Followers

Saturday 24 August 2013

ప్రయాగ అంటే?ప్రయాగ మాహాత్మ్యం...ప్రయాగలో చేయవలసినవి?

ప్రయాగ అగ్నికుండాలు


గంగా, యమునా, సరస్వతుల సంగమస్థానం ప్రయాగ. 
ప్రకృష్టం సర్వ యౌగభ్యః ప్రయాగమితి కథ్యతే” 
(స్కాంద పురాణం) ప్రయాగ అనే పదాన్ని రామాయణ, 
మహాభారత, పురాణాది గ్రంథాలు ‘ప్ర’ – ప్రకృష్ట అనగా 
విశేషంగా + ‘యాగ’ అనగా యాగాలు – వెరసి ‘ప్రకృష్ట యజ్ఞాలు జరిగిన క్షేత్రం’ అని నిర్వచిస్తున్నాయి.
ప్రకృష్టత్వా ప్రయాగో సా ప్రాధాన్యా రాజ శబ్దవాన్” 
(బ్రహ్మ పురాణం) ప్రకృష్టమైన యాగాలు జరిగిన 
తీర్థక్షేత్రాలకే తలమానికం – కాబట్టి ఇది ‘ప్రయాగ 
రాజము’.
ప్రయాగ తీర్థ క్షేత్రం, ఇలాహాబాదు పట్టణ అంతర్భాగంగా 
ఉంటుంది. ఇలాహాబాదు నగరం – ఒకప్పటి 
ప్రతిష్ఠానపురము. మనువుయొక్క పుత్రిక ‘ఇలా’ 
పుత్రుడైన పురూరవుడు తదితర చంద్రవంశజుల 
రాజధాని ప్రతిష్ఠానపురము. అంచేత చంద్రవంశజుల 
కాలంలో, ప్రయాగ సహిత ప్రతిష్ఠానపురాన్ని ‘ఇలా’ 
పేరున ‘ఇలావర్తము’ అని పిలిచేవారు. కాలాంతరంలో 
ఇది ‘ఇలావాసము’ అయింది. ముఘల్ చక్రవర్తి అక్బర్ 
– ఈ ఇలావాసాన్ని ‘అల్లాహావాస్‌’ అని మార్చాడని 
చరిత్రకారుడు అబు ఫజల్ వ్రాశాడు. క్రమేపీ ఆ పదం 
‘అలహాబాదు’, ‘ఇలాహాబాదు’లుగా మారిపోయి, 
ఇప్పటికీ అలానే పిలువబడుతుంది.


ప్రయాగ మాహాత్మ్యం


దశకోటి సహస్రాణి త్రిస్త్కోట్‌యస్తథాపరే, మాఘ మాసే తు గంగాయాం గమిష్యన్తి నరర్షభ(స్వర్గఖండం, పద్మ 
పురాణం) దీనిలో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్య 
నివాసముంటాయి. ఇక మాఘమాసంలోనయితే లెక్కకే 
అందనన్ని తీర్థాల మహత్తు ప్రయాగ పొందుతుంది. 
మత్స్యపురాణంలో మార్కండేయ ముని యుధిష్టురిడికి 
దీని మాహాత్మ్యం తెలియజేస్తూ, స్వయంగా 
బ్రహ్మదేవుడుశైతం – నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ 
ఉంటారని చెప్పారు. సమస్త దేవతాగణం, అన్ని తీర్థాలు 
– దీనిలో నివాసముంటాయని మత్స్యపురాణాం 
చెబుతోంది. మహాకవి కాళిదాసు – సముద్రపత్నుల 
(గంగాయమునలు) సంగమస్థానంలో 
పుణ్యస్నానమాచరించిన పవిత్రాత్ములు, తత్వజ్ఞానం 
పొందకపోయినా, మరణానంతరం మోక్షానికి 
అర్హులవుతారని చెప్పారు.
ఐదు యోజనాల విస్తీర్ణంలోనున్న సంగమ స్థలం, 
గంగాయమునల ప్రవాహ కారణంగా మూడు భాగాలుగా 
విభాగించబడుతుంది. గంగకు పూర్వోత్తరాన ఉన్న 
స్థలాన్ని ‘గంగాపార్‌’ అని, గంగాయమునలకు దక్షిణాన 
ఉన్న ప్రదేశాన్ని ‘యమునాపార్‌’ అని, ఈ రెండు 
నదుల మధ్యనున్నప్రదేశాన్ని ‘దోఆబ’ (ద్వాబా) అని 
అంటారు. గంగాపార్ ‘ప్రతిష్ఠాన్‌’ (ఝూసీ), 
యమునాపార్‌లో ‘అలర్క్‌’ (అరౌల్‌) అని మూదవది 
అయిన రెండు నదుల మధ్యస్థలంలో ‘ప్రయాగ’ అని 
మొత్తం మూడు అగ్ని కుండాలుగా అవధారణ 
చేయవచ్చు. ఈ మూడు కుండాల మధ్యనుండి 
ప్రవహిస్తూ గంగమ్మ ముందుకు సాగుతున్నట్టుగా 
పరిగణించవచ్చు. ప్రతిష్ఠాన్‌పుర్‌లో ఉన్నది 
‘ఆహ్వనీయాగ్ని’ కుండమని, అలర్కపుర్‌లో 
‘దక్షిణాగ్ని’ 
కుండమని, ప్రయాగలో ‘గార్హాపత్యాగ్ని’ కుండమని 
అంటారు. ఈ మూడుగా విభాగించబడిన ప్రతి క్షేత్రంలో – 
శుచిపూర్వకంగా నియమ సంయమనాలతో ఒక్క 
రాత్రన్నా గడిపితే, ఆయా క్షేత్రాలలో అగ్ని (త్రేతాగ్నుల) 
ఉపాసన చేసిన ఫలితం దక్కుతుంది.
ప్రయాగ అగ్నికుండాలు
ఈ రెండు నదుల సంగమంలో పవిత్ర స్నానం చేసిన 
వారు స్వర్గాన్ని చేరుతారని, ఇక్కడ 
పరమపదించినవారికి జన్మరాహిత్యం కలుగుతుందని – 
ఈ ప్రయాగ తీర్థ మహిమా వర్ణన, ఋగ్వేదంలో సైతం 
కనిపిస్తుంది. ప్రయాగరాజములో వసించే వారు 
నిష్కాములై లేక కామార్థులైనా సరే – ధర్మబద్ధంగా 
జీవిస్తూ, శక్తికొలది దానాలు చేస్తూ మోక్షాస్థితికి అర్హత 
పొందగలరు.
స్కాంద పురాణాంతర్గత కాశీ ఖంఢంలో 
జన్మాన్తరేష్వసంఖ్యేషు యః కృతః పాపసంచయః, 
పుంసః శరీరాన్నితర్యాతుమపేక్షేత పదాన్తరమ్‌” అంటే 
జన్మ జన్మాంతరాలలో సంచయమైన పాపం, ప్రయాగ 
తీర్థముయొక్క యాత్ర వల్ల మనిషి శరీరాన్ని 
వీడిపోతుంది. ఇలా పురాణేతిహాసాలలో ఉన్న 
విశేషాలను ఉటంకిస్తూ పోతే, ఒక చిన్ని పుస్తకమే 
రాయొచ్చు.


