Followers

Thursday 6 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఆరవ అధ్యాయం


రాజోవాచ
న నూనం భగవ ఆత్మారామాణాం యోగసమీరితజ్ఞానావభర్జితకర్మబీజానామైశ్వర్యాణి పునః
క్లేశదాని భవితుమర్హన్తి యదృచ్ఛయోపగతాని

ఇది విన్న పరీక్షిత్తు "కోరకుండా వచ్చినా కోరి వచ్చినా వచ్చిన ఐశ్వర్యాన్ని ఒప్పుకుంటే మళ్ళీ సంసారములో పడినట్లే. " అన్నాడు. అప్పుడు శుకుడు 

ఋషిరువాచ
సత్యముక్తం కిన్త్విహ వా ఏకే న మనసోऽద్ధా విశ్రమ్భమనవస్థానస్య శఠకిరాత ఇవ
సఙ్గచ్ఛన్తే

అప్పుడు శుకుడు "ఉన్న మాట ఉన్నట్లు చెప్పావు. మనస్సును నిగ్రహించుకోలేని వారు ఏ విషయాలను గెలవాలని ప్రయత్నిస్తారో ఆ విషయాలకే లోనవుతారు. మన మనస్సు దొంగ వేటగాడిలాంటిది 

తథా చోక్తమ్
న కుర్యాత్కర్హిచిత్సఖ్యం మనసి హ్యనవస్థితే
యద్విశ్రమ్భాచ్చిరాచ్చీర్ణం చస్కన్ద తప ఐశ్వరమ్

మనసు ఏకాగ్రముగా లేనంతవరకూ ఎక్కడా ఏ విషయములోనూ స్నేహం చేయకూడదు. పొరబాటున కొంచెం నమ్మి "ఏమవుతుందిలే" అనుకుంటే ఎంత గొప్ప వారి తపస్సైనా వ్యర్థమవుంది. మనస్సును గెలవగలిగితే వాటితో చెలిమి చేసినా నష్టములేదు. సాక్షాత్ శంకరుని తపస్సుకూడా జారిపోయింది కదా. ఇంతకంటే ఏమి కావాలి ఉదాహరణ

నిత్యం దదాతి కామస్య చ్ఛిద్రం తమను యేऽరయః
యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలీ

మనసు నిరంతరం కోరిక వెంటనే పరిగెత్తుతూ ఉంటుంది. ప్రతీక్షణం కోరికకు అవకాశం (చిధ్రం) ఏర్పడే ఉంటుంది, దాని వెంటా దాని మిత్రులైన క్రోధ మోహ మదాదులు ఉంటాయి. స్నేహం చేసి యోగిగా ఉన్నవాడికి కోరికలు ఉండకూడదు పుర్హ్సుడి వెంట చరించే స్త్రీ (వేశ్య లాంటివి)

కామో మన్యుర్మదో లోభః శోకమోహభయాదయః
కర్మబన్ధశ్చ యన్మూలః స్వీకుర్యాత్కో ను తద్బుధః

ఇన్ని రకములైన కర్మలకు ఏది మూలమో దాన్ని ఎవరు స్వీకరిస్తాడు. సఖ్యం వలనే కోరికా కోపం లోభం మదం మోహం పుడతాయి. ఈ ఒక్క మైత్రీ భావాన్ని దూరముగా ఉంచితే తక్కినవేమీ రావు

అథైవమఖిలలోకపాలలలామోऽపి విలక్షణైర్జడవదవధూతవేషభాషాచరితైరవిలక్షిత
భగవత్ప్రభావో యోగినాం సామ్పరాయవిధిమనుశిక్షయన్స్వకలేవరం
జిహాసురాత్మన్యాత్మానమసంవ్యవహితమనర్థాన్తరభావేనాన్వీక్షమాణ ఉపరతానువృత్తిరుపరరామ

సకలలోకపాలకులకు ఈయన అధిపతి అయి ఉండీ అవధూత వేషాన్ని వారి ఆచారాన్నీ వ్యవహారాన్నీ ఆచరించి చూపాడు. తరువాత వచ్చే యోగులకది మార్గదర్శకం. ఇంక శరీరాన్ని విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు రోగాలకు రోగమైన శరీరాన్ని  విడిచిపెట్టదలచి ఉచ్చ్వాస నిశ్వాసలను కూడా విడిచిపెట్టాడు

