Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పదవ అధ్యాయం

బ్రహ్మకు పరమాత్మ తన దివ్య రూపాన్ని స్వభావాన్నీ సాక్షాత్కరింపచేసి అంతర్థానం చెందాడు

విదుర ఉవాచ
అన్తర్హితే భగవతి బ్రహ్మా లోకపితామహః
ప్రజాః ససర్జ కతిధా దైహికీర్మానసీర్విభుః

పరమాత్మ అంతర్హితమైన తరువాత బ్రహ్మగారు ఎలా సృష్టి చేసారు. దేహ సృష్టి, మానసిక సృష్టి ఎలా చేసారు.

యే చ మే భగవన్పృష్టాస్త్వయ్యర్థా బహువిత్తమ
తాన్వదస్వానుపూర్వ్యేణ ఛిన్ధి నః సర్వసంశయాన్

విషయములు తెలిసినవారిలో నీవు శ్రేష్టుడవు. నేను ఇదివరకు ఏమేమి విషయాలు అడిగి ఉన్నానో. నేనడిగిన వాటిని యథాప్రకారముగా చెప్పవలసిన పని లేదు. నీకు ఎలా అనుకూలముగా ఉంటే అలా చెప్పండి. మాకున్న అన్ని సందేహాలూ తొలగాలి.

సూత ఉవాచ
ఏవం సఞ్చోదితస్తేన క్షత్త్రా కౌషారవిర్మునిః
ప్రీతః ప్రత్యాహ తాన్ప్రశ్నాన్హృదిస్థానథ భార్గవ

ఈ మైత్రేయుడు విదురునిచే అడగబడి ఇలా అన్నాడు. విదురుడు అడిగిన ప్రశ్నలు హృదయములో అలాగే ఉన్నాయి.

మైత్రేయ ఉవాచ
విరిఞ్చోऽపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః
ఆత్మన్యాత్మానమావేశ్య యథాహ భగవానజః

పరమాత్మ ఆజ్ఞ్య ప్రకారం బ్రహ్మగారు నూరు దివ్య సంవత్సరములు పరమాత్మ యందు మనసు ఉంచి శ్రీమన్నారాయణుడు ఎలా చెప్పడో అలా చేసాడు

తద్విలోక్యాబ్జసమ్భూతో వాయునా యదధిష్ఠితః
పద్మమమ్భశ్చ తత్కాల కృతవీర్యేణ కమ్పితమ్

ఇలా తపస్సు చేయడం పూర్తి అయిన తరువాత చూస్తే ఆయన కూర్చున్న పద్మం కంపించింది. కంపించింది అంటే అందులో వాయువు లేదా జలమూ ఉండలి. ఆ పద్మము కాలము చేత ఏర్పడిన శక్తితో కదిలింది. పంచభూతములలో వృద్ధి క్షయములు కాల ప్రభావము చేత వస్తుంది. పుణ్యము చేసిన వారందరూ ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే అక్కడ సూర్యుని ప్రభావం తక్కువగా ఉంటుంది. వ్యక్తితః వస్తుతః దేశతః కాలతః మారుతూ ఉంటాయి.

తపసా హ్యేధమానేన విద్యయా చాత్మసంస్థయా
వివృద్ధవిజ్ఞానబలో న్యపాద్వాయుం సహామ్భసా

అలా పద్మం కదలడం చూసి, తపసు బాగా చేసాడు కాబట్టి, తపశ్శక్తి పెరగడం వలన విజ్ఞ్యాన బలం అభివృద్ధి చెందిన వాడై, ఆ వాయువునూ జలమునూ పానము చేసాడు. పద్మమంటే లోకమునకు ప్రతిరూపం. ఇపుడు ఆ పద్మం నీటిలో ఉంది కాబట్టి ముందు ఆ నీటిని పానం చేసాడు.

తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితమ్
అనేన లోకాన్ప్రాగ్లీనాన్కల్పితాస్మీత్యచిన్తయత్

ఆ రెంటినీ పానము చేసాక బయట పడిన పద్మాన్ని చూచాడు. ఆకాశము వరకూ విస్తరించి ఉన్న పద్మాన్ని చూచాడు. దీనితోటే ఇది వరకు ఇందులో రహస్యముగా లీనమయ్యి ఉన్న లోకాలను నేను కల్పిస్తాను

పద్మకోశం తదావిశ్య భగవత్కర్మచోదితః
ఏకం వ్యభాఙ్క్షీదురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా

పరమాత్మ యొక్క సంకల్పం చేత ప్రేరేపించబడి పద్మ కోశములోకి ప్రవేశించి, ఒకటిగా ఉన్న పద్మాన్ని విభజించాడు. భోక్తా భోగ్యమూ భోగ్యోపకరణములు అంటే అనుభవించేవాడు అనుభవించబడేవి అనుభవించడానికి సాధనాలుగా లేదా జీవుడూ విషయములూ ఇంద్రియాలుగా విభజించాడు. ఇంక నాలుగవది భోగస్థానములు
1. భోక్త (జీవుడు) 2. భోగ్యం (శబ్ద స్పర్శ రూప రస గంధములు) 3. భోగోపకరణము (ఇంద్రియములు) 4. భోగస్థానము (ఆయా లోకములు)
విషయ్మూ కరణమూ కర్తా. ఇవన్నీ ఉన్నా స్థానం ఉండాలి. తినడానికి అన్నీ ఉండి తినేవాడూ ఉండి ఆకలీ ఉన్నా, తినే పాత్ర ఎలా అవసరమో అలాగే భోగస్థానములు అవసరం.
ఒకటిగా ఉన్న దాన్ని ఈ విధముగా మూడు భాగాలుగా విభజించాడు. పదునాలుగు లోకాలను (ద్విసప్తధా) తనలో ఉంచుకున్న పద్మాన్ని మూడుగా విభజించాడు. పృధ్వికి శరీరం మనకి  మట్టి, ఇంద్రియం ఘ్రాణం, విషయం గంధము. ఇలాగే ప్రతీ దానికీ మూడు ఉంటాయి. శరీరం ఇంద్రియం విషయం.

ఏతావాఞ్జీవలోకస్య సంస్థాభేదః సమాహృతః
ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠ్యసౌ

ఇలా చేయడానికి బ్రహ్మగారికి అంత శక్తి ఎలా  వచ్చింది?  బ్రహ్మ అంటే నిష్కామ ధర్మాచరణకు ఫలం (విపాకః). "నేను సృష్టి చేస్తాను " అని సంకల్పించలేదు. తాను చేయబోయే సృష్టికి ఫలితం ఏమొస్తుంది అని అడగలేదు. బ్రహ్మ అంటే నిష్కామ కర్మ యోగి. నిష్కామ కర్మను ఆచరించేవారు లోకోత్తరమైన ఏ కార్య్మైనా చేయగలడు.

విదుర ఉవాచ
యథాత్థ బహురూపస్య హరేరద్భుతకర్మణః
కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్యథా వర్ణయ నః ప్రభో

కాల చోదితముతో సృష్టిచేసాడు అంటున్నారు.  అంటే సృష్టి కంటే ముందు కాలమున్నట్టే కదా? అత్యాశ్చర్యకరములైన కర్మలు చేసే పరమాత్మ కాలాన్ని ఆధారముగా చేసుకుని ఏమేమి పనులు చేస్తున్నాడు

మైత్రేయ ఉవాచ
గుణవ్యతికరాకారో నిర్విశేషోऽప్రతిష్ఠితః
పురుషస్తదుపాదానమాత్మానం లీలయాసృజత్

