Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదకొండొవ అధ్యాయం

సూత ఉవాచ
ఆనర్తాన్స ఉపవ్రజ్య స్వృద్ధాఞ్జనపదాన్స్వకాన్
దధ్మౌ దరవరం తేషాం విషాదం శమయన్నివ

ద్వారక పొలిమేరల్లోకి రాగానే ఇంతకాలం తన వియోగంతో బాధపడుతున్న తమవారి మనసులో విషాదాన్ని తొలగించడానికా అన్నట్లు పాంచజన్యాన్ని పూరించాడు.

స ఉచ్చకాశే ధవలోదరో దరోऽప్యురుక్రమస్యాధరశోణశోణిమా
దాధ్మాయమానః కరకఞ్జసమ్పుటే యథాబ్జఖణ్డే కలహంస ఉత్స్వనః

పరమాత్మ కింది పెదవి ఎరుపుదనం అంటుకున్న అరచెయ్యి ఎరుపుతో ప్రకాశించింది (అధరశోణశోణిమా). ఈ రెండు ఎరుపుల (కింది పెదవి అరచెయ్యి ) మధ్య ఉన్న శంఖం, సరసులో పద్మం మధ్య ఉండి తామరతూలిని ఆరగిస్తూ ఆనదిస్తూ ధ్వనిస్తోన్న రాజ హంసలా ఉంది.   హంస తెల్లగా పద్మం ఎర్రగా సరసు నీలంగా ఉంటుంది.  శంఖం పూరిస్తున్న పరమాత్మని సరసులో పద్మం మీద ఉన్న హంసతో పోల్చబడింది.
స ఉచ్చకాశే ధవలోదరో దరోऽపి  శంఖం తెల్లగా ఉన్నా
ఉరుక్రమస్య అధరశోణశోణిమా - పరమాత్మ అధరపు ఎరుపు అంటి
దాధ్మాయమానః కరకఞ్జసమ్పుటే - చేతులనే పద్మగర్భంలో ఉండి
యథా అబ్జఖణ్డే కలహంస ఉత్స్వనః- పద్మసమూహంలో బాగా ధ్వనిస్తున్న కలహంస లాగ భాసించింది

తముపశ్రుత్య నినదం జగద్భయభయావహమ్
ప్రత్యుద్యయుః ప్రజాః సర్వా భర్తృదర్శనలాలసాః

జగద్భయభయావహమ్ - ప్రపంచానికి కలిగే భయానికే భయాన్ని కలిగించే ధ్వనిని విని స్వామిని చూడటానికి వెళ్ళారు

తత్రోపనీతబలయో రవేర్దీపమివాదృతాః
ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా

ఉపనీతబలయో - స్వామిని పూజించి కానుకలు ఇచ్చారు. రవేర్దీపమివాదృతాః సూర్యునికి దీపమును చూపించినట్లుగా
ఆయన నిత్య పూర్ణుడు,

ప్రీత్యుత్ఫుల్లముఖాః ప్రోచుర్హర్షగద్గదయా గిరా
పితరం సర్వసుహృదమవితారమివార్భకాః

ప్రీత్యుత్ఫుల్లముఖాః  - సంతోషంతో వారి ముఖం వికసించింది.
హర్షగద్గదయా గిరా - ఆనందంతో గొంతుపూడుకపోయింది,
ఎలాగంటే తండ్రిని చూచిన సంతానం ఎలా ఐతే గొంతు గద్గదమై మాట్లాడతారు సకల జనులక్షేమాని కోరే పరమాత్మతో మాట్లాడుతున్నారు

నతాః స్మ తే నాథ సదాఙ్ఘ్రిపఙ్కజం విరిఞ్చవైరిఞ్చ్యసురేన్ద్రవన్దితమ్
పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం న యత్ర కాలః ప్రభవేత్పరః ప్రభుః

బ్రహ్మచేత, బ్రహ్మసంతానం చేత నమస్కరించబడే నీ పాదపద్మాలకు మేమందరమూ నమస్కారం చేస్తున్నం,  భగవతుండు ఇచ్చిన వివేకాన్ని కాపాడుకోవాలని కోరుకున్న వారికి సర్వోత్తమైన ఆధరమైన నీకు నమస్కరిస్తున్నము. నీవు తప్ప సకలప్రాణులూ కాలప్రభావానికి లొంగినవాడే.

భవాయ నస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా
త్వం సద్గురుర్నః పరమం చ దైవతం యస్యానువృత్త్యా కృతినో బభూవిమ

విశ్వభావన - సకల చరాచర జగతూను కాపాడే వాడా నీవు మా రక్షణగ ఉండు (భవాయ నస్త్వం భవ )
త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా - నీవే మాతా అర్థం పితా పతి అన్నీ నీవే
త్వం సద్గురుర్నః పరమం చ దైవతం -నీవే మాకు ఉత్తమగురువు పరదైవం
యస్యానువృత్త్యా కృతినో బభూవిమ - నిన్ను సేవిస్తేనే మా జన్మ సార్ధకమవుతుంది

అహో సనాథా భవతా స్మ యద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనమ్
ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం పశ్యేమ రూపం తవ సర్వసౌభగమ్

మేము కేవలం ధన్యులం అనట్లేదు, మేము రక్షణ కలవారము. స్వర్గంలో ఉండేవారికి కూడా నీ దర్శనం లభించదు. .
ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం - పరమాత్మ చూపులో ప్రేమ, అరనవ్వు, స్నేహం ఈ మూడు తొణికిసలాడే మొహంలో శోభిస్తున్న స్వర్గంలో కూడా కలగని దర్శనం మాకు కలిగింది.
సర్వసౌభగమ్ - అన్ని రకముల సౌందర్యాలకు నిలయం నీ సౌందర్యం,

యర్హ్యమ్బుజాక్షాపససార భో భవాన్కురూన్మధూన్వాథ సుహృద్దిదృక్షయా
తత్రాబ్దకోటిప్రతిమః క్షణో భవేద్రవిం వినాక్ష్ణోరివ నస్తవాచ్యుత

యర్హ్యమ్బుజాక్షాపససార భో భవాన్, క్రూన్, మధూన్వాథ సుహృద్దిదృక్షయా
లౌకికములైన వృత్తి అనుసరించడానికి బంధువులను చూడటానికి వెళ్ళావు.
నిను చూడని తృటి మాకు క్షణమవుతుంది. ఈ వియోగంలో జరిగే ఒక్కొక్క క్షణము కోటిసంవత్సరాలతో సమానం ఎలాగంటే సుర్ర్యుడులేని కళ్ళకు వలె.
 
కథం వయం నాథ చిరోషితే త్వయి ప్రసన్నదృష్ట్యాఖిలతాపశోషణమ్
జీవేమ తే సున్దరహాసశోభితమపశ్యమానా వదనం మనోహరమ్

ఇతి చోదీరితా వాచః ప్రజానాం భక్తవత్సలః
శృణ్వానోऽనుగ్రహం దృష్ట్యా వితన్వన్ప్రావిశత్పురమ్

ఇలా ప్రజలచేత పలకబడిన పలుకులను విన్న భక్తవత్సలుడు తన చూపుతోటే అనుగ్రహాన్ని వారిక్ అందిస్తూ నగరాన్ని ప్రవేశించాడు.

మధుభోజదశార్హార్హకుకురాన్ధకవృష్ణిభిః
ఆత్మతుల్యబలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ

నాగులతో పాతాళలోకం ఉన్నట్లుగా ఈ ఆనర్త రాజ్యంలో మధు భోజ దశార్హ కుకుర అంధక వృష్ణి ఆరు రకముల క్షత్రియవీరుల అధిపతి అయిన కృష్ణుడు. నాగులతో ఉన్న భోగవతీ నగరంలా ఉంది.

సర్వర్తుసర్వవిభవపుణ్యవృక్షలతాశ్రమైః
ఉద్యానోపవనారామైర్వృతపద్మాకరశ్రియమ్

అన్ని ఋతువుల చెట్లూ పూలు అక్కడే ఉన్నాయి. ఆ శోభలతో ఉంది. అన్ని ఉద్యానాలు (అందరికీ పనికొచ్చేదాన్ని ఉద్యానం), ఆరామాలు (కొందరికి మాత్రమే పనికొచ్చేదాన్ని ఆరామం అంటారు),

గోపురద్వారమార్గేషు కృతకౌతుకతోరణామ్
చిత్రధ్వజపతాకాగ్రైరన్తః ప్రతిహతాతపామ్

కృష్ణాగమనాన్ని తెలుసుకున్న వారు పుష్పాలు తోరణాలు ధ్వజములు కట్టారు. అన్తః ప్రతిహతాతపామ్ - స్వామికి ఎండతగలకుండా కట్టారు.

సమ్మార్జితమహామార్గ రథ్యాపణకచత్వరామ్
సిక్తాం గన్ధజలైరుప్తాం ఫలపుష్పాక్షతాఙ్కురైః

సమ్మార్జితమహామార్గ - దారినంతా ఊడ్చి సుగంధములు కలిగిన అత్తరు జల్లారు (సిక్తాం గన్ధజలై)
ఫలములు అక్షతాలు పళ్ళు వేశారు దారిలో

ద్వారి ద్వారి గృహాణాం చ దధ్యక్షతఫలేక్షుభిః
అలఙ్కృతాం పూర్ణకుమ్భైర్బలిభిర్ధూపదీపకైః

ప్రతీ ద్వారం ముందు పెరుగు అక్షతలు పళ్ళు చెరుకు రసం ఉంచారు.
ప్రతీ ఇంటిముందరా పూర్ణ కుంభములు ఉంచబడినవి.

నిశమ్య ప్రేష్ఠమాయాన్తం వసుదేవో మహామనాః
అక్రూరశ్చోగ్రసేనశ్చ రామశ్చాద్భుతవిక్రమః
ప్రద్యుమ్నశ్చారుదేష్ణశ్చ సామ్బో జామ్బవతీసుతః
ప్రహర్షవేగోచ్ఛశితశయనాసనభోజనాః

దేవకీ వసుదేవులు అకౄఉరుడు మొదలైన వారందరూ కృష్ణ పరమాత్మ వస్తున్నడన్న వారత విని వారు చేస్తున్న పని వదిలిపెట్టి బయలుదేరారు (శయన ఆసన భోజనా)

వారణేన్ద్రం పురస్కృత్య బ్రాహ్మణైః ససుమఙ్గలైః
శఙ్ఖతూర్యనినాదేన బ్రహ్మఘోషేణ చాదృతాః
ప్రత్యుజ్జగ్మూ రథైర్హృష్టాః ప్రణయాగతసాధ్వసాః

గజేంద్రుని ముందు పెట్టుకుని మంగళకరములైన మంత్రములతో శంఖములు మంగళవాద్యాలతో ఎదుర్కొన్నారు. ప్రేమతో వచ్చిన తొట్రుపాటుతో ఎదుర్కొన్నారు (సాధ్వసాః).

వారముఖ్యాశ్చ శతశో యానైస్తద్దర్శనోత్సుకాః
లసత్కుణ్డలనిర్భాతకపోలవదనశ్రియః
నటనర్తకగన్ధర్వాః సూతమాగధవన్దినః
గాయన్తి చోత్తమశ్లోకచరితాన్యద్భుతాని చ

వందిమాగదులు పరమాత్మను స్తోత్రం చేసారు.

భగవాంస్తత్ర బన్ధూనాం పౌరాణామనువర్తినామ్
యథావిధ్యుపసఙ్గమ్య సర్వేషాం మానమాదధే
ప్రహ్వాభివాదనాశ్లేషకరస్పర్శస్మితేక్షణైః
ఆశ్వాస్య చాశ్వపాకేభ్యో వరైశ్చాభిమతైర్విభుః

తనను ఎదుర్కోవడానికి వచ్చిన బంధువుల ప్రేమను ఆర్తిని చూపుతో నమస్కారంతో ఆలింగనంతో (ఆశ్లేష), వంగి (ప్రహ్వా) స్వీకరించాడు.
ఆశ్వపాకేభ్య - చండాలుర వరకూ వరైశ్చాభిమతైర్విభుః అందరినీ ఓదార్చాడు మన్నించాడు.
చిన్న పెద్ద తేడాలేకుండా అందరినీ మన్నించాడు.

స్వయం చ గురుభిర్విప్రైః సదారైః స్థవిరైరపి
ఆశీర్భిర్యుజ్యమానోऽన్యైర్వన్దిభిశ్చావిశత్పురమ్

వృధ్ధులు బ్రాహ్మణులు యోగులు ఆశీర్వదించారు. అవి తీసుకుని నగరంలోకి ప్రవేశించాడు (అభిశ్చావిశత్పురమ్)

రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయాః కులస్త్రియః
హర్మ్యాణ్యారురుహుర్విప్ర తదీక్షణమహోత్సవాః

ద్వారకలో ఉన్న కులస్త్రీలు ప్రాసాదం ఎక్కి వరుసగా నిల్బడ్డారు.

నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకసామ్
న వితృప్యన్తి హి దృశః శ్రియో ధామాఙ్గమచ్యుతమ్

శ్రియో ధామ అఙ్గం అచ్యుతమ్ - చూచేవారిని తను చూచినవారని జారనీయని వాడు

శ్రియో నివాసో యస్యోరః పానపాత్రం ముఖం దృశామ్
బాహవో లోకపాలానాం సారఙ్గాణాం పదామ్బుజమ్

అమ్మవారికి ఆయన వక్షస్థలం నివాసం, ఆయన ముఖం మనకి పాన పాత్రం, ఆయన బాహువులు అఖిలలోక పాలకులకు ఆశ్రయం, భక్తులకు (సారఙ్గాణాం - తుమ్మెదలు - పరమాత్మ యొక్క ఏకాంత భక్తులు) పరమాత్మ పాదపద్మాలే పానపాత్రలు

సితాతపత్రవ్యజనైరుపస్కృతః ప్రసూనవర్షైరభివర్షితః పథి
పిశఙ్గవాసా వనమాలయా బభౌ ఘనో యథార్కోడుపచాపవైద్యుతైః

సితాతపత్రవ్యజనైరుపస్కృతః తెల్లని గొడుగు ద్వజములు, పూలవర్షం కుర్పించారు
పిశఙ్గవాసా - పసుపు బట్టలు పీతంబరం కట్టుకుని
వనమాలయా  - అన్నిరంగుల పూలమాల, వనమాల.
ఇవి అన్నీ కలిపితే - ఘన:  యథా అర్క ఉడుప చాప వైద్యుతైః  సూర్యుడు చంద్రుడు ఇంధ్రధనస్సు మెరుపు తీగలతో కూడి ఉన్న మబ్బులా ఉన్నాడు. (దీన్ని అభూత ఉపమాలంకారం )
మబ్బు - స్వామి
నక్షత్రాలు - పుష్పాలు
చంద్రుడు - సితాతపత్రం
మెరుపుతీగలు - వనమాల

ప్రవిష్టస్తు గృహం పిత్రోః పరిష్వక్తః స్వమాతృభిః
వవన్దే శిరసా సప్త దేవకీప్రముఖా ముదా

తల్లులకి నమస్కారం చేసారు (ఏడుగురు పట్టపురాణులు వసుదేవునికి ). తల్లులు కృష్ణున్ని ఆలింగనం చేసుకున్నారు.

తాః పుత్రమఙ్కమారోప్య స్నేహస్నుతపయోధరాః
హర్షవిహ్వలితాత్మానః సిషిచుర్నేత్రజైర్జలైః

ఒడిలో కుర్చోబెట్టుకుని ఆనందబాష్పాలతో స్నానం చేయించారు

అథావిశత్స్వభవనం సర్వకామమనుత్తమమ్
ప్రాసాదా యత్ర పత్నీనాం సహస్రాణి చ షోడశ

అందరికీ నమస్కరించి తన భవనానికి వెళ్ళాడు. పదుహారువేల ఎమిది ప్రాసాదాలున్న భవనానికి వెళ్ళాడు

పత్న్యః పతిం ప్రోష్య గృహానుపాగతం విలోక్య సఞ్జాతమనోమహోత్సవాః
ఉత్తస్థురారాత్సహసాసనాశయాత్సాకం వ్రతైర్వ్రీడితలోచనాననాః

భర్తను చూడగానే వారికి మనసులో మరొక కొత్త పండుగ ఆవిర్భవించింది.
సహసాసనాశయాత్సాకం - ప్రొషితవ్రతం (భర్త ఇంటిదగ్గరలేనప్పుడు అలంకారదులు చేసుకోకుండా ఉండటం, భర్త క్షేమం కోరి బ్రాహ్మణులని ఆరాధిస్తూ, త్రికాలం స్నానం చేస్తూ దేహం మీద భోగ్య బుధ్ధి కలగకుండా ఉండి) ఈ వరతం నుండి అలాగే లేచి వచ్చారు. వ్రీడితలోచనాననాః చిన్న సిగ్గు ముఖములో పోడసూపింది.

తమాత్మజైర్దృష్టిభిరన్తరాత్మనా దురన్తభావాః పరిరేభిరే పతిమ్
నిరుద్ధమప్యాస్రవదమ్బు నేత్రయోర్విలజ్జతీనాం భృగువర్య వైక్లవాత్

ఇక్కడ మూడురకాలుగా ఆలింగనం చేసుకున్నారు 1. పుత్రుల ద్వార 2. కన్నుల ద్వార 3. అంతరాత్మతో ఆలింగనం చేసుకున్నరు.
ఆనందం పెల్లుబికి ఆనంద బాష్పాలుగ బైటకువచ్చే కన్నీళ్ళు ఎంత బలవంతంగా ఆపిన అవి వచ్చేశాయి

యద్యప్యసౌ పార్శ్వగతో రహోగతస్తథాపి తస్యాఙ్ఘ్రియుగం నవం నవమ్
పదే పదే కా విరమేత తత్పదాచ్చలాపి యచ్ఛ్రీర్న జహాతి కర్హిచిత్

ఎప్పుడూ వారి దగ్గరే ఉన్నా ఆయన్ ఎప్పుడూ నిత్యనూతనం
ఎప్పుడూ తిరిగే చంచలమైన శ్రీలక్ష్మి అమ్మవారు కూడా ఈయన పాదాలను ఏ క్షణమైనా ఎప్పుడూ వదిలిపెట్టదు.

ఏవం నృపాణాం క్షితిభారజన్మనామక్షౌహిణీభిః పరివృత్తతేజసామ్
విధాయ వైరం శ్వసనో యథానలం మిథో వధేనోపరతో నిరాయుధః

ఆయుధం జోలికి పోకుండా పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యాన్ని ధ్వంసం చేసాడు. ఆయుధాలు ఉన్న వారికి వైరం పుట్టించాడు. భూమికి బరువుకల్గించడానికే పుట్టిన రాజులను సైన్యంతో కలిపి నాశనం చేసాడు.
తాను ఎవరినీ చంపకుండా, వారిలో వారే చంపుకునేట్లు చేసాడు (మిథో వధే).

స ఏష నరలోకేऽస్మిన్నవతీర్ణః స్వమాయయా
రేమే స్త్రీరత్నకూటస్థో భగవాన్ప్రాకృతో యథా

ఈ పరమాత్మ తన మాయతో మానవలోకంలో అవతరించాడు
నరునిగా అవతరించాడు కాబట్టి, మనవ ప్రలోభాలకి దూరంకాకూడదు కాబట్టి పామరుడిలాగ స్త్రీలతో రమించాడు. స్త్రీలంపటుడు ఎలా వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరించాడు.

ఉద్దామభావపిశునామలవల్గుహాస
వ్రీడావలోకనిహతో మదనోऽపి యాసామ్
సమ్ముహ్య చాపమజహాత్ప్రమదోత్తమాస్తా
యస్యేన్ద్రియం విమథితుం కుహకైర్న శేకుః

భగవంతుని తమ వశం చేసుకోవాలని ప్రతీ ఒక్కరు కృష్ణుని మీద ఇవన్నీ ప్రయోగించారు
ఉద్దామమైన భావం, దాన్ని సూచించే చిరునవ్వు, వల్గు (వంకర ) హాసం, కడగంటి చూపు, కనుబొమలు కిందకీ మీదకి ఆడించుట, తలకాస్త వంచీ వంచనట్లు ఊపుతూ ఇలా 16000 వేల మంది భార్యలు ప్రయోగించారు,
ఇవన్నీ చూచి మన్మధుడే మొహం చెంది ధనుర్బాణాలు విసిరి పారిపోయాడు.
ఇంత మంది ఇంతగా ప్రయత్నించినా పరమాత్మ మనసుని చలింపచేయలేకపోయారు

తమయం మన్యతే లోకో హ్యసఙ్గమపి సఙ్గినమ్
ఆత్మౌపమ్యేన మనుజం వ్యాపృణ్వానం యతోऽబుధః

ఇలాంటి పరమాత్మను ఈ లోకం నిస్సంగుడైనా స్త్రీసంగుడని చెప్పుకుంటారు
ఎవరికి వారు వారితో పోల్చుకుని (ఆత్మౌపమ్యేన ) పరమాత్మని పోల్చుకోలేకపోతున్నారు

ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోऽపి తద్గుణైః
న యుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా

దీన్నే ఈశత్వం అంటారు. ఇదే ఆయన శాసకత్వం. ప్రకృతిలోనే ఉండి ప్రకృతి గుణములతో అంటుకోబడడు.
ఎలా ఐతే ఆత్మకు ఎలాంటి గుణాలు అంటవో.  మహత్ ప్రకృతి తత్వాలకు పైన ఉండే పరమాత్మకు ఏ గుణాలు అంటవు

తం మేనిరేऽబలా మూఢాః స్త్రైణం చానువ్రతం రహః
అప్రమాణవిదో భర్తురీశ్వరం మతయో యథా

స్వామిని స్త్రీలోలుడని తన భర్త యొక్క ప్రమాణం తెలియక అనుకున్నారు. మన బుధ్ధితో ప్రవృత్తితో పరమాత్మను ఎలా భావిస్తామో కృష్ణ పరమాత్మను భార్యలు కూడా అలాగే భావించారు.

Popular Posts