తస్య హ వా ఏవం ముక్తలిఙ్గస్య భగవత ఋషభస్య యోగమాయావాసనయా దేహ ఇమాం
జగతీమభిమానాభాసేన సఙ్క్రమమాణః కోఙ్కవేఙ్కకుటకాన్దక్షిణ
కర్ణాటకాన్దేశాన్యదృచ్ఛయోపగతః కుటకాచలోపవన ఆస్య కృతాశ్మకవల ఉన్మాద ఇవ ముక్తమూర్ధజో
ऽసంవీత ఏవ విచచార

లింగాన్ని వదిలిపెట్టి యోగమాయతో భూమండలములో శరీరం మీద అభిమానాన్ని విడిచిపెట్టి ఆయా దేశాలను తిరుగుతూ ఉన్నాడు, చివరకు కుటకాచలం వద్దకు వచ్చి ఆగాడు. నోరు తెరుచుకుని ఉంటాడు. ఆ నోటిలో ఏది పడితే అదే ఆహారం. రుచి మీదకు మనసు పోతే తినాలన్న ఆశ కలుగుతుంది,ఆహరం మీద లోలుపత్వం వస్తుంది, అది శరీరాన్ని బాగా బలిపిస్తుంది, దాని వలన శొమరితనమూ, శొమరితనం వలన అనాచారం, అనాచరం వలన భ్రష్టత వస్తుంది. శరీరమూ మనసూ పాడవుతుంది. అలా నొటిలో ఏది పడీతే అది తింటూ ఉన్మాదుడిలా జుట్టు విరబూసుకుని దిగంబరముగా సంచరించాడు

అథ సమీరవేగవిధూతవేణువికర్షణజాతోగ్రదావానలస్తద్వనమాలేలిహానః సహ తేన దదాహ

ఇలా సంచరిస్తూ ఉంటే ఒక సారి పెద్ద గాలి రావడం వలన వెదురుబొంగులు రాజుకోవడముతో అగ్నిపుట్టింది, అది వనం మొత్తం కాలిపోయింది, అందులో ఈయన కూడా ఉన్నాడు. 

యస్య కిలానుచరితముపాకర్ణ్య కోఙ్కవేఙ్కకుటకానాం రాజార్హన్నామోపశిక్ష్య కలావధర్మ
ఉత్కృష్యమాణే భవితవ్యేన విమోహితః స్వధర్మపథమకుతోభయమపహాయ కుపథ
పాఖణ్డమసమఞ్జసం నిజమనీషయా మన్దః సమ్ప్రవర్తయిష్యతే

వృషభుడు సంచరించిన మార్గములు విని దాన్ని అపార్థము చేసుకుని ఆయన ఆచరించినవి ఆచరించారు. రాబోయే కలియుగములో ఇలాగే జరగవలసి ఉండాల్సి ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ లేని వారి ధర్మాలను వదిలిపెట్టి పాఖండ మార్గాలను ప్రజలు తమ బుద్ధితో మందులందరూ దాన్ని ప్రవర్తింపచేస్తారు. పరమాత్మ మాయచే మోహించబడిన వారై 

యేన హ వావ కలౌ మనుజాపసదా దేవమాయామోహితాః స్వవిధినియోగశౌచచారిత్రవిహీనా దేవ
హేలనాన్యపవ్రతాని నిజనిజేచ్ఛయా గృహ్ణానా అస్నానానాచమనాశౌచకేశోల్లుఞ్చనాదీని కలినాధర్మ
బహులేనోపహతధియో బ్రహ్మబ్రాహ్మణయజ్ఞపురుషలోకవిదూషకాః ప్రాయేణ భవిష్యన్తి

తే చ హ్యర్వాక్తనయా నిజలోకయాత్రయాన్ధపరమ్పరయాశ్వస్తాస్తమస్యన్ధే స్వయమేవ
ప్రపతిష్యన్తి