మూల ప్రకృతి అనేది బిందు రూపములో ఉంటుంది. ఇది మహా సూక్ష్మం. స్వరూప స్వభావమేదీ తెలియదు.  తరువాత ఉండీ ఉండనట్లు ఉండేది అవ్యక్తము. తరువాత "ఇది లేకపోతే ఏ పని జరగదు " అని అనిపిస్తుంది. అది ప్రధానం. తరువాత పరమాత్మ గుణములు కూర్చుటతో ఒక స్వభావానికి వస్తుంది. ఇది ప్రకృతి. అపుడు ఆ గుణమయి అయిన ప్రకృతిలోకి పరమాత్మ ప్రవేశించి క్షోభింపచేస్తాడు. "దారాలను ముట్టుకోకుండా వస్త్రాన్ని ముట్టుకున్నట్టు" పరమాత్మ గుణత్రయముతో ఉన్న ప్రకృతిలో ఆ గుణాలని తాకకుండా ప్రవేశిస్తాడు. అహంకార సృష్టి ఏర్పడే వరకూ ప్రకృతిలో గుణములు బయటకి తెలియబడవు. ప్రకృతిని క్షోభింపచేసిన తరువాత, ప్రకృతిని నుండి మహత్ తత్వం ఆవిర్భవిస్తే. వాటి నుండి అహంకారం వస్తే, ఆ అహంకారములో త్రిగుణాలు ఆవిష్కరింపబడతాయి. అహంకారములోకి ప్రకృతి తత్వములో ఉన్న గుణాలు ప్రవేశింపచేస్తాడు. ఇటువంటి పరమాశ్చర్య కరములైన కర్మలు పరమాత్మ చేస్తాడు. ఇది నిర్విశేషం. పృధివ్యాదులు లేనిది, గుణవ్యతికరము లేనిది.
అన్నిటికీ కారణమైన ఆ మూల ప్రకృతిని అనాయాసముగా లీలగా సృష్టించాడు.

విశ్వం వై బ్రహ్మతన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా
ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాలేనావ్యక్తమూర్తినా

సకల చరాచర జగత్తు ఆ పద్మములో నిలిచి ఉంది. ఒకటిగా ఉన్న పద్మము, ఏమీ కనపడని స్థితి, అందులో తాను ప్రవేశించి, అందులో దాగి ఉన్న అన్ని లోకములనూ, పరమాత్మ తన సంకల్పముతో, ఎవరికీ కనపడని కాలముతో వేరు వేరు చేసాడు. ప్రతీ వస్తువులోనూ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. పురుషరూపములో లోపలా, కాల రూపములో బయట. లోపల ఉన్నవాడు సంకల్ప వికల్పాలు కలిగిస్తాడు. బయట ఉన్న వాడు ఆ సంకల్పము కలిగేట్టు ప్రోత్సహిస్తాడు (శాసిస్తాడు).

యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశమ్
సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః

మనకు ఇప్పుడు ఏది ఎలా కనపడుతున్నదో ఇలాంటిదే అంతకు ముందు ఉన్నాది, ఇకముందు కూడా ఉంటుంది. ఈ సృష్టి తొమ్మిది రకాల సృష్టి. ప్రాకృత సృష్టి ఆరు. వైకృత సృష్టి మూడు. బ్రహ్మ కంటే ముందు ఉన్న సృష్టి ప్రాకృత సృష్టి. బ్రహ్మగారు చేసింది వైకృత సృష్టి

కాలద్రవ్యగుణైరస్య త్రివిధః ప్రతిసఙ్క్రమః
ఆద్యస్తు మహతః సర్గో గుణవైషమ్యమాత్మనః

సృష్టి గానీ ప్రళయం గానీ కావాలంటే కావలసినవి కాలమూ గుణమూ ద్రవ్యమూ. ప్రకృతి నుండి మొదలు ఏర్పడినది మహత్ తత్వం. ఇది గుణ వైశమ్యం. ప్రకృతిలో మూడు గుణాలూ ఉన్నా, అన్నీ సమానముగా ఉంటాయి. గుణ వైషమ్యం ఉండదు. సృష్టి కావాలంటే గుణ వైషమ్యం ఉండాలి. అందువలన మహత్ తత్వము వచ్చింది. ఆ మహత్ నుంచి అహంకారము వచ్చింది. ఈ అహంకారము నుండే ద్రవ్య (భూతములు) జ్ఞ్యాన (జ్ఞ్యానేంద్రియాలు) కర్మ (కర్మేంద్రియాలు)
1. మొదటి సృష్టి మహత్ తత్వం 2. అహంకార తత్వం

ద్వితీయస్త్వహమో యత్ర ద్రవ్యజ్ఞానక్రియోదయః
భూతసర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్

మూడవ సృష్టి తన్మాత్ర సృష్టి. ఇక తన్మాత్ర సృష్టి. తన్మాత్ర అంటే శబ్ద స్పర్శ రూప రస గంధముల సూక్ష్మావస్థలు. వీటి నుండే పంచభూతాలు ఏర్పడతాయి.


