Followers

Sunday 31 March 2013

అక్షతల పరమార్థం ఏమిటి?


అక్షతల పరమార్థం ఏమిటి?


మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.
‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము.
పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్ల కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లి దండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!
మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుం ది శిరస్సు.అది సరే కాని! అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మి కంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో
‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరిం చడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగు తూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరు డు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.
‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.
అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతు లుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదిం చడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన ప్రయోజనం ఏమిటి..?


ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు అవసరమవుతాయి. అటువంటి అనుభవం కోసం కొన్ని ప్రాంతాలను, వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెతుక్కుంటూ వెళ్ళటమే తీర్థయాత్ర. గతంలో ప్రజలు మునీశ్వరుల దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను తీర్చుకునేవారు.

ఆ మహానుభావులున్న ప్రదేశాలే పుణ్యక్షేత్రాలయ్యాయి. అటువంటి శక్తి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా లభిస్తుంది. ఆ విశేష స్థలపురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల మానవుల మనసులో మార్పువస్తుంది. మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది.

పుణ్యక్షేత్రాల సందర్శన మనస్సు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు వ్యాపారాభివృద్ధి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

సూర్య నమస్కారం చేస్తే.. రోగాలు, దారిద్ర్యం మాయమైపోతాయట!

సూర్య నమస్కారం చేస్తే.. రోగాలు, దారిద్ర్యం మాయమైపోతాయట!

శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. 

సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. 

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు. 

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు. 

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. 

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

శ్రీ గణేశ పంచరత్నం

శ్రీ గణేశ పంచరత్నం




దుర్గా దేవి చరిత్ర - Durga Devi Charitra


దుర్గా దేవి చరిత్ర - Durga Devi Charitra



అమ్మవారికి ఇష్టపూజ



అమ్మవారికి ఇష్టపూజ
























రాహుగ్రహ దోషనివారణ


రాహుగ్రహ దోషనివారణ














దేశవ్యాప్త దుర్గామాత క్షేత్ర విశేషాలు














తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు.



‘యాన్ములే సర్వతీర్దాని! యన్మధ్యే సర్వదేవతాః 
యాదాగ్రే సర్వవేదాశ్చ! తులసిం త్వాం నమమ్యహమ్’’
ఐశ్వర్య ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ ప్రదక్షిణం చేసినచో సర్వదేవతా ప్రదిక్షణం చేసిన ఫలితం దక్కుతుంది. 
తులసి శ్రీ మహాలక్ష్మిః, విద్యా విద్యా యశస్విని!
ధర్మా ధర్మనా దేవీ దేవ దేవ మనః ప్రియా!
లక్ష్మి! ప్రియ సఖీ దేవీ ద్యౌర్బమి రచలాచలా!

లక్ష్మీ నారాయణ స్వరూపిణి యైన తులసిని నమస్కరిస్తూ పైన 16నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ, సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి. తులసి చెట్టుతోనూ దేవికి బాంధవ్యముంది. తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే, తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది. 

తులసిదళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది. ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది. తులసి స్తోత్రం చేయడం అంటే అనంత గుణ ఫలాలను పొందడమే. తులసి ఉన్న ఇంటికి ప్రేత, పిశాచ, భూతాలవంటివి దూరమవుతాయి. ప్రతిరోజు ఇంటిముందు లేదా తులసికోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్య్రం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆలయాల్లో, ఇళ్లల్లో, తులసి, మారెడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ తులసి లక్ష్మీదేవి స్వరూపిణి. లేవగానే తులసిని చూస్తే పాపాలు పోతాయి. 
తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థ్దాలు, మధ్యభాగంలో దేవతలు, చివరి భాగంలో వేదాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. 

తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, కాండమందు శివుడు, శాఖల్లో అష్టదిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతారు. ప్రాతఃకాలంలోను, సంధ్యాసమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం. 

లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రమైన తులసి చెట్టు ఎలా ఆవిర్భవించింది అన్న విషయం కొన్ని హైందవ పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాల ప్రకారం మనువు వంశానికి చెందిన వృషభద్వజుడు అనే మహారాజు పరమ శివభక్తుడు. ఈ వృషభద్వజుని మనమడు అయిన ధర్మద్వజునికి తులసీదేవి జన్మించింది.

Saturday 30 March 2013

పతివ్రతలు ,తమ పతి ప్రాణాలను తమ మంగళ సూత్రాలలో ధరిస్తారు

పతివ్రతలు ,తమ పతి ప్రాణాలను తమ మంగళ సూత్రాలలో ధరిస్తారు .
’’బ్రహ్మ విశ్న్వీశ రూపేషు రంద్ర శ్యేతం త్రి తంతుకం –త్రిరత్న ,రుక్మజం ,స్త్రీణాం ,మాన్గాల్యాభరణం విదుహ్ 

మంగళ సూత్రం అంటే పవిత్ర మైంది .కలంక రహిత మైనది .పరిశుద్ధ మైనది అని అర్ధం .’’పవెహ్ త్రాయతీతి పవిత్రః ==’’పవి అంటే మృత్యువు .మృత్యువు నుండి రక్షించేదే మాంగల్యం –అందుకే పవిత్ర మైనది .మాంగల్య తంతువు (దారాలు )తత్వాలను సూచిస్తుందని దాని వల్ల ‘’బ్రహ్మమఃహ మస్మి’’అనే స్మృతి రూపం లోని మేధస్సు యొక్క ప్రభ జనిస్తుందని భావన

ద్వాదశి జ్యోతిర్లింగాలు - విశిష్టత త్రయంబకేశ్వరుడు


ద్వాదశి జ్యోతిర్లింగాలు - విశిష్టత త్రయంబకేశ్వరుడు

దశరధుని ఆజ్ఞానుసారం వనవాసానికి వచ్చిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని నివసించసాగాడు. రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముని మోహించి తత్ఫలితంగా లక్ష్మణుని చేత ముక్కు చెవులను కోయించుకున్నది. ఆమె ముక్కు కోయబడిన ప్రాంతమును నాశిక అంటారు. ఈ నాశిక దగ్గరలో బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది. బ్రహ్మగిరిపై గౌతమమహర్షి అహల్యాసమేతంగా నివసిచేవాడు. అక్కడ స్నానపానాదులకు నదీ తీర్ధములేవీ లేవు. ఇతర మునులందరూ నీరు లభించక అనేక ఇబ్బందుల పాలయ్యేవారు. గౌతముని తపశ్శక్తి తెలిసిన వారందరూ ఒక తంత్రము పన్ని ఒక ఆవునూ, దూడనూ దర్భతో సృష్టించి గౌతముని పొలములో వదిలారు. 


