Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ముప్పై మూడవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీసా కర్దమస్య దయితా కిల దేవహూతిః
విస్రస్తమోహపటలా తమభిప్రణమ్యతుష్టావ తత్త్వవిషయాఙ్కితసిద్ధిభూమిమ్

కపిలుని తల్లి కపిలుని మాటలు వినగానే ఇంతవరకూ ఆమెను అంటిపెట్టుకుని ఉన్న మోహం అనే వస్త్రం జారిపోయింది. అంటే దేహాత్మాభిమానం తొలగిపోయింది. తొలగి కపిలునికి నమస్కరించింది (మోహం తొలగకుంటే కన్న కొడుకుకు నమస్కారం చేయదు). తత్వ విషయాన్ని (ప్రకృతీ జీవుడూ పరమాత్మ అనే తత్వ త్రయం గురించి తెలుసుకుని, సాంఖ్యాన్నిం జ్ఞ్యానన్ని, భక్తినీ, వైరాగ్యాన్ని) తెలుసుకొని స్తోత్రం చేసింది.  అన్ని రకముల తత్వ విషయములూ, నానటానికి, నాటినవి పండటానికి పనికొచ్చే క్షేత్రమైన కపిలుడిని మోక్షం చేయుటకు ప్రారంభించింది

దేవహూతిరువాచ
అథాప్యజోऽన్తఃసలిలే శయానం భూతేన్ద్రియార్థాత్మమయం వపుస్తే
గుణప్రవాహం సదశేషబీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః

చతుర్ముఖ బ్రహ్మ కూడా నీ నాభి కమలము నుండి పుట్టి నీటిలో పడుకుని ఉన్నటువంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని స్తోత్రం చేసాడు. ఆయన శరీరం నుండే భూతములూ ఇంద్రియములూ తన్మాత్రలూ పుట్టాయి. అన్ని గుణములకూ (త్రిగుణాలకు) ఇదే మూల కారణం. అటువంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని సకల చరాచర జగత్తుకూ మూలకారణమైన దానిగా ధ్యానం చేసాడు. నీ నాభినందు ఉన్న పద్మం నుండి పుట్టాడు కాబట్టి, నిన్ను చూడగలిగి ధ్యానం చేసాడు

స ఏవ విశ్వస్య భవాన్విధత్తే గుణప్రవాహేణ విభక్తవీర్యః
సర్గాద్యనీహోऽవితథాభిసన్ధిరాత్మేశ్వరోऽతర్క్యసహస్రశక్తిః

రజో మూర్తిగా సృష్టీ, తమో మూర్తిగా సంహారం, సత్వ మూర్తిగా రక్షణా చేస్తావు. నీకు దేని మీదా కోరిక లేదు. మేము ఆచరించిన కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవింపచేయడానికి సృష్టి చేస్తావు. కొంత విరామం అవసరం అనుకున్నప్పుడు ప్రళయం. నీ సంకల్పం వ్యర్థం కాదు (అవితథ). నీవు అన్ని ఆత్మలకూ అధిపతివి. ఎవరి ఊహకూ అందని అనంతమ్మైన శక్తి కలవాడవు. 

స త్వం భృతో మే జఠరేణ నాథ కథం ను యస్యోదర ఏతదాసీత్
విశ్వం యుగాన్తే వటపత్ర ఏకః శేతే స్మ మాయాశిశురఙ్ఘ్రిపానః

సకల చరాచర జగత్తునూ సంకల్పమాత్రముచే సృష్టి చేయగల నీవు నా గర్భముతో ధరించబడ్డావు. ఈ ప్రపంచమంతా ఎవరి కడుపులో ఉన్నదో, అటువంటి నీవు నా కడుపులో ఎలా పెరిగావు. యుగాంతములో వటపత్రములో మాయా శిశువుగా ఉండి నీ పాదాన్ని నీవే పానం చేస్తున్నావు. 