ప్రయాగలో చేయవలసినవి?


స్వచ్ఛంగా ఉన్న గంగ, నల్లనయ్య వర్ణంతో యమున, 
అంతర్వాహినిగా సరస్వతీ నదులు సంగమించే ఈ 
తీర్థంలో చేయవలసిన ముఖ్యమైన కర్మ – పవిత్ర 
సంగమ స్నానం. ప్రయాగలో పూణ్యస్నానం చేయటానికి 
తిథి, మాసాలు, లేక ఆ భక్తుడి అవస్థలకు 
సంబందించిన నియమమంటూ ఏదీ లేదు. ఎప్పుడైనా 
చేయవచ్చు. కానీ ప్రతి పన్నేండేళ్ళకొకసారి ప్రపంచ 
ప్రఖ్యాతిగాంచిన కుంభ మేళ సమయంలో, ఇంకా ప్రతి 
సంవత్సరం వచ్చే మాఘ మాసంలో – ఈ తీర్థస్నానం 
విశేష ఫలితాన్నిస్తుంది. ఒక చిన్న గమనిక. మన 
తెలుగువారి లెక్క ప్రకారం పుష్య బహుళ పాడ్యమి 
నుండి మాఘ పౌర్ణమి వరకు గల కాలం, ఉత్తర 
భారతీయులకు మాఘ మాసం. ఈ విషయానికి 
సంబందించిన వివరాలు విడిగా వేరే టపాలో 
తెలియజేస్తాను.
ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌, 
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌” అని 
కూడా స్కాంద పురాణాంతర్గత కాశీ ఖంఢంలో ఉంది. 
దీని అర్థం – ప్రయాగలో వపనం అంటే (మన 
తిరుమలలోలాగా) శిరో ముండనం, గయలో 
పిండదానం, కురుక్షేత్రంలో దానం మరియూ కాశిలో 
మరణాలను ఒకటిగా పోల్చారు. అంచేత, స్నానానికి 
ముందు నమ్మకం ఉన్నవారు ముండనం కూడా 
చేయించుకుంటారు.
తత్ర దానం ప్రదాతత్వ్యం యథావిభవసమ్భవమ్‌, తేన 
తీర్థ ఫలేనైవ వర్ధతే మాత్ర సంశయః” ప్రయాగలో 
శక్తికొలది దానాలు చేయాలని చెప్పబడింది. ఇక్కడ 
చేసిన దానాలు క్షేత్రమాహాత్మ్యంవల్ల విశేష ఫలితాన్ని 
ప్రసాదిస్తాయి.

 హిరణ్య శ్రాద్ధం మరో ముఖ్య కర్మ. తల్లీ, తండ్రి, తాత 
ముత్తాతలే కాక, తనతో సంబంధం ఉన్న వారు లేదా 
పరమపదించిన స్నేహితులు, చుట్టాలు వంటి అందరికీ 
ఇక్కడ పిండ రహిత శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తుంటారు.

ఈ త్రివేణీ సంగమంలో, మరణించినవారి చితా భస్మాన్ని 
వదలటానికి దూర దూరాలనుండి వస్తుంటారు.
మరో ముచ్చటైన తంతు – వేణీ దానం. ఇది 
సుమంగళులైన స్త్రీలకు సంబందించినది. తమ భర్తకు 
అర్చన చేసి, తను తెలిసీ తెలియక చేసిన తప్పులన్నిటికి 
క్షమాపణకోరి, భర్త ఒడిలో కూర్చొని, అతని చేత కొంత 
జుత్తు కత్తిరింపజేసి, ఆ జుత్తును త్రివేణీ సంగమంలో 
వదులుతారు. సాధారణంగా కత్తిరించిన జుత్తు, నీటిపై 
తేలియాడుతుంది. కానీ ఇక్కడ, ఆ జుత్తు 
మునుగుతుంది. జీవితంలో ఒక్క సారి మాత్రమే వేణి 
దానం చేయాలని, మా చేత ఈ తంతు జరిపించిన 
పండితుడు చెప్పాడు.

Popular Posts