Followers

Friday 26 July 2013

కృష్ణుని వ్యక్తిత్వం




కర్షయతి ఇతి కృష్ణః అనే వ్యుత్పతి ఆధారంగా జనించిన అర్థానికి సార్థకత కల్గించినవాడు కృష్ణుడు.

“బ్రహ్మణో వయసా యస్యమిమేష ఉపచార్యతే
సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే”

(శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలోని ద్వితీయ ఖండంలో గల రెండవ అధ్యాయం)

ఎవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్దాయమో అటువంటి ఆత్మ స్వరూపుడైన పరబ్రహ్మమే కృష్ణుడు అని అర్థం.

కృష్ణుడు పరమ యోగీశ్వరేశ్వరుడు. నిర్వికల్ప సమాధిలో ఉండి తిరిగి సామాన్య స్థితికి రాగలిగిన సామర్థ్యం కలవాడు. కర్మలను చేస్తూ కూడా ఆ కర్మవాసన తనకంటకుండా తామరాకు మీది నీటి బొట్టులాంటి జీవనం గడిపిన యోగి. ఇతని యోగీశ్వరత్వానికి భగవద్గీత చక్కని ఉదాహనరణ.

వాస్తవానికి భగవద్గీత మొదటి సారిగా సూర్యునికి ఉపదేశింపబడింది. అయితే ఇక్కడ సూర్యశబ్దం సాంకేతిక పరమైనది. సూర్య శబ్దం జ్ఞానమయం గ్రహిస్తే తొలి సారిగా భగవద్గీత జ్ఞాన మార్గాన ఈ లోకానికి అంద చేయబడింది అనుకోవచ్చును. సహజంగా జ్ఞానం ఒకరినుంచి ఇంకొకరికి అందచేయబడేదే. కాబట్టి సూర్యశక్తి ఆధారంగా జ్ఞానం లొకానికి అందచేయబడింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టే ఈ గీత అతి ప్రాచీనమైనది. అంతే చరిత్ర కందిన నాగరికతల కంటే కూడా ప్రాచీనమైనది అనుకోవాలి. సూర్యుని దగ్గర్నించి శాసనకరమైన మనుచక్రవర్తి ఈ జ్ఞానాన్ని అందుకున్నాడు. అనేక కారణాంతరాల వలన ఈ జ్ఞానం కొంత మరుగున పడింది. అయినప్పటికీ బ్రహ్మకి, యాజ్ఞావల్క్య మహర్షికి కూడా ఈ జ్ఞానం అందుబాటులో ఉందని తెలుస్తోంది.

కర్మ సిద్ధాంతం భగవద్గీతలో వివరంగా చెప్పబడింది. అంతే సమాజంలో ఆనాటికి కర్మలపట్ల విశ్వాసం, నమ్మకం ఉందనుకోవాలి. ఈ భావన అప్పటికే బలపడింది. అంటే ఇదెంతో ప్రాచీనమైన విశ్వాసం అని తేలుతోంది. ఈశావాస్య ఉపనిషత్తు కర్మ సిద్ధాంతపు బీజాలను ఈ రకంగా ప్రకటించింది.

“కురవణ్ణే నేహ కర్మాణి జిజివిషెత్ శతమ్ సమోః
ఏవమ్ త్వయిన అస్యతా ఇతః ఆస్తి నకర్మ లిప్యతే నరే”!

ఈ మంత్రంలో కర్మయోగానికి సంబంధించిన బీజాలు కనిపిస్తున్నాయి. ఇది సూర్య భగవానుడు చెప్పినట్లు తెలుస్తున్నది. తనకు తెలిసిన జ్ఞానాన్ని బహుశః సూక్ష్మంగా చెప్పి ఉండవచ్చును. నిస్వార్థమైన కర్మ ఎన్నటికి వృథా కాదు. వాసనారహిత జీవనాన్ని, జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని, మోక్షాన్ని అందిస్తుంది అని ఈ మంత్రం స్పష్టం చేస్తున్నది. ఈ విషయాన్ని భగవద్గీత పదేపదే వక్కాణించినది.సర్వకాలాలకు అన్వయింపబడే ఈ విషయం అందరికి శిరోధార్యమే. యుద్ధరంగంలో కృష్ణుడు ఆ విషయాన్ని రేఖామాత్రంగా అర్జునునికి జ్ఞప్తికి తెచ్చాడు. అర్జునునితో పాటు ఆ గీతాబోధకు ఆంజనేయుడు, సంజయుడు ప్రత్యక్ష సాక్షులు. ఇంట మహిమోపేత మైన భగవద్గీతను చెప్పిన కృష్ణుని వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో ఒక్క సారి సింహావలోకనం చేద్దాం. భగవద్గీతతో పాటు హరివంశం, విష్ణుపురాణం, మహాభారతం, భాగవతం కూడా పరశీలిస్తే తప్ప కృష్ణుని సంపూర్ణ వ్యక్తిత్వం అర్థం కాదు.   

