూర్మం కావలసి వచ్చింది. మనం పాపం బాగా చేస్తే సంసారములో మునుగుతాము. పాపమే కాదు, పుణ్యము చేసినా సరే సంసారములో మునుగాతము. నిరయాద్ అంటే నరకమనీ, స్వర్గమనీ కూడా అర్థం వస్తుంది.  మనను సంసారము యందు అనురక్తి కలిగించడములో నరకమూ స్వర్గమూ రెండూ సమానమే. ఈ కూర్మం రెంటినీ కాపాడుతుంది. కవ్వమన్న పేరుతో జీవాత్మనూ, సముద్రమన్న పేరుతో సంసారాన్ని, మునగడం అన్న పేరుతో స్వర్గమూ నరకమూ అన్న కామనలనూ. ఈ మూటినీ కలిపి కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. స్వర్గము నుంచీ నరకము నుంచీ కూర్మావతారం కాపాడాలి. అందుకే సంధ్యావందనములో కూర్చునే ముందు కూర్మ మంత్రాన్ని చదివి "ఆసనే వినియోగః" అంటారు. కూర్మము స్థైర్యానికి గుర్తు. మనం స్వర్గానికీ నరకానికీ పోకుండా ఉండాలంటే స్థిరత్వం ఉండాలి. మందర పర్వతం ఎంత లోతులో ఉంటే చిలకడానికి ఉపయోగిస్తుందో అంతే లోతు ఉంది. మరీ లోతుకు వెళ్ళకుండా ఉంది. అలాగే మనం కూడా సంసారములో ఉండాలి. మనమాచరించే కర్మల యొక్క శుభాశుభ ఫలితాలు పొందేవరకూ వద్దన్నా మనం సంసారములోనే ఉంటాము. ఆ అంటీ అంటకుండా ఉండే స్థితి కూర్మము యొక్క స్థితి.

ధన్వన్తరిర్భగవాన్పాత్వపథ్యాద్ద్వన్ద్వాద్భయాదృషభో నిర్జితాత్మా
యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాన్తాద్బలో గణాత్క్రోధవశాదహీన్ద్రః

