Followers

Monday 23 September 2013

శీతాకాలంలో చర్మ సంరక్షణ



-ఈ కాలంలో దాహం ఎక్కువగా కాకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించిదు. దీనివల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా విధిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి.
- బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బయటికి వెళ్లి వచ్చిన తరువాత గోరు నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్ అపె్లై చేయాలి.
- మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్‌వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
- చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బుకు బదులుగా సున్నుపిండిని ఉపయోగించాలి. అంతేకాదు ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
- గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లెచేయాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
- పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
- తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
- అరటిపండు, బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- నల్లగా, కరుకుగా ఉన్న మోచేతులు ఈ చలికాలంలో మరింత పొడిబారతాయి. నిమ్మకాయ సగం ముక్కను తీసుకుని మోచేతికి బాగా రుద్దాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగి మాయిశ్చరైజర్ అపె్లై చేయాలి.
- బియ్యం పిండిలో కానీ, ఓట్స్‌లో కానీ చెంచాడు నిమ్మరసం వేసి మోచేతులకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బియ్యం, పెసర, శనగ పిండి మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది.
- ఓట్స్ పొడిలో తగినంత పెరుగుని కలిపి చేతులు, ముఖానికి మర్దనా చేయాలి. పూర్తిగా ఆరిన తరువాత కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది.
- రెండు చెంచాల పెరుగులో నాలుగుచుక్కల దోసకాయ రసం కలిపి ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖం తుడిచేస్తే చర్మం శుభ్రపడుతుంది. వారానికోసారి ఇలా చేయడం వల్ల ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది.

Popular Posts