త్వం దేహతన్త్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే
యథావతారాస్తవ సూకరాదయస్తథాయమప్యాత్మపథోపలబ్ధయే

నీవు మాలాగ కర్మబద్ధుడవు కావు. నీ దివ్య మంగళ విగ్రహం నీ స్వాధీనములో ఉన్నవాడవు. పాపాత్ములను శమింపచేయడానికి వచ్చావు నీవు. నీ ఆజ్ఞ్యను పరిపాలించే వారి ముక్తికోసం వచ్చావు. అందుకోసమే వరాహాది అవతారాలను స్వీకరించావు. ఎలాగైతే వరాహాది అవతారాలు దుష్ట శిక్షణకూ శిష్ట రక్షణకూ ఏర్పడ్డాయో, ఈ నీ అవతారం ఆత్మ జ్ఞ్యానాన్ని ఉపదేశించడానికే. 

యన్నామధేయశ్రవణానుకీర్తనాద్యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్
శ్వాదోऽపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్

మనని మనం గొప్పగా తలచుకుంటూ ఉండకుండా ఉండటానికీ, ఏ రోజు చేసిన పాపాన్ని ఆ రోజు తొలగించుకోవడానికి సంధ్యావందనం ఎలా చేస్తామో అలా ఈ శ్లోకాన్ని నిత్య పారాయణ చేసుకోవాలి. సంధ్యావందనం చేయకపోయినా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ఆపకూడదు. 
గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఈ శ్లోకములో ఉంది. 
"ఏ మహానుభావుని యొక్క నామమును వినడం వలనా, పలకడం వలన, ఎవరికి తలవంచి నమస్కరించడం వలన, ఎవరికి నమస్కరించడం వలన, కుక్క మాన్సం తినే వాడైనా వెంటనే యజ్ఞ్యాధికారాన్ని పొందుతాడు. అలాంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించినవాడికి కలగనిది ఏమిటి?" 
నీ దివ్య మంగళ విగ్రహాన్ని మేము మాటి మాటికీ ధ్యానం చేస్తామూ (తత్ సవితుః వరేణ్యం). వెంటనే వాడు యజ్ఞ్యం చేయగలడు (ధియో యోనః ప్రచోదయాత్). యజ్ఞ్యం అంటే మనదీ అనుకుంటున్న ద్రవ్యమూ,నాదీ అనుకునే ఆస్థిని పరమాత్మకు అర్పించే బుద్ధి కలుగుతుంది. 
ఆ గాయత్రీ మంత్రార్థాన్నే ఈ శ్లోకములో చెప్పబడినది.

అహో బత శ్వపచోऽతో గరీయాన్యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్
తేపుస్తపస్తే జుహువుః సస్నురార్యా బ్రహ్మానూచుర్నామ గృణన్తి యే తే

ఎవరినాలుక కొనలో నీ పేరు ఉందో, వాడు చండాలుడైనా, తక్క్కిన వారందరికంటే గొప్పవాడు. ఎవరు నీ నామ సంకీర్తనం చేస్తారో వారు అన్ని తపస్సులూ, హోమములూ చేసినవారే, అందరినీ స్తోత్రం చేసినవారే. భగవన్నామ సంకీర్తన చేసిన వారు వేదమును చెప్పుకున్నవారే. 

తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యమ్
స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వన్దే విష్ణుం కపిలం వేదగర్భమ్

అలాంటి పరబ్రహ్మ అయిన, ఉత్తమ పురుషుడివైన నిన్నూ, శరీరముతో కాకుండా, బుద్ధితో మాత్రమే ధ్యానించదగిన వాడినీ, మూడు గుణములనూ ప్రవర్తింపచేసిన వాడినీ, మూడు గుణాలను నశింపచేసేవాడివీ అయినా. వేద గర్బుడవైన నీకు ( వేదం అంటే బ్రహ్మ - బ్రహ్మను గర్భములో దాచుకున్నవాడు, ఆయనకు వేదం ఉపదేశించిన వాడు) నమస్కరిస్తున్నాను. 