ఆ ఆవుదూడలు వరిపైరుని పాడుచేయడం గమనించిన గౌతముడు వాటిని అదిలించుటకై ఒక దర్భపోచను విసిరాడు. ఆ దర్భపోచ తగిలినంతనే ఆవు, దూడ రెండునూ ప్రాణాలు వదలి లాయి. ఆ గోహత్య పాతకము నుండి నివృత్తి పొందుటకు గౌతము డు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ‘ఏమి కావలెనని?’ అడిగాడు. ‘ప్రభూ... నాకు తగిలిన గోహత్యా పాతక మును బాపుకొనుటకునూ, లోక హితము కొరకునా నీ జటాజూటము నుండి గంగను భూమిపైకి వదులు’మని ప్రార్ధించాడు గౌత ముడు. శివుడు జటాజూటము నుండి వదిలిన గంగ బ్రహ్మగిరిపై బడి, అచట నుండి పాయలుగా వీడి గౌతముని పేరుని గౌతమి గాను, గోవు ప్రాణాలు వదిలిన ప్రదేశము మీదుగా ప్రవహించి ‘గో దావరి’ గాను ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రము నందు గౌతముని ప్రా ర్ధన మేరకు శివుడు ‘త్రయంబకేశ్వరుడు’ అను పేరుతో జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిశాడు. ఈ స్వామిని దర్శిం చిన వారు గోహత్యాది మహాపాతకముల నుండి విముక్తులవుతారని ప్రతీతి.

మానస సరోవరము


మానస సరోవరము

మానస సరోవరము అత్యద్భుతమైన, విశాలమైన (చుట్టు కొలత ౧౦౬ కి.మీ) సరస్సు వాల్మీకి రాసిన రామాయణంలో ఈ సరస్సు బ్రహ్మదేవుడు తన మనసులో సృష్టించినాడని వ్రాశాడు. బ్రహ్మ మనసునుండి పుట్టినది గనుక మానస సరోవరము అనడము జరిగినది. ఈ సరోవర మహిమల ప్రసిద్ధి వాసికెక్కినది. దేవతలు ఈ సరోవరములో స్నానము చేయడానికి స్వర్గలోకమునుండి ప్రతి రాత్రి వస్తుంటారని, పండుగ రోజుల్లో, నిండు పున్నమి రాత్రులలో తప్పక వస్తారని ప్రతీతి. తమ నిజ రూపములో రావడం, పది మందికి కనిపించడము ఇష్టము ఉండదు గనుక వారు నక్షత్ర రూపములో వచ్చి సరోవర ప్రాంతములో విహరించి, జలకములాడి తిరిగి వెళ్తారని అనుకోవడము నిజము. విష్ణుమూర్తి, లక్షిదేవి శేషతల్పము మీద ఈ సరస్సులో అపుడపుడు కనిపిస్తారని కూడా విన్నాము. ఈ సరస్సు కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉండడము మూలంగా శివుడు నటరాజుగా సరోవర తటాన్ని దర్శించి ఆనంద తాండవము చేస్తాడని కూడా ప్రతీతి. అలాంటి మహాత్మ్యము కలిగిన సరోవరాన్ని దర్శించాలని, అందులో జలకాలాడి పునీతులము కావాలని ఎన్నో రోజులనుండి కోరిక.

అంత దూరము వెళ్ళినపుడు శివపార్వతులు నివసించే కైలాస పర్వతాన్ని కూడ దర్శించాలనే పట్టుదల ఈ విహారానికి నాంది పలికింది. ఈ పర్వత శిఖరాన శివుడు పార్వతి, కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నది తదితర ప్రమధగణాలతో నివసిస్తారని, ఈ పర్వతాన్ని ఎక్కగలిగితే వచ్చే పుణ్యము పునర్జన్మ లేకుండా చేస్తుందని, మృత్యువును జయించినట్లేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పార్వాతీదేవికి జన్మనిచ్చిన పర్వతరాజు మేరు, మహారాణి మేనక నివాసము కూడా ఈ పర్వతశ్రేణిలో ఉండడం వలన ఈ విహారము వలన పుణ్యము, పురుషార్ధము కలసి వస్తుందని కోరిక మరీ బలపడింది.

ఈ రెండు సుప్రసిద్ధ, చారిత్రాత్మక, ఆద్యాత్మిక స్థలాలు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండడము మూలంగా అందరికి వీలుపడదు. కైలాస శిఖరము పూర్తి ఎత్తు ౨౧,౦౦౦ అడుగులు. ఐతే మానవమాత్రులు పోగలిగిన ఎత్తు ౧౯,౦౦౦ అడుగులు మాతమే. ఆ చివరి రెండువేల అడుగుల ఎత్తున ఉన్న పర్వత శిఖరము ఎప్పుడూ తెల్లని మంచుతో నిండి వుంటుంది. శివుని దర్శనము ఈ మానవ సహజమైన శరీరానికి అందనిది. శివుడు గాని, విష్ణుమూర్తి కాక ఇంకే దేవున్నైనా చేరాలంటే మన శరీరమేకాక, మనస్సుకూడా నిర్మలమై, దైవభక్తితో పునీతమై వుంటేనే వీలు పడుతుంది. అంటే ఆధ్యాత్మికంగానే వీలు పడుతుంది. ఆ అదృష్టము కొందరు మహాత్ములకే వీలుపడుతుంది. మనలాంటి మానవ మాత్రులకు కనీసము పర్వత ప్రాంగణము. పర్వత శ్రేణి పైకి వెళ్ళగలిగితే ఆ అదృష్టమే చాలుననే కోరిక మనలను ఈ ప్రయత్నానికి పురికొల్పుతుంది.