చతుర్థ ఐన్ద్రియః సర్గో యస్తు జ్ఞానక్రియాత్మకః
వైకారికో దేవసర్గః పఞ్చమో యన్మయం మనః

నాలుగవ సృష్టి ఇంద్రియములు. జ్ఞ్యాన కర్మేంద్రియాలు. ఐదవది దేవ సృష్టి (మనః సృష్టి). ఇంతవరకూ ఏర్పడిన జ్ఞ్యాన కర్మేంద్రియాలకు అధిష్ఠాన దేవతలు ఏర్పడతారు. దేవతలు ఇంద్రియాలను నడిపిస్తుంటారు. కన్ను వేరు, కన్నులో ఉండే చూచే శక్తి ఇంద్రియం వేరు, దాన్ని నడిపించే (చూపించే) శక్తి దేవత.

షష్ఠస్తు తమసః సర్గో యస్త్వబుద్ధికృతః ప్రభోః
షడిమే ప్రాకృతాః సర్గా వైకృతానపి మే శృణు

ఆరవది అజ్ఞ్యానం. ఇది తమస్సు, చీకటి. ఇది అబుద్ధికృతం (బుద్ధి లేనందువలన ఏర్పడేది). ఈ ఆరు ప్రాకృత సృష్టి. ఇపుడు వైకృత సృష్టి

రజోభాజో భగవతో లీలేయం హరిమేధసః
సప్తమో ముఖ్యసర్గస్తు షడ్విధస్తస్థుషాం చ యః

భగవంతుడు రజో గుణం స్వీకరించుట వలన సృష్టి జరుగ్తుంది. పరమాత్మ యొక్క సంకల్పము యొక్క లీల. ఇక ఏడవది ముఖ్య సర్గ. ఇది చేసినది బ్రహ్మ. ఇంతకుముందు చేసిన సృష్టి అంతా పరమాత్మ చేసినది. ముఖ్య సృష్టి ఆరు రకములు. దీనికే స్థావర సృష్టి అని పేరు.

వనస్పత్యోషధిలతా త్వక్సారా వీరుధో ద్రుమాః
ఉత్స్రోతసస్తమఃప్రాయా అన్తఃస్పర్శా విశేషిణః

ముందు ఆహారం సృష్టించబడిన తరువాతే జీవు ఏర్పడతాడు (ఉదా: గర్భవతి అయిన తరువాత పిల్లవాడు పుట్టకముందే పాలు ఏర్పడతాయి).
ఈ ఆరు రకాల ముఖ్య సృష్టి - వనస్పతి (తైలమును ప్రసాదించేవి), ఔషధి (పైరులు, వరి, జొన్న..ఒకే పంటనిచ్చేవి ), లత, త్వక్ సార (అరటి మొదలైన చర్మ ప్రధానమైనవి), వీరుధ్ (పొదలూ తీగలూ, కందములూ), ధ్రుమాః. ఇవన్నీ క్రిందనుంచి పైకొచ్చేవి. తమః ప్రాయ: అజ్ఞ్యానం వీటికి ప్రధానం. ఇవి అంతః స్పర్శ. మనం స్పృశిస్తే వాటికి జరిగే అనుభూతి బయటకి కనపడదు. అనుభూతిని వ్యక్తీకరింపచేయలేవు. ఇవి విశేషణ కలవి ( స్పందన కలవి)

తిరశ్చామష్టమః సర్గః సోऽష్టావింశద్విధో మతః
అవిదో భూరితమసో ఘ్రాణజ్ఞా హృద్యవేదినః

జంతువులు ఎనిమిదవ సృష్టి. ఇది ఇరవై ఎనిమిది రకాలుగా ఉంటుంది. జ్ఞ్యానము ఏమీ లేని సృష్టి. వాసన చూసి గుర్తుపట్టేవి. వీటి హృదయములో ఏవి తెలీదు (పగ, ద్వేషం లాంటివి).