యయాతి కుమారుడైన యదు యాదవుల యొక్క మూల పురుషుడుగా చెప్పబడుచున్నాడు. కాని యాదవులలో కాలక్రమేణ ఎన్నో శాఖలు ఏర్పడ్డాయి. వృష్ణి భోజ, శూర, అంధక, యాదవ మో|| అందులో కొన్ని, వీరందరూ ఎంతో శౌర్యపరాక్రమాలు గలవారు అయినప్పటికి స్వేచ్చాప్రియులు. సామాజిజంగా, రాజకీయంగా వీరందరినీ ఏకం చేయాలని సంకల్పించాడు కృష్ణుడు. సంఘటితమైన మంచితనం ఎప్పుడూ చెడును ఎదుర్కోనటానికి తగిన సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. విడివిడిగా చెడును ఎదుర్కొనలేము. ఇది వాస్తవం. సంఘంలో ప్రబలిపోయిన చెడును సమర్థవంతంగా ఎదిరించాలి అంటే ఈ సమీకరణ చాలా అవసరం. అందుకే తనకు తానుగా నాయకత్వం వహించి యాదవులందరిని ఏకం గావించగలిగాడు. ఈ నాయకత్వ లక్షణాలు అతనికి పసితనం నుంచే ఉన్నాయి. లోక రక్షణ కోసం, ధర్మం కోసం కృష్ణుడు పడిన తాపత్రయం చిన్నప్పటి నుంచే కన్పిస్తుంది. అన్నిటా తానే ఉంటూ కూడా తామరాకు మీది నీటిబొట్టు లాంటి సాధుజీవనం గడిపాడు. తనకొక కీర్తి రావాలని కాని, ధనం సంపాదించాలని గాని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆదర్శవంతమైన సంఘాన్ని నిర్మించాలని, అందులోని ప్రజలు అందరు ఏ కలతలు లేకుండా సుఖజీవనం గడపాలని, మన స్ఫూర్తిగా నమ్మినవాడు, దానికై ప్రయత్నించి సఫలీకృతుడైన వాడు, కృష్ణుని ఏ చర్య గమనించినా దాని వెనకాల గల ధర్మసంరక్షణ మనకతని వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపుతుంది. ఈ ధర్మ సంరక్షణలో కృష్ణుడు ఎంతో మంది అసురులను సంహారించాడు. కంసుడు, సాళ్వుడు, సృగాల వాడుదేవుడు, పౌండ్రక వాసుదేవుడు శిశుపాల దంతవక్తృలు, కాలయవనుడు, జరాసంధుడు, నరకుడు – ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎందరో…జరాసంధుడు, నరకుడు బంధించిన రాజన్యులకు, రాకుమర్తెలకు విముక్తి కలిగించాడు. వారందరికి తానే నీడగా నిలిచాడు. ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇంతధైర్యం, విచక్షణ, సానుభూతులు ఇంకొక వ్యక్తిలో మనకు కన్పించవు.