తమ తమ విధిని బట్టీ చారిత్రమును బట్టీ ఆచారాన్ని బట్టీ ఆచరించకుండా భగవంతున్ని అవమాన పరిచే వ్రతాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకుంటూ  వాటికి ఇష్టము వచ్చిన పేర్లు పెట్టుకుంటూ స్నానాచమనాదులు లేక కేశాలను కడుక్కోకుండా పరమాత్మనూ బ్రాహ్మణులనూ యజ్ఞ్యములనూ పురుషులనూ దూషించేవారవుతారు. తరువాతి ఆచారాన్ని తరువాతి నియమాన్ని ఆచరించిన వారై, "నాకంటే ముందు వారు చేసారు కాబట్టి నేను చేసాను" అంటూ  పరమ అజ్ఞ్యానములో వారే పడిపోతూ ఉన్నారు

అయమవతారో రజసోపప్లుతకైవల్యోపశిక్షణార్థః

రజో గుణం ఆవరించిన వారికి మోక్షం రావడానికి కావలసిన మార్గం చెప్పే అవతారం ఇది. 

తస్యానుగుణాన్శ్లోకాన్గాయన్తి
అహో భువః సప్తసముద్రవత్యా ద్వీపేషు వర్షేష్వధిపుణ్యమేతత్
గాయన్తి యత్రత్యజనా మురారేః కర్మాణి భద్రాణ్యవతారవన్తి

ఏడు సముద్రాలతో కూడి ఉన్న ఏడు ద్వీపాలలో ఇది పరమ పవిత్రమైన విషయం. ఈ సప్త సముద్రములూ గల ఈ భూమండలమెందుకు పవిత్రమెందుకంటే పరమాత్మ అవతార చైత్రలను గానం చేస్తున్నారు కాబట్టి

అహో ను వంశో యశసావదాతః ప్రైయవ్రతో యత్ర పుమాన్పురాణః
కృతావతారః పురుషః స ఆద్యశ్చచార ధర్మం యదకర్మహేతుమ్

ప్రియవ్రతుని వంశం కూడా పరమ పవిత్రం ఎందుకంటే పురాణ పురుషుడు ఉద్భవించాడు. కర్మ చేయకుండా ఉండటానికి కావలసిన ధర్మాన్ని వృషభుడు ఆచరించాడు. కర్తృత్వ జ్ఞ్యాతృవాభిమానములు లేకుండా చేసాడు. సంస్కారముతో వాసన వాసనతో కోరిక కోరికతో కర్మలు కర్మలతో భోగం భోగముతో వాసన. ఇవన్నీ ఒక ధర్మాచరణతో రాకుండా ధర్మాచరణ మోక్షహేతువుగావాలి. ఎలా చేస్తే కర్మ బంధించదో అలా చేసి చూపాడు

కో న్వస్య కాష్ఠామపరోऽనుగచ్ఛేన్మనోరథేనాప్యభవస్య యోగీ
యో యోగమాయాః స్పృహయత్యుదస్తా హ్యసత్తయా యేన కృతప్రయత్నాః

ఇలాంటి మహాత్ముని మార్గాన్ని సంకల్పముతో కూడా అనుసరించేవాడెవరైనా ఉన్నారా? ఈయన ఆచరించిన యోగముతో లభించిన సిద్ధులను ఉదాసీన స్వభావముతో ఉన్నాడు. వాటిని వదులుకున్నాడు. ఆయన మార్గాన్ని మనసుతో కూడా అనుసరించలేము

ఇతి హ స్మ సకలవేదలోకదేవబ్రాహ్మణగవాం పరమగురోర్భగవత ఋషభాఖ్యస్య
విశుద్ధాచరితమీరితం పుంసాం సమస్తదుశ్చరితాభిహరణం పరమమహా
మఙ్గలాయనమిదమనుశ్రద్ధయోపచితయానుశృణోత్యాశ్రావయతి వావహితో భగవతి తస్మిన్వాసుదేవ ఏకాన్తతో
భక్తిరనయోరపి సమనువర్తతే

వేదలోకదేవబ్రాహ్మణగవాం - వీటన్నిటికీ పరమ గురువైన వృషభదేవుని పరమపవిత్ర చరిత్రను వర్ణించాను. ఇది మానవుల సకల పాపములనూ తొలగించి అనంతమైన కళ్యానన్ని కలిగించేది. శ్రద్ధతో సావధానముతో ఎవరు ఈ చరిత్రను విని వినిపిస్తారో అలాంటి వారు పరమాత్మ అయిన వాసుదేవుని యందు ఏకాంతమైన భక్తి కలవారై ఆయన మార్గాని అవలంబిస్తారు. 