శ్రీకాళహస్తి గురించి స్థల పురాణం

                  శ్రీకాళహస్తి గురించి  స్థల పురాణం  

శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది శ్రీ – సాలె పురుగు, కాళ – సర్పము, హస్తి – ఏనుగు అనే మూగజీవాలకు ముక్తి నిచ్చిన క్షేత్రమని చాలా మంది వినే ఉంటారు. కాబట్టి దీన్ని గురించి ఎక్కువగా విడమరిచి చెప్పడం లేదు. ఇది జరగక మునుపే ఇక్కడ చాలా సంఘటనలు జరిగున్నాయట. అప్పుడు ఈ ప్రాంతాన్ని గజకాననం అనే వారట.
బ్రహ్మ ముందు ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన తర్వాతనే సృష్టికార్యం ప్రారంభించాడట. ఇక్కడ శివుడు జ్ఞానానికి ప్రతీకయైన దక్షిణామూర్తి స్వరూపంలో కూడా వెలసిఉన్నాడు.
వశిష్ట మహర్షికి విశ్వామిత్రునితో వైరము వలన తన నూర్గురు పుత్రులనూ పోగొట్టుకుంటాడు. ఆయన జ్ఞాన సంపున్నుడే అయినా పుత్రశోకంతో మాయ కప్పివేయడం మూలాన గజకాననానికి వచ్చి ఓ పర్వతం ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడట. అప్పుడు భూమత అతన్ని రక్షించింది. శివుని గురించి తపస్సు చేయమని కర్తవ్యబోధ చేసింది. అలా కొన్నేళ్ళపాటు తపస్సు గావించిన వశిష్టునికి మహాశివుడు, దక్షిణామూర్తి స్వరూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాజ్ఞానియైన ఆయన ప్రాపంచిక విషయాల గురించి ఏం కోరుకుంటాడు?. అయినా లోక కల్యాణం కోసం శివుడిని జ్ఞానప్రదాత గా ఆ క్షేత్రంలో కొలువై ఉండమని కోరుకున్నాడట. అలా శ్రీకాళహస్తి జ్ఞానక్షేత్రమైంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ.
శ్రీకృష్ణదేవరాయలు కొలువులోని అష్టదిగ్గజాల్లో ధూర్జటి ఒకరు. అవి ప్రభంద సాహిత్యపు రోజులు. అందరు కవులూ రాజుల గురించి ఇతివృత్తాలను ఎన్నుకుంటుంటే ఆయన మాత్రం ఆయన ఇష్టదైవమైన శ్రీకాళహస్తీశ్వరుని ఇతివృత్తంగా ఎన్నుకొని శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం రాశాడు. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు. ఆయన శైలిని గురించి రాయలు స్వయంగా

స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

అని కీర్తించినట్లు చెబుతుంటారు. తర్వాత ఆస్థానంలో ఆయనపై కొంతమంది ఏవో నిందలు వేయడంతో రాయలవారు ధూర్జటికి రాజ్య బహిష్కార శిక్షను విధించారట. వెంటనే ధూర్జటి కట్టుబట్టలతో భార్యతో కలిసి ఒక అడవికి వచ్చేశాడట. అక్కడే ఇద్దరు ముని దంపతుల ఆశ్రమంలో ఉంటూ వాళ్ళకు సేవ చేస్తూ, వాళ్ళు పెట్టే భోజనం తింటూ దైవ ప్రార్థనలో ప్రశాంత జీవనం గడుపుతున్నారట.
ఒకరోజు ధూర్జటి దంపతులు నదీ స్నానం కోసం వెళ్ళగా అక్కడికి వచ్చిన రాయల వారి సైనికులు వీరిని గుర్తు పట్టి, ఆయన మీద వేసిన నిందలు అసత్యాలుగా నిరూపణలు అయ్యాయనీ,  రాజు వాళ్ళను తిరిగి రాజ్యానికి ఆహ్వానించారనీ చెప్పారు. వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తూ ఆశ్రమం వైపు నడుస్తున్నారు. కానీ వారికి ఎంత సేపు వెతికినా ఆయాశ్రమమూ కనిపించలేదు, వృద్ధ దంపతులూ కనిపించలేదు. చివరికి అది శ్రీకాళహస్తీశ్వరుని మహత్తుగా భావించి తాము వారితో రావడం లేదని ఆ సైనికులను తిరిగి పంపించి వేసి తమ శేష జీవితాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంలోనే గడిపాడని చెబుతారు.
ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది అసలు పేరు సువర్ణముఖరీ నది. అగస్త్య మహర్షి ప్రభావంతో ఈ నదీ ప్రవాహం ఏర్పడ్డదని స్థల పురాణం చెబుతోంది.

Friday 29 March 2013

స్నానానికి సమయం మీకు తెలుసా ? నదిలో స్నానం పురుషులు ఎలా స్త్రీలు ఎలా చేయాలి ?

స్నానానికి  సమయం మీకు  తెలుసా ? నదిలో స్నానం  పురుషులు  ఎలా స్త్రీలు  ఎలా  చేయాలి ?

తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి... ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం...

ఇక స్నానాల్లోకెల్లా... చన్నీటి స్నానం ఉత్తమమైనది.ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మధ్యమం. నూతివద్ద స్నానం చేయడం అధమం. మిగతా స్నానాలకు పేర్లులేవు. వేయిపనులున్నా... వాటిని వదిలి... సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

నదీస్నానం, కాలవల్లో స్నానం చేసేప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానం చేయాలి. మగవారు ఎదురుగా కాకుండా, వాలుగా స్నానం చేస్తే వారి మగతనం నషిస్తుంది. అదేవిధంగా ఆడవారు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేస్తే... వారి స్త్ర్రీత్వం నశిస్తుంది. (ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే... నేడు సంతానలేమికి కారణమవుతున్నాయి)

ఒక నదిలో స్నానం చేసేప్పుడు మరో నదిని దూషించకూడదు.

