Followers

Wednesday 19 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదహారవ అధ్యాయం


రాజోవాచ
ఉక్తస్త్వయా భూమణ్డలాయామవిశేషో యావదాదిత్యస్తపతి యత్ర చాసౌ జ్యోతిషాం గణైశ్చన్ద్రమా
వా సహ దృశ్యతే

తత్రాపి ప్రియవ్రతరథచరణపరిఖాతైః సప్తభిః సప్త సిన్ధవ ఉపక్లృప్తా యత ఏతస్యాః సప్త
ద్వీపవిశేషవికల్పస్త్వయా భగవన్ఖలు సూచిత ఏతదేవాఖిలమహం మానతో లక్షణతశ్చ సర్వం వి
జిజ్ఞాసామి

ప్రియవ్రతుని గురించి చెబుతూ భూమండల విస్తారం చెప్పారు. సూర్య భగవానుడు ఎంత వరకూ తన ప్రభావం వ్యాపింపచేసాడో చంద్రుడు ఎంత వరకూ వ్యాపింప చేసాడో చెప్పారు. ఏడు ద్వీపాల గురించీ సముద్రాల గురించీ చెప్పారు.
ఒక్కో ద్వీపం సముద్రం ఎంత విశాలమూ దాని గుణములేమిటీ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ జగత్తంతా పరమాత్మ స్థూల రూపం. ఈ జగత్తును బాగా అర్థం చేసుకుంటే భగవానుని స్థూల రూపాన్ని ధ్యానం చేయవచ్చు.   నిరాకారమైన స్వామి మీద మనసు లగ్నం అయ్యే వరకూ ఆయన స్థూల రూపం మీద మనసు లగ్నం చేయాలి. 

భగవతో గుణమయే స్థూలరూప ఆవేశితం మనో హ్యగుణేऽపి సూక్ష్మతమ ఆత్మజ్యోతిషి పరే
బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమమావేశితుం తదు హైతద్గురోऽర్హస్యనువర్ణయితుమితి

సూక్ష్మ రూపం యందు మనసు నిలపడానికి పరమాత్మ స్థూల రూపం మీద నిలుపుట అభ్యాసముగా ఉంటుంది.  మీరు మాకు సకల పృధ్వీ మండలాన్నీ వర్ణించవలసినది.  ఆ ప్రశ్న విన్న శుకుడు 

ఋషిరువాచ
న వై మహారాజ భగవతో మాయాగుణవిభూతేః కాష్ఠాం మనసా వచసా వాధిగన్తుమలం
విబుధాయుషాపి పురుషస్తస్మాత్ప్రాధాన్యేనైవ భూగోలకవిశేషం నామరూపమానలక్షణతో
వ్యాఖ్యాస్యామః

పరమాత్మ విభూతులన్నీ అనంతములూ. ఆ విభూతులన్నీ ప్రతి ఒక్కటీ వివరముగా వర్ణించడం ఎవరి వలనా కాదు. ఆయన విభూతులలో ఏదో ఒక భాగం పూర్తిగా వర్ణించాలన్నా మనస్సుతో గానీ వాక్కుతో గానీ అందుకోలేము, మనకు దేవతల ఆయుష్షు వచ్చినా, కల్ప కాలం మనం ఉన్నా అది అలవి కాని పని.

మొత్తం కాకుండా ప్రాధాన్యమైన విశేషమును వివరిస్తాను. వాటి పేరూ కొలతా చెబుతాను 

యో వాయం ద్వీపః కువలయకమలకోశాభ్యన్తరకోశో నియుతయోజనవిశాలః సమవర్తులో యథా
పుష్కరపత్రమ్

యస్మిన్నవ వర్షాణి నవయోజనసహస్రాయామాన్యష్టభిర్మర్యాదాగిరిభిః సువిభక్తాని భవన్తి

మనం ఉన్నది జంబూ ద్వీపమూ లేదా ఇలా వర్షము. కలువ మొగ్గ రూపములో ఉంటుంది. దీని అభ్యంతర కోశం (జఠరం) లక్ష యోజనాలు ఉంటుంది. సమవర్తులాకారములో ఒకే రకమైన కొలతలో పద్మం యొక్క రేకులాగ ఏ భాగం నుంచి కొలిచినా ఒకే కొలత ఉంటుంది. 

ఇందులో తొమ్మిది వర్షాలుంటాయి. ఒక్కోటి తొమ్మిది వేల యోజనాలు. 

ఏషాం మధ్యే ఇలావృతం నామాభ్యన్తరవర్షం యస్య నాభ్యామవస్థితః సర్వతః సౌవర్ణః కుల
గిరిరాజో మేరుర్ద్వీపాయామసమున్నాహః కర్ణికాభూతః కువలయకమలస్య మూర్ధని ద్వాత్రింశత్సహస్ర
యోజనవితతో మూలే షోడశసహస్రం తావతాన్తర్భూమ్యాం ప్రవిష్టః

దీనికి సరిహద్దు పర్వతాలు ఎనిమిది ఉంటాయి. ఈ తొమ్మిది వర్షముల మధ్యలో ఇలా వృత్తమనే వర్షముంటుంది. మేరుపర్వతం దేని మధ్యలో ఉందో అది ఇలా వృత్తం. అది బంగారు పర్వతం. జంబూ ద్వీపం ఎంత వైశాల్యముందో ఈ మేరు పర్వతం అంత ఎత్తు ఉంది. లక్ష యోజనాల పొడవు ఈ పర్వతం. దీప ఆయమ సమున్నాహః  ద్వీప వైశాల్యమంత ఎత్తు గలదు. 
ఈ పర్వతం పైభాగములో ముప్పై రెండు వేల యోజనాలు వైశాల్యం, పదహారువేలు యోజనాలు కింద వైశాల్యం. కింద వైశాల్యం తక్కువ, పైన వైశాల్యం ఎక్కువ. దేవతా లోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి.  పదహారు వేల యోజనాలతో భూమిలోపల కూడా ఉంది. అంత విస్తీర్ణముతో పదహారు వేల యోజనాల లోతు వెడల్పుతో అంతర్భూమిలో ఉంది. 

ఉత్తరోత్తరేణేలావృతం నీలః శ్వేతః శృఙ్గవానితి త్రయో రమ్యకహిరణ్మయకురూణాం వర్షాణాం మర్యాదా
గిరయః ప్రాగాయతా ఉభయతః క్షారోదావధయో ద్విసహస్రపృథవ ఏకైకశః పూర్వస్మాత్పూర్వస్మాదుత్తర
ఉత్తరో దశాంశాధికాంశేన దైర్ఘ్య ఏవ హ్రసన్తి

ఇలా వృతానికి ఉత్తర భాగములో మూడు పర్వతాలుంటాయి -  నీలః శ్వేతః శృఙ్గవ. ఒక్కో పర్వతం ఒక్కో వర్షానికీ(రమ్యకహిరణ్మయకురూణాం) సరిహద్దు. ఇవి తూర్పు దిక్కు వైశాల్యం ఉండి విస్తరించాయి. ఉప్పు సముద్రానికి ఆ పక్కా ఎపక్కా వ్యాపించాయి. ఒక్కో పర్వతం తన పూర్వ పర్వతం కంటే పది రెట్లు ఎక్కువ విస్తీర్ణం. 

ఏవం దక్షిణేనేలావృతం నిషధో హేమకూటో హిమాలయ ఇతి ప్రాగాయతా యథా
నీలాదయోऽయుతయోజనోత్సేధా
హరివర్షకిమ్పురుషభారతానాం యథాసఙ్ఖ్యమ్

తథైవేలావృతమపరేణ పూర్వేణ చ మాల్యవద్గన్ధమాదనావానీలనిషధాయతౌ ద్విసహస్రం
పప్రథతుః కేతుమాలభద్రాశ్వయోః సీమానం విదధాతే

మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద ఇత్యయుతయోజనవిస్తారోన్నాహా మేరోశ్చతుర్
దిశమవష్టమ్భగిరయ ఉపక్లృప్తాః

పొడుగులోనే ఎక్కువ తక్కువలు, వైశాల్యములో కావు. దక్షిణ ఇలా వృతములో మూడు పర్వతాలు ఉన్నాయి. నిషధో హేమకూటో హిమాలయ. ఇవన్నీ పదివేల యోజనాల ఎత్తులో ఉన్నాయి. హరి వర్షం కింపురుషం భారత వర్షం. భారతదేశ సరిహద్దు పర్వతం హిమాలయం. ఇలావృత వర్షానికి పూర్వభాగములో, ఇంకో మూడు పర్వతాలు ఉన్నాయి. మాల్యవత్ గంధమాధనం అవానలం అనే పర్వతాలు పేరు పొందాయి. ఇవి కేతుమాల భద్రాశ్వ వర్షానికి హద్దులు. మరియొక నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తూ వెడల్పు ఉన్నవై మేరు పర్వతానికి ఉన్నాయి. మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద. మేరు పర్వతానికి పోదగినవారికే ఈ పర్వతాలు దారి ఇస్తాయి. మేరుపర్వతానికి ఇవి రక్షకమైనవి. 

చతుర్ష్వేతేషు చూతజమ్బూకదమ్బన్యగ్రోధాశ్చత్వారః పాదపప్రవరాః పర్వతకేతవ ఇవాధి
సహస్రయోజనోన్నాహాస్తావద్విటపవితతయః శతయోజనపరిణాహాః

ఈ నాలుగు పర్వతములలో ఒక్కో పర్వతానికి గుర్తుగా ఒక్కో మహా వృక్షములు ఉన్నాయి.మామిడీ జంబూ కదంబం న్యగ్రోధ (మఱ్ఱి). ఈ నాలుగు మహావృక్షాలూ పర్వతానికి జండాలులా ఉన్నాయి. 

హ్రదాశ్చత్వారః పయోమధ్విక్షురసమృష్టజలా యదుపస్పర్శిన ఉపదేవగణా యోగైశ్వర్యాణి
స్వాభావికాని భరతర్షభ ధారయన్తి

పదకొండు వేల యోజనాల ఎత్తుతో, ఒక్కో కొమ్మ వైశాల్యం వంద యోజనాలు. అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లున్నాయి. నాలుగు సముద్రాలే వీటికి నీరుపోస్తాయి. పాలూ తేనే చెరుకు రసం నీరు. ఈ నాలుగు జనములతో నాలుగు హ్రదములున్నాయి. 

దేవోద్యానాని చ భవన్తి చత్వారి నన్దనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రమితి

యేష్వమరపరివృఢాః సహ సురలలనాలలామయూథపతయ ఉపదేవగణైరుపగీయమాన
మహిమానః కిల విహరన్తి

ఈ జలములో గొప్పదనం, ఒక్క సారి ఈ జలాన్ని ఆచమనం చేస్తే దేవతల సమముతో బలం వచ్చి యోగముతో నిష్ణాతులవుతారు. ఉపదేవతల ఐశ్వర్యం  సహజముగా వస్తాయి.

నాలుగు పర్వతాలూ నాలుగు చెట్లూ నాలుగు నదులతో బాటు నాలుగు ఉద్యాన వనాలున్నాయి. అవి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రం. ఈ ఉద్యానవనములలో దేవతలతో చుట్టబడి దేవతా స్త్రీలూ వారి భర్తలూ వినోడములతో కాలం గడుపుతారు 

మన్దరోత్సఙ్గ ఏకాదశశతయోజనోత్తుఙ్గదేవచూతశిరసో గిరిశిఖరస్థూలాని ఫలాన్యమృత
కల్పాని పతన్తి

తేషాం విశీర్యమాణానామతిమధురసురభిసుగన్ధిబహులారుణరసోదేనారుణోదా నామ నదీ
మన్దరగిరిశిఖరాన్నిపతన్తీ పూర్వేణేలావృతముపప్లావయతి

మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరు మామిడి. పదకొండు వందల యోజనాల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తుకు తగ్గట్టుగా ఒక్కో పండూ ఒక్కో పర్వత శిఖరములా ఉంటుంది. అవి ఎంతో తీయగా ఉంటాయి. 

యదుపజోషణాద్భవాన్యా అనుచరీణాం పుణ్యజనవధూనామవయవస్పర్శసుగన్ధవాతో దశ
యోజనం సమన్తాదనువాసయతి

ఆ మామిడి పళ్ళ రసం పర్వత ప్రాంతములో ప్రవహించింది, అలా ప్రవహించి ఎరుపు రంగు నీరులా మారి అరుణొద అనే పేరు వచ్చింది. మందర గిరి శిఖరం నుంచి ఈ నది పడి తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది. ఈ అరుణొదా నది జలమును సేవించిన పార్వతీ దేవి సేవకులైన యక్షులు మొదలైనవారిని స్పృశిస్తే చాలు, మన శరీర సుగంధం పదియోజనాలు వ్యాపిస్తుంది. 

ఏవం జమ్బూఫలానామత్యుచ్చనిపాతవిశీర్ణానామనస్థిప్రాయాణామిభకాయనిభానాం రసేన
జమ్బూ నామ నదీ మేరుమన్దరశిఖరాదయుతయోజనాదవనితలే నిపతన్తీ దక్షిణేనాత్మానం
యావదిలావృతముపస్యన్దయతి

జంబూ (అల్ల నేరేడు) పళ్ళు కింద పడగా ఒక్కో పండు ఏనుగు శరీరమంత ఉండగా ఆ జంబూ ఫలము యొక్క రసము పారిన నది జంబూ నది. ఈ ప్రవాహమూ జలమూ నదీ పరివాహక ప్రాంతములో ఉన్న మట్టితో కలిసి బంగారమయ్యింది. జంబూ నదీ తీరములో పుట్టినది జాంబూనదం. దానితో దేవతలు ఆభరణాలు చేసుకుంటారు.  మేరు మందర శిఖరాల నుండీ పదివేల యోజనాల నుండీ కిందపడుతూ దక్షిణ భాగములో పడి ఇలా వృత వర్షాన్ని తడిపేస్తుంది. అక్కడ ఉండే మట్టి,జంబూ రసముతో తడపబడి, వాయువు సూర్య కిరణాలు సోకడం వలన  దేవతలకు ఆభరణముగా జాంబూనదముగా పేరు గాంచింది 

తావదుభయోరపి రోధసోర్యా మృత్తికా తద్రసేనానువిధ్యమానా వాయ్వర్కసంయోగవిపాకేన
సదామరలోకాభరణం జామ్బూనదం నామ సువర్ణం భవతి

యదు హ వావ విబుధాదయః సహ యువతిభిర్ముకుటకటకకటిసూత్రాద్యాభరణరూపేణ ఖలు
ధారయన్తి

యస్తు మహాకదమ్బః సుపార్శ్వనిరూఢో యాస్తస్య కోటరేభ్యో వినిఃసృతాః
పఞ్చాయామపరిణాహాః
పఞ్చ మధుధారాః సుపార్శ్వశిఖరాత్పతన్త్యోऽపరేణాత్మానమిలావృతమనుమోదయన్తి

ఇక మూడవ వృక్షం కడిమ చెట్టు, ఇది సుపార్శ్వములో ఉంది. ఈ వృక్షం యొక్క తొఱ్ఱలో వెళ్ళినటువంటి ఐదు మధు ధారలు ప్రవహిస్తూ పర్వత శిఖరము నుంచీ ప్రవహిస్తూ ఇలా వృతానికి పశ్చిమ భాగములో వస్తాయి. ఈ రసాన్ని తాగిన వారి నిట్టూర్పు నుంచి వచ్చిన వాయువు కొన్ని  యోజనాలు వ్యాపిస్తుంది.

యా హ్యుపయుఞ్జానానాం ముఖనిర్వాసితో వాయుః సమన్తాచ్ఛతయోజనమనువాసయతి

ఏవం కుముదనిరూఢో యః శతవల్శో నామ వటస్తస్య స్కన్ధేభ్యో నీచీనాః పయోదధిమధుఘృత
గుడాన్నాద్యమ్బరశయ్యాసనాభరణాదయః సర్వ ఏవ కామదుఘా నదాః
కుముదాగ్రాత్పతన్తస్తముత్తరేణేలావృతముపయోజయన్తి

ఇక నాలగవది అయిన న్యగ్రోధము (మఱ్ఱి). ఇక్కడ నాలుగు నదములు ఉన్నాయి. (తూర్పు నుంచి పశ్చిమానికి పారితే నదము). 

యానుపజుషాణానాం న కదాచిదపి ప్రజానాం వలీపలితక్లమస్వేదదౌర్గన్ధ్యజరామయమృత్యు
శీతోష్ణవైవర్ణ్యోపసర్గాదయస్తాపవిశేషా భవన్తి యావజ్జీవం సుఖం నిరతిశయమేవ

అన్ని కోరికలూ తీర్చే నదులు ఇవి. అన్ని కావలసిన వాటికీ నదులే ప్రసాదిస్తాయి.పరవతం నుంచి పడుతూ ఉత్తరం వైపునుంచి ఇలావృతానికి వ్యాపించి ఉంటుంది. ఈ నీరు తాగినందు వలనే వారిని దేవతలన్నారు. శరీరం మడత పడటం శరీరం దుర్గంధం రావడం మొదలైనవి ఉండవు.చలి వేడి రంగు మారడం లాంటివి ఈ నదీ జలం తాగే వారికి ఏర్పడవు. బతికున్నంతవరకు మాత్రం ఇవన్నీ అనుభవిస్తారు. 

కురఙ్గకురరకుసుమ్భవైకఙ్కత్రికూటశిశిరపతఙ్గరుచకనిషధశినీవాసకపిలశఙ్ఖ
వైదూర్యజారుధిహంసఋషభనాగకాలఞ్జరనారదాదయో వింశతిగిరయో మేరోః కర్ణికాయా ఇవ కేసరభూతా
మూలదేశే పరిత ఉపక్లృప్తాః

ఈ మొత్తం ఇరవై పర్వతాలు. ఇవి మేరు పర్వతానికి పూవు మధ్య చుట్టు ఉన్న కర్ణికలాగ ఉన్నాయి. మేరు పర్వతం మధ్యభాగమైతే ఈ ఇరవై పర్వతాలూ చుట్టూ వ్యాపించి ఉంటాయి. 

జఠరదేవకూటౌ మేరుం పూర్వేణాష్టాదశయోజనసహస్రముదగాయతౌ ద్విసహస్రం పృథుతుఙ్గౌ
భవతః ఏవమపరేణ పవనపారియాత్రౌ దక్షిణేన కైలాసకరవీరౌ ప్రాగాయతావేవముత్తరతస్త్రిశృఙ్గ
మకరావష్టభిరేతైః పరిసృతోऽగ్నిరివ పరితశ్చకాస్తి కాఞ్చనగిరిః

జఠరదేవ మేరు యొక్క పూర్వభాగములో ఉండి దశయోజన విస్తీర్ణముతో వ్యాపించి ఉంటాయి. ఇలా చుట్టూ ఉన్న పర్వతాలతో మేరుపర్వతం అగ్ని జ్వాలలతో ఆవరించి ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది.

మేరోర్మూర్ధని భగవత ఆత్మయోనేర్మధ్యత ఉపక్లృప్తాం పురీమయుతయోజనసాహస్రీం సమ
చతురస్రాం శాతకౌమ్భీం వదన్తి

మేరు యొక్క మూర్ధ్న భాగములో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరముంటుంది. పదివేల యోజనాలతో సమ చతురస్రముగా ఉంటుంది. అది శాతకుంభీ నగరం. 

తామనుపరితో లోకపాలానామష్టానాం యథాదిశం యథారూపం తురీయమానేన
పురోऽష్టావుపక్లృప్తాః

ఇలాంటి బ్రహ్మ పురిని చుట్టుకొని అష్టదిగ్పాలకుల నగరాలుంటాయి. ఏ దిక్కుకు ఏ పాలకులో ఆ దిక్కులో ఆ నగరాలుంటాయి. ఒక్కో దానికీ రెండవది నాలగవ వంతు.  