అమృతాన్ని అందించినది ధన్వంతరి. ఈయన వైద్యుడు. మనం ఏవేవి తినకూడదో అవి తింటూ ఉంటాము. కప వాత పిత్తములకు ఎంతెంత అందాలో అంతంత అందాలి. అందించకూడని వాటిని అందించే పదార్థాలు మనం తీసుకునే ఆహారములో ఉంటాయి. తినకూడని వాటిని తినడము వలన వచ్చే దోషాన్ని ధన్వంతరి కాపాడాలి.
అందుకే భోజనం చేసే ముందు "అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం" అని అంటాము.
రోగమును పెంచే ఆహారమును తీసుకున్నా ఆ ఆహరం వలన వచ్చే దోషాల నుండి ధన్వంతరి కాపాడు గాక.
ఋషభుడు మహా యోగి. సంసారములో వచ్చీ పాపపుణ్యములని మనం అనుభవిస్తున్నాము. దాన్ని ఇప్పుడు తప్పించుకోవాలనుకున్నా, తరువాతైనా దాన్ని అనుభవించి తీరాల్సిందే. శరీరానికి ప్రకృతి ఇచ్చేది పడదు, విపరీతం కావాలి (వేసవి కాలములో చల్లగా ఉండాలని, చలి కాలములో వెచ్చగా ఉండాలని శరీరం కోరుతుంది). వీటిని ద్వంద్వములూ అంటారు. చలీ వేడీ ఆకలి దప్పి లాభాలాభములూ సుఖదుఃఖములూ, జంటలు. ఇవన్నీ శరీరానికే. ఆత్మకూ మనసుకూ కాదు. బాధపడి ప్రార్థించుట అజ్ఞ్యాని చేస్తాడు. వీటిని తట్టుకుంటాడు జ్ఞ్యాని. వృషభుడు దీన్నే చూపించాడు, వేసవిలో పంచాగ్నుల నడుమ తపస్సు చేసాడు. అలాంటి మనసుని గెలిచిన వృషభుడు "జంటల వలన" కలిగే భయం నుంచి కాపాడు గాక.
జనాంతమంటే అపవాదు. అపవాదులకు ఇష్టమైన లోకమునుండి యజ్ఞ్యుడు కాపాడుగాక. ఈ లోకం మనము ఎలా ఉన్నా అపవాదు కల్పిస్తూ ఉంటుంది. మౌనముగా ఉంటే మూగ వాడని, మాట్లాడితే వదరుబోతని, గంభీరముగా ఉంటే గర్విష్ఠీ అని, నిందించే ఈ లోకానికి తప్పు చేయని వాడెవ్వడూ కనపడడు. లోకమునుండి వచ్చే అపవాదులనుండి యజ్ఞ్య పురుషుడు కాపాడాలి.
గణాత్ - గుంపులు. మన మీద గుంపులుగా ఎవరైన దాడి చేస్తే దాని నుంచి బలరాముడు కాపాడాలి.
మనకు క్రోధము రాకుండా ఆదిశేషుడు కాపాడాలి. నిత్యమూ సంకర్షణ జపాన్ని చేస్తే కోపాన్ని గెలవగలము. మనలో కోపాన్ని మనం జయించాలంటే సంకర్షణున్ని జపించాలి. అందుకే సంధ్యావందనములో ప్రతీ రోజూ ఉదయం అచ్యుతా అనంతా గోవిందా అని చేస్తాము. శరీరము వలన మనసులో కలిగే వికారాలు తలెత్తవు. కోపమూ మోహమూ వ్యామోహమూ మొదలైనవి రాకుండా ఉంటాయి. మానసిక వికారాలు ఇరవై నాలుగు, కామానికి పది, క్రోధానికి ఎనిమిది,  మానసికమైనవి ఆరు. అందుకే ఈ ఇరవై నాలుగు వికారాలు తొలగించుకోవడానికి కేశవాది ఇరవై నాలుగు నామాలూ జపించాలి.

ద్వైపాయనో భగవానప్రబోధాద్బుద్ధస్తు పాషణ్డగణప్రమాదాత్
కల్కిః కలేః కాలమలాత్ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః

మనందరికీ జ్ఞ్యానం కలగడానికి ఆయన ఇన్ని పురాణాలు వ్రాశాడు. ఆయన మనకు జ్ఞ్యానం కలిగించు గాక.
యజ్ఞ్యమునూ ధర్మమును ఆచరిస్తూ అధర్మానికి మార్గాన్ని లేపిన వారి కొరకు బుద్ధావతారం వచ్చింది. ధర్మపు ముసుగులో అధర్మాన్ని ఆచరించే వారి ఆటకట్టించడానికి వారు చేసే కపట యజ్ఞ్య యాగాదులను ఆచరించకుండా వచ్చిన అవతారం బుద్ధావతారం. వాదములతో ప్రతీ వారి మనసును ఆకర్షించి వారాచరించే ధర్మాన్నుంచి వారు బయటకు వచ్చేట్లు చేసి వారిని సంహరించిన వాడు. పాషణ్డ గణం, తాము అధర్మం ఆచరిస్తూ, ధర్మం ఆచరించే వారి మనసును ఆకర్షిస్తుంది. అధర్మాన్ని బోధించే మాటలకు మనసు తొందరగా ఆకర్షింపబడుతుంది. బుద్ధుడు వారిలో అధర్మాన్నే పెంచి, వారిని శిక్షించి లోకకళ్యాణాన్ని చేకూర్చాడు.  ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని పాలద్రోలడమే మార్గం. ధర్మమను ముసుగులో అధర్మాన్ని ఆచరించేవారిని అణచడానికి వచ్చిన అవతారం బుద్ధుడు. అటువంటి బుద్ధుడు పాషణ్డ మతముల నుండి మమ్ము కాపాడుగాక.
కలి అంటే కలహం. ఇది కాలం యొక్క దోషం. దాన్ని పోగెట్టే పరమాత్మ అవతారం కల్కి. ఈ కల్కి కాల మలం నుండి కాపాడతాడు. ధర్మమును కాపాడటానికి అవతరించిన వాడు కలి.

మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్గోవిన్ద ఆసఙ్గవమాత్తవేణుః
నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తిర్మధ్యన్దినే విష్ణురరీన్ద్రపాణిః

పొద్దున్నే కాపాడేవాడు కేశవుడు. అందమైన జుట్టు గలవాడు, కేశి అన్న రాక్షసున్ని సంహరించినవాడూ, బ్రహ్మ రుద్రులకు మూలమైన వాడు అయిన కేశవుడు ప్రాతః కాలం కాపాడాలి. రజో గుణ తమో గుణాలను తగ్గించి సత్వ గుణమును వృద్ధి పొందించాలి. గదను ధరించిన కేశవుడు కాపాడాలి. గదను చేతిలో ధరించిన కేశవుడు ప్రాతఃకాలం కాపాడాలి. మాయకు గద ప్రతీక. మాయకు మూలం ఆయనే. ప్రాతఃకాలం మెలుకువ రావలసింది మనకు నిద్ర వస్తుంది. దానికి కారణం మాయ. దాన్ని పోగొట్టేవాడు కేశవుడు. కేశవాయానమః అనుకుంటూ లేవాలి. కేశవాయ గదాధరాయ నమః అనుకోవాలి.
(ప్రాతః సంగవ  మధ్యాహ్నం అపరాహ్నం రాత్రి అర్థ రాత్రి అపర రాత్రి)
సూర్యోదయానికంటే ముందు ఉండేది ప్రాతః కాలం. సూర్యోదయం నుండి రెండు ఘడియల వరకూ ఉండేది సంగమ (సంగవ - సం - గవ - గోవులను బయటక్ వదిలే కాలం) కాలం. ఈ కాలములో వేణువు ధరించిన గోవిందుడు కాపాడాలి.

దేవోऽపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్
దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోऽవతు పద్మనాభః

పరాహ్ణ కాలములో (రెండవ ఝాములో) నారాయణుడు కాపాడాలి, మధ్యందినం యందు చక్రం (అరి) ధరించిన విష్ణువు కాపాడాలి, అపరాహ్ణములో మధువు అనే రాక్షసున్ని చంపిన (మధుహా) మధుసూధనుడు కాపాడాలి. మనకు అహంకారం కోపం అపరాహ్నము పెరుగుతాయి. అందుకు ఆ సమయములో మనము "అన్నీ నాకే కావాలి" అన్న భావన రాకుండా అహంకారం రాకుండా, కోపం రాకుండా మధుసూధనుడు కాపాడాలి.
సాయంకాలం మాధవుడు కాపాడాలి. త్రిధామ అంటే భూః భువః సువః లేదా ఉదరమూ, హృదయ దహరాకాశమూ, ఉరస్సు (వక్షస్థలం). (స్వాహాకారములతో మనం తినేది అందుకునేది పరమాత్మే). త్రిధామములో ఉండే మాధవుడు మమ్ము కాపాడు గాక.
రాత్రి కాగానే (దోష సమయం) ఇంద్రియాలను అరికట్టే హృషీకేశుడు కాపాడాలి. అర్థరాత్రి, అపరరాత్రి పద్మనాభుడు కాపాడాలి. పద్మనాభుడు సృష్టికి ప్రతీక. సంభోగం కేవలం సంతానం కోసమే అవ్వాలి. భోగలాలసకు గురికాకుండా పద్మనాభుడు కాపాడాలి

శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోऽసిధరో జనార్దనః
దామోదరోऽవ్యాదనుసన్ధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్కాలమూర్తిః