గౌరజో మహిషః కృష్ణః సూకరో గవయో రురుః
ద్విశఫాః పశవశ్చేమే అవిరుష్ట్రశ్చ సత్తమ
ఖరోऽశ్వోऽశ్వతరో గౌరః శరభశ్చమరీ తథా
ఏతే చైకశఫాః క్షత్తః శృణు పఞ్చనఖాన్పశూన్
శ్వా సృగాలో వృకో వ్యాఘ్రో మార్జారః శశశల్లకౌ
సింహః కపిర్గజః కూర్మో గోధా చ మకరాదయః
కఙ్కగృధ్రబకశ్యేన భాసభల్లూకబర్హిణః
హంససారసచక్రాహ్వ కాకోలూకాదయః ఖగాః
అర్వాక్స్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణామ్
రజోऽధికాః కర్మపరా దుఃఖే చ సుఖమానినః

ఆవు మేక దున్నపోతు, లేడి, వరాహం, మేకలు, రురువు -  ఇవన్నీ రెండు కొమ్ములు గలవి.
గొర్రె, వొంటె, గాడిద, గుఱ్ఱం, మొదలైనవి ఒక గిట్ట ఉండేవి.
ఐదు గోళ్ళు ఉండే పశువులు: కుక్క , నక్క, తోడేలు , పెద్ద పులి, మార్జాలం, కుందేలు, ఏలు పంది, సిమ్హం, గజం, తాబేలు, కోతి, ఉడుము, మొసలి ఇలాంటివి. తరువాతవు పక్షులు.
తరువాత నిలువుగా ఉండేవారు, మానవులు. మానవులు రజో గుణం ఎక్కువగా ఉన్నవారు. కోరికలే వీరికి ప్రాణము. ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. దుఃఖాన్ని సుఃఖం అని అనుకుంటూ ఉంటారు.

వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమ
వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తూభయాత్మకః

ఇదే సృష్టిలో నరులూ దేవతలూ ఉంటారు. వీటిలోనే కౌమారులు (సనకాదులు) కూడా ఉన్నారు. ఈ కుమారులు ప్రతీ సృష్టిలోనూ ఉన్నారు కాబట్టి ప్రాకృతులు అవుతారు. బ్రహ్మగారు సృష్టిస్తున్నారు కాబట్టి వైకారికులు కూడా అవుతారు. కుమార సృష్టి ఉభయాత్మకః

దేవసర్గశ్చాష్టవిధో విబుధాః పితరోऽసురాః
గన్ధర్వాప్సరసః సిద్ధా యక్షరక్షాంసి చారణాః
భూతప్రేతపిశాచాశ్చ విద్యాధ్రాః కిన్నరాదయః
దశైతే విదురాఖ్యాతాః సర్గాస్తే విశ్వసృక్కృతాః

దేవతలు పది రకాల సృష్టి. భూత ప్రేత పిశాచాలు కూడా దేవతా సృష్టే. వారిలో తమో గుణం అధికం. ఇవన్నీ బ్రహ్మగారు చేసినవి.

అతః పరం ప్రవక్ష్యామి వంశాన్మన్వన్తరాణి చ
ఏవం రజఃప్లుతః స్రష్టా కల్పాదిష్వాత్మభూర్హరిః
సృజత్యమోఘసఙ్కల్ప ఆత్మైవాత్మానమాత్మనా

ఇక ఇక్కడినుంచి వంశములు మన్వంతరములూ వివరిస్తాను. బ్రహ్మ రజో గుణం తీసుకుని ప్రతీ కల్పము ఆదిలోనూ సృష్టి చేస్తాడు. సఫలమైన సార్ధకమైన సంకల్పం కలవాడు కాబట్టి తానే తనతో తనను సృష్టి చేసుకుంటాడు. ఆయనే ఉపాదానం ఆయనే నిమిత్తం  ఆయనే సహకారి. సూక్ష్మాకారంగా ఉండేవాడు స్థూలాకారముగా మారుతాడు. 

Popular Posts