మన శాస్త్రం పుట్టినరోజున ఎమీ చేయలని చూద్దాం .....

మన శాస్త్రం పుట్టినరోజున ఎమీ చేయలని చూద్దాం .....
ప్రతి జన్మనక్షత్రంమందు ,పుట్టిన రోజు (తిధి )నందు అపమృత్యు పరిహారం కోసం ఆయుష్య సూక్తం తో హోమం చేయలీ .ఈ హోమం అ మనిషికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది .వ్యాధులు రాకుండా పరిహరాన్ని ఇస్తుంది . ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు చేసే ప్రార్థనలు వారికీ సకల శుభాలనూ ఇస్తాయి .

అరోజు చేసే దానాలు వారికి పుణ్యం ఇవ్వడం కాకుండా మన కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తి నీ కలిగిస్తాయి.

పుట్టిన రోజు నా రుద్రాభిషేకం ఇంటిలో అయిన ,ఆలయం లో అయిన చేయడం మంచిది .

తీరిక ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం పారాయణము చేయవచ్చు .

ఇంతే కాకుండా గ్రహచరాదులు వలన అపమృత్యు దోషం ప్రాప్తి అయినపుడు మృత్యుంజయ హోమం శ్రేయస్సుని ఇస్తుంది.

ఉదయన్నే నువ్వుల నునెతో తలంటుకొని తల స్నానం చేసి ,నూతన వస్త్రధారణ ,రక్షా తిలకం ధరించడం ,ఇంటిలో గల పూజ గది లో దేవుళ్ళకి హారతి ఇచ్చి ,ఆ హారతిని గ్రహించటం, ఇవీ ప్రధానమయనవి. ఇవి అరిష్టాలని పోగొడతాయి.

పసిపిల్లలకి ఒక ఏడాది పూర్తి అయ్యేవరకు ప్రతి మాసం లో జన్మ తిథి నాడు జన్మదినము చేయాలి .అ తరువాత ప్రతి ఏడది జన్మతిథి నాడు జన్మ దినం జరపాలి .ఇదీ మన సంప్రదాయం
 

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి ?

పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి ?
సంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలీ .

జన్మదినం నాడు కులదేవతలను ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుచుకొని స్మరించాలి. ఆ తరువాత గణపతినీ , సూర్య భగవానుని ,ఆ తరువాత మీ ఇష్ట దైవం ని తలుచుకొనీ నమస్కరించు కోవాలీ . పుట్టినరోజు నాడు షేవింగ్ ,గోళ్లు తీయడం ,కలహం ,ప్రయాణం ,హింస విడిచి పెట్టాలి .

ఎటువంటి బ్రాహ్మణుడి కి నమస్కారం చేయాలి?

ఎటువంటి బ్రాహ్మణుడి కి నమస్కారం చేయాలి?

యజ్ఞోపవితాన్ని దరించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. వేదాధ్యయనం నిత్యం చేయువాడు, బ్రహ్మ జ్ఞానం కలవాడు, మాంసదులను, మధ్యమును, పోగాకులను ఆస్వాదించనివాడు , సత్యమును, శౌచమును పాటించేవాడు బ్రహ్మణుడు. బ్రహ్మ నుంచి జన్మించినవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణునికి మరోపేరు ప్రజాపతి. అటువంటివారితో పూజాదికాలు జరిపించుకోవాలి.

Thursday 28 March 2013

మీనక్షత్రానికి సంబంధించిన చెట్టు పెంచండి .సర్వ సౌఖ్యాలను పొందండి. ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి?

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి?        

జీవి ఈ భూమ్మీదకు వచ్చేప్పుడు సూర్యుడు ఏనక్షత్రానికి దగ్గరలో వున్నాడో అది మన జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనం లో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే దివ్య శాస్త్రము జ్యోతిష్యము. ఇక జీవితములో మనిషికి దు:ఖాన్ని కష్టాలను ఎలాసంభవిస్తాయో వాటికి ఏగ్రహములకు శాంతులు చెయ్యాలో ఈశాస్త్రము లో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణముగా మనము నక్ష్తర శాంతులు గ్రహ శాంతులు జరిపించుకుంటూంటాము.
మన నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా వుంటె తొలగటమే గాక .సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈసూత్రాన్ని ఆచరించి ఎంతో మేలు పొందవచ్చు.మీరు పుట్టిన నక్షత్రానికి దగ్గర సంబంధమ్ గల వృక్షాన్నిపెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను కురిపిస్తుంది మీ జీవితం లో.
మీరునాటవలసిన మొక్కనుగాని లేక ,విత్తనాన్ని గాని మీకు ఎక్కడవీలైతే అక్కడ ,రోడ్లపక్కన వీధి పక్కలన ,పార్కు,కొండ,అడవి దేవాలయం ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటాలి. దానిని పెరిగేలా శ్రద్ద చూపాలి. మీకు నాటాక వాటి పోషణ కు సమయము చాలకుంటే మీస్వతం దబ్బుతో దానిని పెరిగేదాకా సంరక్షించే ఏర్పాటు చేయాలి.మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీరు నాటిన ప్రదేశానికి సంవత్సరం లో ఒక్కసారైనా వెళ్ళి నమస్కరించి రావాలి. మీగ్రామము లో లేదా నివాస సమీపం లో ఎక్కద ఆవృక్షము కనిపించినా నమస్కరించాలి.ఎట్టి పరిస్థితి లోనూ ఆవృక్షాన్ని దూషించటం గాని నరకటం గాని చేయరాదు.పసిపిల్లలచేత కూడా ఇలా వృక్షాన్ని నాటించిచూడండి వారి జీవితాన శుభాలు వెల్లివిరుస్తాయి. ఇది చదివిన వెంటనే మీ మిత్రులందరికీ తెలియజేయండి. మీరంతా కలసి రోడ్డుపక్కన ఒకప్రదేశములో మీ అందరి నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలను సామూహికంగా పెంచటంద్వారా అందరికీ వేడుకగా వుంటుంది కూడా.

ఏనక్షత్రానికి సంబంధించిన వారు ఏవృక్షం నాటాలి
--------------------------------------
అశ్వని - జీడిమామిడి
భరణి - దేవదారు
కృత్తిక - అత్తి [మేడి]
రోహిణి - నేరేడు
మృగశిర - మారేడు
ఆరుద్ర -చింత
పునర్వసు - గన్నేరు
పుష్యమి - పిప్పలి
ఆశ్లేష - బొప్పాయి
మఖ - మర్రి
పుబ్బ - మోదుగ
ఉత్తర - జువ్వి
హస్త - కుంకుడు
చిత్త - తాడి
స్వాతి - మద్ది
విశాఖ - మొగలి
అనూరాధ - పొగడ
జ్యేష్ఠ - కొబ్బరి
మూల - వేగి
పూర్వాషాఢ - నిమ్మ
ఉత్తరాషాఢ - పనస
శ్రవణం - జిల్లేడు [తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం]
ధనిష్ఠ - జమ్మి
శతభిషం - అరటి
పూర్వాభద్ర - మామిడి
ఉత్తరాభాద్ర -వేప
రేవతి -విప్ప
 

 

బట్టలుతికిన నీళ్ళు కాళ్ళమీద పోసుకుంటే పుట్టింటివారికి కీడట జాగ్రత్త

బట్టలుతికిన నీళ్ళు కాళ్ళమీద పోసుకుంటే పుట్టింటివారికి కీడట జాగ్రత్త

మన మహిళామతల్లులు కొందరు బట్టలుతికిన తరువాత ఆ నీళ్లను కాళ్లమీద గుమ్మరించుకుంటారు. అలాచేయటంవలన ఆమె పుట్టింటివారికి కీడుజరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అందువలన మీరు జాగ్రత్తవహించాలని సోదరీమణులను కోరుతున్నాను.
ఆ ! మరీ ఛాదస్తం .నీళ్ళు కాళ్లపై పోసుకోవటమ్ తో కూడా కీడా ? మరీ మూఢనమ్మకాలని కొట్టిపారేయకండి. మనవాళ్లు ఏదిచెప్పినా దానివెనుక శాస్త్రీయ కారణాలుంటాయి . ఆలోచించే ఓపికా పరిశీలించే శ్రద్దాలేక ఈవిజ్ఞానం తెలియని సోమరిపోతులు చేసిన దుష్ప్రచారలతో మనం మన పెద్దలమాటలన్నీఅబద్దమేమోనన్న అపనమ్మకంలో మునిగిపోయాం మరి .
విషయమేమిటంటే సహజంగా విడిచిన గుడ్డలలో దుమ్ముధూళీ కణాలలో నిండుగా క్రిములు చేరిఉంటాయి.మధ్యతరగతి దిగువతరగతి ఆడవాళ్ళు స్వయంగా ఇంటిలోని బట్టలు ఉతుక్కుంటారు .అయితే సహజంగా వీరి పాదాలు పగుళ్ళు ఉంటాయి. ఎక్కువగా నీటిలోనూ తడుస్తుంటాయి . బట్టలుతుకిన నీళ్లలో నిండుగా క్రిములుంటాయి .ఆనీటిని కాళ్లమీదపోస్కుకుంటే ఆపగుళ్లద్వారా శరీరం లోకి ప్రవేశించే అవకాశం ఉంది . అలా చేరి ఆమె రోగగ్రస్తమయితే ఆమెను భర్త ఆమెను పుట్టింఇకి వెళ్లగొట్టే అవకాశం ఉంది .ఇది ఆమెపుట్టింటికి కీడేకదా !?
మామూలుగా అలా చేయొద్దని చెబితే పట్టించుకోని స్త్రీలు పుట్టింటికి కీడు అంటే మాత్రం శ్రధ్ధచూపుతారని పెద్దలు ఇలా చెప్పి ఉంటారు . ఇంతటి వైజ్ఞానిక దృష్టి,దాన్ని తరతరాలవరకు ఆచరించేలా సాంప్రదాయాలను ఏర్పరచిన మన పెద్దలకు మరో సారి నమస్కరిద్దాం. 

దుర్గమ్మ అని స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం .

దుర్గమ్మ  అని  స్తుతించటం లో ఒక అంతరార్ధం తెలుసుకుందాం . 

దుర్గం అంటే శరీరం .ఈశరీరంలో ఉండే శక్తే దుర్గ . అదే ప్రాణశక్తి . ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం వలన మాత్రమే విశ్వమంతా నిలచిఉంది.
దుర్గాదేవి దశభుజాలు ,పంచప్రాణ,పంచోపప్రాణాలు దశప్రాణాలకు ,పంచజ్ఞానేంద్రియాలకు,పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు. ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉన్నది. సింహం కామానికి సంకేతం .దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూడదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది ..అలాగే అమ్మ చేతిలో సంహరించబడిన మహిషుడు దున్నపోతువంటి క్రోధానికి ప్రతీక .క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం .ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కావున అమ్మకుచేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే . మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించుకోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.
ఇక దుర్గ పక్కన ఉండే లక్ష్మీదేవి ధనశక్తి. ఆశక్తిఉండాలి కానీ దివాంధం గుడ్లగూబలా కన్నూమిన్నూకానని స్థితి పనికిరాదు .దానిసూచిస్తూ లక్ష్మీదేవి గుడ్లగూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరో పక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక .అది అత్యవసరం .అసత్ జ్ఞానం వీడి సత్ జ్ఞానంతో ఉండాలనేదానికి సంకేతం ఆవిడ వాహనం హంస.ాది నీటినివీడి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది . ఇంకోపక్కనుండే కుమారస్వామి దేవసేనాని ,ఆయనవీరత్వానికి ప్రతీక.ాట్టివీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి . నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు .అట్తిబ్రహ్మచర్యమందుండుటచే నెమలికన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది. ఇట్టి సాధనలో సిద్ది గణపతి స్థానం.
అకారణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది . సిధ్ధికి భంగం కలుగకుండా ఉండాలంటే ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి . ఆన్నింటికీ అధిష్టాతగాఉన్న శివుడు త్యాగమునకు,అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిసూలం


సత్వరజస్తమోగుణాలకు గుర్తు,వృషము అంటే ధర్మం .అదే ఆయనవాహనమైన నంది. అది నాలుగుకాళ్లపై ఉంటుంది .ఇలాపరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని  సూచిస్తుంది.

పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా? మంచివాళ్లకి చెడు ఎందుకు జరుగుతుంది?




చెడంటూ ఎవరికీ జరగదు. ఎన్నో జరుగుతుంటాయి. నచ్చని వాటిని మీరు చెడు అనుకుంటారు. చూడండి...ఈ రోజు పెళ్లనుకుందాం. మీరు వీధిలో ఊరేగింపుగా వెళదామనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద వాన పడింది. అంతా తడిసి ముద్దయ్యారు. అది మీకు చెడు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్ధిస్తున్నారు. అతనికి వర్షం పడుతోందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అన్నది కేవలం మీ ఇష్టాయిష్టాల మీదే ఆధారపడుతుంది, అవునా? కాబట్టి మనం జీవితాన్ని మంచీ చెడులని వేర్వేరుగా చూడొద్దు.  

ఎందుకంటే మీరంతా దేవుణ్ణి నమ్ముతున్నారు, అవునా? మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయనే అన్నీ సృష్టించాడని నమ్ముతున్నప్పుడు ఇక మంచీ చెడూ ఎక్కడ? ఇదంతా మీకు అవసరమేనేమో? అందుకే ఆయన ఇలా చేస్తున్నాడేమో అనుకోవాలి. కాదంటే మీ దేవునిపై మీ నమ్మకం అసలైనది కాదని అర్థం. అవునా? మీరు దేవుణ్ణి నమ్మితే, అతను చేసేవన్నీ సరైనవై ఉండాలి. అవునా? లేదంటే అసలు దేవుణ్ణే తొలగించాలి! తాను చేసేది అతనికే తెలియకుంటే, అతనిని ఆ ఉద్యోగం నుంచి తప్పించాలి. అతను అంతా తెలిసే చేస్తుంటే మనం ఇక ఫిర్యాదు చేయకూడదు 

భూతప్రేతాలనుగూర్చి నా అభిప్రాయం....

 భూతప్రేతాలనుగూర్చి నా  అభిప్రాయం....
చనిపోయిన తరువాత అసంతృప్తిగల ఆత్మకు ఉండే వాయురూపాన్నిభూతమనీ,ప్రేతమనీ అంటుంటారు. కింది స్థాయి మనిషి,లేదా ఆత్మహత్యచేసుకున్నవాడుచాలా దినాలవరకు స్తబ్దంగా లేదా మోహగ్రస్థ పరిస్థితిలో ఉండవలసి వస్తుంది.అతను చచ్చిపోవడమయితే జరిగింది,కానీ ఆసంగతి తెలుసుకోవడానికి అతనికి అనేక సమవత్సరాలు పడుతుంది .ఎందుచేతనంటే అతని ఆత్మ ఆసమయంలో గాఢసుషుప్తలో ఉంటుంది. భూతప్రేతాలు మనుష్యశరీరాన్ని ధరించడం సులువుకాదు. అనేకప్రయత్నాలు చేసినమీదట అది భాష్పీయ[ఆవిరివంటి] శరీరాన్ని పొందుతుంది. భాష్పంఘనీభవించి మనుష్య ఆకారం పొందగలుతుందికూడా . కానీ ఆ శరీరం సమాన్యకారణాలవల్ల కరిగిపోగలదు.పరలోక గతమయిన ఆత్మ రక్తసంబంధీకులతో ఏదయినా చెప్పడానికి శరీరాన్ని ధరించవచ్చు. పమ్చభూతాల్లో ఏ ఒక్కదాన్నయినా ఆశ్రయించి భూతం వెల్లడికావచ్చు,. . ఏదయినా విశేషమయిన వాసన సోకినట్లయితే భూతం వాసనను ఆశ్రయించుకుని వచ్చినదని గ్రహించవచ్చు. శబ్దాన్ని ఆశ్రయించుకుని వచ్చినట్లయితే కర్కశ ధ్వని,భాజాలు,సంగీతం,లేదా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు వినిపిస్తుంది.

మ్యారేజ్ రింగ్ 4 వ వెలికి ఎందుకు తొడుగుతారు ? మీకు తెలుసా?

మ్యారేజ్ రింగ్ 4 వ వెలికి ఎందుకు  తొడుగుతారు ? మీకు తెలుసా?
ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి
ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.
బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
మధ్యవేలు-మనకోసం
ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి

ఆసక్తిగా ఉందికదా……..

ఈ  విధంగా చేయండి.రెండు అర చేతులను తెరచి,మధ్య వేళ్లు
రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి.ఇప్పుడు
మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.
మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి.అవి విడిపోతాయి.
అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు.అలాగే
మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.
ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి

కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల
 సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.
ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.

అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత
జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.
ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.
 ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు.ప్రయత్నించినా మిగతా
వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా
 భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే
 వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.
 అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.
ప్రయత్నించి చూడండి.

Wednesday 27 March 2013

ఏడడుగుల బంధం వివరణ

 ఏడడుగుల  బంధం వివరణ 


వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక అర్థముంది. 

తొలి అడుగు తమ జీవితాలకు అవసరమైన ఆర్థిక శక్తి సాధనకు, రెండవ అడుగు ఆరోగ్యకర ఆధ్యాత్మిక చింతనకు, మూడవ అడుగు ధర్మబద్ధ ఆర్థిక సంపాదన కొరకు, నాల్గవ అడుగు విజ్ఞాన సముపార్జనకు, ఆనంద, ప్రేమ, గౌరవాలకు, ఐదవ అడుగు సంతానం పొంది వారి బాధ్యత తీసుకుంటామని, ఆరవ అడుగు తమ చర్యలపై నియంత్రణ సాధనకు, ఏడవ అడుగు ఒకరికోసం మరొకరిగా కలకాలం బతుకుతామనే వేయిస్తారు. 

మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.

పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన ప్రయోజనం ఏమిటి..?

                          
ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు అవసరమవుతాయి. అటువంటి అనుభవం కోసం కొన్ని ప్రాంతాలను, వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వెతుక్కుంటూ వెళ్ళటమే తీర్థయాత్ర. గతంలో ప్రజలు మునీశ్వరుల దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను తీర్చుకునేవారు.

ఆ మహానుభావులున్న ప్రదేశాలే పుణ్యక్షేత్రాలయ్యాయి. అటువంటి శక్తి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా లభిస్తుంది. ఆ విశేష స్థలపురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల మానవుల మనసులో మార్పువస్తుంది. మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది.

పుణ్యక్షేత్రాల సందర్శన మనస్సు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు వ్యాపారాభివృద్ధి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

గాయత్రి మంత్రాన్ని ఎవరైనా పఠించివచ్చా....?

ఈ సర్వసృష్టికి మూలమైనది శక్తిరూపం. ఆ శక్తి రూపం నుండి వచ్చిన మనము తిరిగి ఆ శక్తిని దర్శించి తరించాలి. ఆ శక్తి రూపమే గాయత్రి మాత. ఆ గాయత్రీమాత కరుణా కటాక్షాల కోసం అందించినదే గాయత్రి మంత్రం. 

ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం! 
భర్గోదేవస్య ధీమహి 
ధియోయోనః ప్రచోదయాత్|| 

ఇది గాయత్రి మంత్రం. ప్రతి ఒక్కరు పఠించిదగిన విశేషమంత్రం. గాయత్రీ బీజమంత్రం. శబ్దపరంగానూ, మంత్రోచ్చారణ చేసినవారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి. 

గాయత్రి మంత్రం పురుషులే పఠించదగినదని కాని, కొన్ని వర్గాలవారికే పరిమితమైనదని కాని శాస్త్రాలలో ఎక్కడా లేదు. ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత ఉండి తీరాలి. అందుకు మినహాయింపు లేదు. 

అందువలన ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించిన వారు గాయత్రీమాత కరుణా, కటాక్షాలను పొందగలరు.

మహాదానశీలి శిబి చక్రవర్తి

మహాదానశీలి శిబి చక్రవర్తిమహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!ఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.

అయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... "ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?" అంటూ ప్రశ్నించాడు.

అప్పుడు శిబి చక్రవర్తి "ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను..." అని చెప్పాడు.

దానికి డేగ మాట్లాడుతూ... "అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు" అని అంది.

దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.

సరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.


ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి ఎలా వచ్చాయో తెలుసా? చిన్న కధ...

ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి ఎలా వచ్చాయో   తెలుసా?  చిన్న కధ...


వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్తుంటాడాయన.

అలా నడుస్తుండగా... ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన "సూర్యుడా...! దూరంగా వెళ్ళు" అంటూ ఆజ్ఞాపించాడు.


అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని.... వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.

అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా ఇంకా పెంచుతున్నాడు.

అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో.... తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు.


ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ.... ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.

"ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని" హెచ్చరించాడు.

అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ... "ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ... మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా...! అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు" అన్నాడు కసిగా...

జమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. "ఓ మహామునీ...! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం" అని చెప్పుకొచ్చాడు.

అంతేగాకుండా... జమదగ్నికి వేడినుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్య భగవానుడు. అవేంటంటే... పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా... అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటా
రు.

సంతోషాల రంగుల హోలీ

సంతోషాల రంగుల హోలీ 

మనం ఈ ఏడాదిలో చలికి, పొగమంచుకు వీడ్కోలు చెప్పి, వెచ్చదనాన్నిచ్చే వసంతానికి స్వాగతం పలికే పండగే హోలీ. మొఘల్‌ పరిపాలనా కాలంలో హోలీ పండగ హిందువులు, ముస్లింల మత సమైక్యతకు సంకే తంగా జరుపుకునేవారు. ఏడాదిలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఫాల్గుణ పూర్ణిమని హోళికాపూర్ణిమ అనీ, మహా ఫాల్గుణి అని పిలుస్తారు. 14 మన్వంతరాల్లో ఒకటైన బ్రహ్మ సావర్ణి హోలీ నుంచే ప్రారంభమయిందని పురాణాలుచెబుతున్నాయి అసలీ ప్రపంచమే రంగులమయం. మన జీవనవిధానమే రంగులతో మమేకమై ఉంది.ఇంద్రధనస్సు లో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రకాల రంగులు న్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవిత తత్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే వేడుకే హోలీ. గతం లో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొనిసంతోషిం చేవారు. 

జానపద పాటలు పాడుకుంటూ, ఆనందంగా ఆడుకుంటూ తరతమ భేదాలు మరిచి ఆనందాన్ని ఆస్వాధించేవారు. ఈ వసంతోత్సవమంతా ప్రజలందర్నీ సామాజికంగా ఏకం చేసేది. అదే సమయంలో ఆకులు రాల్చిన చెట్లు కొత్త చిగుళ్లతో వసంత లక్ష్మికి ఆహ్వానం పలికేవి. ప్రకృతికాంత నూతన శోభను సింగారించుకొని కన్నుల పండువైనప్పుడు ఆమెకు స్వాగతం పలకడం భారతీయులు అనాదిగా అనుసరిస్తున్న ఆచారం. ఈ ఆచారపు ఆనంద స్వరూపమే ‘హోలీ’. అమితోత్సాహంతో జరుపుకొనే హోలీని ‘ఫాల్గుణో త్సవం’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ ఉత్సవాన్ని మదనోత్సవంగా, వసంతోత్సవంగా వ్యవహ రిస్తారు. 

Tuesday 26 March 2013

హోలిక పూజ (Holika Pooja)

హోలిక పూజ (Holika Pooja)


ఈ పండగను పూర్వం హోలికా పూర్ణిమ అని పిలిచేవారు. కృతయుగంలో రఘు మహారాజు 


కాలంలో హోలిక అనే రాక్షసి నిద్రపోతున్న శిశువుల్ని పీడించేది. ఆ రాక్షసిని 


తరిమివేయడానికి రఘువు, ప్రజలు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ, వారి 


ప్రయత్నాలేవీ ఫలించలేదు. అప్పుడు నారద మహర్షి ఉపదేశంతో ఫాల్గుణ శుద్ధ పూర్ణిమి 


రోజున “కళ్యాణ వ్రతం” చేసి రాక్షసి పీడ వదిలించుకున్నారు.

అందుకు గుర్తుగా హోలీ పండగను జరుపుకోవడం ఆచారమయిందంటారు. 
తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయంలో హోలీ రోజున కల్యాణవ్రతం ఇప్పటికీ 
చేస్తారు. హోలిక హిరణ్యకశిపుని చెల్లెలు. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని 
అగ్నిలోకి తోయించినప్పుడు హోలిక కూడా అగ్నిలోకి దూకి, ప్రహ్లాదుని కాపాడి, తాను 
భస్మమైందట. ఆనాటి నుంచి తమ శిశువుల రక్షణ కోసం హోలికని పూజిస్తున్నారని మరో 
కథనం ప్రచారంలో ఉంది

.......

కోర్కెలను దహించే పండగ

కోర్కెలను దహించే పండగ

పరమేశ్వరుడిని పార్వతీపతి చేయ సంకల్పించిన మన్మథుడు తపోదీక్షలో ఉన్న ముక్కంటి 

ఆగ్ర హజ్వాలల్లో దగ్ధం అవుతాడు. కానీ మన్మథ ప్రయత్నం వృథా పోదు. పరమశివుడు 

పార్వతిని పరిణయమాడతాడు. అందుకు సంకేతంగానే హోలీ ఉత్సవాన్ని 

జరుపుకొంటారనే కథనం ఉంది. మన్మథ దహనానికి సంకేతంగానే హోలీ పండగ రోజు 

కామదహనం చేస్తారని అంటారు. అందుకే హోలికి కామదహనం అని కూడా పేరు ఉంది. 

నిజానికి కామదహనం చేయడంలో కూడా అంతరార్థం ఉంది.
కామం అంటే కోరిక. జీవితాన్ని దుఃఖభరితం చేసే కోరికలను అగ్నికి ఆహుతి చేయాలన్నదే 
దీనిలోని భావం. అనంతమైన కోర్కెలు మన ఆనందాన్ని, మనశ్శాంతిని దహించివేస్తాయి. 
తీరని కోరికలు నిరంతరం వేదనకు గురిచేస్తూ ఉంటాయి. అత్యాశలు లేకుండా పరిమితమైన 
కోరికలతో సంతృప్తిగా ఉంటేనే జీవితం ఆనందమయం అవుతుంది. కోరికల వరదకి సంతృప్తి 
అనే ఆనకట్ట వేస్తేనే జీవితంలో నిత్యం వసంతం ఉంటుందని సూచించే పర్వం ఈ హోలీ.

....


హోలీవిశేషాలు… (Holly Special)

హోలీవిశేషాలు… (Holly Special)
ఎరుపు కోపానికి చిహ్నం. ఆకుపచ్చ అసూయకు సంకేతం. పసుపు ఆనందానికి గుర్తు. 
గులాబీ రంగు ప్రేమకు చిహ్నం. నీలం విస్తృతికి గుర్తు. తెలుపు శాంతికి, కాషాయం 
త్యాగానికి, ఊదారంగు జ్ఞానానికి సంకేతం. ప్రతి మనిషీ ఓ ఇంద్ర ధనుస్సు. ప్రకృతి నిరంతరం 
ఎలా మార్పులకు లోనవుతుందో మనిషి భావోద్వేగాలు కూడా అలాగే నిరంతరం 
మారుతూ ఉంటాయి. మంచి భావాలు నిండిన వ్యక్తి మంచి రంగులు నింపుకొన్న 
రంగవల్లికలా తేజోపుంజమై వెలుగొందుతాడు.
ప్రకృతి ఆరాధన లేని హిందువుల పండగలు ఉండవంటే అతిశయోక్తి కాదేమో! ప్రకృతి 
ఆరాధనను మేళవించి జరుపుకొనే పండగలలో హోలీది ప్రత్యేక స్థానం. యువతీ 
యువకులందరూ హుషారుగా పాటలు పాడుకుంటూ ఆనంద నృత్యం చేస్తూ వసంతానికి 
స్వాగతం పలుకుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకొంటారు. ఏదో ఒక ప్రాంతానికి, ప్రదేశానికి 
పరిమితం కాకుండా దేశమంతటా ఆనంద నృత్యంలా సాగే సంప్రదాయ కేళి… హోళి 
పండగ.

చలికి, పొగమంచుకు వీడ్కోలు చెప్పి, వెచ్చదనాన్నిచ్చే వసంతానికి స్వాగతం పలికే పండగే 
ఈ హోలీ ఉత్సవం. మొఘల్ పరిపాలనా కాలంలో హోలీ పండగ హిందువులు, ముస్లింల 
మత సమైక్యతకు సంకేతంగా జరుపుకొనేవాళ్లని చరిత్రకారులు చెబుతున్నారు. ఏటా 
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని జరుపుకొంటాం. ఫాల్గుణ పూర్ణిమని 
‘హోళికాపూర్ణిమ’ అనీ, ‘మహా ఫాల్గుణి’ అని వ్యవహరిస్తారు. 14 మన్వంతరాల్లో ఒకటైన 
బ్రహ్మ సావర్ణి మన్వంతరం ఈ రోజే ప్రారంభమయిందని పురాణాలు చెబుతున్నాయి.

Popular Posts