అపర రాత్రములో శ్రీ వత్సము ధరించిన ఈశ్వరుడు కాపాడాలి. శ్రీ వత్సం అంటే అమ్మవారికి ఇష్టమైనది. అది చూసి అమ్మవారు స్వామిని ప్రేమించింది. అపరరాత్రములో మన మనసు వ్యభిచరించకుండా ఉండటానికి శ్రీవత్స ధామున్ని స్మరిచుకోవాలి. భార్య నుండి మనసు వేరే వైపు వెళ్ళకుండా ఉండేట్లు కాపాడేవాడు శ్రీవత్సధాముడు. ప్రత్యూష కాలములో (సూర్యోదయానికీ ఉదయ సంధ్యకీ మధ్య కాలం) జనార్ధనుడు ఖడ్గమును ధరించి మనసులో కలిగే కోరికలను ఖండించి కాపాడాలి. కడుపునకు తాడు గలవాడైన దామోదరుడు సంద్యా కాలములో కాపాడు గాక. ఈ దామోదరుడు భక్త పరవశుడు. సకల జగన్నాధుడు కాలమూర్తి విశ్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అన్ని వేళలా అన్ని కాలాలలో కాపాడాలి.

నామములూ భూషణములూ వాహనములూ అయిన తరువాత, ఇంక ఆయుధాలతో రక్ష.

చక్రం యుగాన్తానలతిగ్మనేమి భ్రమత్సమన్తాద్భగవత్ప్రయుక్తమ్
దన్దగ్ధి దన్దగ్ధ్యరిసైన్యమాశు కక్షం యథా వాతసఖో హుతాశః

ప్రళయ కాలాగ్ని వలే తీక్షణమైన అంచు గల చక్రం పరమాత్మ చేత ప్రయోగించబడి అంతటా తిరుగుతూ శత్రు సైన్యమునూ వేగముగా దహింపచేయాలి దహింపచేయాలి. ఎండు కట్టెల మోపును అగ్నిహోత్రుడు ఎలా కాలుస్తాడో అలా. అలా పరమాత్మ చేత ప్రయోగించబడిన చక్రం అగ్నిహోత్రుడు అరణ్యాన్ని దహించినట్లుగా దహించాలి. ఈ దందగ్ధి, దందగ్ధి అనేది అగ్ని బీజము మంత్ర శాస్త్రములో.

గదేऽశనిస్పర్శనవిస్ఫులిఙ్గే నిష్పిణ్ఢి నిష్పిణ్ఢ్యజితప్రియాసి
కుష్మాణ్డవైనాయకయక్షరక్షో భూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్

అశనిస్పర్శనవిస్ఫులిఙ్గే - విస్పులింగమంటే నిప్పు రవ్వలు. పిడుగుపాటు తాకిడికి వచ్చే నిప్పు రవ్వలను వెదజల్లే కౌమోదికీ అనే విష్ణు మూర్తికి ప్రియురాలైన గద భూత ప్రేత పిశాచ శాఖినీ ఢాకినీ కూష్మాండ దుష్ట గ్రహాలను పిండి చేయి పిండి చేయి.

త్వం యాతుధానప్రమథప్రేతమాతృ పిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్
దరేన్ద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోऽరేర్హృదయాని కమ్పయన్

శంఖమా! నీవు కృష్ణ పరమాత్మచే నింపబడి శత్రు హృదయాలను వణికిస్తూ భయంకరమైన ధ్వని కలిగి మన ప్రయత్నం లేకున్నా కోరకున్నా మనం చేసే తప్పుల వలన కొన్ని గ్రహాలు ప్రవేశిస్తూ ఉంటాయి (చీపురు రోకలి తిరగలి కత్తిపీట, కూరలను కోసాక విడిచిపెట్టిన తొడిమెలు, చాట, ఇవన్నీ భూతావాసములు. కత్తిపీట కుడి వైపు వంచి పెట్టాలి, తిరుగలి రెంటినీ వేరు చేసి పెట్టకూడదు. వీటితో కొన్ని లక్షల క్రిములను చంపుతూ ఉంటాము. ఇవే భూతములూ ప్రేతములూ మాత్రే గణములూ, కూష్మాండములు. ఇవే ఇంట్లో కలహాలనూ కోపాలనూ కలిగిస్తాయి. మనం చేసే అన్ని రకాల తప్పులకూ నారాయణ కవచం ప్రాయశ్చిత్తం).