మైత్రేయ ఉవాచ
ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్
వాచావిక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః

ఇలా స్తోత్రం చేయబడిన కపిలుడు తల్లి మీద ప్రేమతో గంభీరమైన మాటతో అన్నాడు

కపిల ఉవాచ
మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే
ఆస్థితేన పరాం కాష్ఠామచిరాదవరోత్స్యసి

నేను చెప్పిన, ప్రతీ వారు సులభముగా సేవించదగినా ఈ మార్గముతో ఈ యోగ మార్గాన్ని నీవాచరిస్తే త్వరలోనే ఉత్తమగతిని పొందుతావు

శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం జుష్టం యద్బ్రహ్మవాదిభిః
యేన మామభయం యాయా మృత్యుమృచ్ఛన్త్యతద్విదః

నేను చెప్పిన విషయాన్ని నమ్ము. ఇదివరకు దీన్ని బ్రహ్మజ్ఞ్యానం కలవరాందరు సేవించారు. అలాంటి ఈ తత్వాన్ని, మార్గాన్ని అవలంబిస్తే భయమును తొలగించే నన్ను పొందుతారు. అది మరిస్తే మృత్యువును (సంసారాన్నీ, అజ్ఞ్యానాన్నీ) పొందుతారు. 

మైత్రేయ ఉవాచ

ఇతి ప్రదర్శ్య భగవాన్సతీం తామాత్మనో గతిమ్
స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోऽనుమతో యయౌ

ఈ ప్రకారముగా పరమాత్మ కపిలుడు తల్లికి ఆత్మ జ్ఞ్యానాన్ని బోధించి బ్రహ్మవాదిని అయిన తల్లి అనుమతి తీసుకుని కపిలుడు వెళ్ళిపోయాడు

సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్
తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహితా

ఆమె కూడా సరస్వతీ నదీ తీరములో కుమారుడు చెప్పిన యోగమార్గాన్ని సావధానముగా అనుష్టించి అక్కడే ఉంది

అభీక్ష్ణావగాహకపిశాన్జటిలాన్కుటిలాలకాన్
ఆత్మానం చోగ్రతపసా బిభ్రతీ చీరిణం కృశమ్

పూర్తిగా యోగములో పడి, మౌనాన్ని వహించి (అభీక్ష్ణావగా), తైల సంస్కారాన్ని విడిచిపెట్టింది, దేహ సంస్కారాన్ని విడిచి పెట్టింది, వస్త్ర సంస్కారాన్ని విడిచిపెట్టింది. గొప్ప తపస్సుతో బక్క చిక్కి ఉంది, శరీరమంతా శిధిలమైపోతోంది. 