యస్యామేవ కవయ ఆత్మానమవిరతం వివిధవృజినసంసారపరితాపోపతప్యమానమనుసవనం
స్నాపయన్తస్తయైవ పరయా నిర్వృత్యా హ్యపవర్గమాత్యన్తికం పరమపురుషార్థమపి స్వయమాసాదితం నో
ఏవాద్రియన్తే భగవదీయత్వేనైవ పరిసమాప్తసర్వార్థాః

ఈయనను ఈ మార్గములోనే పండితులూ యోగులూ ఋషులూ సావధానముతో ఉంచి అనేక పాపములను పోగొట్టడానికి తమను తాము పరిశుద్ధి చేసుకున్నవారై పరమాత్మ దయతో తృప్తి పొందిన వారై ఆత్యంతికమైన మోక్షాన్ని కూడా అంగీకరించరు. పరమాత్మయందు ఉండే భక్తితోటే అన్ని కోరికలూ తీరినవారై పరమాత్మ ఇచ్చే మోక్షాన్నీ ఆదరించరు 

రాజన్పతిర్గురురలం భవతాం యదూనాం
దైవం ప్రియః కులపతిః క్వ చ కిఙ్కరో వః
అస్త్వేవమఙ్గ భగవాన్భజతాం ముకున్దో
ముక్తిం దదాతి కర్హిచిత్స్మ న భక్తియోగమ్

మీ వంశములో మీ కులములో మీకు కింకరునిగా దూతగా మేనమామ కుమారుడై తిరిగిన ఆ దైవమే ఈయన. ఆయన మీకు కింకరుడయ్యాడు. ఇన్ని రకాల సేవ చేసిన తరువాత ఒక నిర్ణయానికొచ్చాడు. కావలంటే ముక్తినిస్తాను గానీ భక్తినివ్వనూ. భక్తినిస్తే చెప్పిన పనల్లా చేయాలి. (అందుకే భగవద్రామానుజులు "శేముషీ భక్తి  రూపా" నాకు భక్తినివ్వు అని అన్నారు)

నిత్యానుభూతనిజలాభనివృత్తతృష్ణః
శ్రేయస్యతద్రచనయా చిరసుప్తబుద్ధేః
లోకస్య యః కరుణయాభయమాత్మలోకమ్
ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై

ఈ శ్లోకం నిత్యానుసంధానం. దీని వలన భక్తి మీద భక్తి కలుగుతుంది. నిరంతరం అనుభవించే సమస్త ఆనందములతో తనను తాను చూచుకుని ఆనందించి తృప్తి పొందినవాడు. ఆయనకు ఇది కావాలీ ఇది వద్దూ అన్న భావన లేదు. సాంసారిక విషయాల యందు మనసు ప్రసరించదు. సంసారములో ప్రవర్తించేవాడి బుద్ధి మోక్షాన్ని చూడలేక నిదురపోతూ ఉంటుంది. యోగమాయతో తనలోకం ఇలా ఉంటుంది, తన లోకాన్ని చేరాలి అని ఏ మహానుభావుడు చెప్పాడో అటువంటి వృషభ దేవునికి నమస్కారము. ఇది వృషభ ద్వాదశి. నిత్యానుసంధానం చేసుకోవలసినది
పరమాత్మ తనకు లభించినదానితో ఆనందముగా ఉండేవాడు. ఆయనకు నిత్యానుభూతి ఉన్నది. మనకి ప్రతీక్షణం దుఃఖం కలుగుతూనే ఉంటుంది. కలిగిన వెంటనే దాన్ని మరచిపోతూ ఉంటాము. సుఖము ఎప్పటికో కలుగుతుంది. పరమాత్మ నిత్యానందముతో ఉంటాడు. మానవుడెందుకు సుఖాన్ని పొందుట లేదు. మన ప్రవృత్తులన్నీ దుఃఖానికే పనికొస్తున్నాయి.  
మానవుడి స్వభావం బాధపడడమే. ఏది శ్రేయస్సో దానికోసం ప్రయత్నించుట లేదు. చాలా కాలం నుంచీ నిదురపోయిన బుద్ధికల లోకానికి కరుణ బోధించాలని వచ్చిన వృషభదేవునికి నమస్కారము. అభయాన్ని ప్రసాదించే తన లోకాన్ని ప్రసాదించిన వృషభదేవునికి నమస్కారం

Popular Posts