త్వం తిగ్మధారాసివరారిసైన్యమీశప్రయుక్తో మమ ఛిన్ధి ఛిన్ధి
చక్షూంషి చర్మన్ఛతచన్ద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్

చర్మ అంటే డాలులాంటిది. ఇది గుండ్రముగా ఉన్న కత్తిలాంటిది. ఖడ్గరాజమా, శత్రు సైన్యమును నీవు పరమాత్మ చేత ప్రయోగించబడి శత్రుసైన్యాన్ని చేదించు. ఈ ఒక్క శ్లోకములోనే రెండు ఆయుధాలు. ఖడ్గం శత్రువులను ఖండించాలి. చర్మమా పాపపు చూపు గల శత్రువుల కళ్ళు కప్పేయి.

యన్నో భయం గ్రహేభ్యోऽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ
సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోऽంహోభ్య ఏవ చ

మాకు ఏ ఏ చోట్ల నుండీ ఏ ఏ ఆపదలు వస్తాయో వాటినుండి కాపాడు. గ్రహముల నుండి , కేతువుల నుండీ మానవుల నుండీ సర్పముల నుండీ దమ్ష్ట్రముల నుండీ పాపముల నుండీ

సర్వాణ్యేతాని భగవన్నామరూపానుకీర్తనాత్
ప్రయాన్తు సఙ్క్షయం సద్యో యే నః శ్రేయఃప్రతీపకాః

ప్రాణుల నుండి ఎన్ని రకాల భయములు ఉన్నాయో వాటి నుండి కాపాడు. పరమాత్మ యొక్క నామ రూప అస్త్రములను మేము కీర్తించడముతో ఏవేవి మన శ్రేయస్సును హరిస్తున్నాయో, ఆ శ్రేయస్సుకు హాని చేసే అన్నిటినుండీ పరమాత్మ యొక్క నామ రూప అస్త్రముల కీర్తన కాపాడాలి.

గరుడో భగవాన్స్తోత్ర స్తోభశ్ఛన్దోమయః ప్రభుః
రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః

ఇపుడు వాహనం.  నామ రూప యాన ఆయుధాలు అన్ని రకములైన ఆపదలనుండీ ఆయన నామమూ రూపమూ వాహనమూ ఆయుధములూ కాపడాలి.

సర్వాపద్భ్యో హరేర్నామ రూపయానాయుధాని నః
బుద్ధీన్ద్రియమనఃప్రాణాన్పాన్తు పార్షదభూషణాః

బుద్ధి మనసు ఇంద్రియం ప్రాణం. బుద్ధి ఆలోచన కలిగిస్తుంది, ఇంద్రియములు పని చేస్తాయి, మనసు సంకల్పిస్తుంది, ప్రాణం బలాన్నిస్తుంది. వీటిని పరమాత్మ నామ రూప యాన ఆయుధాలతో, నామం బుద్ధిని రూపం ఇంద్రియాలనూ యానము మన మనసునూ, పరమాత్మ ఆయుధము మన ప్రాణాన్నీ కాపాడాలి నిరంతర పరమాత్మ నామ సంకీర్తన చేస్తే మన బుద్ధిలో చెడు ఆలోచనలు రావు. నిరంతరం పరమాత్మ రూపాన్ని ధ్యానం చేస్తే ఇంద్రియాలు చెడు వైపు ప్రసరించవు, గరుడున్ని నిరంతరం ధ్యానం చేస్తే మనసు చెడును సంకల్పించదు, పరమాత్మ పంచాయుధాలని ప్రాథన చేస్తే మన ప్రాణములు చెడు పనులకు బలమును అందించవు. అన్ని ఆపదలనుండీ ఇవి మనను కాపాడు గాక. పరమాత్మ పక్కన ఉండే పార్శ్వదులు మమ్ము కాపాడు గాక. వారి ఆభరణములు కూడా మనను కాపాడాలి. భగవంతుని ఆభరణాలను ప్రార్తించినా చాలు మనకు రక్ష దొరుకుతుంది. పరమాత్మకు సంబంధించినదాన్ని దేన్ని స్మరించినా మన బుద్ధీ మనసు ఇందిర్యములూ ప్రాణములూ చెడు వైపుకాకుండా మంచి వైపు ప్రయాణిస్తాయి

యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్
సత్యేనానేన నః సర్వే యాన్తు నాశముపద్రవాః

అన్ని తానే అయి ఉన్న పరమాత్మ, తానే సృష్టించి, తానే లయమూ చేస్తున్నాడు.  సత్తూ అసతూ రెండూ పరమాత్మే అన్న సత్యం మనం తెలుసుకుంటే పరమాత్మే ప్రపంచముగా మారాడని అర్థం చేసుకుంటే పరమాత్మ మనకు ఆపద కలిగిస్తాడా? మరి ఆపద బాధా హానీ ఎక్కడిది? ఇదంతా అజ్ఞ్యానముతో ఇదంతా పరమాత్మ కంటే వేరు అనుకోవడం వలన వస్తాయి. అంతా పరమాత్మే అనుకున్నప్పుడు ఆపదా భయమూ హానీ రాదు. ఈ సత్యమును తెలుసుకున్నందు వలన అన్ని రకముల ఉపద్రవములూ నశించుగాక.

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్
భూషణాయుధలిఙ్గాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా

పరమాత్మకు ఎటువంటి వికల్పమూ ఉండదు (ప్రియమూ అప్రియమూ, రూపము గుణమూ ద్రవ్యమూ ఉత్పత్తీ నాశమూ). పరమాత్మే జగత్తుగా మార్పు చెందుతున్నాడు. ప్రళయములో జగత్తు కనపడదు, సృష్టి కాలములో పరమాత్మ కనపడడూ, రెండు కాలాలలో రెంటినీ చూచినవాడు జ్ఞ్యాని. అన్ని సమయాలలో ఉండే పరమాత్మ ఒక్కడే. ఆయనలో ఎటువంటి భేధమూ ఉండదు. పరమాత్మ తన మాయా విభూతులతో భూషణములూ ఆయుధములూ లింగములు (శ్రీవత్సం), వాహనం. ఆయనకు ఏ వికల్పములూ ఉండవు. ఈ రహస్యం తెలుసుకుంటే, ఇలాంటి నిజమైన ప్రమాణముతో

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్హరిః
పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః

జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు గలిగిన పరమాత్మ తన యొక్క అన్ని స్వరూపములతో సదా (ఎల్లప్పుడూ) సర్వత్రా (అన్ని చోట్లా కాపాడాలి) సర్వదా (అన్ని చోట్లా ఉన్నవాడై కాపాడాలి) . మనకు పరమాత్మ రక్ష కన్నా పరమాత్మే మన దగ్గర ఉండటం కావాలి. ఆయన మనదగ్గర ఉండగా మనకు ఆపదలు రావు, ఆయన సర్వ ప్రహరణాయుధుడు కాబట్టి. అన్ని చోట్లా అన్ని వేళలా అన్ని రూపములలో కాపాడాలి.