ప్రజాపతేః కర్దమస్య తపోయోగవిజృమ్భితమ్
స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి
పయఃఫేననిభాః శయ్యా దాన్తా రుక్మపరిచ్ఛదాః
ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ
స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ
రత్నప్రదీపా ఆభాన్తి లలనా రత్నసంయుతాః
దేవహూతి అనుభవించిన భోగాలు విమానములో సంచరించే యక్ష కిన్నెరులు కూడా అనుభవించలేదు. అంతటి భోగాన్ని అనుభవించిన దేవహూతి, ఇప్పుడున్న స్థితికీ అప్పటి స్థితికీ పోలిక లేదు. ఈ శరీరముతో అనుభవించేవి మనవి కావు, మనకి కాదు. అనుభవించడానికి కూడా మనము కర్తలము కాదు. అంతటి దివ్యమైన విమానములో దివ్యమైన భోగాలు అనుభవించిన కర్దముని భార్య తీవ్రమైన తపస్సుతో శరీరాన్ని కృశింపచేసుకుంది. ఈ రెండూ ఇచ్చినది పరమాత్మే. దాన్ని ఎంత ఆనందముగా అనుభవించిందో దీన్ని కూడా అంత ఆనందముగా అనుభవించింది. అందుకే భారతం మొత్తం చదవలేని వారు స్వర్గారోహణ పర్వాన్ని చదవమంటారు. అహ్స్టదిక్పాలకులకు కూడా అందని భోగాలి అనుభవించిన ధర్మరాజు, ఒక గోచీ పెట్టుకుని జుట్టు విరబోసుకుని అన్ని వదిలివేసి విరాగి అయి బయలుదేరాడు. అదే స్థితి దేవహూతి పొందింది. 
దేవతలు కూడా ఆశ పొందే గృహస్థాశ్రమ భోగాలు, పాలనీటి నురుగులాంటి శయ్యా, ఏనుగు దంతలములతో చేయబడిన మంచమూ, దాని మీద  బంగారు తొడుగు తొడిగారు. బంగారు ఆసనములూ, వజ్రఖచితములైనవీ అయిన ఆసనములూ, వాటి మీద "ఇంకా సేపు కూర్చుంటే బాగుండు " అనిపించే ఆసనములు వేసి, ఆ మాహానుభావురాలు సంచరించిన ఇళ్ళకు స్పటిక మణులతో చేయబడిన గోడలు, మరకత మణులతో చేయబడినవీ, ఆ రత్న దీపాలు ఉన్న భవనాలలో స్త్రీ రత్నాలు సంచరిస్తూ ఉన్నారు

గృహోద్యానం కుసుమితై రమ్యం బహ్వమరద్రుమైః
కూజద్విహఙ్గమిథునం గాయన్మత్తమధువ్రతమ్

ఇంటిలోనే ఉద్యాన వనాలు ఉన్నాయి, ఆ తోటలలో ఉన్నవన్నీ స్వర్గమునుంచి వచ్చాయి. రవములు చేసే పక్షులు, ఝంకారం చేస్తున్న తుమ్మెదలూ. 

యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జగుః
వాప్యాముత్పలగన్ధిన్యాం కర్దమేనోపలాలితమ్

ఇలాంటి తోటలోకి వస్తే మానవులు కూడా మేము దేవతలయ్యాము అనుకుంటారు. దేవతలు వస్తే "ఇదే లోకమూ" అని ఆశ్చర్య పడతారు. ఇంద్రుని ప్రియురాళ్ళు కూడా స్వర్గాన్ని విడిచి పెట్టి ఇలాంటి దానిలో విహరించాలి అనుకుంటారు

హిత్వా తదీప్సితతమమప్యాఖణ్డలయోషితామ్
కిఞ్చిచ్చకార వదనం పుత్రవిశ్లేషణాతురా

వీటన్నిటినీ విడిచిపెట్టింది. అయినా మొహం కొద్దిగా చిన్న బోయినది. కొడుకుని విడిచిపెట్టినందుకు

వనం ప్రవ్రజితే పత్యావపత్యవిరహాతురా
జ్ఞాతతత్త్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సలా

భర్తా కొడుకూ అడవికి వెళ్ళినందుకు, వారి విరహముతో, కపిలుడు తత్వాన్ని చెప్పినా, దూడను విడిచిన ఆవులా కాస్త విలపించింది

తమేవ ధ్యాయతీ దేవమపత్యం కపిలం హరిమ్
బభూవాచిరతో వత్స నిఃస్పృహా తాదృశే గృహే

కుమారుడిని ధ్యానం చేసి, ఆయన పరమాత్మే కాబట్టి, ఇంత గొప్ప భోగాలలో ఉన్న కోరికను విడిచి పెట్టింది.