స్వజనాన్ని చంపుకోవతంలో వెనకంజ వేసిన అర్జునునికి కర్మసిద్ధాంతాన్ని విన్పించి, జాగారూకుడిగా చేసాడు. ఇది కేవలం అర్జునుడు తనకు బందువన్న ప్రీతితో కాదు. పాండవులు ధర్మ రక్షకులు కాబట్టి అన్నివేళలా వారికి అండగా నిలిచాడు. కృష్ణుడు నిర్యాణం చెందే సమయానికి చాల వృద్ధుడు. బోయవాని బాణఘాతంతో తనువు చాలించాడు. తనకు గాయం చేసిన బోయవానిని చిరునవ్వుతో క్షమించాడు. మృత్యువును నిర్వికారంగా ఆహ్వానిచడం కృష్ణునికి తగింది. అందుకే కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడేగాదు, యోగీశ్వరత్వానికి సరైన నిర్వచనం కూడా. ఇంతటి ఆధ్యాత్మికత గల ఇంకొక వ్యక్తి నభూతో నభవిష్యతి. యోగీశ్వరులను చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. కాని, యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడు ఒక్కడే. అతని కంటే ముందు కాలంలో గాని, అతని తర్వాతి కాలంలోగాని ఇటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి లేడు. యోగీశ్వరేశ్వరుడు అంటే యోగులకు మంత్రదీక్ష ఇ ఇవ్వడమో, యోగులకు యోగరహస్యాలు ఉపదేశించడమో కాదు. వీటన్నింటికి అతీతమైనదాస్థానం. కృష్ణుడు అత్యంత సులభంగా నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించ గలుగుతాడు. తిరిగి రాగలుగుతాడు కూడా. నిర్వికల్ప సమాధి స్థాయికూడా దాటి సచ్చిదానందాన్ని అనుభవించగలుగుతాడు. నిజానికి కృష్ణుడే సచ్చిదానంద స్వరూపుడు. అందుకే యోగీశ్వరేశ్వరుడు అనే పదానికి అర్హుడు. సోహం, తత్వమసి, పరబ్రహ్మం అన్న పదాలకు ఆధార భూతుడు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచాడు. అంటే కొడుకుగా, స్నేహితుడుగా, భర్తగా, తండ్రిగా రక్షకునిగా, శిష్యునిగా ఏ పాత్ర గమనించినా, తనవల్ల ఆయావ్యక్తులు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్లు కన్పిస్తుంది. ఇవన్ని అతని వ్యక్తిత్వంలో లీనమై అతని నొక గీతాచార్యునిగా, జగద్గురువుగా నిలబెట్టాయి. అందుకే గీతలోని ప్రత్యక్షరము ఎంతోవిలువైనది. అమూల్యమైనది. విశ్వజనీనమైనది. మానవాళిని ఉద్ధరించడానికి హేతుభూతమైనది.

కర్మ, సాంఖ్య భక్తి, హఠయోగాలను మోక్షానికి మార్గాలుగా చెప్పారు మన ప్రాచీనులు. కృష్ణుడు మొదటి మూడు మార్గాలను ఎంతో హేతుబద్ధంగా, విజ్ఞానయుతంగా వివరించాడు. అతను చూపిన మార్గం ఎంతో సులభమైనది. సాధారణంగా మోక్షసాధకులకు ఎన్నోసార్లు మార్గం దుర్గమంగా కన్పిస్తుంది. కాని కృష్ణుడు ఉపదేశించిన తీరు అత్యంత రమ్యమైనది. బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోయే వారిని నిలబెట్టి గమ్యాన్ని చూపిస్తుంది. సాధకులను సరైనమార్గం వైపు నడిపిస్తుంది. ఇటువంటి అద్భుతమైన వ్యక్తిత్వంగల వ్యక్తి అష్టమి తిథి నాడే ఎందుకు జన్మించినట్లు అని సందేహం రాకపోదు. నిజానికి అష్టమి తిథి ఎన్నో కష్టాలు కల్గిస్తుంది అని జన సామాన్యం నమ్మకం. కాని కృష్ణుని జీవితం గమనిస్తే అష్టమి తిథి కార్యసాధకులకు, శతృంజయులకు అనుకూల మైనదని అర్థమవుతుంది. జ్యోతిషశాస్త్రం కూడా ఈ విషయాన్ని నిర్దారిస్తున్నది. అట్లాంటప్పుడు అష్టమి నవమితిథులు మంచివి కావేమోనన్న మూఢనమ్మకాలతో మనని మనం మోసపుచ్చుకుంటున్నామేమో! సాధారణంగా గోవును మనం ధర్మానికి ప్రతీకగా భావిస్తాం.

కృష్ణుడు వృషభ రాశిలో జన్మించటం అతని ధర్మ సంరక్షణను సూచిస్తున్నది. అదే విధంగా రోహిణీ నక్షత్రం ఆకర్షణీయ శక్తి కలది. కృష్ణునిరూపు దానికి తార్కాణం. కృష్ణ శబ్ద వ్యుత్పత్తి కూడా ఇదే నిర్ధారిస్తున్నది. కర్షయతి ఇతి కృష్ణః – జీవాత్మలకు ఆకర్షించే పరతత్వం అది.

‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన – మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సజ్గోస్త్వుకర్మణి.’

ఆ స్వామిది అనితరసాధ్యమయిన వ్యక్తిత్వం. మనకు ఆదర్శప్రాయం.

Popular Posts