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమన్తాదన్తర్బహిర్భగవాన్నారసింహః
ప్రహాపయ లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః

విదిక్కు అంటే రెండు దిక్కుల మధ్య (ఉదా: ఈశాన్యం), దిక్కులలో, పైనా, కిందా , అంతటా, వెలుపలా, లోపలా ఇలా అన్ని చోట్లా భగవానుడైన నారసింహుడు కాపాడాలి. సర్వ వ్యాపకత్వాన్ని ఋజువు చేసిన అవతారం నరసింహుని అవతారం. తన ఘర్జనతో భయాన్ని పోగొట్టాడు. హిరణ్యకశిపుని తేజస్సుని మింగేశాడు. తన రాకతో పరమాత్మ సర్వ వ్యాపకుడని చాటాడు. ఇది నారాయణ కవచం

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్
విజేష్యసేऽఞ్జసా యేన దంశితోऽసురయూథపాన్

ఇంద్రా, ఇది నారాయణ కవచం. ఈ కవచాన్ని బందించుకుంటే రాక్షస సైన్యాన్ని నీవు గెలుస్తావు

ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా
పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే

ఇలాంటి నారాయణ కవచాన్ని ఉపాసించినవాడు, పఠించిన వాడు కంటితో చూసినా కాలితో తాకినా అలా తాకపడిన వాడు అన్ని పాపముల నుండీ విముక్తుడవుతాడు.

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్
రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాధ్యాదిభ్యశ్చ కర్హిచిత్

అన్ని రకముల ఆపదల నుండీ విడుదల అవుతారు. ఈ నారాయణ కవచాన్ని ధరించేవారికి ఎక్కడ నుండీ ఎలాంటి భయమూ కలగదు.  రాజులూ దొంగలూ గ్రహములూ మృగములూ, వీటి వలన ఈ నాలిగింటినుండీ భయము కలగదు

ఇమాం విద్యాం పురా కశ్చిత్కౌశికో ధారయన్ద్విజః
యోగధారణయా స్వాఙ్గం జహౌ స మరుధన్వని

పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఈ విద్యను ఉపాసించి ధారణ చేస్తూ యోగ ప్రభావముతో శరీరాన్ని ఒక చవట భూమి యందు విడిచిపెట్టాడు.

తస్యోపరి విమానేన గన్ధర్వపతిరేకదా
యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః

గగనాన్న్యపతత్సద్యః సవిమానో హ్యవాక్శిరాః
స వాలిఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః
ప్రాస్య ప్రాచీసరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్

ఆ అస్తిపంజరమున్న చోటి నుంచీ భార్యలతో ఒక గంధర్వుడు విమానము మీద నుంచి వెళ్ళగా ఆ విమానం త్రల్లకిందులుగా కూలిపోయింది. అప్పుడు వాలఖిల్యులు చెప్పగా ఆశ్చర్యపడి ఆ అస్తులని తీసుకుని సరస్వతీ నది నీటిలో కలిపి తనలోకానికి వెళ్ళాడు. నారాయణ కవచం ధరించిన వాడి అస్తిపంజరానికి కూడా అంత శక్తి ఉంటుంది..

శ్రీశుక ఉవాచ
య ఇదం శృణుయాత్కాలే యో ధారయతి చాదృతః
తం నమస్యన్తి భూతాని ముచ్యతే సర్వతో భయాత్

ఎవరు ఈ నారాయణ కవచాన్ని వినదగిన కాలములో వింటారో విని ఆదరముతో ధరిస్తారో అలాంటి వానికి అన్ని ప్రాణులూ నమస్కరిస్తాయి. ఆపదలు వచ్చాయంటే నారాయణ కవచ సప్తాహం చేస్తారు.

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః
త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేऽసురాన్

ఈ హయగ్రీవ బ్రహ్మ విద్యను విశ్వరూపుని వలన ఇంద్రుడు విని యుద్ధములో రాక్షసులను గెలిచి త్రైలోక్య రాజ్య సంపదను అనుభవించాడు

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే  శత సహస్రికాయాయాం వైయాసిక్యాం షష్ఠ స్కంధే నారాయణ వర్మోపదేశో నామ్నాష్టమోధ్యాయః

                                                       సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Popular Posts