ధ్యాయతీ భగవద్రూపం యదాహ ధ్యానగోచరమ్
సుతః ప్రసన్నవదనం సమస్తవ్యస్తచిన్తయా

కపిలుడు చెప్పిన రీతిలో భగవద్ రూపాన్ని ధ్యానం చేస్తూ, మొదట ముఖమండలాన్ని, తరువాత ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేసిందీ, తరువాత సంపూర్ణ రూపాన్ని ధ్యానం చేసింది

భక్తిప్రవాహయోగేన వైరాగ్యేణ బలీయసా
యుక్తానుష్ఠానజాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా

స్వామి బోధించడం వలన ఆమెలో భక్తి పెల్లుబికింది, జ్ఞ్యానము పెరిగింది, వైరాగ్యమూ పెరిగింది. ఉత్త జ్ఞ్యానము కాకుండా, కపిలుడు చెప్పిన ఆచారాలను అనుష్టించింది. యోగ్యమైన (యుక్తానుష్ఠానం - అంటే వర్ణాశ్రమాలకు తగిన అనుష్ఠానం) "అనుష్ఠానముతో" కలిగిన జ్ఞ్యానమును. (అనుష్ఠానం వల్లనే జ్ఞ్యానం కలుగుతుంది). పరమాత్మ స్వరూపం తెలిపే జ్ఞ్యానముతో

విశుద్ధేన తదాత్మానమాత్మనా విశ్వతోముఖమ్
స్వానుభూత్యా తిరోభూత మాయాగుణవిశేషణమ్

పరిశుద్ధమైన మనసుతో అన్ని వైపులా సంచరించే ఆత్మను, తన అనుభవుంలో ఇంతవరకూ దాగి ఉన్న దానిని, అన్న్ని మాయా గుణాలు దాగి ఉన్న దానిని, ప్రతీ ప్రాణికీ అంతరాత్మగా ఉన్న పరమాత్మ యందు మనసు లగ్నం చేసి 

బ్రహ్మణ్యవస్థితమతిర్భగవత్యాత్మసంశ్రయే
నివృత్తజీవాపత్తిత్వాత్క్షీణక్లేశాప్తనిర్వృతిః

"నేను జీవుడిని. ఇది నా శరీరము" అనే జ్ఞ్యానం పూర్తిగా తొలగింది. భేద దర్శనం పోయింది. శరీరం మీద అభిమానముతో వచ్చిన అన్ని కష్టాలూ తొలిగాయి. తృప్తి కలిగింది, ఆనందం కలిగింది. 

నిత్యారూఢసమాధిత్వాత్పరావృత్తగుణభ్రమా
న సస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థితః

నిరంతర సమాధి వలన అన్ని గుణ భ్రమలూ తొలగిపోయాయి, తన శరీరాన్ని కూడా తలచుకోలేదు, కలగన్న వాడు కల వీడిన తరువాత తన కలను ఎలా తలచుకోడో

తద్దేహః పరతః పోషోऽప్యకృశశ్చాధ్యసమ్భవాత్
బభౌ మలైరవచ్ఛన్నః సధూమ ఇవ పావకః

శరీరం మీద అభిమానం పోయి, అసలు శరీరమున్నట్లే తెలియని స్థితిలో ఆ శరీరాన్ని పరమాత్మే పోషించాలి. పరమాత్మ యందు పూర్తిగా మనసు లగ్నం చేసినందువలన పరమాత్మే పోషించాడు. అందువలన బక్క చిక్కలేదు ఎలాంటి మానసిక బాధా లేదు కాబట్టి (ఆధ్యసంభవాత్ - శరీరం చిక్కేది రోగాలతో కాదు, మనో రోగాలతో). ఒళ్ళంతా మురికి పట్టి ఉంది, నివురు గప్పిన నిప్పులాగ. 

స్వాఙ్గం తపోయోగమయం ముక్తకేశం గతామ్బరమ్
దైవగుప్తం న బుబుధే వాసుదేవప్రవిష్టధీః

ఆమె శరీరం తపో యోగమయమై, కేశములు రాలిపోయి, కేశములు విడిపోయాయి, వస్త్రం కూడా చిద్రమైపోయింది, ఆమె మనసు మాత్రం పరమాత్మ యందు స్థిరముగా ఉంది. 