జంబూ ద్వీపములో నవ వర్షాలు. తొమ్మిది వేల యోజనాల వెడల్పు ఒక్కొక్కటీ. మొత్తం ఈ ద్వీపములో మర్యాదా గిరులు (హద్దులు) ఉన్నాయి. గుండ్రముగా ఉన్న భూమిలో నిలువుగా ఒక గీతా అడ్డముగా ఒక గీతా గీస్తే ఆ మధ్య నుండే దానిలో ఇలావృతమనే వర్షముంది. అది నాభి యందు ఉంది, అక్కడ ఉన్న పర్వతం పేరు మేరువు. అది బంగారములా మెరుస్తూ ఉంటుంది. అది ముప్పై రెండు వేల యోజనాలు వెడల్పు. మొదలు పదహారు వేలు భూమిలోకి పదహారు వేలు. ఇలా వృతమనేది మధ్యలో ఉంది. దానికి ఉత్తరముగా (అంటే మీదకి) మూడు ఉన్నాయి నీలా శ్వేత శృంగవాన్ అని మూడు కొండలు. అక్కడ రమ్యక హిరణ్మయ కురు అనే మూడు వర్షాలు ఇలావృత వర్షం మీద ఉన్నాయి. దానికి ఈ పక్కా ఆ పక్కా ఉప్పు సముద్రం. అది ఒక్కో దానికంటే రెండవది రెండు వేల యోజనాల ఎక్కువ ఉంటుంది. ఇంక కిందకు వస్తే నిషధం హేమకూటం హిమాలయం అంటే మూడు పర్వతాలు. మధ్యభాగానికి దక్షిణం వైపు ఉంది. అక్కడ హరి వర్షమూ కింపురుష వర్షమూ భారత వర్షమూ ఉన్నాయి. మొదట ఇలా వృతానికి దగ్గరగా ఉన్నది హరి వర్షం, దానికింద కింపురుష, దాని కింద భారత. ఇలా వృత వర్షానికి పడమట వైపు మాల్యవత్ అనే పర్వతం తూర్పు వైపు గంధమాధనమనే పర్వతం ఉన్నాయి. అక్కడ కేతు మాల భద్రాశ్వమనే వర్షం ఉన్నాయి. ఇవి మొత్తం తొమ్మిది వర్షముల యొక్క సంస్థానం. వీటిలో మందరమూ మేరు మందరమూ సుపార్శ్వమూ కుముదమూ అని మధ్యలో ఉన్న మేరుపర్వతానికి దగ్గరలో దాని అంత ఎత్తుకాకుండా దానికి కాపలాగా అన్నట్లుగా ఈ నాలుగు పర్వతాలూ ఉన్నాయి. తామర మధ్య చుట్టూ ఉన్న రేకులలాగ. ఈ నాలుగు పర్వతాల మీదా నాలుగు చెట్లున్నాయి మామిడీ నేరేడు కదంబ మర్రి చెట్లు. ఈ పర్వతాలు కొన్ని వేల యోజనాల ఎత్తు ఉన్నాయి, ఎన్నో శాఖలు కలిగి ఉన్నాయి, విశాలమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మంచి నీళ్ళ సరస్సు ఒకటి తేనే సరస్సు ఒకటి చెరుకు సరస్సు పాల సరస్సూ ఉన్నాయి. అక్కడ దేవతల ఉద్యానాలు ఉన్నాయి - నందనం చైత్రథం వైభ్రాజకం సర్వతోభద్రమని. అక్కడి దేవతలందరూ వారి వారి భార్యలతో కలిసి వచ్చి విహరిస్తూ ఉంటారు.

ఈ మందర పర్వతం మీద కొండంత మామిడి పళ్ళు పండుతాయి. అవి రాలి కిందపడి వాటి రసం పారుతూ ఉంటుంది. అదే అరుణోదా అనే నది మందర గిరి శిఖరం నుండి ఇలావృత వర్షమునకు వస్తుంది ఆ నది. దానిని చుట్టుపక్కలా ఉండే యక్షులు అనుభ్వైస్తూ ఉంటారు. మరొక పర్వతం (దక్షిణ భాగం మీద ఉన్న కొండమీద) జంబూ అనే నేరేడు చెట్టు చాలా ఎత్తుగా ఉండి ఏనుగంత నేరేడు పళ్ళు కిందపడి వాటి రసం పారి, మేరు మందర శిఖరం కంటే ఎత్తైన దానినుండి ఇలావృతానికి దక్షిణముగా పారుతోంది. ఈ రెండు వైపులా ఉన్న మట్టి ఈ నేరేడు పళ్ళు రసములు తగలడం వలన బంగారములా మెరుస్తూ ఉంటుంది. మెరవడం చేతనూ ఆ మట్టి చేతనే బంగారం రావడం చేతనూ దానికి జాంబూనదం అని పేరు పెట్టారు. ఆ జంబూ నది ఒడ్డులో బంగారం పండుతుంది.

Popular Posts