ఏవం సా కపిలోక్తేన మార్గేణాచిరతః పరమ్
ఆత్మానం బ్రహ్మనిర్వాణం భగవన్తమవాప హ

ఇలా కుమారుడైన కపిలుడు చెప్పిన యోగమార్గాన్ని అక్షరాలా ఆచరించి, దాన్ని బాగా మనసులో నిలుపుకుని, త్వరలోనీ దేవహూతి పరమాత్మను చేరినది

తద్వీరాసీత్పుణ్యతమం క్షేత్రం త్రైలోక్యవిశ్రుతమ్
నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిముపేయుషీ

ఇలా ఈ మహానుభావులందరూ ఉండి వచ్చి వెళ్ళీ సంచరించిన ఆ క్షేత్రం (కర్దమాశ్రమం, ఇదే కపిలాశ్రమం, ఇదే వామనాశ్రమం, సిద్ధాశ్రమం - విశ్వామిత్రుడు మారిచ సుబాహులను తరిమిందీ ఇక్కడే). ఇదే సిద్ధాశ్రమం. దేవహూతి ఇక్కడే సిద్ధి పొందింది కాబట్టి ఇది సిద్ధాశ్రమం.

తస్యాస్తద్యోగవిధుత మార్త్యం మర్త్యమభూత్సరిత్
స్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసేవితా

ఈమె యోగములో ఉన్నప్పుడు యోగకారణముగా ఆమె శరీరము నుండి ఒక ప్రవాహం బయలుదేరి బయలుదేరింది. అందరికీ సిద్ధి ప్రసాదించేది. దాన్ని సిద్ధిదా నదీ అంటారు. సిద్ధులందరి చేతా సేవించబడినది

కపిలోऽపి మహాయోగీ భగవాన్పితురాశ్రమాత్
మాతరం సమనుజ్ఞాప్య ప్రాగుదీచీం దిశం యయౌ

దేవహూతి వలన అనుమతి పొందిన కపిలుడు ఈశాన్య దిక్కుకు బయలుదేరి వెళ్ళాడు

సిద్ధచారణగన్ధర్వైర్మునిభిశ్చాప్సరోగణైః
స్తూయమానః సముద్రేణ దత్తార్హణనికేతనః

సిద్ధ గంధర్వ కిన్నెరాదులతో స్తోత్రం చేయబడుతూ వెళుతుంటే సముద్రం ఎదురొచ్చి పూజించి ఆశ్రయాన్ని ఇచ్చాడు. 

ఆస్తే యోగం సమాస్థాయ సాఙ్ఖ్యాచార్యైరభిష్టుతః
త్రయాణామపి లోకానాముపశాన్త్యై సమాహితః

ఇలా ఈ యోగమును ఆశ్రయించి, అంతకుముందు ఉన్న సకల సాంఖ్యాచార్యులచే సేవించబడుతూ, మూడు లోకాల తాపం చల్లారడానికి యోగమును అనుష్ఠిస్తూ ఇక్కడే ఉన్నాడు. 

ఏతన్నిగదితం తాత యత్పృష్టోऽహం తవానఘ
కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః

నీవు నన్ను ఏమడిగావో దానిని నీకు వివరించాను. కపిల దేవహూతి సంవాదము,పరమపావమైనదాన్ని నీకు చెపాను. 

య ఇదమనుశృణోతి యోऽభిధత్తే కపిలమునేర్మతమాత్మయోగగుహ్యమ్
భగవతి కృతధీః సుపర్ణకేతావుపలభతే భగవత్పదారవిన్దమ్

పరమ పవిత్రమైన, రహస్యమైన ఈ సంవాదాన్ని ఎవరు వింటారో, ఎవరు చెబుతారో, భగవంతుని యందు మనసు లగ్నము చేసి పరమాత్మ యొక్క పాద పద్మములను పొందుతారు. 

దీన్ని ప్రతీ దశమి ఏకాదశి ద్వాదశులలో పారయణ చేస్తారు. వినటమే కాదు ఆచరణ ముఖ్యం. 

                                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts